
పూదోటలో విహారం.. ఓ పువ్వుకు మోదీ పేరు
టెల్ అవివ్: మిష్మర్ హషివలోని డాంజిగర్ పూదోటను నెతన్యాహూతో కలసి మోదీ సందర్శించారు. ఈ తోట జెరూసలేంకు 56 కిలోమీటర్ల దూరంలో.. 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 60 దేశాలకు పూలు ఎగుమతవుతాయి. అనంతరం యాద్ వాషెం స్మారకాన్ని మోదీ సందర్శించి నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ఊచకోతకు బలైన 60 లక్షల మంది యూదుల స్మృత్యర్థం ఈ మ్యూజియం నిర్మించారు. కాగా, యూదు దేశం ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీని ఆ దేశ ప్రభుత్వం కొత్త రీతిలో గౌరవించింది.
ఇజ్రాయెల్లో వేగంగా పెరిగే ‘క్రిసెంతమన్’ పుష్పానికి ‘మోదీ’ అని నామకరణం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారిక మీడియా ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. పూదోటను మోదీ సందర్శించిన సందర్భంగా క్రిసెంతమన్ పువ్వుకు మోదీ పేరు పెట్టారు. యూదు మతవాద స్థాపకుడిగా భావించే థియోడర్ హెర్జ్ స్మారకాన్ని కూడా మోదీ సందర్శించారు. ముందుగా అనుకోకపోయినా నెతన్యాహూ సలహాపై ఆయన అక్కడికి వెళ్లారు. యాద్ వాషెం స్మారకం పక్కనే హెర్జ్ సమాధి ఉంటుంది. సమాధిపై మోదీ చిన్న రాయి పెట్టి ప్రార్థనలు చేశారు.