
ఇస్లామాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ సిద్ధమైంది. జూలై 25న ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్లో ముస్లిమేతర ఓటర్ల సంఖ్య గతం కంటే దాదాపు 30 శాతం పెరిగిందని ఒక నివేదిక పేర్కొంది. 2013 ఎన్నికలప్పుడు 27 లక్షలుగా ఉన్న ముస్లిమేతర ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 36 లక్షలకు చేరుకుంది. ముస్లిమేతర మైనారిటీ ఓటర్లలో హిందు ఓటర్ల సంఖ్యనే అధికం. 2013 ఎన్నికల సమయంలో 14 లక్షలుగా ఉన్న హిందు ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 17 లక్షలకు చేరింది.
హిందువుల తర్వాత అత్యధిక మైనారిటీ ఓటర్లుగా క్రైస్తవులు ఉన్నారు. వారి సంఖ్య 16 లక్షలు. 2013తో పోల్చుకుంటే హిందువులకంటే, క్రైస్తవుల ఓటర్ల సంఖ్య పెరుగుదల శాతం ఎక్కువ. అలాగే పార్శి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ నెల 31తో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుంది. ఎన్నికల నిర్వహణ కోసం దేశాధ్యక్షుడి అనుమతి తప్పనిసరి కావడంతో అంతకుముందు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఆ దేశ అధ్యక్షుడికి లేఖ రాసింది. దీనికి ఆమోదముద్ర పడటంతో జూలై 25, 27 మధ్య ఎన్నికలు నిర్వహించనున్నారు.