hindu
-
ప్రతి హిందూ కుటుంబంలో ముగ్గురు పిల్లలుండాలి
మహాకుంభ్ నగర్: దేశంలో హిందువుల జననాల రేటు పడిపోతుండటంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. మహాకుంభ్ నగర్లో శనివారం జరిగిన విరాట్ సంత్ సమ్మేళన్లో వీహెచ్పీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ బజ్రంగ్ లాల్ బాంగ్రా మాట్లాడారు. ‘హిందువుల జననాల రేటు పడిపోతుండటంతో దేశంలో హిందూ జనాభాలో అసమతూకం ఏర్పడుతోంది. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలుండాలని హిందూ సమాజంలోని గౌరవనీయులైన సాధువులు కోరుతున్నారు’అని ఆయన అన్నారు. అనంతరం గోరక్షా పీఠా«దీశ్వర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. సనాతన భారత ధర్మం కుంభమేళాలో ప్రత్యక్షంగా కనిపిస్తోందని, యావత్తూ ప్రపంచమే దీన్ని చూస్తోందని అన్నారు. బంగ్లాదేశ్లో ప్రణాళిక ప్రకారం హిందువులపై దాడులు సాగడంపై సమావేశంలో చర్చించారని వీహెచ్పీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య స్వామి వాసుదేవానంద అధ్యక్షత వహించారు. -
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.కల్కి చిత్రంపై ఆరోపణలు..సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. మూడు కోణాల్లో దాడి..అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని అనంత శ్రీరామ్ అన్నారు -
పాక్లో తొలి హిందూ పోలీసు అధికారిగా రాజేందర్ మేఘ్వార్
న్యూఢిల్లీ: మన దాయాది దేశం పాకిస్తాన్లో హిందువులపైన, హిందూ ఆలయాలపైన దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న విషయం విదితమే. ఇటువంటి తరుణంలో హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం అనేది గగనమే. అయితే పాక్లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అక్కడి పోలీస్ సర్వీసెస్కు రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు ఎంపికయ్యారు.దీంతో పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పీగా రాజేందర్ మేఘ్వార్ చరిత్ర సృష్టించారు. ఈ నేపధ్యంలో రాజేందర్ మేఘ్వార్ భారత్లోనూ వార్తల్లో నిలిచారు. రాజేందర్ తాను పాక్లో మైనార్టీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ గుల్బర్గ్లోని ఫైసలాబాద్ పోలీస్శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రాజేందర్ నియమితులయ్యారు. సింధ్ ప్రావిన్స్ పరిధిలోని బాడిన్కు చెందిన రాజేందర్ మేఘ్వార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన చిరకాల కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తేనే సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలు సులభంగా తెలుస్తాయని, అప్పుడే వాటిని పరిష్కరించగలనని రాజేందర్ మేఘ్వార్ తెలిపారు.ఒక పోలీసు అధికారిగా తన పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజేందర్ పేర్కొన్నారు. రాజేందర్ మేఘ్వార్ రాకతో పాక్లోని మరికొందరు హిందూ యువకులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. కాగా రాజేందర్ మేఘ్వార్తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే మహిళ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. రహీమ్ యార్ ఖాన్కు చెందిన ఆమె తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది? -
హిందువులపై దాడులు..బంగ్లాదేశ్కు అమెరికా కీలక సూచన
వాషింగ్టన్:బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళకర పరిణామాలపై అగ్రదేశం అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా సూచించింది. బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత,ప్రాథమిక,మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం(డిసెంబర్4) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్ఛనిస్తూ వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పటేల్ కోరారు.కాగా, బంగ్లాదేశ్లో షేక్హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల హిందు మతానికి చెందిన చిన్మయ్ కృష్ణదాస్ను కూడా అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. చిన్మయ్ తరపున కేసు వాదించేందుకు వచ్చిన న్యాయవాదిపైనా దాడి జరగడం బంగ్లాదేశ్లో దిగజారిన పరిస్థితులను తెలియజేస్తోంది. -
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్ల తర్వాత, ఇక ముస్లిమ్లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
రాజ్యాంగాన్ని మోసగించడమే
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది. -
దారుణ విద్వేష క్రీడ!
అయిదు నెలలుగా బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్ లాయర్ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్ అభ్యర్థించాల్సొచ్చింది.ఇస్లామ్ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)లు యూనస్ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్ షరియత్ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. అసలు అఫ్ఘన్ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్కే కాదు... యావత్ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్ నో చెప్పడంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్ సారథి – ట్రంప్ ద్వేషి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్కు ఉన్న కష్టమేమిటి? హసీనా సర్కార్ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్పై ఇకనైనా భారత్ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్ సర్కార్పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. -
ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు
ఒట్టావా: హిందూ భక్తులపై సిక్కు వేర్పాటు వాదుల దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడులు పునరావృతం కాకుండా కొత్త చట్టాల్ని అమల్లోకి తెచ్చింది. బ్రాంప్టన్లో ప్రార్థనా స్థలాల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలపై నిషేదం విధిస్తూ స్థానిక (బైలా) చట్టాన్ని అమలు చేసినట్లు బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. ఈ చట్టంపై సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ నెల ప్రారంభంలో బ్రాంప్టన్లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో రెచ్చిపోయారు. దేవాలయానికి వస్తున్న హిందూ భక్తులపై కర్రలతో దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోలో వైరల్గా మారాయి.ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులపై దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ దాడిని ఖండించారు. ప్రతి ఒక్క కెనడియన్ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా, సురక్షితంగా అనుసరించే హక్కు ఉందని అన్నారు. -
‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’
నాగ్పూర్: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లోగల రేషమ్బాగ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజలు చేశారు. అనంతరం సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.సంఘ్ త్వరలోనే 100వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్లు మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నదని, మన దేశ విశ్వసనీయత, ప్రతిష్ట మరింతగా పెరిగిందన్నారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. యువత మార్గనిర్దేశకత్వంలో భారత్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై హింసాకాండ జరుగుతున్నదని, అయితే హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులు తమను తాము రక్షించుకునేందుకు వీధుల్లోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి సహాయం అందించాలని అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే స్వభావం ఉన్నంత కాలం.. హిందువులే కాదు మైనార్టీలందరూ ప్రమాదంలో పడతారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. #WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, "What happened in our neighbouring Bangladesh? It might have some immediate reasons but those who are concerned will discuss it. But, due to that chaos, the tradition of committing atrocities against… pic.twitter.com/KXfmbTFZ5D— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: భక్తిభావంతో మెలగాలి -
పార్సీ అయిన టాటాకు హిందూ పద్ధతిలో అంత్యక్రియలు?
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. దీనికి ముందు ముంబైలోని నారిమన్ మైదానంలో గల ఎన్సీపీఏలాన్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.రతన్ టాటా పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీలోగల విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఇక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనలు జరుగుతాయి. అనంతరం అంత్యక్రియల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల పద్ధతి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.There’s a Hindu pujari, Christian priest, Muslim Imam and a Sikh sant standing behind. Sanghis may not like this, but this is truly secular …..!!Rest in peace Sir Ratan Tata ….. 🙏 pic.twitter.com/DjiYNOPR7C— Mayank Saxena (@mayank_sxn) October 10, 2024 పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరిలో అంత్యక్రియల సంప్రదాయం మూడు వేల సంవత్సరాల నాటిది. పార్సీలు అనుసరించే జొరాస్ట్రియనిజంలో మనిషి మృతి చెందాక ఆ మృతదేహాన్ని రాబందులు తినేందుకు అనువుగా బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. అయితే రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. గతంలో అంటే 2022 సెప్టెంబర్లో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో పార్సీ సమాజంవారు అనుసరించే అంత్యక్రియల ఆచారాలను వివిధ ప్రభుత్వాలు నిషేధించాయి. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
చేగువేరా టు సనాతని హిందూ!
‘‘సముద్రం ఒకడి కాళ్ళ ముందు కూర్చొని మొరగదు/ తుఫాన్ గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు/ పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చెయ్యదు.’ పదేళ్ళ కిందట జనసేన పార్టీ విశాఖ సభలో పవన్ కల్యాణ్ తనని తాను వేలితో చూపించుకుంటూ సము ద్రంగా, తుఫాన్గా, పర్వతంగా అభివర్ణించుకుంటూ చెప్పిన మాటలివి. ‘చుట్టూ గాఢాంధకారం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు’ వంటి స్థితిలో ప్రజలున్నారని, వారి ఆశలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు పంచి అపర చేగువేరాగా అవతరించాలన్న పవన్ ఉద్దేశాలు జగమెరిగిన వారికి అమాయకంగా కనిపించినా ఎంతోమంది యువత అతన్ని నమ్మారు. పవన్ ఒంటిమీద పిచ్చుక వాలినా జనసేన కార్యకర్తలు బ్రహ్మాస్త్రాలు సంధించారు. సినీహీరోగా తనకున్న ఇమేజ్ని గుడ్ విల్గా పెడితే చాలదని, అంతకి మించి ఏదో చేయాలన్న తపనని వ్యక్తం చేయడానికి ఆయన పలుమార్లు ప్రగతిశీల సాహిత్యాన్ని తన ప్రచారానికి వాడుకున్నారు. ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళితే అక్కడి స్థానిక రచయితలను గుర్తించి వారి రచనల్లోని ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు. గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలు తరుచుగా చదివేవారు. ఆయా సాహిత్య అంశాలలోని అభ్యుదయం, ప్రజాపక్షపాతం, నిర్భీతి వంటివి పవన్ వ్యక్తిత్వ సుగుణాలని జనం నమ్మేలా బట్వాడా అయ్యాయి కూడా. తద్వారా మిగతా రాజకీయ నాయకులకి భిన్నమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. విప్లవకారులుగా చలామణీ అవ్వడానికి మొహం చెల్లని రాజకీయాల్లో అట్టడుగు ప్రజల కష్టాలు తీర్చగల రాబిన్ హుడ్నని ఆయన నమ్మే ఉండాలి. లేకపోతే అంత సులువుగా ‘జై భీమ్’ అని, అంతే సులువుగా ‘గో మాంసం, బీఫ్ తినడం తప్పయితే, అవి తినే ముందుకు వెళ్తాన’ని ఎలా అనగలరు! ఇఫ్తార్లో కూర్చుని గడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకుని మీలో ఒకడిని అనడం, గోధ్రా, గుజరాత్ అల్లర్ల గురించి ప్రశ్నించడం, తన నాయనమ్మ దీపారాధన చేస్తే దాంతో వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకుని, దేవుడూ దయ్యమూ లేవు’ అనేవాడని గుర్తు చేసుకోవడం, మతపరమైన గొడవలు పెడుతున్నది ముఖ్యంగా హిందూ నాయకులని గట్టిగా చెప్పడం ద్వారా పవన్ కొన్నివర్గాల నుంచి మైలేజ్ పొందారు. ఇక ఇపుడు తరం మారకుండానే స్వరం మార్చారు పవన్ కల్యాణ్. అధికారంలోకి రాగానే వేషభాషలు మారాయి. ఇపుడు తనని తాను ‘సనాతని హిందు’గా ప్రకటించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటూ అన్ని మతాలకీ ఒకటే న్యాయం అని ద్వంద్వానికి గురయ్యారు. అంబేడ్కర్ని బాగా చదివి ఆయన భావజాలాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానని పవన్ కొన్నిసార్లు అన్నారు. అన్ని కులాలకి ఒకటే న్యాయం అని అంబే డ్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అనుకోలేదు కనుక అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా ఎదుగుదల లేని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని కులాలూ ఒకటి కానట్లే అన్ని మతాలు కూడా ఒకటి కావు. ఎక్కడైనా మెజారిటీ మతాలు, మైనారిటీల హక్కులకి భంగం కలిగించే సందర్భాలు ఉంటాయి కనుక సెక్యులరిస్టులు మైనారిటీ మతాల హక్కులకి అండగా నిలబడతారు. దానర్థం పవన్ విరుచుకు పడినట్లు వారు ఆ యా మతాలకి భయపడతారని, వలపక్షం చూపుతారని కాదు. తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటో ప్రజలమైన మాకు సరిగ్గా అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎంగా లడ్డు నాణ్యత మీద రోజుల తరబడి పోరాడటం ముఖ్యమా లేక కనీస అవసరాలు తీరని పేద ప్రజకోసం ఏవైనా చేయడం ముఖ్యమా అని అడగము, మెల్లిగా తెలుగుదేశాన్ని పక్కకి జరిపి జనసేన, బీజేపీతో ఎటువంటి రాజకీయం చేయబోతోంది అని కూడా అడగము, సరేనా! కానీ జస్ట్ ఆస్కింగ్! సనాతన ధర్మం అంటే ఏమిటి? బోర్డులు గట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయబోతున్న పోరాటపు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్పగలరా? వర్ణవ్యవస్థ ఇందులో భాగమా, మనుధర్మ శాస్త్రం ఏమైనా పరిపాలనకి దిక్సూచి కానుందా? స్త్రీలను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవకులుగా, శ్రామిక కులాలను అంట రానివారిగా నిశ్చయం చేయబోతున్నారా? ‘మతి ఎంతో గతి అంతే’ అన్నది మీకు ఇష్టమైన కొటేషన్. ఇపుడు సనాతన హిందూగా మీ ‘మతి’ ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మా ‘గతి’ని ఎలా మార్చబోతోందో తెలుసుకోవాలని జస్ట్ ఆస్కింగ్. పవన్ కల్యాణ్ గారూ! ప్రసాదాలు, ప్రమాణాలు సంబంధిత శాఖలకి వదిలిపెట్టి పదేళ్ళ పైబడిన మీ రాజకీయ ప్రయాణాన్ని సమీక్ష చేసుకోండి. మారిన వేషభాషలకి, మీరేంటో గర్జించి ఇచ్చిన ప్రకటనకి మీరే జవాబుదారీ. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మీరు సాధారణ పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు సెక్యులరిస్ట్గా వినపడటమే కాదు కనపడటం కూడా ప్రజాస్వామిక అవసరం. ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్య మంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ‘ప్రరవే’ ఏపీ కార్యదర్శి -
సనాతనానికి చీడ పురుగులు
‘‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు/ మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు / జనులంతా ఒక కుటుంబం – జగమంతా ఒక నిలయం’’– జాషువాఈ మాటలు ఎంత సందర్భోచితంగా ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ రంగాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజమైన మతవాదులైతే వారితో ఇబ్బంది లేదు. అది వారి ప్రగాఢ నమ్మకంగా భావించవచ్చు. కానీ కుహనా మతవాదులు వేషాలు వేసుకుని, అవకాశవాద రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవటం వల్లనే అసలు ఇబ్బంది వస్తున్నది.వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సనాతన మతవాదుల అవతారం ఎత్తారు. హిందూ మతానికి వీళ్లే అసలైన వారసులన్నట్లుగా ఉపన్యాసాలిస్తున్నారు. ఇక పచ్చ మీడియా రచ్చ సరేసరి.‘అసలే అనలుడు. అతనికి సైదోడు అనిలుడు’ అని ఒక మహాకవి చెప్పినట్లు, చంద్రబాబు అబద్ధా లకు తింగరి పవన్ కల్యాణ్ దొరికాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా చెప్పిన డైలాగ్నే చెబుతూ, మెట్లను కడుగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.అసలు ఇప్పుడు అర్జంట్గా హిందూమతాన్ని ఈ గురుశిష్యులు అంతగా తలకెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాన్యుడి ప్రశ్న.అందులో ఒకరికి దేవుడన్నా, మతమన్నా ఏ సెంటి మెంట్లూ లేవు. బూట్లతో పూజలు చేస్తాడు, దేవాలయాలు పడగొడతాడు, ఆలయాల్లో క్షుద్ర పూజలు భార్య చేస్తే ఊరుకుంటాడు. ఇక రెండవ వారు చెప్పులు ధరించే స్వామి దీక్షలు నిర్వహి స్తాడు. తలక్రిందులుగా తపస్సు చేసినా వీళ్ళను నమ్మే జనాలున్నారా?అసలెందుకు హఠాత్తుగా ఈ రచ్చ లేవ దీశారు? ఢిల్లీ పెద్దలేమయినా హరియాణా, మహా రాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళిద్దరినీ సెంటిమెంట్ రోల్స్ చెయ్యమన్నారా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, విజయవాడ వరద బాధితులకు సమాధానం చెప్పలేక, ప్రజల వద్దకు 100 రోజుల మంచి పాలన అంటూ పోవాలనుకున్నా జనా లెక్కడ తిరగబడి ‘సూపర్ సిక్స్’లు అడుగుతారో అనే భయం చేతనా? ప్రజలు ఆలోచించే లోపలే పచ్చ మీడియా మూకుమ్మడిగా జనాలకు అర్థంకాని భాషలో వ్యాఖ్యానాలు చేయిస్తూ చివరకు హిందూ ధర్మం జగన్ గారి వల్లనే నాశనమైందని తేలుస్తుంది.సెంటిమెంట్ బాగా పండాలంటే కలియుగ దైవం, ఆయన ప్రసాదం వీరికి అక్కరకొచ్చాయి. జగన్ గారి పాలనలో లడ్డూ ప్రసాదంలో జంతు వుల కొవ్వులు కలిశా యని చెప్పాలనుకున్నారు. కానీ వాటికి ఆధారాలు దొరక్క చివరకు వీళ్ళ ప్రభుత్వం మెడకు చుట్టు కోవటంతో దానిని ఎలా మలపాలో అర్థం కాక ‘యూటర్న్’ బాబు... 20 సార్లు తిరుమలకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రిగారి డిక్లరేషన్ పేరుతో దానిని డైవర్ట్ చేయటానికి ప్రయత్నించారు. ‘నాతిని చెయ్యబోతే కోతిగా తయారయ్యిందన్న’ సామె తగా చివరకు సనాతన ధర్మానికే కళంకాన్ని తెచ్చే విధంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం స్వామివారి ప్రసాదాన్నే కళంకితంగా మార్చింది. ఈ చర్యలు క్షమార్హం కాదు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారని ప్రకటించటంతో ఖంగుతిన్న చంద్రబాబు... పార్టీల మాటున గూండాలను తిరుపతికి తరలించారు. వారిలో కొంతమంది బహిరంగంగానే ‘జగన్ మోహన్రెడ్డి తిరుపతి వస్తే చంపేస్తాం’ అంటూ చెప్పారు. అంటే ఆయనను చంపాలనేదే కదా వీళ్ళ కుట్ర! వాళ్ళే నిందలేస్తారు. వాళ్ళే నిందిస్తారు.ఎంత నిస్సిగ్గుగా ఆయన మతాన్ని తెర మీదకు తెచ్చి డిక్లరేషన్ బోర్డు పెట్టారు! అందుకు జగన్మోహన్ రెడ్డిగారు ప్రెస్ మీట్లో చాలా చక్కటి సంస్కారవంతమైన సమా ధానం చెప్పారు. అసలైన హిందూ ధర్మతత్వం ఆయన మాటల్లో వినిపించింది. హిందూ ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసిన ఉపనిషత్తులు ఏం చెప్పాయో మత ఛాందసులు కూడా తెలుసుకోవాలి.‘‘యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్వి జానతః / తత్ర కో మోహః కశ్శోకః ఏకత్వ మను పశ్యతః’’(ఈశావాస్యోపనిషత్తు)ఎవరయితే సమస్త జీవుల ఆత్మలను తన ఆత్మగా భావించి గౌరవిస్తాడో అతడు శోకమోహ ములను దాటి ఒకే ఆనంద స్థితిని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మం చెప్పేమాట. అలాగే హిందు వులందరూ పరమ ప్రామాణికంగా భావించే భగ వద్గీతలో కూడా ఆ కృష్ణ పరమాత్మ –యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజా మ్యహం! / మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః‘‘ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలో నేనే ఉంటాను అన్నాడు. అంటే అన్ని మతాలను, దేవుళ్ళను గౌరవించాలనే కదా మన హిందూ ధర్మం చెబుతున్నది. మరి ఈ మతానికి ఈ చాదస్తపు రంగులు పూసి ఎందుకిలా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఇప్పటికయినా ఢిల్లీ బీజేపీ పెద్దలు తమ కూటమి ఆంధ్రలో చేస్తున్న కోతి చేష్టలను ఆపించ కపోతే అది తమకే నష్టం అని గమనించాలి. ప్రజల్ని అంత తక్కువగా అంచనా వెయ్యొద్దు.‘‘నీకు మతం కావాలా లేక అన్నం కావాలా?’ అని అడిగితే ముందు అన్నమే ఇవ్వమంటాను. ఆకలితో బాధపడేవాళ్ళ కడుపు నింపి తర్వాత బోధలు చెయ్యి’’ అంటారు స్వామి వివేకానంద.ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులకు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది అదే. ముందు పేదవాళ్ళను ఆదుకోండి, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీ నీచ రాజకీయానికి పవిత్ర ప్రసాదాన్ని బలి చేయకండి.నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త వైసీపీ నాయకురాలు -
దైవంతో జూదమా?
శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా హిందూ భక్తులు ఆరాధిస్తారు. వారి దృష్టిలో తిరుమల క్షేత్రం సాక్షాత్తూ కలియుగ వైకుంఠమే. ‘‘భావింప సకల సంపదరూప మదివో... పావనములకెల్ల పావనమయము’’ అంటూ ఆ శ్రీహరివాసాన్నిఅన్నమయ్య కాలం నుంచీ భజిస్తూనే ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవునిగా కోట్లాదిమంది చేత నిత్య పూజలందుకునే వేంకటనాథుని ఆలయ ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ప్రతి పక్షంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ ప్రతిష్ఠను, ఔన్నత్యాన్ని ఆయన పణంగా పెట్టారు.కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా విజయవాడ వరదల పాలు కావడం, ‘సూపర్ సిక్స్’ పేరుతో చేసిన ఎన్నికల బాసలను ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, కనీసం ఎప్పుడు చేస్తారనే షెడ్యూల్ను కూడా విడుదల చేయలేకపోవడం వంటి కారణాలు ఈ తాజా కుట్రకు నేపథ్యం. తమ కూటమి పరిపాలనకు వంద రోజులు పూర్తయిన సంద ర్భంగా ఏర్పాటు చేసుకున్న శాసనసభా పక్షాల ఉమ్మడి సమావేశంలో ఆ కుట్రను అమలు చేయడం ప్రారంభించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో తయారైందని, ఇది వైసీపీ పాలనలో జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.రాజకీయాల్లో ఇక ఇంతకంటే దిగజారుడు సాధ్యం కాదనుకున్న ప్రతిసారీ చంద్రబాబు షాక్ ఇస్తూనే ఉంటారు. ఏడుకొండలవాడి పవిత్ర ప్రసాదంపై అనుమాన పంకిలం చల్లడానికి ఆయన ఏడు పాతాళ లోకాలను దాటి కిందకు దిగజారారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల పైచిలుకు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.లడ్డూ ప్రసాదం తయారీకి, అందులో వినియోగించే సరుకుల కొనుగోలుకు ఒక పటిష్ఠమైన వ్యవస్థ తిరుమలలో గత కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్నది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఈ వ్యవస్థలో మార్పు ఉండదు. తిరుమలలో గత వంద సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదం అమల్లో ఉంది. మహంతుల అజమాయిషీలో నడిచే తిరుమల పాలనా వ్యవహారాలను తొంభయ్యేళ్ల కింద బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకొని టీటీడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగానే లడ్డూ ప్రసాదానికీ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ డిమాండ్ను అందుకోవడానికి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి లడ్డూలు తయారుచేసే పోటు సామర్థ్యం రోజుకు 45 వేలు మాత్రమే. పోటు సామర్థ్యాన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ ఆయన హయాంలో ఆధునిక వసతులను సమకూర్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోటును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు. మూడున్నర లక్షల లడ్డూల తయారీ సామర్థ్యం ఇప్పు డున్నది. అవసరమైతే ఆరు లక్షల వరకు తయారు చేసుకోవ డానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు కూడా చేశారు.తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తిరుమల పవిత్రతను కాపాడటానికి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతను పెంచడం కోసం ల్యాబ్ వ్యవస్థను పటిష్ఠం చేయడం కూడా వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. నవనీత సేవకోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్నను తయారు చేయడానికి తిరుమలలోనే ఒక ప్రత్యేక గోశాల కూడా ఆయన హయాంలోనే ఏర్పాటయింది. ఏడుకొండలపై ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలన్న సంకల్పంతో మఠాధిపతులతో కూడిన విద్వత్ సభ కూడా అప్పట్లో జరిగింది. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రయినప్పటికీ ఈ తరహా కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవు.ఇక చంద్రబాబు ఆరోపణలకు సంబంధించిన నెయ్యి కొనుగోలు వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వ్యవహారం కొన్ని దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతున్నది. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండేవారిలో కొందరితో కలిసి కొనుగోలుకు సంబంధించిన సబ్–కమిటీ ఉంటుంది. ఆరు నెలలకోసారి ఆన్లైన్లో టెండర్లు పిలిచి ఎల్–వన్గా నిలిచిన వారిని ఎంపిక చేస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు ఉన్న ప్లాంట్ను పరిశీలించి, అందులో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను ఈ సబ్కమిటీ బేరీజు వేసుకుంటుంది. అనంతరం కాంట్రాక్టుకు సంబంధించిన అభ్యంతరాలు గానీ, సూచనలు గానీ వుంటే సబ్కమిటీ బోర్డుకు నివేదిస్తుంది.టెండర్ ఖరారు చేయడానికీ లేదా రద్దు చేయడానికీ కూడా సబ్ కమిటీకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేబినేట్లో ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, కేంద ప్రభుత్వానికి సన్నిహితుడైన వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.నెయ్యి సరఫరా దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రతి ట్యాంక ర్తో పాటు నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంట తెచ్చు కోవాలి. ఎన్ఏబీఎల్ గుర్తించిన ల్యాబుల్లో ఈ ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవచ్చు. ట్యాంకర్ తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడ వున్న మార్కెటింగ్ కార్యాలయంలో మూడు శాంపిళ్లను తీసి వేరువేరుగా పరిశీలిస్తారు. ఈ మూడు శాంపిళ్ల పరీక్షలోనూ నాణ్యత నిర్ధారణ అయితేనే ట్యాంకర్ తిరుమలకు చేరుకుంటుంది. లేకుంటే వచ్చిన దారిన వెనక్కు వెళ్తుంది. పరీక్షలో విఫలమై ట్యాంకర్లు వెనక్కు వెళ్లడం ఈ ఇరవై ఏళ్లలో వందలసార్లు జరిగినట్టు సమాచారం. అదేవిధంగా చంద్రబాబు ఆరోపించిన ఏఆర్ డెయిరీ వారి కంటెయినర్ కూడా వెనక్కు వెళ్లింది. అది కొండెక్కిందీ లేదు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడిందీ లేదు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు ఆరగించిందీ లేదు. తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థ కల్తీ సరుకులను ప్రసా దాల్లోకి అనుమతించదు.తిరస్కరించిన ఈ ట్యాంకర్లోని శాంపిల్ను తీసుకున్నది జూలై 12వ తేదీన! అప్పటికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆ శాంపిల్ను జూలై 17న గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కు పంపించారు. 23న ఆ ల్యాబ్ రిపోర్టు పంపించింది. టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిట బుల్ ఫ్యాట్స్ కలిశాయని నివేదిక ఆధారంగా చెప్పారు. విశ్వస నీయ సమాచారం మేరకు ఎన్డీడీబీతో పాటే మైసూర్లోని మరో కేంద్ర ప్రభుత్వ ల్యాబ్కు కూడా ఈ శాంపిల్స్ పంపించారట. వారి రిపోర్టు గురించి మాత్రం ఎటువంటి సమాచా రాన్ని టీటీడీ ఇవ్వడం లేదు.ఈ వ్యవహారం పూర్తయి రెండు నెలలు గడిచాయి. కూటమి సర్కార్కు వందరోజులు నిండిన నేపథ్యంలో జరిగిన రాజకీయ సమావేశంలో చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను విడుదల చేశారు. జంతువుల ఫ్యాట్ కలిసిందనే ఆరోపణ అక్కడే చేశారు. టీటీడీ విడుదల చేయవలసిన నివేదికను పొలిటికల్ మీటింగ్లో విడుదల చేయడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. అంతకుముందు వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిందని చెప్పిన ఈఓ ఈ సమావేశం తర్వాత స్క్రిప్టు మార్చి చంద్రబాబు ప్రసంగాన్ని అనుసరించారు.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తిరుమల ప్రసాదానికి అపవిత్రతను ఆపాదిస్తూ మాట్లాడడంతో ఇది జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారిపోయింది. తిరుమలకు ఉన్న విశిష్టత అటువంటిది. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసి, తద్వారా రాష్ట్ర ఇమేజ్కు మసిపూసి చంద్రబాబు ఏం సాధించదలుచుకున్నారు? కల్తీ సరుకును కనిపెట్టి వెనక్కు తిప్పి పంపే వ్యవస్థాగత బలం టీటీడీకి ఉన్నది. పలు సంద ర్భాల్లో అలా జరిగింది. మొన్నటి కల్తీ సరుకు వచ్చింది టీడీపీ సర్కార్ జమానాలోనే. దాన్ని గుర్తించిన టీటీడీ వ్యవస్థ వెనక్కు పంపింది కూడా! మరి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని జగన్ సర్కార్ మెడకు చుట్టాలని చంద్రబాబు భావించారు? తనకు అనుకూలంగా అరవై నాలుగు నోళ్లు లేస్తాయన్న ధీమాతోనే కదా అభాండాలు వేయడం!తమ జీవితాలను వరదల్లో ముంచేసినందుకు మూడు లక్షల కుటుంబాలు విజయవాడలో బాబు సర్కారు మీద భగ్గుమంటున్నాయి. సర్కార్ బడుల్లో వసతులపై కోత పెట్టడం, సీబీఎస్ఈ సిలబస్ రద్దు చేయడం, ఇంగ్లీష్ మీడి యాన్ని నిరుత్సాహపరచడంతో రెండున్నర లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రైవేట్ బాట పట్టారు. కేంద్ర సర్కార్లో టీడీపీ భాగస్వామిగా ఉండి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ యత్నాలను అడ్డుకోవడం లేదని కార్మికులు మండి పడుతున్నారు.ఉద్యోగాల కల్పన ఊసేలేదు, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. వంచనకు గురయ్యామని మహిళలు మథనపడుతున్నారు. సర్కార్ మేనిఫెస్టోలపై సోషల్ మీడి యాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వీడియోల నిండా వెట కారం ప్రవహిస్తున్నది.వంద రోజుల్లోనే విశ్వరూపం దాల్చిన వ్యతిరేకతను దారి మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండవచ్చు. కానీ ఆ దారి మళ్లింపు ఇలా ఉండకూడదు. నిస్సందేహంగా బాబు చేసింది మహాపచారం. ఆయన చేసిన పనివల్ల తిరుమల ప్రతిష్ఠకు జాతీయ స్థాయిలో భంగం వాటిల్లింది. కూటమి సర్కార్ అందజేసిన సమాచారాన్నే కళ్లకద్దుకొని జాతీయ మీడియా గుడ్డిగా వ్యవహరిస్తున్నది. ఈ మీడియా ప్రచారం వల్ల జగన్ మోహన్రెడ్డి ప్రతిష్ఠే దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తుండవచ్చు. కానీ చంద్రబాబు జమానాలోనే కల్తీ సరుకు వచ్చిన విషయం నేడు కాకపోతే రేపైనా జాతీయ మీడియాకు తెలుస్తుంది. అక్కడ అమలవుతున్న కట్టుదిట్టమైన వ్యవస్థపై అవగాహన కలుగుతుంది. కానీ, తిరుమల పవిత్రతకు చంద్రబాబు వల్ల తగిలిన గాయం ఎప్పుడు మానాలి? రాజకీయ జూదం కోసం పుణ్యక్షేత్రాలను పణంగా పెట్టేవారికి ఆ ఏడు కొండలవాడే బుద్ధి చెప్పాలి. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పెండ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?
వివాహ సంప్రదాయంలో తలంబ్రాల వేడుక చూడముచ్చటగా సాగుతుంది. వధూవరులు పోటాపోటీగా ఇందులో పాల్గొంటారు. మాంగల్య ధారణ తర్వాత జరిగే తంతు ఇది. తలంబ్రాలకు ఎంచుకునే బియ్యానికి కొన్ని కొలతలు ఉంటాయి. అవి ఆయా ఇంటి ఆచారాలను బట్టి ఉంటుంది. ఇందులో విరిగిన బియ్యం వాడకూడదు. తలంబ్రాల వేడుకలో పఠించే మంత్రాల్లో విశేషమైన అర్థాలు ఉంటాయి. అవి సంసార బాధ్యతలను గుర్తుచేస్తాయి.మొదట తలంబ్రాలను కొబ్బరి చిప్పలో పోసి, రాలతో ్రపోక్షించి వధూవరులకు అందిస్తూ దానం, పుణ్యం చేయాలని, శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, తారలు, చంద్రుని వల్ల దాంపత్యం సజావుగా సాగి, సుఖశాంతులు కలగాలని’ పురోహితుడు మంత్ర పఠనం చేస్తాడు.మొదటగా వరుడు వధువు శిరస్సున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన మృద్ధి జరుగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పిడిపంటలు వృద్ధియగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగునుగాక‘ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళతో పోసుకుంటారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంధి అంటారు. -
నేడు హిమాచల్ బంద్.. హిందూ సంస్థల పిలుపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు శుక్రవారం లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (సెప్టెంబర్ 14) హిమాచల్ బంద్కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.హిమాచల్ బంద్ నేపధ్యంలో రాష్ట్రంలోని వ్యాపారులంతా తమ దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి ఉంచాలని హిందూ సంస్థ నేత కమల్ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. సిమ్లాలోని సంజౌలీలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతామని హిందూ సంస్థలు హెచ్చరించాయి.సెప్టెంబర్ 11న ఉదయం సంజౌలిలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిమ్లా జిల్లా యంత్రాంగం సెక్షన్ 163ని అమలు చేసింది. ఇందులోభాగంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై పూర్తి నిషేధం విధించారు. అయితే ఆందోళనకారులు ఢిల్లీ టన్నెల్ దగ్గరున్న బారికేడింగ్ను బద్దలు కొట్టి, సంజౌలి వైపు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్ ప్రయోగించారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.ఇది కూడా చదవండి: అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్ -
Bangladesh: హిందువుల పూజలపై ఆంక్షలు
ఢాకా: బంగ్లాదేశ్లో అధికారం మారిన తర్వాత, అక్కడి హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువుల పూజల విషయంలో ఆంక్షలు విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం బంగ్లాదేశ్లోని హిందువులు ఇకపై ముస్లింలు నమాజ్ చేసే సమయంలో పూజలు చేయకూడదు. అలాగే ఆ సమయంలో భజనలు చేయడం, వినడం, లౌడ్ స్పీకర్లు వినియోగించడం లాంటి పనులు చేయకూడదు. ఈ ఉత్తర్వులను తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి జారీ చేశారు.ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా వారిని అరెస్టు చేస్తారని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బంగ్లాదేశ్లో అధికారం మారినప్పటి నుంచి ఇప్పటివరకూ 300 హిందూ కుటుంబాలు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. హిందువులపై మూక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. పదికి పైగా హిందూ దేవాలయాల్లో విధ్వంసం, దహనాలు జరిగాయి. ఇదేవిధంగా 49 మంది హిందూ ఉపాధ్యాయుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వుల తర్వాత బంగ్లాదేశ్లోని హిందువులు ప్రశాంతంగా పూజలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా చదవండి: NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన -
ఏది ధర్మం? దేనికి రక్షణ?
చట్టం విరుద్ధం కానంత వరకు ఎవరేమి చేయాలో, ఎవరేం తినాలో చెప్పడానికి వేరొకరికి ఏమి హక్కు ఉంటుంది? కొద్దిరోజుల వ్యవధిలో హర్యానాలో వరసగా జరిగిన రెండు విచక్షణా రహిత హత్యలు ఆ మౌలిక ప్రశ్ననే మరోమారు ముందుకు తెచ్చాయి. ధర్మం పేరిట విద్వేషాన్ని నింపుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటున్న స్వయం ప్రకటిత గోరక్షకులతో దేశానికున్న ముప్పును గుర్తుచేశాయి. పన్నెండో తరగతి చదువుతున్న 19 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు ఆర్యన్ మిశ్రా హర్యానాలోని ఆగస్ట్ 24న మిత్రులతో కలసి కారులో వస్తుండగా, గోమాంసం రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సాయుధ మూకలు 50 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి మరీ, ఫరీదాబాద్ వద్ద అతణ్ణి కాల్చి చంపిన ఘటన అమానుషం. అలాగే, గొడ్డుమాంసం తింటున్నాడనే అనుమానంతో ఆగస్ట్ 27న చర్ఖీ దాద్రీ వద్ద 26 ఏళ్ళ వలస కార్మికుడు సబీర్ మాలిక్ను కొందరు సోకాల్డ్ ధర్మపరిరక్షకులు కొట్టి చంపిన తీరు నిర్ఘాంతపరుస్తోంది. సాక్షాత్తూ హర్యానా సీఎం సైతం ‘సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగల’మంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠ. ఇలాంటి పాలక వర్గాల భావజాలం కారణంగానే దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో గోరక్షణ పేరిట హింస సాధారణమైపోయింది. సోమవారం మహారాష్ట్రలో ఓ రైలులో పశుమాంసం తీసుకెళు తున్న ఓ వృద్ధుడిపై మూకదాడి అందుకు మచ్చుతునక. అయితే, తాజా దాడులు మైనారిటీలపై హింస పెచ్చరిల్లుతున్న వైనాన్ని పట్టిచూపడమే కాక, ఈ మతపరమైన అసహనంపై విస్తృత చర్చను లేవనెత్తాయి. ఫరీదాబాద్ ఘటనలో చనిపోయింది అమాయక హిందువంటూ రచ్చ చేస్తున్న వాళ్ళు ఆ పోయిన ప్రాణాలు ముస్లిమ్వైనా ఇలాగే స్పందిస్తారా అన్నది ధర్మసందేహం. అప్పుడే ఇలా స్పందించి ఉంటే, దేశంలో అసలు గోరక్షణ పేరిట పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావేమో! ప్రధాని మోదీ సైతం పశువుల వ్యాపారులపై, పశు మాంసం తినేవారిపై దాడులను గతంలో ఖండించక పోలేదు. కానీ, నోరొకటి మాట్లాడుతుంటే నొసలొకటి చెబుతున్నట్టుగా... అధికార బీజేపీ ఊదరగొ డుతున్న హిందూ జాతీయవాదం గోరక్షణ పేరిట దాడుల్ని పెంచిపోషించిందన్నది నిష్ఠురసత్యం. ఆర్యన్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తే సరికి, ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగకతప్పలేదు. ఛాందసవాద గోరక్షకుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు గురువారం ప్రకటించారు. గతంలోకి వెళితే, 2012– 2018 మధ్య కాలంలో గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా 120 దాకా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఆ హింసలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అత్యధిక ఘటనలు ఉత్తర ప్రదేశ్లోనే జరగడం గమనార్హం. గడచిన ఏడెనిమిదేళ్ళుగా ఉత్తర ప్రదేశ్లోనే కాక హర్యానా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంర క్షకుల పేరిట హింస పెచ్చరిల్లుతూ వస్తోంది. ఈ ‘గోరక్షక ముఠాల’ దాడులు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తున్నాయి. నిజానికి, 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచే మన దేశంలో గోహత్యపై చర్చ, అడపాదడపా హింస సాగుతూనే వచ్చాయి. ‘హిందువేతరులపై హిందూ ధర్మాన్ని రుద్ద కూడద’ని దేశ విభజన సందర్భంగా సాక్షాత్తూ గాంధీ సైతం నొక్కిచెప్పాల్సి వచ్చింది. భారతదేశం లౌకికవాద గణతంత్ర రాజ్యమనే స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం సైతం గోరక్షణను తమ డ్రాఫ్టులో చేర్చలేదు. గోరక్షణను ప్రాథ మిక హక్కుగా చేర్చాలన్న వాదనను తోసిపుచ్చి, దాన్ని ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారని చరిత్ర. భారత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించిన మన పెద్దలు వివేకంతో వ్యవహరించి, మెజారిటీ ప్రజల ఒత్తిడికి తలొగ్గలేదు. భావోద్వేగభరిత ధార్మిక అంశాల కన్నా దేశంలోని లౌకికవాద చట్టాన్ని సమున్నతమని చేతలతో చాటారు. హిందూ ధర్మంలో గోవును పవిత్రమైనదిగా పూజిస్తాం. తప్పు లేదు. మరి, అదే ధర్మం మనిషిలో దేవుణ్ణి చూడమన్న మాటను గౌరవించవద్దా? దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల అక్రమ అమ్మకం, వధను నిషేధిస్తూ రకరకాల నియంత్రణలున్నాయి. కానీ, వీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అతివాద బృందాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, హత్యలకు పాల్పడడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచడం సహిద్దామా? భరిద్దామా? ఈ రకమైన హిందూ జాతీయవాదంతో దేశం ఎటు పోతుంది? దేశంలోని 20 కోట్ల పైగా ముస్లిమ్లను వేరుగా చూస్తూ, ఈ సమాజంలో తాము మరింత మైనారిటీలుగా మిగిలిపోయామనే భావన కల్పించడం సామాజిక సమైక్యతను దెబ్బతీయదా? అది పొరుగున పొంచిన శత్రువులకు ఊతం కాదా?సంఘమంటేనే విభిన్న వర్గాలు, భావాలు, సంస్కృతులు, అలవాట్ల సమ్మేళనమనే ప్రాథమిక అంశాన్ని అందరూ గుర్తెరిగేలా చేయాలి. వైమనస్యాలు పెంచి సామరస్యాన్ని దెబ్బతీస్తే మొదటికే మోసం. అందులోనూ మూగజీవాల్ని అడ్డం పెట్టుకొని ప్రదర్శిస్తున్న మతోన్మాదం రాజకీయ ప్రేరేపి తమైనది కావడం పెను ప్రమాదఘంటిక. రాజ్యాంగ నైతికతకే విఘాతం కలిగిస్తున్న ఈ చర్యలతో చివరకు సత్ పౌరులనూ, అమాయకులనూ హింసించడం మరింత విషాదం. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ రకమైన హింసను సహించరాదని పదే పదే ఆదేశించినా, పాలకవర్గ రాజకీయాలకు ఆశ్రితులైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. స్థానిక నేతలుగా ఎదిగి, చట్టసభల్లో స్థానం సంపాదించు కొని, ప్రజాస్వామ్య విలువల్ని పరిహాసప్రాయం చేస్తున్నారు. పశువుల్ని కాపాడే మిషతో మనిషే మృగంగా మారుతున్న ఈ ధోరణికి ఇకనైనా పాలకులు అడ్డుకట్ట వేయాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకై దీన్ని ఇలాగే వదిలిస్తే ఆఖరికి ఆవుల రక్షణ పేరిట ఆటవిక రాజ్యం నెలకొంటుంది. -
ఏడడుగులు ఎందుకు వేస్తారు?
మూడు ముళ్ల తర్వాత హోమం చుట్టూ ఏడడుగులు ప్రదక్షిణ చేస్తారు వధూవరులు. అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకూ తోడుంటా అని వాగ్ధానం చేస్తూ ఏడడుగులు వేస్తారు. ఇంకా వివరంగా చె΄్పాలంటే ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇస్తున్నట్లు లెక్కమొదటి అడుగు.. అన్నవృద్ధికి. అంటే అన్నపూర్ణగా పిలిచే మనదేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది. రెండో అడుగు.. బలవృద్ధికి. అంటే వధూవరుల ఇరు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు.మూడో అడుగు.. ధన ప్రాప్తి కలగాలని వేస్తారునాలుగో అడుగు..దంపతులిద్దరూ సదా సుఖ సంతోషాలతో ఉండాలని ఐదో అడుగు..ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైన మేరకు సాయం చేస్తామని చెప్పడం. ఆరో అడుగు..వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని.ఏడో అడుగు.. శారీరకంగా, మేధో పరంగా పుష్ఠి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు. -
బంగ్లాదేశ్ సంక్షోభంపై అవిముక్తేశ్వరానంద ఏమన్నారంటే..
బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ఢాకా వదిలి ఇండియా వచ్చారు. ఇక్కడి నుంచి షేక్ హసీనా ఇప్పుడు లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ సంక్షోభంపై ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బంగ్లాదేశ్లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోంది. పౌరులను రక్షించే బాధ్యతను సైన్యం కచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్లో దాదాపు 10 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు. వారి భద్రత ఎంతో ముఖ్యం. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ఆర్మీ పాటుపడాలి’ అని కోరారు.కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో సహా అనేక ఇతర నగరాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ప్రకటించారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో వందల సంఖ్యలో జనం మృతిచెందారు. -
మోదీజీ.. ఇక చాలు
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజాజీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడిఆవులు, గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోటా తగ్గించి ముస్లింలకు 15 శాతం ఇస్తారని మోదీ రోజూ అబద్దాలు ప్రచారంచేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పీటీఐ ఇంటర్వ్యూ సందర్భంగా ఖర్గే వెల్లడించిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..ఆయనే వైదొలగుతానన్నారు‘హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. మళ్లీ ఆయనే రోజూ హిందూ, ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబ డట్లేరు. తప్పులు ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంతగా అబద్దాలడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వింటే, చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీల్లో విష ప్రచారాన్ని దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజాజీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం’’అందుకే రాహుల్ ప్రేమ దుకాణాలు తెరుస్తానన్నారు‘‘ బీజేపీ నేతలు రాజ్యాంగం, ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మోదీ ఏనాడైనా ఖండించారా? గిరిజ నులపై మూత్ర విసర్జన ఘటనలను ఒక్కసారైనా తప్పుబట్టారా? కనీసం బీజేపీ నేతలను మందలిస్తూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారా?. తానొక్కడినే నేత అన్నట్లు వన్మ్యాన్ షో చేస్తున్నారు. మొత్తం దేశాన్ని ఒక్కడినే పాలిస్తానని ప్రకటించుకుంటున్నారు. ప్రచారసభల్లో విద్వేష వ్యాఖ్యానాలే చేస్తున్నారు. అందుకే విద్వేషం సమసిపోయేలా ప్రేమ దుకాణాలు తెరుస్తానని రాహుల్ గాంధీ అన్నారు’’అవి బుజ్జగింపు రాజకీయాలు కావు‘‘అన్యాయమైపోతున్న వారిని పట్టించుకుంటే దానిని బుజ్జగింపు రాజకీయాలు అనరు. మేమేం చేసినా బుజ్జగింపు రాజకీయాలు అంటే ఎలా? పేదలకు ఏదైనా ఇవ్వడం, స్కాలర్షిప్ అందించడం, ముస్లింలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందిస్తే వాటిని బుజ్జగింపు రాజకీయాల గాటన కట్టొద్దు’’బీజేపీలో కూర్చున్న అవినీతి నేతల సంగతేంటి?‘‘అవినీతి నేతల్ని జూన్ 4 తర్వాత జైల్లో వేస్తామని మోదీ అన్నారు. మరి అవినీతి మరకలున్న చాలా మంది నేతలను బీజేపీ లాగేసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వారిలో కొందరిని ఎంపీలను చేసింది. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి వారి సంగతేంటి?’’.బీజేపీ మెజారిటీని కచ్చితంగా అడ్డుకుంటాం‘‘కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చాలా పెరిగింది. కూ టమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ బలంతో బీజేపీ మెజారిటీని ఖచ్చితంగా నిలు వరిస్తాం. మా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది’’.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?‘‘రామ మందిరం, హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్ అంశాలే దశాబ్దాలుగా చెబుతూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఇన్నాళ్లూ ఒడిసిపట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కొత్తగా కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఆవులు, గేదెలు తీసుకెళ్తుందని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని, మంగళసూత్రం తెంపుకుపోతుందని, భూము లు లాక్కుంటారని ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?’’‘400’ గొడవ మొదలెట్టిందే మీరు‘‘పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, 400 సీట్లు గెలవాలని అన్నది ఎవరు?. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? అసలు 400 సీట్ల గొడవ మొదలెట్టిందే మీరు. అర్హతలేని ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్యాంగబద్ధ సంస్థలను నింపేద్దామని బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్లు తెగ్గోసేందుకు రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ సాహసిస్తోంది. రాజ్యాంగం ప్రకారం పాలించట్లేదు. అనైతికంగా గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు’’ అని ఖర్గే ఆరోపించారు. -
మళ్లీ సీఏఏ రంగప్రవేశం!
రేపో మాపో లోక్సభ ఎన్నికల నగారా మోగబోతున్న తరుణంలో... ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆరునూరైనా ఈనెల 15కల్లా బహిరంగపరచాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన కొన్ని గంటల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనలపై సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో మైనారిటీలుగా వేధింపులకు లోనవుతూ మన దేశానికి వలసవచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మతస్తులకు త్వరితగతిన భారత పౌర సత్వం ఇవ్వటం సీఏఏ ప్రధాన ఉద్దేశమని పార్లమెంటులో బిల్లు పెట్టిన సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మరోసారి ఆమాటే చెప్పింది. ఈ మతస్తులు వరసగా అయిదేళ్లపాటు ఈ దేశంలో నివసిస్తే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఈ సవరణలు తీసుకొచ్చారు. చట్టంలో ముస్లింలను మినహాయించినట్టు బాహాటంగానే కనబడుతోంది. కానీ శ్రీలంకలో మైనారిటీలైన హిందూ తమిళులనూ, మయన్మార్లోని మైనారిటీలు రోహింగ్యాలనూ, ఇంకా... హజరా, అహ్మదీయ వంటి ముస్లిం మైనారిటీ తెగలనూ సీఏఏ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ తెగలు కూడా భారత పౌరసత్వం కోసం ఎప్పటిలా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం వారు పదకొండేళ్లపాటు ఈ దేశంలో నివసించాలి. ఆచరణలో పౌరసత్వం రావటానికి దశాబ్దాలు పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ముస్లిం దేశాల్లోని హిందువుల స్థితిగతులపై వున్న ఆరాటం లంక తమిళుల విషయంలో ఎందుకు లేకుండా పోయింది? అక్కడ వారు ఎదుర్కొంటున్న వివక్ష, హింస తక్కువేమీ కాదు. చట్టం ముందు అందరూ సమానులేనని మన రాజ్యాంగం చెబుతోంది. రాజ్యం ఎవరికీ సమానత్వాన్ని నిరాకరించకూడదనీ, పౌరులందరికీ చట్టాలు సమంగా రక్షణ కల్పించాలనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చాటుతోంది. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నవారి విషయంలో ఆ స్ఫూర్తే కొనసాగాలి. కానీ సీఏఏ అందుకు విరుద్ధంగా కొన్ని మతాలవారిని ఉదారంగా చూడటం, మరికొందరిని దూరం పెట్టడం ఎంతవరకూ సమంజసం? ఈ చట్టాన్ని సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 2020లో పిటిషన్ దాఖలు చేసింది. కాలక్రమంలో మరో 200 పిటిషన్లు దానికి జత కలిశాయి. ఇందులో అస్సాంకు చెందిన అసోం గణపరిషత్, డీఎంకే, అస్సాం పీసీసీ మొదలుకొని అసదుద్దీన్ ఒవైసీ, మహువా మొయిత్రా, జైరాం రమేష్ వంటి నాయ కులు కూడా వున్నారు. బిల్లు చట్టంగా మారాక దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, విశ్వ విద్యాలయాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలోని జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూని వర్సిటీ వంటిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనల్లో వందమంది వరకూ మరణించగా, అనేకులు గాయపడ్డారు. వందలాదిమందిపై ఇప్పటికీ కేసులు కొనసాగు తున్నాయి. సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యాక ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఉద్యమాల వెనకున్న ఉద్దేశం వేరు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వంటివి పరాయి దేశాల మైనారిటీలకు మనమెందుకు పౌరసత్వం ఇవ్వాలని ప్రశ్నిస్తు న్నాయి. ఈ భారం తమపైనే పడుతుందని ఆందోళన పడుతున్నాయి. మరోపక్క సీఏఏ నోటిఫికేషన్ రాకపై గత కొన్ని నెలలుగా మీడియాలో కథనాలు వస్తూనే వున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఎదుర్కొనటానికి ఇది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనీ, లేకుంటే దెబ్బతింటామనీ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. బెంగాల్లోని నాదియా, 24 పరగణాలు, తూర్పు బర్ద్వాన్, ఉత్తర బెంగాల్లోని మరికొన్ని ప్రాంతాలకు 1971లో బంగ్లా విముక్తి యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతువా తెగ ప్రజలు హిందువులు. పౌరసత్వ చట్టానికి 2003లో చేసిన సవరణ కింద వారంతా శరణార్థులుగా కొనసాగుతున్నారు. ఓటుహక్కు వగైరాలున్నాయి. మొదట్లో సీపీఎంకూ, తర్వాత తృణమూల్కూ, ఇప్పుడు బీజేపీకీ వోటు బ్యాంకుగా వీరు ఉపయోగపడుతున్నారు. అస్సాంలోనూ బీజేపీకి అటువంటి ప్రయోజనాలే వున్నాయి. రామమందిరం, పౌరసత్వ సవరణ చట్టంవంటివి మాత్రమే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని నిజంగా బీజేపీ భావిస్తే అది ఆ పార్టీ బలహీనతను సూచిస్తుందే తప్ప బలాన్ని కాదు. పొరుగు దేశాల బాధిత మైనారిటీల విషయంలో అనుసరించాల్సిన విధానాలను మాత్రమే సీఏఏ నిర్ధారించిందని, మైనారిటీల పౌరసత్వానికి దానివల్ల వచ్చే నష్టంలేదని, వారు భయపడాల్సిన పని లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. సీఏఏ దానికదే సమస్యాత్మకం కాక పోవచ్చు. కానీ జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను దాంతో అనుసంధానిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని నిపుణులంటున్న మాట. అస్సాంలో ఎన్ఆర్సీ అమలయ్యాక ఏమైందో చూస్తే ఇది అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలమంది పౌరసత్వానికి అనర్హు లయ్యారు. ఇందులో ముస్లింలతోపాటు హిందువులు కూడా వున్నారు. ఎన్ఆర్సీని ఏదోమేరకు అంగీకరించిన అస్సాంలో సీఏఏపై వ్యతిరేకత వుండటాన్ని, లంక తమిళులకు చట్టంలో చోటీయక పోవటంపై వున్న అసంతృప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్టులేదు. చట్టం తీసుకురావటానికి ముందు అన్ని వర్గాలతోనూ చర్చించలేదు. ఉద్యమాల సమయంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా అవేమీ జరగలేదు. కనీసం నోటిఫికేషన్ విడుదలకు ముందైనా సందేహాలు పోగొట్టాల్సిన అవసరం గుర్తించకపోతే ఎలా? అసలు ఎన్నికలు ముంగిట పెట్టుకుని సమస్యాత్మకమైన ఈ తేనెతుట్టెను ఎందుకు కదిపినట్టు? -
కన్నడ కాంతార కాదు.. కేరళ కలియట్టం
-
‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం?
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. అంటే ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బిల్లుకు స్వాగతం పలికారు. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఇంకా చర్చల దశలోనే ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ ఏ మతంపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు ఉత్తరాఖండ్లో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలైన పక్షంలో హిందూ వివాహ చట్టం (1955), హిందూ వారసత్వ చట్టం (1956) తదితర ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్)పై కూడా దీని ప్రభావం పడనుంది. ముస్లింలు ప్రస్తుతం ముస్లిం పర్సనల్ (షరియత్) అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలువుతోంది. దీనిలో వివాహం, విడాకులు తదితర నియమాలు ఉన్నాయి. అయితే యూసీసీ అమలైతే బహుభార్యత్వం, హలాలా తదితర పద్ధతులకు ఆటకం ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్లో ముస్లిం జనాభా 13.95 శాతం ఉంది. సిక్కు కమ్యూనిటీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్లో సిక్కు జనాభా 2.34%. ఆనంద్ వివాహ చట్టం 1909 సిక్కుల వివాహాలకు వర్తిస్తుంది. అయితే ఇందులో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో విడాకుల కోసం సిక్కులకు హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది. అయితే యూసీసీ అమలులోకి వచ్చిన పక్షంలో అన్ని వర్గాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు కావచ్చు. క్రైస్తవులు క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు కూడా ఉత్తరాఖండ్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా 1925 వారసత్వ చట్టం ప్రకారం క్రైస్తవ మతంలోని తల్లులకు వారి మరణించిన పిల్లల ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అయితే యూసీసీ రాకలో ఈ నిబంధన ముగిసే అవకాశం ఉంది. ఆదివాసీ సముదాయం ఉత్తరాఖండ్లోని గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదు. ఉత్తరాఖండ్లో అమలు కాబోయే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఇందులోని నిబంధనల నుండి గిరిజన జనాభాకు మినహాయింపు ఇచ్చింది. ఉత్తరాఖండ్లో గిరిజనుల జనాభా 2.9 శాతంగా ఉంది. -
Gyanvapi: మిగిలిన సెల్లార్లలో కూడా ఏఎస్ఐ సర్వే చేపట్టాలి
లక్నో: జ్ఞానవాపి కాంప్లెక్స్లో మిగిలిన సెల్లార్లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కాంప్లెక్స్ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రవేశానికి అనుమతి లేని మిగిలిన సెల్లార్లలో సర్వే చేపట్టవలసిందిగా పిటిషనర్ ఏఎస్ఐని అభ్యర్థించారు. వీటితోపాటు జ్ఞానవాపి ఆవరణలో ఇటీవలి సర్వే సమయంలో దర్యాప్తు చేయని సెల్లార్ల సర్వేలను నిర్వహించాలని ఏఎస్ఐని కోరారు. ఏ సర్వే నిర్వహించినా నిర్మాణానికి నష్టం జరగకుండా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని ఇటుకలు, రాళ్లతో ఉన్న అడ్డంకుల కారణంగా ఏఎస్ఐ సర్వే కొన్నిసెల్లార్లలో పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నిర్మాణానికి హాని కలిగించకుండా ఈ అడ్డంకులను సురక్షితంగా తొలగించడానికి అవసరమైన నైపుణ్యాలను ఏఎస్ఐ నిపుణులు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపుపై ఏఎస్ఐ నివేదిక పొందాలని అభ్యర్థించారు. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేను పూర్తి చేసి నివేదికను కూడా బహిర్గతం చేసింది. మసీదు ప్రాంగణంలో భారీ హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్ఐ స్పష్టం చేసింది. హిందూ దేవాలయ చిహ్నాలు శంఖం, చక్రం సహా పలు ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ సర్వే తర్వాత జ్ఞానవాపి కాంప్లెక్స్ సెల్లార్లో పూజలు చేసుకోవడానికి హిందూ పక్షంవారికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: Varanasi: మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ -
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ.. ముస్లింల మద్దతు!
ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులంతా విరివిగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన హిందూ మహిళ సవీరా ప్రకాష్ వార్తల్లో నిలిచారు. పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. హిందువు అయినప్పటికీ, ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాలలో ఆమె ప్రచారం సాగించినప్పుడు ఆమెకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సవీరా ప్రకాష్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని బునెర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆమెకు టికెట్ ఇచ్చింది. సవీరా వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె తండ్రి పేరు ఓం ప్రకాష్. ఆయన పీపీపీలో సభ్యునిగా ఉన్నారు. ఆయన వైద్య వృత్తిలో రాణిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో సవీరా ప్రకాష్ మాట్లాడుతూ తాను భారత్-పాక్ మధ్య సత్సంబంధాలకు వారధిగా పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను డాక్టర్నని, పాక్లోని ఆసుపత్రుల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. సవీరా 2022లో మెడికల్ కాలేజీ నుండి పట్టా పుచ్చుకున్నారు. బునర్ అసెంబ్లీలో పీపీపీ పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె చాలా కాలంగా తండ్రితోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పాకిస్తాన్లో మహిళల అభ్యున్నతి, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా పాక్ ఎన్నికలకు ముందు గత మూడు రోజులుగా కరాచీ, బలూచిస్థాన్లోని ఎన్నికల సంఘం కార్యాలయాల వెలుపల పేలుళ్లు జరిగాయి. -
అవిస్మరణీయ క్షణాలు
కొన్ని క్షణాలు చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయి. భారత ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, హిందువులు ఆరాధించే శ్రీరాముడికి పురాణప్రసిద్ధమైన ఆయన జన్మస్థలి అయోధ్యలో వెలసిన మందిర ప్రారంభం, అక్కడ అయిదేళ్ళ బాలరాముడి విగ్రహానికి సోమవారం జరిపిన ప్రాణప్రతిష్ఠాపన ఘట్టం అలాంటివే. మరో వెయ్యేళ్ళు గుర్తుండిపోయే రోజుగా మోదీ పేర్కొన్న మందిర ప్రారంభ దినాన కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రామనామం ప్రతిధ్వనించింది. నేపాల్, బాలీ, ట్రినిడాడ్ సహా దేశదేశాల్లోని హిందువులు ఉత్సవం చేసుకున్నారు. వజ్రవైడూర్య ఖచిత స్వర్ణాభరణాలంకృత మందస్మిత బాలరామ రూపసాక్షాత్కారం, సాయంసంధ్యలో సరయూ తీరంలో లక్షల సంఖ్యలో దీపప్రజ్వలనంతో... అనంత కాలగతిలో ఒక చక్రభ్రమణం పూర్తి అయినట్టయింది. నాగరకతలో ఇదొక మహత్తర క్షణమనీ, రామరాజ్య స్థాపనకు తొలి అడుగనీ కొందరంటే... రామరాజ్యమంటే హిందూ రాజ్యం కాదు, ధర్మరాజ్యమనే గాంధీ భావనను ఇతరులు గుర్తుచేయాల్సి వచ్చింది. అనేక మతఘర్షణలు, దశాబ్దాల రాజకీయ, న్యాయ పోరాటాలు ఈ మందిర నిర్మాణం వెనుక ఉన్నాయి. రామ జన్మభూమిలో 1528లో బాబర్ సైన్యాధ్యక్షుడు మీర్ బాఖీ కట్టినట్టు చెబుతున్న బాబ్రీ మసీదు 1992 డిసెంబర్ 6న కరసేవకుల చేతిలో కూలడం, చివరకు సుప్రీమ్ కోర్టు వేర్వేరుగా ఆలయ – మసీదు నిర్మాణాలకు ఆదేశాలివ్వడం... అలా అది ఓ సుదీర్ఘ చరిత్ర. వెరసి, అయిదు శతాబ్దాల తర్వాత రామ్ లల్లా (బాల రాముడు)కు అది మందిరమైంది. వేలాది ధార్మికుల మొదలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, అశోక్ సింఘాల్, కల్యాణ్ సింగ్ లాంటి నేతల వరకు ఈ ఆలయ నిర్మాణ ఘట్టానికి ప్రేరకులు, కారకులు ఎందరెందరో. మూడు దశాబ్దాల క్రితం తమ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాన్ని ఎట్టకేలకు నెరవేర్చిన ఘనత మాత్రం మోదీకి దక్కింది. తెరపై రామ జన్మ భూమి ట్రస్ట్ లాంటి పేర్లున్నా, తెర వెనుక చక్రం తిప్పుతున్నదెవరో తెలియనిది కాదు. వచ్చే మేలో మరోసారి ప్రజాతీర్పు కోరి, వరుసగా మూడోసారి బీజేపీని గద్దెనెక్కించే పనిలో మోదీ ఉన్నారు. హడావిడి, అసంపూర్ణ ఆలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల అస్త్రంగా విమర్శకులు తప్పుబడుతున్నదీ అందుకే. కోట్లాది శ్రద్ధాళువుల ఉత్సాహం అర్థం చేసుకోదగినదైనా, దేశమంతటా ఉద్వేగం రగిలించి, మందిరాన్ని సైతం మెగా ఈవెంట్గా మార్చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవనలేం. ‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అన్న భావన నుంచి పక్కకు జరిగి, అత్యద్భుత ఆలయ నిర్మాణాలు అవసరమనే విధాన మార్పు వైపు దేశం ప్రయాణించింది. బీజేపీ, మోదీల మందిర రాజకీయాలు ప్రాంతీయ నేతలకూ పాఠమయ్యాయి. ఆలయాలు అనంత రాజకీయ ఫలదాయకమని అందరూ గుర్తించారు. అయోధ్య అక్షతలను ఇంటింటికి పంపే పని ఒకరు చేస్తే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ప్రతి ఇంటా బియ్యం, తాంబూలం సేకరించి, గత బుధవారం పూరీ క్షేత్రంలో ఆలయ విస్తరణ ప్రాజెక్ట్ ‘జగన్నాథ్ పరిక్రమ’ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శక్తిపీఠాల్లో ఒకటైన కోల్కతాలోని కాళీఘాట్ ఆలయ పునర్నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు. మతానికీ, రాజకీయానికీ ముడివేసే ఈ ప్రయత్నాలు ఎంత దూరం వెళతాయో చెప్పలేం. అడుగడుగున గుడి, అందరిలో దేవుడున్నాడని భావించే భారతీయ సంస్కృతి నడయాడిన నేలపై... అయోధ్యలో మందిరావిష్కారం రోజునే మమత సర్వమత సౌభ్రాతృత్వ యాత్ర చేపట్టడం గమనార్హం. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ధార్మిక స్థలాల సందర్శన పెరుగుతోంది. ధార్మిక పర్యాటకంపోటెత్తుతోంది. భారత్లో ఏటా 20 కోట్ల మందికి పైగా కాశీని సందర్శిస్తారనీ, రోజుకు లక్ష మందికి పైగా తిరుపతికి వస్తారనీ లెక్క. ఇప్పుడీ జాబితాలో కొత్తగా అయోధ్య చేరనుంది. దేశంలోనే పెద్ద హిందూ దేవాలయంగా నిర్మాణమైన రామమందిరం, సరయూ నదీ తీరంలోని సామాన్య పట్నాన్ని మహానగరంగా మార్చేందుకు వేసిన మెగా ప్రణాళిక, ప్రచార హంగామాతో పరి వ్యాప్త మైన ధార్మిక వాతావరణం... అన్నీ కలసి పురాణ ప్రసిద్ధ శ్రీరామ జన్మస్థలి అయోధ్యను సరికొత్త ఆధ్యాత్మిక గమ్యంగా మారుస్తున్నాయి. చరిత్ర ప్రసిద్ధ ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చి దిద్దడం మన వారసత్వ వైభవానికీ, పర్యాటక వాణిజ్యానికీ మంచిదే. కాకుంటే, రూ. 15 వేల కోట్ల ప్రాజెక్టులు, 85 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ఒకప్పుడు రోజుకు 2 వేల మందికి పరిమితమైన ప్రాంతాన్ని రోజుకు 3 లక్షల పర్యాటకుల స్థాయికి తీసుకెళ్ళే క్రమంలో తగు జాగ్రత్తలూ ముఖ్యం. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠాపన, మందిర ప్రారంభాలకు ఉత్సవం చేసుకోవడం సరే. ఈ సంబరాల వేళ సాటి వర్గాలను మానసికంగా ఒంటరివాళ్ళను చేస్తేనే కష్టం. సమస్త జనుల సౌభాగ్యానికి మారుపేరైన ‘రామరాజ్యం’ వైపు నడిస్తేనే సార్థకత. దేశంలోని అన్ని వర్ణాలు, వర్గాల మధ్య సమత, సమానత, సహనం, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొనేలా చూడాల్సింది నాయకులే. ఆ కృషి చేస్తేనే అర్థం, పరమార్థం. శ్రీరాముడు చేసింది అదే. అలాకాక, ‘అయోధ్య అయిపోయింది... కాశీ, మథుర మిగిలింది’ లాంటి రెచ్చగొట్టే నినాదాలతో వైమనస్యాలు పెంచితే, దేశ సమైక్యతకే అది గొడ్డలిపెట్టు. మరో రావణకాష్ఠానికి మొదటి మెట్టు. ఈ దేశం నీది, నాది, మనందరిదీ అని అన్నివర్గాలూ అనుకోగలిగే ఏకాత్మ భావనే భిన్న సంస్కృతులు, ధర్మాల సమ్మిళితమైన భారతావనికి శ్రీరామరక్ష. పాత తప్పుల్ని తవ్వి తలకుపోసుకొనే పని మాని, కలసి నడవాల్సిన సమయమిది. ఆ దిశలో... నేటికీ కలగానే మిగిలిన నిరుద్యోగ నివారణ, దారిద్య్ర నిర్మూలన, స్త్రీలోకపు సశక్తీకరణ, పీడితజన సముద్ధరణ లాంటి లక్ష్యాలతో మన పాలకులు అడుగులు వేయాలని ఆశిద్దాం. అందరూ ఆ మహా సంకల్పం చెప్పుకొంటేనే ఏ సంబరానికైనా పుణ్యం, పురుషార్థం! -
‘శ్రీరాముడు మాంసాహారి’: ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
హిందువులు ఆదర్శపురుషునిగా భావించే శ్రీరామునిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత డాక్టర్ జితేంద్ర అవద్ మాట్లాడుతూ శ్రీరాముడు శాకాహారి కాదని, మాంసాహారేనని అన్నారు. 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం ఉన్న వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇది నిజమో కాదో ప్రజలే గ్రహించాలన్నారు. దేశ స్వాతంత్ర్యం గురించి ప్రస్తావించిన ఆయన ఎవరెన్ని చెప్పినా గాంధీ, నెహ్రూల కారణంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నది వాస్తవమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ నేత గాంధీజీ ఓబీసీ అనే విషయాన్ని ఆర్ఎస్ఎస్వారు గుర్తుంచుకోవాలన్నారు. గాంధీజీ హత్యకు అసలు కారణం కులతత్వమేనని జితేంద్ర అవద్ వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వివాదం తలెత్తింది. 31 ఏళ్ల క్రితం రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న శ్రీకాంత్ పూజారిని తాజాగా అరెస్ట్ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. అయితే ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ఇలా అరెస్ట్ చేయడం యాదృచ్ఛికమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శ్రీకాంత్ పూజారి మద్యం అక్రమ విక్రయాలు, జూదంతో సహా 16 సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని సీఎం తెలిపారు. అలాంటి వారిని అరెస్టు చేయకపోతే రాముడు కూడా క్షమించడని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఇటీవల సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా కొత్త వివాదం సృష్టించారు. భారత్ హిందూ దేశంగా మారితే అది ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్లా మారుతుందని వ్యాఖ్యానించారు. -
‘ఆ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షలు’
హిందూ దేవుళ్లపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్లో కలకలం రేపాయి. ఈ నేపధ్యంలో శివ భవానీ సేన అనే హిందూ సంస్థ సదరు ఆర్జేడీ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షల రివార్డును అందజేస్తామంటూ పోస్టర్లను అతికించింది. పాట్నాలోని బీహార్ శాసనసభ సభ్యుల ఫ్లాట్ల దగ్గర ‘శివ భవానీ సేన’ ఆర్జేడీ ఎమ్మెల్యేకు సంబంధించిన పోస్టర్ను అతికించింది. అందులో ఈ రివార్డ్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బహదూర్ సింగ్ స్పందిస్తూ ‘శివ భవానీ సేన’పై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటన చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు లేఖ రాశానని తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ పేరుతో పలు గోడలపై కొన్ని చోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేను చెప్పిన మాటను ఉదహరిస్తూ.. ‘ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం, పాఠశాల అంటే జీవితంలో వెలుగుల మార్గం’ అని రాసివుంది. ఇది గుడి గంట మోగిస్తే మనం మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, అజ్ఞానం వైపు పయనిస్తున్నామని, బడి గంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం, శాస్త్రీయత, వెలుగుల వైపు పయనిస్తున్నామనే సందేశం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకోండి’ అని దానిలో రాసివుంది. కాగా ఆ పోస్టర్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ గురించి పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హిందూ శివ భవానీ సేన ఈ ప్రకటనను తప్పుబట్టింది. ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ వ్యాఖ్యలు చేశారని, అతని నాలుకను తెగ్గోసినవారికి రూ. 10 లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు. ఫతే బహదూర్ సింగ్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. -
‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతం, హిందూ ధర్మం వేరువేరని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. హిందుత్వ సిద్ధాంతంపై (ఐడియాలజీ) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు మైనారిటీ ఓట్లు కోల్పోకుండా.. మరోవైపు మోడరేట్ హిందూ ఓట్లు దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహంగా 'సాఫ్ట్ హిందుత్వ'ను పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. హిందుత్వలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏం ఉండవని తెలిపారు. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'హిందుత్వ అంటే హిందుత్వనే. నేను హిందువునే. హిందుత్వం, హిందు అనేవి వేర్వేరు. మనం రాముడిని ఆరాధించలేదా? వాళ్లు (బీజేపీ) మాత్రమే రాముడిని పూజిస్తున్నారా? మన గ్రామాల్లో రామ మందిరాలు నిర్మించలేదా? మనం రాముడి భజనలు చేయలేదా? ' అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. డిసెంబర్ చివరి వారంలో భజనలు జరుగుతుంటాయని, తమ గ్రామంలోనూ అలాంటి వేడుకలు జరిగేవని సిద్ధరామయ్య తెలిపారు. ఆ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొనేవాడినని చెప్పారు. కేవలం బీజేపీ వాళ్లే హిందువులా?.. మనం కాదా? అని మండిపడ్డారు. సిద్ధరామయ్య గత ఫిబ్రవరిలోనూ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ అనేది రాజ్యాంగవిరుద్ధమని, హిందుత్వ, హిందూ ధర్మం వేర్వేరని అన్నారు. తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదని, తాను హిందువునని, కానీ మనువాదం, హిందుత్వకు వ్యతిరేకినని చెప్పారు. హత్యలను ఏ మతం సమర్ధించదని, కానీ హిందుత్వ మద్దతుదారులు హత్యలు, వివక్షను సమర్ధిస్తారని ఆరోపణలు చేశారు. తాను రామాలయాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ రాజకీయ ప్రయోజనాలకు దానిని వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యానించారు. మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలు, వచ్చే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో హిందుత్వపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలకు బీజేపీ నేత అశ్వత్ నారాయణ్ కైంటర్ ఇచ్చారు. సిద్దరామయ్య, కాంగ్రెస్కు భారత్/ హిందుత్వానికి సంబంధించిన అంశాలపై అసలు స్పష్టతే లేదని విమర్శించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. హిందూత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు Karnataka CM @siddaramaiah accuses BJP of "Fake Hindutva." Says, "Some people talk about soft Hindutva. Hindutva is Hindutva. Hindu and Hindutva are different. Haven’t we built Ram temples in our villages? Don’t we worship Rama? Aren’t we Hindus?” Siddaramaiah also pitches for… pic.twitter.com/RrkhHjVIF4 — Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) December 28, 2023 -
కెనడాలో హిందూ వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు
ఒట్టావా: కెనడాలో హిందూ లక్షిత దాడులు మరోసారి జరిగాయి. సర్రేలో హిందూ వ్యాపారవేత్త ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో ఇంటిపై 11 బుల్లెట్లు పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 27 ఉదయం 14900 బ్లాక్ 80 అవెన్యూలో కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు జరిపిన నివాసం సర్రేలోని లక్ష్మీ నారాయణ మందిర్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పెద్ద కుమారుడికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. కెనడాలో కొద్ది రోజులుగా హిందూ లక్షిత దాడులు జరుగుతున్నాయి. దేవాలయాలే లక్ష్యంగా దుండగులు దాడులు చేస్తున్నారు. ఇటీవల సర్రేలోని లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఇటీవల దాడులు జరిగాయి. సర్రేలో ఖలిస్థానీల మద్దతుతో ర్యాలీలు కూడా వెలుగు చూశాయి. నిజ్జర్ హత్య కేసు తర్వాత ఈ దాడులు ఎక్కువయ్యాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ను సర్రేలోనే దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. గురుద్వాలో ఉన్న నిజ్జర్పై జులై 18న కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది కాస్త కెనడా- భారత్ మధ్య వివాదంగా మారింది. ఇదీ చదవండి: ఖతార్లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు -
‘హలాల్ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
బెగూసరాయ్: ‘సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో జంతు బలి ఉంది. ముస్లింలను నేను గౌరవిస్తాను. వాళ్లు వారి మత ఆచారం ప్రకారం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. హిందువులు వెంటనే హలాల్ మాంసాన్ని తినడం ఆపేయాలి. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలి’అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ఈ విషయమై సింగ్ సోమవారం బీహార్లోని బెగూసరాయ్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కుట్ర వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడుతుందని సింగ్ తెలిపారు. పార్లమెంట్లో జరిగిన దాడి రైతుల ఉద్యమం లాంటిదేనని, ఇందులో కూడా టూల్కిట్ గ్యాంగ్ హస్తం ఉందని ఆరోపించారు. ‘పార్లమెంట్లో దాడి ఘటనపై విచారణ జరుపుతున్నాం.దీనికి కారణమైన వాళ్లు ఎవరో త్వరలో తేలుతుంది. రైతుల ఉద్యమ సమయంలో టూల్కిట్ గ్యాంగ్ ఎలా బయటపడిందో అలాగే పార్లమెంట్ ఘటన వెనుక ఉన్నదెవరో త్వరలో తెలుస్తుంది’అని గిరిరాజ్ అన్నారు. ఇదీచదవండి..పార్లమెంట్ సమావేశాల అప్డేట్స్. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
లక్నో: వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది.. ఖండంతరాలు దాటిన ఆ ప్రేమకు పెద్దల ఆంగీకారం తోడైంది.. ఇంకేముంది మూడు ముళ్ల బందంతో ఆ జంట ఒక్కటైంది. నెదర్లాండ్స్ అమ్మాయి, యూపీ అబ్బాయి ప్రేమపెళ్లి ఇరువురి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. హార్దిక్ వర్మ(32), ఉత్తరప్రదేశ్ ఫతేపూర్కు చెందిన వ్యక్తి. ఇటీవల ఆయన ఉద్యోగ రీత్యా నెదర్లాండ్స్ వెళ్లారు. అక్కడ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే తన సహోద్యోగి గాబ్రిలాతో స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. గత వారం గాబ్రిలాను వెంటబెట్టుకుని ఇండియా వచ్చిన హర్దిక్ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు కూడా అంగీకరించడంతో నవంబర్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. 'మా కుటుంబీకులు అంతా గుజరాత్లో ఉంటారు. కానీ మా పూర్వికుల నుంచి ఇళ్లు ఇక్కడే ఉంది. అందుకే అందరం ఫతేపూర్కు వచ్చాం. హిందూ సాంప్రదాయం ప్రకారమే గాబ్రిలాను వివాహం చేసుకున్నా. డిసెంబర్ 25న నెదర్లాండ్స్ వెళ్లిపోతాం. అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో కూడా వివాహం చేసుకుంటాం.' అని హర్దిక్ తెలిపారు. ఇదీ చదవండి: బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్కు బాంబు బెదిరింపులు -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు
ఒట్టావా: ఇండియా-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడ ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారతీయ హిందువులు కెనడా విడిచి వెళ్లాలని నిషేదిత ఖలిస్థానీ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) నాయకుడు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్గా మారింది. 'కెనడా హిందువులారా.. మీరు మా దేశ రాజ్యాంగం పట్ల విధేయతను తిరస్కరించారు. మీ గమ్యం భారతదేశం. కెనడాను వదిలి వెళ్లండి. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాకు విధేయులుగా ఉంటారు. కెనడా రాజ్యాంగం ప్రకారం వారు నడుచుకుంటారు.' అని పేర్కొంటూ పన్నూన్ ఓ వీడియోను విడుదల చేశాడు. అక్టోబర్ 29న వాంకోవర్లో కెనడా సిక్కులు సమావేశమవ్వాలని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ బాధ్యుడని రిఫరెండంపై ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఇండియా ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య వేత్తలను కూడా పలుమార్లు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కూడా పన్నూర్ వారం క్రితం హెచ్చరికలు జారీ చేశారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: Canada-India Dispute: ముంబయిలో ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు -
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి? అల్లుని మృతదేహాన్ని చూసి నెహ్రూ ఏమన్నారు?
అది 1960, సెప్టెంబరు 7.. ఫిరోజ్ గాంధీ వారం రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇక భరించలేక తన స్నేహితుడైన డాక్టర్ హెచ్ఎస్ ఖోస్లాకు ఫోన్ చేశారు. తరువాత తానే కారు నడుపుతూ ఢిల్లీలోని వెల్లింగ్టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య ఇందిరా గాంధీ ఢిల్లీకి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఇందిర వెంటనే ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు... ఇందిరా గాంధీ ఆ రాత్రంతా ఫిరోజ్ పక్కనే కూర్చున్నారు. ఫిరోజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం కొద్దిసేపు స్పృహలోకి వచ్చారు. అయితే ఆయన తన 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని వెల్లింగ్టన్ హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్కు తీసుకువచ్చారని బెర్టిల్ ఫాక్ తన పుస్తకం ‘ఫిరోజ్ – ది ఫర్గాటెన్ గాంధీ’లో రాశారు. అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని... తీన్ మూర్తి భవన్కు చేరుకున్న ఇందిర.. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని, అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు. తీన్ మూర్తి భవన్లోని కింది అంతస్తు నుంచి ఫర్నిచర్ తదితరాలన్నింటినీ తొలగించి, అక్కడ ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని తెల్లటి షీట్పై ఉంచి, అందరికీ చివరి చూపు కోసం ఉంచారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి... బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో బ్రిటిష్ నటి, సినీ విమర్శకురాలు మేరీ సెటన్ జవహర్లాల్ నెహ్రూ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తీన్ మూర్తి భవన్లో ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీతో కలిసి ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని ఉంచిన గదికి చేరుకున్నారని మేరీ రాశారు. ఆ సమయంలో నెహ్రూ ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇందిరా గాంధీ కూడా లోలోపల తీవ్రంగా ఆవేదన చెందున్నారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి వచ్చిన జనాన్ని చూసి నెహ్రూ ‘ఫిరోజ్ని జనం ఇంతలా ఇష్టపడతారని నాకు తెలియదు’ అని అన్నారు. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు... సెప్టెంబర్ 9 ఉదయం, ఫిరోజ్ గాంధీ భౌతికకాయం అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్కు తరలించారు. ఫిరోజ్ గాంధీ తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు పార్సీ ఆచారాల ప్రకారం తన అంత్యక్రియలు చేయకూడదని తన స్నేహితులకు తెలిపారు. పార్సీ సమాజ ఆచారంలో మృత దేహాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం చేయరు. దీనికి బదులుగా మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో ఉంచుతారు. ఇక్కడ డేగలు, కాకులు, జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాథరిన్ ఫ్రాంక్ తన పుస్తకం ‘ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ’లో ఇలా రాశారు ‘ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగినప్పటికీ, ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని దహనం చేసే ముందు కొన్ని పర్షియన్ ఆచారాలను ఇందిర పాటించారు. ‘అహనవేటి’ అధ్యాయం మొత్తం చదివారు. అనంతరం 18 ఏళ్ల రాజీవ్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల చితికి నిప్పంటించారు. చితాభస్మాన్ని మూడు భాగాలుగా.. ఫిరోజ్ గాంధీ కుటుంబం చాలా కాలం సూరత్లో ఉండేది. తర్వాత ఫిరోజ్ అలహాబాద్ వచ్చాడు. దహన సంస్కారాల అనంతరం అతని చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించారు. పండిట్ నెహ్రూ సమక్షంలో అలహాబాద్ సంగమంలో ఒక భాగం నిమజ్జనం చేశారు. రెండవ భాగం అలహాబాద్లో, మూడవ భాగాన్ని సూరత్లోని ఫిరోజ్ పూర్వీకుల స్మశాన వాటికలో ఖననం చేశారు. ఇది కూడా చదవండి: డిజిటల్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆన్లైన్ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి? -
అక్షరధామ్ ఆలయంలో రిషి సునాక్ ప్రార్ధనలు
ఢిల్లీ:బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తితో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. దాదాపు గంటపాటు దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుగా గర్విస్తున్నానని అన్నారు. 'నేను హిందువునని గర్విస్తున్నాను. అదే వాతావరణంలో పెరిగాను. ఇప్పటికీ అలానే ఉన్నాను. ఢిల్లీలో ఉండే ఈ రెండు రోజుల్లో ఒక మందిరాన్ని దర్శించాలని అనుకున్నాను.' అని రిషి సునాక్ అన్నారు. రిషి సునాక్ రాకతో దేవాలయంతో సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. జీ20 సమావేశాలకు హాజరుకావడానికి శుక్రవారం ఢిల్లీకి వచ్చారు రిషి సునాక్ దంపతులు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే 'జై శ్రీరాం' అని పలకరిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వారికి స్వాగతం పలికారు. రుద్రాక్ష, భగవద్గీత, హనుమాన్ చాలీసాను రిషి సునాక్ దంపతులకు అందించారు. శనివారం జీ20 సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు రిషి సునాక్. వాణిజ్య, పెట్టుబడుల అంశంలో మరిన్ని ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్.. -
దేశానికి తగిలిన చెంప దెబ్బ
మొదటి ఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. హోమ్ వర్క్ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల ముస్లిం బాలుడిని మిగతా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చెంప దెబ్బ కొట్టాలని తృప్తి త్యాగి అనే ఉపాధ్యాయురాలు ఆదేశించారు. రెండో ఘటన జమ్మూ–కశ్మీర్లో చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు బ్లాక్ బోర్డు పైన ‘జై శ్రీరామ్’ అని రాసినందుకు, ఫరూఖ్ అహ్మద్ అనే టీచర్ పిల్లలంతా చూస్తుండగా ఆ బాలుడిని క్లాసు బయటికి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టాడు. ఇక్కడ బాధితులు పసివాళ్లు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వారికి లోతైన గాయాలయ్యాయి. దారుణాతి దారుణం ఏంటంటే... వారు ముస్లిములో, హిందువులో అయిన కారణంగా అలా జరగడం! అది ఏకంగా భారతదేశం పైనే జరిగిన దాడి! మాట వినని పిల్లలు చెంపదెబ్బ తింటారని తెలియని తరం నుండేమీ నేను రాలేదు. కానీ నాన్న ఎప్పుడూ నాపై చెయ్యి ఎత్తలేదు. ఆయన ఆర్మీ ఆఫీసర్ అయినప్పటికీ నన్ను గారం చేసేవారు. సున్నితమైన మనసు గల తండ్రిగా ఆయన నా పట్ల వ్యవహరించేవారు. అమ్మ మాత్రం నన్ను క్రమశిక్షణలో ఉంచేవారు. అమ్మ చేతి దెబ్బలు ఒకటీ రెండు తిన్నట్లు కూడా నాకు గుర్తు. నిస్సందేహంగా నేను ఆ దెబ్బలకు యోగ్యమైనవాడినే! నిజానికి, ఆ విధమైన దండన ఆ కాలంలో సమర్థనీయతను కలిగి ఉందన్న సంగతి కూడా నాకు తెలియందేమీ కాదు. అయితే గత వారం రెండు వేర్వేరు పాఠశాలల్లో, ఇద్దరు వేర్వేరు వర్గాలకు చెందిన పిల్లలపై ‘ఇతర’ వర్గం నుంచి జరిగింది ఇందుకు భిన్నమైనది. వారు చెంపదెబ్బలు తినలేదు. దెబ్బలు తిన్నారు. ఇది మొదటిది. ఇక రెండవది... వారిని మందలించడానికి గానీ, సరిదిద్దడానికి గానీ కొట్టలేదు. అవి వారిని అవమానించడానికీ, ఆత్మా భిమానాన్ని దెబ్బతీయడానికీ కొట్టినవి. మూడవది, వారు వేరే మతానికి చెందిన వారైనందువల్ల జరిగినవి. వెల్లువెత్తిన మత విద్వేషం అది. ఇదేమీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం జరిగినది కాదు. నిజం చెప్పాలంటే... ఆ ధోరణి గర్హనీయమైనది, నీచమైనది, అసహ్యకరమైనది. మొదటి ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఖుబ్బాపుర్లో జరిగింది. హోమ్ వర్క్ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల ముస్లిం బాలుడిని మిగతా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చెంపదెబ్బ కొట్టాలని తృప్తి త్యాగి అనే ఉపాధ్యాయురాలు ఆదేశించారు. ఆమె ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కూడా! ఆ బాలుడిని అలా కొట్టిస్తున్న సమయంలో ఆ టీచరు... ‘మహమ్మదీయ పిల్లలు’ అంటూ అవహేళనగా, అవమానకరంగా మాట్లాడుతూ, ‘‘ఇంకా గట్టిగా కొట్టండి’’ అని సాటి పిల్లల్ని ప్రోత్స హించడం మరో మాటకు తావులేకుండా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రెండో ఘటన, జమ్మూ–కశ్మీర్లోని బనీలో చోటు చేసుకుంది. అక్కడ పదేళ్ల బాలుడు బ్లాక్ బోర్డు పైన ‘జై శ్రీరామ్’ అని రాశాడు. అది చూసిన ఫరూఖ్ అహ్మద్ అనే టీచర్ ‘‘పిల్లలంతా చూస్తుండగా ఆ బాలుడిని క్లాసు బయటికి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టాడు. అక్కడి నుంచి ఆ బాలుడిని ప్రిన్సిపాల్ గది లోకి లాక్కెళ్లి అక్కడ మళ్లీ ఆ టీచరు, ప్రిన్సిపాల్ కలిసి, గదికి తాళం వేసి మరీ ఆ చిన్నారిని కొట్టారు. ఇంకోసారి అలా రాస్తే చంపేస్తామని హెచ్చరించారు’’ అని ఎఫ్.ఐ.ఆర్.లోని వివరాలను బట్టి తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కూడా అత్యంత భయానకమైనవి. రెండో ఘటన గురించి కొద్దిగా మాత్రమే మనకు తెలుసు. మొదటి ఘటన తాలూకు వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియోను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించే లోపే సోషల్ మీడియాలో లక్షల మంది వీక్షించారు. ఏడేళ్ల ముస్లిం బాలుడిని కొట్టినందుకు వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. ఇక్కడే మరొక ఆందోళన కూడా కలుగుతోంది నాకు. బాలుడి తండ్రి న్యాయం కోసం డిమాండ్ చేసే స్థితిలో లేక పోగా... రాజీపడమని, ఇంకా చెప్పాలంటే ఆ టీచర్ను క్షమించి, జరిగిన దానిని మరచిపొమ్మని ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. అలా ఒత్తిడి తెస్తున్నవారిలో రైతుల పోరాట యోధుడు నరేశ్ టికైత్ కూడా ఉన్నారు. బాలుడి తండ్రిని రాజీ పడమని చెబుతూ, ఎందుకంటే, ‘‘ఆ టీచర్ చెడు ఉద్దేశంతో అలా చేయలేదు’’ అంటున్నారు. ‘‘కనీసం ఆమె క్షమాపణైనా చెప్పాలి కదా’’ అని అడిగినప్పుడు, ‘‘క్షమాపణ అనేది పెద్ద మాట. కానీ ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు’’ అని రాకేశ్ టికైత్ అన్నారు. ఖుబ్బాపుర్ పరిసర ప్రాంతాల గ్రామ పెద్దల ప్రతిస్పందన అయితే మరింత నిరుత్సాహకరంగా ఉంది. పూరా గ్రామానికి చెందిన నరేంద్ర త్యాగి ఆ ఏడేళ్ల పిల్లవాడి తండ్రితో, ‘‘ఇక ఈ నాటకాన్ని ఆపండి. గ్రామంలోకి మీడియా అడుగు పెట్టడం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్.ఐ.ఆర్. వద్దని చెప్పండి. వెనక్కు తీసుకోండి. లేకుంటే మీరే దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అన్నారు. చివరికి పోలీసులు కూడా కనీసంలో కనీసమైనా చేయలేదు. వారెంటు లేకుండా అరెస్టు చేయడానికీ, కోర్టు అనుమతి లేకుండా విచారణ చేపట్టడానికీ వీల్లేని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘‘తృప్తి త్యాగికి ద్వేషపూరిత ఉద్దేశాలు లేవు’’ అని ముజఫర్నగర్ పోలీసులు పేర్కొన్నారు. ఇక స్థానిక బీజేపీ ఎంపీ సంజీవ్ బాల్యాన్ ‘‘ఇదొక చిన్న విషయం’’ అనేశారంటే ప్రభుత్వ స్పందన ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. ఎన్నికలు మరో ఏడు నెలల్లో ఉన్నాయి కనుక క్షమించి, ఇక ఆ విషయాన్ని మర్చిపోవాలని అది కోరుతోంది. కానీ మీరు, నేను అలా క్షమించి, మర్చిపోకూడదని నేను అంటాను. లేదా మొత్తంగా మనం. ఇక్కడ బాధితులు పసివాళ్లు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వారికి లోతైన గాయాలు అయ్యాయి. అవి నయం అవడానికి ఎంతో సమయం, ఎంతగానో ప్రేమ అవసరం అవుతాయి. వారికి జరిగిన దారుణాతి దారుణం... వారు ముస్లిములో, హిందువులో అయిన కారణంగా జరిగింది. అది ఏకంగా భారతదేశం పైనే జరిగిన దాడి! చివరిగా ఒక మాట. ఇవి ‘అచ్ఛే దిన్’(మంచి రోజులు) కాదు. ఇది ‘అమృత్ కాల్’కు పిలుపు కాదు. ఇది నరకానికి ప్రవేశ ద్వారం కావచ్చు. అందుకనే ఈ టీచర్లకు గుణపాఠం నేర్పాలి. ప్రభుత్వం దగ్గర నుంచి కనీసంగా మనం ఆశించగలిగింది ఇదే! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రపంచం మెచ్చిన ఐదుగురు హిందూ రాజులు
ప్రపంచం భారతదేశాన్ని వీరుల భూమి అని గుర్తించింది. ఇక్కడి చరిత్ర మహా వీరోచితులైన రాజులతో పునీతమైంది. చంద్ర గుప్త మౌర్య, అశోక ది గ్రేట్, పృథ్వీ రాజ్ చౌహాన్.. ఇలా వీరంతా భరతమాత ఖ్యాతిని ప్రపంచమంతటా చాటారు. వీరంతా వారి హయాంలో ఎన్నో వీరోచిత పోరాటాలు సాగించారు. అవి చిరస్మరణీయంగా నిలిచాయి. ఈ రాజుల కీర్తి పతాక భారతదేశానికే పరిమితం కాలేదు. విదేశాలలోనూ వీరిపేరు మారుమోగింది. అలాంటి ఐదుగురు హిందూరాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పృథ్వీ రాజ్ చౌహాన్ పృథ్వీ రాజ్ చౌహాన్ భారతదేశంలోని ప్రముఖ చౌహాన్ రాజవంశానికి చెందిన హిందూ రాజు. పృథ్వీ రాజ్ చౌహాన్ అజ్మీర్, ఢిల్లీలను పాలించాడు. అతని హయాంలోనే భారతదేశంపై మొఘల్ పాలకుల దాడి జరిగింది. పృథ్వీ రాజ్ చౌహాన్ ఎంతో ధైర్యవంతుడని, అతను 13 సంవత్సరాల వయస్సులో యుద్ధంలో గుజరాత్ రాజు భీమ్దేవ్ను ఓడించాడని చెబుతారు. పృథ్వీ రాజ్ చౌహాన్కు 6 భాషలు తెలుసు. యుద్ధంలో మహమ్మద్ ఘోరీకి 17 సార్లు ఓటమి రుచి చూపించాడు. కానీ 1192 సంవత్సరంలో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో ఘోరీ.. కన్నౌజ్ రాజు జయచంద్రతో కలిసి పృథ్వీ రాజ్, అతని స్నేహితుడు చంద్బర్దాయిని బంధించి చంపాడు. అలగ్జాండర్లో పోటీపడిన పోరస్ భారతదేశంలోని గొప్ప హిందూ రాజుల పేర్లలో పోరస్ పేరు కూడా వినిపిస్తుంది. పోరస్ సింధు రాజు. అతను అలెగ్జాండర్తో ఎంత ధైర్యంగా యుద్ధం చేశాడు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ కూడా అతని ధైర్యం ముందు తలవంచాడు. కింగ్ పోరస్ సామ్రాజ్యం సింధు నది నుండి చీనాబ్ నది వరకు విస్తరించింది. పోరస్ ది గ్రేట్.. అలెగ్జాండర్ మధ్య హైడాస్పెస్ యుద్ధం (క్రీ.పూ. 326) జరిగింది. రాజు పోరస్ క్రీస్తుపూర్వం 321- 315 మధ్య మరణించాడని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నప్పటికీ, అతని మరణానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీపై ఎటువంటి ఆధారాలు లేవు. అశోక చక్రవర్తి అశోక చక్రవర్తి సాహసం గురించి తెలియనివారెవరూ ఉండరు. అశోకుడు మహా యోధుడు. అయితే భీకర కళింగ యుద్ధం అతనికి వినయ మార్గాన్ని కూడా చూపింది. ఈ యుద్ధం అనంతరం అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. శాంతి వైపు మళ్లాడు. కళింగ యుద్ధంలో సుమారు లక్ష మంది మరణించారని చెబుతారు. అశోక చక్రవర్తి సామ్రాజ్యం ఉత్తరాన హిందూకుష్ నుండి దక్షిణాన గోదావరి వరకు అంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు విస్తరించింది. మహారాణా ప్రతాప్ మహారాణా ప్రతాప్ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలిసిందే. మహారాణా ప్రతాప్ మేవార్ రాచరిక పాలన సాగిస్తున్న సమయంలో అక్బర్ ఢిల్లీని పరిపాలించేవాడు. అక్బర్ కొన్ని మార్గాల ద్వారా మేవార్ను పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నాల్లో ప్రతీసారి విఫలమవుతూ వచ్చాడు. మహారాణా ప్రతాప్ 72 కిలోల కవచాన్ని ధరించేవాడని, అతను వినియోగించే ఈటె 81 కిలోల బరువు కలిగినదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. వీర శివాజీ శివాజీ పరాక్రమానికి మారుపేరు. వీర శివాజీ పరాక్రమం ముందు మొఘలులు తలవంచారు. శివాజీ తండ్రి పేరు షాజీ భోంస్లే. తల్లి పేరు జీజాబాయి. శివాజీ తన సంరక్షకులు దాదాజీ కొండదేవ్, జీజాబాయి, సమర్థ గురు రాందాస్ పర్యవేక్షణలో పెరిగాడని చెబుతారు. శివాజీ సైన్యంలో ముస్లిం యోధులు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ తన యుద్ధాలలో గెరిల్లా యుద్ధ విధానాన్ని అవలంబించాడు. ఈ వ్యూహంతోనే శివాజీ అనేక యుద్ధాలలో విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫిలడెల్ఫియా ఫుట్పాత్లపై డ్రగ్స్ బానిసల వికృత చేష్టలు! -
నూహ్లో ప్రశాంతంగా పూజలు
నూహ్(హరియాణా): సర్వజాతీయ హిందూ మహాపంచాయత్ సంస్థ సోమవారం నూహ్లో తలపెట్టిన శోభాయాత్రను అధికారులు అడ్డుకున్నారు. జూలై 31న నూహ్లో మత కలహాలు చెలరేగిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం తాజాగా శోభాయాత్రకు అనుమతి నిరాకరించింది. మల్హర్, ఝిర్, శింగార్ శివాలయాల్లో పూజలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, అధికారులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దుల నుంచి నూహ్ వరకు అయిదు ప్రధాన చెక్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి బయలుదేరిన జగద్గురు పరమహంస ఆచార్య తదితరుల బృందాన్ని సోహ్నా వద్ద ఘమోర్జ్ టోల్ ప్లాజా వద్ద నిలిపివేశారు. అనంతరం అధికారులు నూహ్ జిల్లాలోకి అనుమతించిన 15 మంది సాధువులు, ఇతర హిందూ నేతలు సుమారు 100 మంది నల్హర్లోని శివాలయంలో జలాభిక పూజలు చేశారు. అక్కడ్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఫిరోజ్పూర్లోని ఝిర్కా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. శింగార్ ఆలయానికి కూడా వెళ్లారని అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, సోమవారం సోహ్నా నుంచి నూహ్ వరకు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలేవీ తెరుచుకోలేదు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. -
'చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి'
ఢిల్లీ:ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాని మహారాజ్ మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని కోరారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకముందే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటును శివ శక్తిగా నామకరణం చేయడంపై ప్రధాని మోదీకి చక్రపాని మహారాజ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్ను రాజధానిగా మార్చాలని కోరారు. 'చంద్రున్ని హిందూ సనాతన దేశంగా పార్లమెంట్లో ప్రకటించాలి. చంద్రయాన్ 3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా నిర్మించాలి. అప్పుడు జిహాదీ స్వభావం ఉన్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారు.' అని స్వామి చక్రపాని మహారాజ్ అన్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాంశాల్లో స్వామి చక్రపాని మహారాజ్ చిక్కుకున్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు. కాగా.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరడంతో చంద్రయాన్ 3 విజయం సాధించింది. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటుని ప్రధాని మోదీ శివ శక్తి పాయింట్గా పేరు పెట్టారు. ఇదీ చదవండి: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు -
కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్
జమ్మూ: భారత దేశంలోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించినవారే. అందుకు కశ్మీర్ లోయలోని కశ్మీర్ పండిట్లే ఉదాహరణ అని అన్నారు DPAP చైర్మన్ గులాం నబీ ఆజాద్. ఈ సందర్బంగా రాజకీయాలకు మతాన్ని అడ్డుపెట్టుకునే వారంతా బలహీనులేనని అన్నారు. ధోడా జిల్లాలో జరిగిన సమావేశంలో డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) అధినేత మాట్లాడుతూ.. ఇటీవల ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ భారత్ దేశంలో ముస్లింలంతా బయట నుంచి వచ్చిన వారేనంటారు.. ఇక్కడ ఎవ్వరూ బయట నుంచి వచ్చినవారు లేరు.ఇస్లాం మతం 1500 ఏళ్ల క్రితమే ఉంది. హిందూ మతం చాలా పురాతనమైంది. ఈ దేశంలో బయట నుండి వచ్చిన ముస్లింలు 10-20 శతం మాత్రమే ఉంటారు. వారిలో కొంతమంది ముఘల్ సైన్యంలో పనిచేశారు. మిగిలిన వారంతా హిందూ మతం నుండి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారే. దీనికి ఉదాహరణ కశ్మీర్లోనే చూడవచ్చు. 600 ఏళ్ల క్రితం కశ్మీర్లో ఉన్న ముస్లింలంతా ఎవరు? అందరూ కశ్మీరీ పండిట్లే. వారంతా ఇస్లాం మతాన్ని స్వీకరించినవారేనాని అన్నారు. హిందువుల ఆచారం ప్రకారం వారి మరణానంతరం దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అస్తికలను నీటిలో కలుపుతుంటారు. మేము ఆ నీటిని తాగుతాం. నీళ్లు తాగేటప్పుడు అందులో కలిపిన అస్తికల బూడిదను ఎవ్వరం చూడమని అన్నారు. అలాగే ముస్లింల మరణానంతరం వారి శరీరం భరతమాత ఒడిలో కలిసిపోతుంది. హిందువులైనా ముస్లింలైనా అందరం భూమిలో కలిసిపోవాల్సిందే. అందులో తేడా ఏమీ ఉండదని అన్నారు. హిందూ ముస్లిం పేర్లను బట్టి రాజకీయాలు చేయకూడదని.. మతాన్ని అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదు. అలాంటి వారు నా దృష్టిలో బలహీనులని అన్నారు. ఇది కూడా చదవండి: ఓటు ఎవరికి వెయ్యాలో చెప్పినందుకు ఉద్యోగం ఊడింది -
గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై.. పాకిస్తాన్ హిందూ పార్టీ పతనం వెనుక..
పాకిస్తాన్కు స్వాతంత్ర్యం లభించకముందు అక్కడ హిందువుల సంఖ్య భారీగానే ఉండేది. దీంతో అక్కడ వారికి తగిన ప్రాధాన్యత లభించేది. స్వాతంత్ర్యం అనంతరం పాక్ ప్రత్యేక దేశంగా అవతరించింది. అదేసమయంలో అక్కడ ఉంటున్న హిందువులు భారత్కు తరలివచ్చారు. కొద్దిమంది మాత్రం పాకిస్తాన్లోనే ఉండిపోయారు. వారిలో హిందూ రాజులు కూడా ఉన్నారు. వారిలో ఒకరే పాకిస్తాన్లోని అమర్కోటకు చెందిన హిందూ రాజు రాణా చంద్ర సింగ్. ఇతనే తొలిసారిగా 1990లో పాకిస్తాన్లో పాకిస్తాన్ హిందూ పార్టీని స్థాపించారు. నాడు పాకిస్తాన్లో అమర్ కోటగా పిలిచే ప్రాంతాన్ని నేడు ఉమర్కోటగా మార్చారు. రాణా చంద్ర సింగ్ అక్కడే రాజుగా ఉండేవారు. పాక్కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్కడి హిందువులకుపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న విషయాన్ని గమనించిన రాజపూత్ వంశస్థుడైన రాణా చంద్ర సింగ్ పాకిస్తాన్ హిందూ పార్టీని నెలకొల్పారు. అయితే పార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. పాకిస్తాన్లోని హిందువులు పార్టీకి తగినంత అండనివ్వలేదు. రాజకీయ విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్టీలోని కీలకపదవులను రాణా చంద్ర సింగ్ కుటుంబ సభ్యులు, పాక్లోని అగ్రవర్ణాల వారు ఆక్రమించారు. అప్పట్లో పాక్లోని హిందూ ఓటర్లలో అత్యధికులు కింది వర్గాలకు చెందినవారే ఉన్నారు. దీంతో వారు ఈ పార్టీతో అనుసంధానం కాలేకపోయారు. ఫలితంగా పార్టీ ఎంత గొప్పగా ప్రారంభమయ్యిందో అంత వేగంగానే పతనమయ్యింది. పాకిస్తాన్ హిందూ పార్టీకి చెందిన జెండా హిందూ చిహ్నాలతో కూడి ఉంటుంది. కాషాయవర్ణంలోని జెండాపై త్రిశూలం గుర్తు కనిపిస్తుంది. అలాగే ఓంకారం కూడా ఉంది. ప్రస్తుతం ఈ పార్టీ మనుగడలో లేదు. అయితే ఈ పార్టీని స్థాపించిన రాణా చంద్ర సింగ్ కుమారుడు రాణా హమీర్ సింగ్ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ఆయన సింధ్ ప్రాంతానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సింధ్లో ఆయన పలుకుబడి కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. ఇది కూడా చదవండి: మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి.. -
రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వుకుంటూ..
చంఢీగర్: హరియాణాలోని మేవాత్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాసిర్, జునైద్ హత్య కేసులో మోనూ మానేసర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే.. బివానీ జిల్లాలో బొలేరో వాహనంలో మోనూ మానేసర్ సంచరించాడనే ఈ అల్లర్లు మొదలైనట్లు తెలుస్తోంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు శోభా యాత్రలో పాల్గొనాలని మోనూ మానేసర్ కోరినట్లు తెలుస్తోంది. అనంతరం సోమవారం ఉదయం యాత్ర ప్రారంభమైన వెంటనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ ఈ ఘటనపై స్పందించారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు యాత్ర కోసం అనుమతులు పొందినట్లు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇతర వర్గాల ప్రజలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. మేవాత్ ప్రాంతంలో పోలీసులను మోహరించినట్లు స్పష్టం చేశారు. అల్లర్లను అదుపు చేయడానికి ఆగష్టు 2వరకు ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం.. -
పాక్లో ముగ్గురు హిందూ బాలికల కిడ్నాప్
కరాచీ: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో హిందూ వ్యాపారి ముగ్గురు కూతుళ్లను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చి ముగ్గురు యువకులు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. పాకిస్తాన్ దరేవార్ ఇతేహాత్ సంస్థ చీఫ్ శివ కచ్చి ఈ విషయం తెలిపారు. ధార్కి ప్రాంతానికి చెందిన హిందూ వ్యాపారి లీలా రామ్ ముగ్గురు కూతుళ్లు చాందిని, రోష్ని, పరమేశ్ కుమారిలను కొందరు అపహరించుకుపోయారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి అపహరించిన ముగ్గురు ముస్లింలు వారిని పెళ్లిళ్లు చేసుకున్నారని శివ కచ్చి చెప్పారు. -
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే..
మధ్యప్రదేశ్: రాజ్ గడ్ లో జరిగిన కిసాన్ కళ్యాణ మహాకుంభ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అవసరానికి హిందువుగా అవతారం ఎత్తి ఆమె మధ్యప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే ప్రియాంక గాంధీ వచ్చారంటూ వ్యాఖ్యానించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. జబల్పూర్లో రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె నర్మదా నది వద్ద ప్రార్ధనలు నిర్వహించి ఆ నదిని జీవనదిగానూ, జీవాధారంగానూ వర్ణించడం వెనుక అసలు కారణం వేరే ఉందన్నారు కేంద్ర మంత్రి. ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రైతుల సాధికారతతోనే దేశం శక్తివంతంగా తయారవుతుందని అన్నారు. కొందరు రైతుని "అన్నదాత" అంటే మరికొంతమంది వారిని "జీవనదాత" అంటూ ఉంటారు. కానీ నా దృష్టిలో రైతులంటే "భాగ్యవిధాతలు" అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని విమర్శించాడనికి ఆయన ఇదే సభను వేదికగా చేసుకున్నారు. అవసరాన్ని బట్టి హిందువు అవతారం ఎత్తి ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి కొందరు వస్తుంటారు. ఈ మధ్య వారు ఆంజనేయ స్వామి గదను కూడా పట్టుకుని తిరుగుతున్నారు. అలాంటి వారిని నమ్మకండి. నర్మదా నదిని జీవనదిగా ముందు గుర్తించింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజల్లో మంచి నమ్మకాన్ని సంపాదించుకున్నారు. ఆయన హయాంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ పెరిగింది, అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. ఇక్కడ మహిళలు ఆర్మీలో చేరుతున్నారు, సియాచిన్ నౌకాదళ యుద్ధనౌకల్లో కూడా మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజీపీ ప్రభుత్వాలు అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నాయని, ఇప్పుడు మీరొచ్చి ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాంగ్రెస్ పార్టీ నాయకురాలినుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మతమార్పిడులు చేస్తే జైలుకే.. ఇద్దరు అరెస్టు -
హిందూ యువకుని ‘ముస్లిం వ్యవహారం’.. తండ్రి ఫిర్యాదుతో..
దేశంలో హిందూ- ముస్లిం వివాదాలకు సంబంధించిన ఉదంతాలు తరచూ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదే కోవలో తాజాగా డెహ్రాడూన్లో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ పరిధిలోని డోయీవాలా ప్రాంతంలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక యువకుని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. తన 24 ఏళ్ల కుమారుడు ఇంటిలో ఉన్నట్టుండి నమాజ్ చేస్తున్నాడని, అలాగే అతని లాప్టాప్, మొబైల్ ఫోన్లలో ఆశ్చర్యకరమైన డేటా ఉందని తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వైభవ్ బిజ్లవాణ్(24) గత మూడేళ్లుగా డిప్రెషన్లో ఉన్నాడు. అతనికి ఇస్లాంపై విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. పోలీసుల విచారణలో అతని ల్యాప్ టాప్, మొబైల్ ఫోను నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వైభవ్ ముస్లిం మతానికి సంబంధించిన ఆచారవ్యవహారాలను నేర్చుకుంటున్నాడు. ప్రతీరోజూ వీటిని అనుసరిస్తున్నాడు. పోలీసుల దర్యాప్తులో.. వైభవ్ తన గది నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, గత మూడేళ్లుగా డిప్రెషన్తో బాధపడుతున్నాడని వెల్లడయ్యింది. పోలీసులు వైభవ్కు సైకలాజికల్ టెస్ట్ చేయిస్తున్నారు. డెహహ్రాడూన్ పోలీసు అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఆ యువకుడు నిత్యం గదిలోనే ఉంటున్నాడని, దీనిపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. తమ బృందం పరిశీలనలో ఆ యువకుడు డిప్రెషన్లో బాధపడుతున్నాడని తెలిసిందన్నారు. ఆన్లైన్లో ఇస్లాం ఆచారాల గురించి తెలుసుకుంటున్నాడని, ఉర్దూ నేర్చుకుంటున్నాడని తెలిపారు. ఆ యువకునికి సంబంధించిన మెడికల్ రిపోర్టు రాగానే తదుపరి చర్యలు చేపడతామన్నారు. చదవండి: జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర -
యూపీలో ‘ది కేరళ స్టోరీ’... సంచలన ఉదంతం వివరాలివే..
‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తలపించే ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒక హిందూ యువతిని హత్యచేశారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ యువతిని కిడ్నాప్ చేసి, రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తరువాత ఆమె చేత మతమార్పిడి చేయించాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయ్యింది. ఈ సమయంలోనే ఆమెను హత్య చేశాడని సమాచారం. ఈ ఉదంతంలో పోలీసులు నావేద్ అనే యువకునితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి, వారిని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలు సామాజిక సంస్థలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం లవ్ జిహాద్, హత్యలతో ముడిపడిన ఈ ఉదంతం లోదీపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నావేద్ అనే యువకుడు లఖీపూర్ జిల్లాలోని పలియా ప్రాంతానికి చెందిన సీమా గౌతమ్ అనే యువతి చేత మత మార్పిడి చేయించి, ఆమెను వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాహం తరువాత సీమా గౌతమ్ పేరును సిద్ధిఖీ అని మార్చాడని తెలుస్తోంది. ఒక ఆసుపత్రిలో పనిచేసే ఆమెతో పాటు ఒక గదిలో నావేద్ అద్దెకు ఉండటం ప్రారంభించాడు. ఆదివారం అర్థరాత్రి నవాద్ ఆమెను వైద్య పరీక్షల పేరుతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, మృతి చెందిందని ధృవీకరించారు. దీంతో నవాద్ ఆమె మృతదేహాన్ని వెంటనే అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని నావేద్తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ యువతి 6 నెలల గర్భవతి అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తమ కుమార్తె చేత బలవంతంగా మత మార్పిడి చేయించి, గర్భవతిని చేశాక, విషం ఇచ్చి చంపేశారని ఆరోపించారు. నిందుతునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పలు సామాజిక సంస్థలు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టాయి. నిందితునిపై వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో హిందూ సంస్థలు సంయుక్తంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తాయని హెచ్చరించారు. -
క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థల సేవలు అపారం
జైపూర్: దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థలే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. మిషనరీలతో పోలిస్తే హిందూ ఆధ్యాత్మిక గురువులు సమాజ సేవలో ఎన్నో రెట్లు ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అయితే, ఇది పోటీకి సంబంధించిన విషయం కాదని అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్ సమీపంలోని జామ్డోలీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన కేశవ్ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సేవ సంగమ్ సదస్సును మోహన్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ సేవ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన దేశంలో మేధావులు క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు. మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విద్యాసంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే హిందూ మత గురువులు, ఆచార్యులు, సన్యాసులు అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. సేవ అంటే సేవ మాత్రమేనని, ఇది పోటీ కాదని వివరించారు. నిస్వార్థంగా ప్రజలకు అందించే సేవలను కొలవలేమని వ్యాఖ్యానించారు. సేవ అనేది సహజ మానవత్వ వ్యక్తీకరణ అని మోహన్ భగవత్ తెలియజేశారు. మనమంతా సమాజంలో భాగమేనని, ఐక్యంగా లేకపోతే మనం పరిపూర్ణం కాదని తేల్చిచెప్పారు. సమాజంలో అసమానతలు ఎంతమాత్రం వాంఛనీయం కాదన్నారు. దురదృష్టవశాత్తూ అసమానతలు కొనసాగుతున్నాయని వివరించారు. సేవ అనేది ఆరోగ్యకరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. -
హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన యూఎస్ రాష్ట్రం
హిందూ ఫోబియాను, హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ యూఎస్లోని జార్జియా రాష్ట్రం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న తొలి అమెరికన్ రాష్ట్రంగా నిలించింది. ఆ తీర్మానంలో.. హిందూఫోబియాను ఖండిస్తూ.. దాదాపు 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న అతిపెద్ద పురాతన మతాలలో హిందూ మతం ఒకటి. పైగా పరస్పర గౌరవం, శాంతి విలువలతో విభిన్న సంప్రదాయాలు, విశ్వాస వ్యవస్థలను కలిగి ఉన్న మతం అని తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానాన్ని అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్డొనాల్డ్, టాడ్జోన్స్ ప్రవేశపెట్టారు. అంతేగాదు ఈ తీర్మానంలో వైద్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని గుర్తించింది. అలాగే యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, కళలు వంటివి అమెరికా సాంస్కృతికతను సుసంపన్నం చేశాయి. పైగా అమెరికన్ కమ్యూనిటీ వాటిని అడాప్ట్ చేసుకోవడమేగాక మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచాయని కూడా పేర్కొంది. అలాగే దేశంలోని అనేక ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదైన ఘటనలను వివరిస్తూ..హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్యారంగానికి చెందిన కొందరు హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని ఈ తీర్మానం పేర్కొంది. వాస్తవానికి ఈ నినాదం జార్జియా రాజధానిలో మార్చి 22న తొలిసారిగా హిందూ న్యాయవాద దినోత్సవాన్ని నిర్వహించే ఉత్తర అమెరికా హిందువలు కూటమి(కోహెచ్ఎన్ఏ) నుంచి వచ్చింది. దీనికి అమెరికాలోని రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు సంబంధించి సుమారు 25 మంది చట్టసభ సభ్యులు హాజరయ్యారు. అలాగే హిందూ కమ్యూనిటీలో చేరిన కొందరూ తమ ఆందోళనలు ఆర్థం చేసకుని, ఈ వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని రక్షించే మార్గాలను రూపొందించడానికి కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు కోహెచ్ఎన్ఏ పేర్కొంది. కాగా, ఈ కౌంటీ రిజల్యూషన్ను ఆమోదించే ప్రక్రియలో మాకు మార్గనిర్దేశం చేసిన రెప్ మెక్డొనాల్డ్, రెప్ జోన్స్ తోపాటు చట్టసభ సభ్యులతో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం అని కోహెచ్ఎన్ఏ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ అన్నారు. ఇప్పటి వరకు శాసనసభ్యులందరూ ఎజెండాలోని శాసనపరమైన అంశాల ప్రకారం చాలా గంటలు పని చేస్తున్నారని విన్నాం. కానీ ఈ రోజు వారంతా హిందూ సమాజానికి ఎంత విలువ ఇస్తున్నారో చూపించడానికి న్యాయవాద దినోత్సవంలో మాతో చేరడమే గాక దాన్ని నిజం చేసి చూపించారని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కోహెచ్ఎన్ఏ ప్రధాన కార్యదర్శి శోభా స్వామి మాట్లాడుతూ..హిందూ అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అసత్య ప్రచారం తోపాటుగా ఈ హిందూ ఫోబిక్ కథనాలు కూడా అమెరికా కమ్యూనిటిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఒకరకరంగా హిందువులపై విద్వేషాన్ని పెంచేలా చేయడమేగాక భారతీయ అమెరికన్ సంతతికిచెందిన ప్రజలపై వివక్ష చూపేందుకు కారణమవుతోంది. అందువల్ల అటువంటి మతోన్మాదాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక చట్టాలు, పర్యవేక్షణ అవసరమని చెబుతూ వారి సహాయన్ని కోరినట్లు శోభా వివరించారు. (చదవండి: భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు) -
హిందూ వృద్ధి రేటుకు దగ్గర్లో భారత్
న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడుల తగ్గుదల, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ‘‘హిందూ వృద్ధి రేటుకు ప్రమాదకర స్థాయిలో చాలా దగ్గరగా’’ ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. సీక్వెన్షియల్గా త్రైమాసికాలవారీ వృద్ధి నెమ్మదిస్తుండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1950ల నుంచి 1980ల దాకా అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా వ్యవహరిస్తారు. ఇది సగటున 4 శాతంగా ఉండేది. 1978లో భారతీయ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ ఉపయోగించిన ఈ పదం ఆ తర్వాత నుంచి అత్యంత నెమ్మదైన వృద్ధి రేటుకు పర్యాయపదంగా మారింది. జాతీయ గణాంకాల కార్యాలయం గత నెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13.2 శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, రెండో క్వార్టర్లో 6.3 శాతానికి, తర్వాత మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘గత జీడీపీ గణాంకాలను తిరిగి ఎగువముఖంగా సవరించే అవకాశం ఉందని ఆశావహులు ఆశిస్తుండవచ్చు. కానీ సీక్వెన్షియల్ మందగమనం ఆందోళనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడటం లేదు .. ఆర్బీఐ ఇప్పటికీ వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది .. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు వృద్ధికి అవసరమైన తోడ్పాటు ఎక్కణ్నుంచి లభిస్తుందన్నది తెలియడం లేదు’’ అని రాజన్ పేర్కొన్నారు. తన ఆందోళనకు బలమైన కారణాలే ఉన్నాయని ఆయన చెప్పారు. నాలుగో త్రైమాసికంలో వృద్ధి మరింత నెమ్మదించి 4.2 శాతానికే పరిమితం కావచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు దాదాపు మూడేళ్ల క్రితం నాటి కరోనా పూర్వపు 3.7 శాతం స్థాయికి దగ్గర్లో నమోదైందని పేర్కొన్నారు. ‘‘హిందూ వృద్ధి రేటుకు ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో, అత్యంత దగ్గరగా ఉంది!! మనం ఇంకా మెరుగ్గా వృద్ధి సాధించాలి’’ అని ఆయన చెప్పారు. ఆశావహంగా సర్వీసులు.. ప్రభుత్వం తన వంతుగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోందని రాజన్ చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీసుల రంగం ఆశావహంగా కనిపిస్తోందని రాజన్ చెప్పారు. చాలా మటుకు సంపన్న దేశాలు సేవల ఆధారితమైనవే ఉంటున్నాయని.. భారీ ఎకానమీగా ఎదగాలంటే తయారీపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సర్వీసులతో .. నిర్మాణ, రవాణా, టూరిజం, రిటైల్, ఆతిథ్యం తదితర రంగాల్లో ఒక మోస్తరు నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాలను భారీగా కల్పించేందుకు వీలవుతుందని రాజన్ తెలిపారు. అదానీ గ్రూప్–హిండెన్బర్గ్ రీసెర్చ్ వివాదంపై స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలపై నిఘాను తీవ్రంగా పెంచాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందని తాను భావించడం లేదన్నారు. తమ పని తాము చేసేలా నియంత్రణ సంస్థలను ప్రోత్సహిస్తూనే అటు వ్యాపార సంస్థలు .. ప్రభుత్వాల మధ్య లోపాయికారీ సంబంధాలను తగ్గించుకుంటే ఇలాంటివి తలెత్తడం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. -
వింత ఘటన: కుక్కలకు ఘనంగా వివాహ తంతు
ఒక జంట పెంపుడు కుక్కలకు ఘనంగా హిందూ సంప్రదాయపద్ధతిలో వివాహ తంతు జరపనున్నారు. ఈ వింత ఘటన గురుగ్రామ్లోని హర్యానాలో జరగనుంది. అచ్చం హిందూ సంప్రదాయరీతిలో నాలుగు రోజులు వివాహ వేడుకను జరిపేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఆ కుక్కలకు హల్దీ వేడుకను కూడా నిర్వహించారు. ఆడ కుక్క పేరు స్వీటీ కాగా మగ కుక్క పేరు షేరు. నవంబర్ 14న ఆ కుక్కలకు అట్టహాసంగా పెళ్లి చేయనున్నారు. సుమారు 100 మంది దాక ఈ వివాహ తంతుకు ఆహ్వనించినట్లు కుక్కల యజమాని చెబుతున్నారు. ఈ వివాహ వేడుక హర్యానాలోని పాలం విహార్ ఎక్స్టెన్షన్లో ఉన్న జిల్ సింగ్ కాలనీ స్థానికులను చాలా ఆశ్చర్యపర్చింది. కానీ ఈ వివాహ వేడుకకు పెద్ద ఎత్తున అతిధులు మాత్రం హాజరవునున్నారు. ఈ మేరకు కుక్కల యజమాని శ్వేత మాట్లాడుతూ...తమకు పిల్లలు లేకపోవడంతో స్వీటీని తమ బిడ్డగా చూసుకుంటున్నట్లు తెలిపారు. ఒక రోజు తన భర్త గుడికి వెళ్లి అక్కడ కుక్కలకు ఆహారం పెట్టి వచ్చేస్తుండగా స్వీటీ అనే వీధి కుక్క తన భర్త వెంట వచ్చిందని, అప్పటి నుంచి ఆ కుక్కని తమ బిడ్డగా పెంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయం పోలీసులకు తెలిస్తే మీ దంపతులను అరెస్టు చేస్తారంటూ పలువురు చెప్పారని కానీ అందుకు తాము భయపడమని తేల్చి చెప్పారు. ఈ మేరకు మగ కుక్క షేరు యజమాని మాట్లాడుతూ ...కుక్కల పెళ్లి తంతు అనేది కామెడీగా అనిపించనప్పటికీ వివాహ పనులు మాత్రం అత్యంత సీరియస్గా జరుగుతున్నాయని అన్నారు. ‘Sheru weds Sweety; Neighbourhood comes alive amid ‘furry’ wedding festivities in Gurugram Full Video: https://t.co/gBwuHmmgkj pic.twitter.com/NjODzrG6wg — Take One (@takeonedigital) November 14, 2022 (చదవండి: అరే! ఏం మనషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...) -
హిందూ ప్రధానిగా గర్విస్తున్నా
లండన్: బ్రిటన్ మొట్టమొదటి హిందూ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నానని భారత సంతతికి చెందిన రిషి సునాక్ అన్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో భావాల్ని పంచుకున్నారు. ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్లో భిన్నత్వానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.యూకేకి 42 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రిషి సునాక్ ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయడానికి ముందు గోమాతకి పూజ చేస్తారు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకుంటారు. ‘‘ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి పండుగకి దివ్వెలు వెలిగించాను. అలా చెయ్యగలగడం మన దేశం ఎంత అద్భుతమైనదో చాటి చెప్పింది. అదే సమయంలో అదో పెద్ద విషయం కాదన్న అంశాన్ని కూడా చెప్పింది.’ అని సునాక్ అన్నారు. ప్రధాని ఎన్నిక సమయంలో బోరిస్ జాన్సన్ ప్రధాని కావడానికి వీలుగా తాను పోటీ నుంచి తప్పుకుంటానని జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘‘పార్లమెంటులో నా సహచర ఎంపీల నుంచి నాకు గట్టి మద్దతు ఉంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న సమయంలో ప్రధానిగా నేనే సరైన వ్యక్తినని గట్టిగా నమ్మాను. రేసు నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు’’ అని సునాక్ స్పష్టం చేశారు. -
మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి
భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ఒక మంచి ఉదాహరణగా భాసిల్లుతోంది. అనేక మతాలూ, కులాలూ ఉన్నా... అందరం భారతీ యులమే అన్న భావనతో ప్రజలు సహజీవనం చేస్తు న్నారు. అటువంటి దేశంలో మతతత్త్వ వాదులు... మైనారిటీలపై విద్వేషాన్ని ప్రచారం చేస్తూ హిందూ త్వాన్ని రెచ్చగొడుతున్నారు. అదే సమయంలో వివిధ భాషలు మాట్లాడే జనాలపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రెండూ దేశ లౌకిక తత్త్వాన్ని దెబ్బతీసేవే. రాజ్యాంగ మౌలిక సూత్రాలను తుంగలో తొక్కేవే! హిందూ ముస్లింల ఐక్యత సుదీర్ఘమైనది. 1857 తిరుగుబాటులో హిందూ ముస్లింలు కలిసి పోరాడారు. దేశ ప్రజల్ని బ్రిటిష్వారి నుంచి వేరుచేసి చూపటానికి ఉత్తర భారతదేశ పత్రికలు ‘హిందుస్తానీలు’ అన్న పదం వాడాయని ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర తన రచనల్లో తెలిపారు. కానీ దానినే తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు ఈ దేశం హిందువులది మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశ సమగ్రత, లౌకిక వాదాలకు గొడ్డలిపెట్టు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలను ఆశించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహింసా సిద్ధాంత ఆయుధంతో దేశాన్ని ఒక్క తాటిపై నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ... గాడ్సే చేతిలో బలవ్వడానికి మతోన్మాదమే కారణం. ఆ తర్వాత బాబ్రీ మసీదు ధ్వంసం, గుజరాత్తో సహా దేశంలో అనేక ప్రాంతాల్లో విద్వేష పూరిత అల్లర్లు వంటివన్నిటికీ ఈ ఉన్మాదమే కారణమయింది. దీంతో మన లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర భావనే ప్రమాదంలో పడింది. దీనికితోడు ‘ఒకే దేశం, ఒకే భాష’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదేమి టని ప్రశ్నించిన రాష్ట్రాలపైనా, రాష్ట్ర పాలకులపైనా ఆధిపత్యం చెలాయించటమే గాకుండా... ఆ ప్రభు త్వాలను కూల్చివేసే చర్యలు మొదలుపెట్టారు. సమాజంలో కొన్ని వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మాట నిజం. నేటికీ కొన్ని వర్గాలు ఇంకా ప్రభుత్వ నిర్లక్ష్య నీడల్లోంచి బైటపడక దుర్భర స్థితిలో ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనారి టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కోట్లాది మంది సంచార జాతుల వాళ్లు స్థిరనివాసం లేక చెట్ల వెంట, పుట్టల వెంట, గుట్టల వెంట, జనావా సాలకు దూరంలో తమ జీవనాన్ని కొనసాగిస్తు న్నారు. వీరి ఈ స్థితి ఆధునిక భారతదేశానికి అవమానకరం. ఇటువంటి కోట్లాదిమంది అభివృద్ధి గురించి ప్రణాళికలు వేయవలసిన వారు మత తత్త్వంతో దేశాన్ని ఛిన్నాభిన్నం చేయచూడటం ఎంతవరకు సమంజసం? మతతత్త్వం ఎంత ప్రమాదకరమో మన ఇటీవలి చరిత్రే చెబుతోంది. జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్వారు అను సరించిన ‘విభజించి పాలించు’ విధానం మతాల వారీగా భారత సమాజాన్ని చీల్చింది. హిందూ మహాసభ, ముస్లింలీగ్ వంటి రాజకీయ సమూ హాలు ఈ క్రమంలో తలెత్తినవే. ఆ తర్వాత దేశంలో జరిగిన మత ఘర్షణలకు ఆయా మతతత్త్వ సమూ హాలు కారణమయ్యాయి. 1922–27 మధ్య కాలంలో 112 మత ఘర్షణలు జరిగాయని ‘సైమన్ కమిషన్’ తన నివేదికలో పేర్కొందంటే అప్పటి పరిస్థితి అర్థమవుతుంది. ఇక 1947 దేశ విభజన సమయంలో జరిగిన దారుణ మారణకాండ గురించి చెప్పనవసరమే లేదు. అప్పుడప్పుడూ మత సహనానికి ఇటువంటి దాడుల రూపంలో హాని జరిగినప్పటికీ దేశంలో జాతీయోద్యమ కాలంలోనే కాక... అంతకు ముందూ మతసామరస్యం వెల్లివిరిసిన మాట వాస్తవ దూరం కాదు. అప్పటి ఆ పునాదులే ఇప్ప టికీ ప్రజలను తప్పుదోవ పట్టకుండా కాపాడు తున్నాయి. భాష సంగతి కొస్తే... ‘ఒకే దేశం... ఒకే భాష’ అన్న నినాదంతో దేశ ‘విభిన్నత్వం’పై ఇవ్వాళ దాడి జరుగుతోంది. దేశంలోని అంతర్గత అస్తిత్వాలు, భిన్న సంస్కృతుల మేళవింపులు ఛిద్రం అవుతాయి. ఈ మట్టి పెట్టిన పట్టెడన్నం తిని బతుకుతున్న వాళ్లం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఇంత గొప్ప సంస్కృతి వర్ధిల్లే ఈ నేలపై ‘ఒక మతంగా మన మంతా ఏకం కాకపోతే మనకు మనుగడ లేదని’ చేసే వాదనలు విషతుల్య వాదనలుగా గుర్తించాలి. రామ్ రహీమ్ల దోస్తానా వర్ధిల్లాలి. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ఛైర్మన్,తెలంగాణ సాహిత్య అకాడమీ -
Rishi Sunak: హిందూ ఫోబియా.. అయిననూ ప్రధాని అయ్యాడు!
‘‘నేను ఇండియాకో, సౌదీకో ప్రధాని కాగలనా? మీరే చెప్పండి. అలా జరుగుతుందని ఊహకు కూడా అందడం లేదు. అస్సలు అవకాశమే లేదు కదా! బ్రిటన్లో 85 శాతం శ్వేతజాతీయులే. వాళ్లు తమ ప్రధానిగా తమలో ఒకరిని చూడాలనుకుంటారే తప్ప శ్వేతేతరుణ్ని కాదు. అంతెందుకు, నేనిప్పుడు ఇండియా వెళ్లి ప్రధాని పదవి చేపట్టగలనా? అక్కడి వాళ్లు నాకా అవకాశమిస్తారా?’’ –బ్రిటన్లో ప్రజాదరణ పొందిన ఓ రేడియో షోలో వ్యాఖ్యాత గొంతెత్తుకుని అరుస్తున్నాడు. రిషి ప్రధాని కావడంపై బ్రిటన్లోని సాధారణ పౌరుల్లో కూడా చాలామందిది ఇదే భావన. కానీ మర్యాద ముసుగులో బయటపడటం లేదంతే. బ్రిటన్లో స్థిరపడ్డ ఓ హిందూ మూలాలున్న వ్యక్తి 10–డౌనింగ్ స్ట్రీట్లో అడుగు పెట్టడం అక్కడివాళ్లకు అస్సలు రుచిస్తున్నట్టు లేదు. కొన్ని ప్రధాన పత్రికలు దీనిపై బాహాటంగానే పతాక శీర్షికల్లో అసంతృప్తి వెళ్లగక్కాయి. కానీ, ఎంపీలు ఎన్నుకున్నారు. రాజు ఓకే చెప్పేశాడు. బ్రిటన్లో ఓ హిందూ మూలాలున్న వ్యక్తి పాలన మొదలైపోయింది కూడా! పోటీ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న బోరిస్ జాన్సన్ గానీ, పెన్నీ మోర్డంట్ గానీ, లోలోపల తెగ ఇబ్బంది పడుతున్న సామాన్య పౌరులు గానీ ఇప్పుడిక చేసేదేమీ లేదు. రిషిని ఇప్పటికిప్పుడు పదవి నుంచి దించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కూడా కాదు. నిజానికి రిషి ప్రధాని కావడం బ్రిటన్ చరిత్రలో ఓ కీలక మలుపు. ప్రజాస్వామ్య విలువలకు మైలురాయి. అతనే దిక్కు! బ్రిటన్ను ఆర్థికంగా నిండా ముంచినంత పనిచేసిన తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ అసంబద్ధ నిర్ణయాలను సరిచేయడం రిషి ముందున్న సవాళ్లలో అతి ప్రధానమైనది. రాణి కన్నుమూసింది. కొత్త రాజు ఇంకా కుదురుకోవాల్సి ఉంది. పౌండు విలువ నానాటికీ పతనమవుతోంది. మొత్తమ్మీద బ్రిటన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆర్థిక మంత్రిగా సమర్థంగా పని చేసిన అనుభవమున్న రిషికి ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడం అంత కష్టం కాకపోవచ్చు. నిజానికి బ్రిటన్కు ఇప్పుడతనే దిక్కు. ట్రబుల్ షూటర్ కూడా! రానున్న రోజుల్లో బ్రిటన్ ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుందా, మరింత దిగజారుతుందా అన్నది కాలమే తేలుస్తుంది. ఏది ఏమైనా బ్రిటన్ను ఓ హిందువు ఏలుతుండటం సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘట్టం. అయితే ఇది జాతివివక్ష లేని బ్రిటన్కు తార్కాణం మాత్రం కాదు. ఇటీవల హిందూ ప్రార్థనా స్థలాలపై అక్కడి లీస్టర్షైర్ వంటి చోట్ల జరిగిన దాడులను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అందుకే, ‘రిషి హిందువు అయినప్పటికీ ప్రధాని అయ్యాడు తప్పితే హిందువు కావడం వల్ల మాత్రం కాద’న్న ఓ విశ్లేషకుని వ్యాఖ్య అక్షరసత్యం. హిందూ ఫోబియా అసలు విషయానికొస్తే, హిందువులపై జరిగిన దాడులను అక్కడి పత్రికలు ఎంత ఘోరంగా చిత్రించిందీ అందరికీ తెలుసు. ఒకరకంగా వారిలో హిందూ ఫోబియా (హిందువలంటే భయం) కన్పించింది. అక్కడి చాలామంది మేధావుల్లో, విశ్లేషకుల్లో కూడా హిందువులంటే అంత మంచి అభిప్రాయమేమీ లేదు. వారి వ్యాఖ్యల్లో ఈ విషయం పదేపదే గోచరిస్తుంది. రిషి అత్యున్నత స్థానాన్ని అధిష్టించడం ఈ పెడ ధోరణిని మారుస్తుందా అంటే, ఇప్పడే చెప్పలేం. అయినా వీటిని రిషి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ప్రస్తుతానికి ఆయన దృష్టంతా బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంపైనే ఉంటుంది. కొసమెరుపు: ఒకప్పుడు ఇదే 10–డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఏళ్ల తరబడి బ్రిటన్ను ప్రధానిగా ఏలిన విన్స్టన్ చర్చిల్ హిందువులపై, భారతీయులపై అప్పట్లో అసందర్భ, అసంబద్ధ వ్యాఖ్యలు చేసి కించపరిచాడు. ఇప్పుడు ఆ హిందువుల్లోనే ఒకరు అదే 10–డౌనింగ్ స్ట్రీట్లోకి సగర్వంగా అడుగు పెట్టాడు. అది కూడా ఆ దేశ ప్రధాని హోదాలో! – ఎస్.రాజమహేంద్రారెడ్డి చదవండి: ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..! -
Rishi Sunak: పక్కా హిందూ
‘‘నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. ఎంత ఎదిగినా తన మూలాలను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. రిషి బ్రిటన్లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పట్నుంచి భారత సంస్కృతి సంప్రదాయలను వంటపట్టించుకున్నారు. తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేస్తారు. గోమాంసం ముట్టరు. యూకే రాజకీయాల్లో హిందువునని చెప్పుకునే రిషి పైకి ఎదిగారు. అదే ఆయన ప్రత్యేకత. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీతపైన అపారమైన నమ్మకం. 2015లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు కూడా గీతపైనే ప్రమాణం చేశారు .ప్రధానిగా లిజ్ ట్రస్తో పోటీ పడే సమయంలో ప్రచారంలోనూ శ్రీకృష్ణ జయంతి రోజున గోపూజ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ఆయన ట్వీట్లు చేశారు.రిషి ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. సునాక్కు భారత్ పాస్పోర్టు కూడా ఉంది. బెంగుళూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబమైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న సునాక్ ఇంట్లో కూడా భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు. వారి ఇద్దరి ఆడపిల్లలు అనౌష్క, కృష్ణని కూడా భారతీయతనే నేర్పిస్తున్నారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. తన అత్తమామలు ఎప్పటికీ గర్వకారణమని చెప్పుకుంటారు. వారిని కలవడానికి తరచూ బెంగుళూరు వచ్చి వెళుతుంటారు. ప్రతీ ఏటా దీపావళిని ఘనంగా జరుపుకునే సునాక్ ప్రధానిగా దీపావళి రోజే ప్రమాణం చేయడం విశేషం. ఒక హిందువును ప్రధానిగా అంగీకరించడం ద్వారా బహుళ విశ్వాసాలు, వైవిధ్యాలను అంగీకరించగలిగే సహనం యూకే ప్రజలకు బాగా ఉందని అర్థమవుతోంది. కుటుంబ నేపథ్యం ఇదీ రిషి సునాక్ తాత రామదాస్ సునాక్ అవిభాజ్య భారత్లో పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రనవాలాకు చెందినవారు. 1935 సంవత్సరంలోనే రామదాస్ తూర్పు ఆఫ్రికాలోని నైరోబియాకి వలస వెళ్లిపోయారు. నాన్నమ్మ రాణి సునాక్ ఓ రెండేళ్లు ఢిల్లీలో ఉండి తర్వాత భర్త దగ్గరకి వెళ్లారు. రామదాస్ దంపతులకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ 1949లో కెన్యాలో జన్మించారు. 1960లో ఆఫ్రికాలో భారతీయులపై జరిగే దాడులకు భయపడి యశ్వీర్ యువకుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బ్రిటన్కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. పంజాబ్ నుంచి టాంజానియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఉషా బెర్రీని యశ్వీర్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే రిషి సునాక్. రిషి తాత ముత్తాతలు ఉంటే గుజ్రనవాలా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడంతో ఆ దేశం కూడా రిషి మా వాడే అని అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!
అక్టోబర్ అయిదవ తేదీన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మిషన్ జై భీం సంస్థల ఆధ్వర్యంలో పదివేల మందికి పైగా న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్లో బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించారు. అందులో ధమ్మ దీక్ష సంప్రదాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను పఠించారు. గత 66 ఏళ్లుగా ఎక్కడ బౌద్ధ ధమ్మ దీక్షా సమ్మేళనాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు దాన్ని బీజేపీ వివాదాస్పదం చేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకుంటోంది. 1950 అక్టోబర్ 14 విజయదశమి నాడు అంబేడ్కర్ నాయకత్వంలో ఐదున్నర లక్షల మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించినప్పుడు... అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను అనుసరిస్తామని అందరూ శపథం చేశారు. అందులో నైతిక సూత్రాలు, నైతిక జీవన విధానంతో పాటు దేవీ దేవతలను పూజించం అనే అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, బుద్ధుడు ప్రభోదించిన అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తామనే విషయం కూడా ఉంది. అక్టోబర్ 5న జరిగిన బౌద్ధ ధమ్మ దీక్షా స్వీకార ఉత్సవానికి ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ భారతీయ జనతాపార్టీ నాయకులు వివాదాస్పదం చేశారు. అక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచారనీ, దూషించారనీ, అందులో రాజేంద్ర గౌతమ్ భాగమయ్యారనీ ఆరోపించారు. రాజేంద్ర గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని, హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే రాజేంద్ర గౌతమ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని ఆప్కు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తున్నదని భావించిన రాజేంద్ర గౌతమ్ తనకు తానుగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఈ వివాదాన్ని సృష్టించి, ఆప్ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావించింది. అంతే కాకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్ను దోషిగా నిలబెట్టాలనీ చూశారు. పదవి, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనేవి రెండు విషయాలు నా ముందున్నప్పుడు అంబేడ్కర్ మహోన్నతా శయం మాత్రమే నాకు కనిపించింది. పదవిని వదులుకున్నాను. భవిష్యత్లో మరింత శక్తిమంతంగా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గౌతమ బుద్ధుని మార్గంలోనే నడవడానికి నిశ్చ యించుకున్నాను’ అన్నారు. అసలు బాబాసాహెబ్ అంబేడ్కర్ కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వీడి, సమత, కరుణ, ప్రేమతో నిండిన బౌద్ధాన్ని స్వీకరించడానికి, ఇప్పటికీ ఈ దేశంలోని దళితులు, ఇతర మానవతావాదులు బౌద్ధాన్ని స్వీకరించడానికీ ఎవరు కారకులు? ఏంటి కారణాలు? అనేది ఆలోచించాలి. అంబేడ్కర్ 1935, అక్టోబర్ 13వ తేదీన పదివేల మంది అణగారిన కులాల పేరుతో పిలవబడే అంటరాని కులాల ప్రజలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ... ‘దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ హిందువుగా మరణించను. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజంలోని ఆధిపత్యకులాలు పెడుతున్న బాధలు భరించడం ఇంకా అవసరం లేదు. అయితే ఒక మతాన్ని వీడి, మరో మతాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమానత్వ హోదా, భద్రత, గౌరవప్రదమైన జీవితం లభించగలిగే ధర్మంలోకి వెళ్ళాలి’ అన్నారు. అదే సందర్భంలో అప్పటికే ఐదేళ్లుగా సాగుతున్న నాసిక్లోని కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని అంబేడ్కర్ ప్రస్తావించారు. ఏ మతంలోని దేవాలయాలలోకి మనకు ప్రవేశం లేదో, ఆ మతంలో ఉండాల్సిన అవసరం ఉందా అని బహిరంగంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, 1922 మార్చి 20వ తేదీన మహద్లోని చౌదర్ చెరువు నీళ్ళను తాగడానికి సాగించిన సత్యాగ్రహం, ఆ సందర్భంగా మహర్లపై జరిగిన దాడి ఆయన మనస్సులో బలంగా నాటుకుపోయింది. మహద్ చెరువులోని నీళ్లు తాగ డానికి అందరికీ హక్కు ఉన్నదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆధిపత్య కులాలు ఆనాటి మహర్లను చాలా క్రూరంగా కొట్టి, గాయపరిచారు. ఈ ఘటనలు కూడా అంబే డ్కర్ను పెద్దగా బాధించలేదు. కానీ ఆయన 1919 నుంచి 1932 వరకు దాదాపు 13 ఏళ్లపాటూ పోరాడిన ఫలితంగా ప్రకటించిన ‘కమ్యూనల్ అవార్డు’ వల్ల సాధించిన ప్రత్యేక ఎన్నికల హక్కుని వదులు కోవలసి వచ్చినప్పుడు ఎంతో క్షోభ అనుభవించారు. 1932 ఆగస్టు 16వ తేదీన ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సె మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తే, పూనాలోని ఎరవాడ జైలులో ఉన్న మహాత్మాగాంధీ దానిని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ‘ఇది హిందువులను విభజించడమే’ అనే వాదనను గాంధీజీ ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రత్యేక ఎన్నికల విధానాన్ని అంగీకరించనని మొండికేశారు. దీనిని అంబేడ్కర్ తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు హిందూ సంస్థలు, సంఘాలు అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. గాంధీజీ ప్రాణానికి ఏమైనా జరిగితే, అణగారిన కులాల భద్రత ప్రమా దంలో పడగలదని భావించిన అంబేడ్కర్ 1932, సెప్టెంబర్ 24వ తేదీన ‘పూనా ఒడంబడిక’కు ఒప్పుకున్నారు. దానివల్ల దళితులు తమ ప్రతినిధులను తాము మాత్రమే ఎన్నుకునే హక్కును కోల్పోయారు. ఈ రోజు మనం చూస్తున్న రిజర్వుడు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన అంబేడ్కర్ను తీవ్రంగా కదిలించింది. ఆలోచింపజేసింది. ఫలితంగా కుల నిర్మూలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంటరానివారెవరు, శూద్రులెవరు వంటి అంశాలతో పాటూ ఇంకా హిందూ మతంపైన అనేక రకాలైన అధ్యయనాలూ, బౌద్ధంపైన పరిశోధనలూ చేశారు. 1956 అక్టోబర్ 14వ తేదీన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు చెప్పండి... బాబా సాహెబ్ అంబేడ్కర్ హిందూ మతం మీదగానీ, కుల వ్యవస్థ మీదగానీ పోరాటాన్ని తీవ్రంగా పదునెక్కించడానికి ఆనాటి హిందూ పెద్దలు, ప్రత్యేకించి గాంధీ లాంటి వాళ్ళు కారణం కాదా? ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే అంబేడ్కరిస్టుల పోకడలు అర్థం అవుతాయి. (క్లిక్: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) రకరకాల కారణాలతో గత 75 సంవత్సరాల్లో 30 వేల మంది దళితులను పొట్టనపెట్టుకున్నారు. 50,000 మందికి పైగా దళిత మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. ఇప్పటికైనా హిందూ మత పెద్దలు తమ మతాన్ని సంస్కరించుకోకపోతే దళితులకు, కుల అణచివేతకు గురవుతున్న ఇతర బలహీన వర్గాలకు అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞలు మాత్రమే మార్గం అవుతాయనడంలో సందేహం లేదు. (క్లిక్: రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
ఎందుకీ విద్వేషపు చిచ్చు ?
ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా కెనడాకు పేరుంది. గతేడాది ప్రపంచ శాంతి సూచిలో ఆరో ర్యాంకు దక్కింది. నేరాలు, ఘర్షణలూ తక్కువే. రాజకీయంగా సుస్థిరమైన ప్రభుత్వం. అలాంటి దేశంలో భారతీయులకు భద్రత ఎందుకు లేదు? వారిపై విద్వేష నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? కెనడాలో భారతీయులు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది...? కెనడాలో హిందూ, భారత్ వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయి. ఇటీవల అక్కడ హిందూ దేవాలయాలపై వరసగా జరుగుతున్న దాడులు ఆందోళన పెంచుతున్నాయి. టొరంటోలోని స్వామినారాయణ మందిరంపై కొన్నాళ్ల క్రితం కొందరు దుండగులు దాడులు చేస్తూ ఖలిస్తాన్ జిందాబాద్, హిందూస్తాన్ ముర్దాబాద్ అంటూ చేసిన నినాదాలతో భారతీయులు ఉలిక్కిపడ్డారు. జూలైలో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని రిచ్మండ్ హిల్లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వీటి వెనక ఖలీస్తాన్ ఉగ్రవాదుల హస్తముందని ఆధారాలున్నా కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం భారత్కు ఆగ్రహం తెప్పిస్తోంది. అధికార లిబరల్ పార్టీ ఎంపీ, ప్రవాస భారతీయుడు చంద్ర ఆర్య వీటిని పార్లమెంటులో లేవనెత్తారు. భారత్పై, హిందూ మతంపై విద్వేషం వెళ్లగక్కుతున్నారన్నారు. ఖలిస్తానీల అడ్డా? కెనడా కొన్నేళ్లుగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యతిరేక అజెండాతో పని చేస్తున్న వీరంతా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం కెనడాను వాడుకుంటున్నారు. భారత్ నిషేధించిన సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సెప్టెంబర్ 18న ఖలిస్తాన్ రిఫరెండాన్ని నిర్వహించింది. దీన్ని నిలిపేయాలని భారత్ కోరినా కెనడా పట్టించుకోలేదు. లౌకిక దేశమైన తాము ప్రజాభిప్రాయ సేకరణలను అడ్డుకోబోమని తేల్చి చెప్పింది. ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ వంటివి కెనడా గడ్డ నుంచి భారత్లో మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నాయి. 2018 నుంచి కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. బ్రాంప్టన్లో గౌరీశంకర్, జగన్నాథాలయం, మిసిసాపలో హిందూ హెరిటేజ్ సెంటర్పై దాడులు జరిగాయి. ఇదంతా కెనడాలో ఉంటూ భారత్ను అస్థిరపరిచే కుట్రేనని గతేడాది అక్కడ పర్యటించిన జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. కెనడాలో భారతీయం కెనడాలో మొదట్నుంచి భారతీయుల ప్రాబల్యం ఎక్కువే. ప్రస్తుతం అక్కడ 16 లక్షల మంది (4 శాతం) భారతీయులున్నారు. వీరిలో లక్ష మందికి పైగా శాశ్వత పౌరసత్వముంది. ఎక్కువగా పంజాబీలే కెనడా వెళుతుంటారు. ఆ దేశంలో అత్యధికంగా మాట్లాడే 10 భాషల్లో పంజాబీ కూడా ఉంది. చట్టసభల్లోనూ భారతీయులు సత్తా చాటారు. 2015లో 21 మంది భారత సంతతికి వారు ఎంపీలయ్యారు. 2019లో 23కు పెరిగారు. కెనడా రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే! జర భద్రం: కేంద్రం ‘‘కెనడాలో జాతి విద్వేష నేరాలు, వర్గ హింస, భారత్ వ్యతిరేక కార్యక్రమాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడి భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే ఒట్టావాలోని భారతీయ హైకమిషన్, టొరంటోలో దౌత్య కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. ఇటీవలి నేరాలపై సమగ్ర విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిజాం పాలనలో జీవిస్తునే దేశ స్వాతంత్ర్యంకోసం పోరాటం
-
TS: బీజేపీ క్లియర్కట్ మెసేజ్.. పట్టు దొరికిందా?
తెలంగాణాలో హిందుత్వ కార్డు ద్వారా విస్తరించాలనేది బీజేపీ గేమ్ప్లాన్. హిందుత్వ విషయంలో దూకుడుగా ఉండే బండి సంజయ్కు పార్టీ బాధ్యతలు ఇవ్వడం ద్వారా బీజేపీ ఇప్పటికే క్లియర్కట్ మెసేజ్ ఇచ్చేసింది. హైదరాబాద్పేరును భాగ్యనగర్గా మారుస్తామంటూ ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. చార్మినార్-భాగ్యలక్ష్మి అమ్మవారి మందిరం అంశాన్ని కూడా రాబోయే ఎన్నికల్లో చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీని ముందు నుంచీ బీజేపీ టార్గెట్ చేస్తోంది. రజాకార్ల పార్టీతో కేసీఆర్ సంబంధాలంటూ కేసీఆర్ను యాంటీ హిందూగా బీజేపీ ప్రచారం చేస్తోంది. చదవండి: కాంగ్రెస్లో ఏం జరుగుతోంది.. రేవంత్కు ఊహించని ఫోన్ కాల్! ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సైతం కేసీఆర్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని పదే పదే విమర్శిస్తున్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి యాంటీ ఎంఐఎం సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడంలో ఇప్పటికే బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. తమకంటూ బలమైన హిందుత్వ ఓటు బ్యాంక్ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు... ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కలుపుకోవాలనే ద్విముఖ వ్యూహంతో బీజేపీ ముందుకు పోతోంది. హైదరాబాద్లో నివసించే నార్త్ ఇండియన్స్ బీజేపీకి అండగా నిలబడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వీరి ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. వీరితో పాటు తెలంగాణాలో బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల్లో బీజేపీకి మంచిపట్టుంది. ఇక రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. బండి సంజయ్ లాంటి బీసికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా తమది బీసీల పార్టీ అని బీజేపీ మేసేజ్ ఇచ్చింది. ఇప్పటికే ఓబీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానిగా ఉండటంతో.. సహజంగానే ఆ పార్టీకి తెలంగాణా బీసీల్లో పట్టుదొరికే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణా రాజకీయ చరిత్ర చూస్తే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలందరూ ఏకపక్షంగా ఒకే పార్టీకి ఓటువేసిన ఉదాహరణలు చాలా తక్కువ. స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్ధులను బట్టి బీసీ కులాల ఓటింగ్ మారుతూ ఉంటుంది. దీనికోసం బీజేపీ వివిధ సామాజిక వర్గాలకు చెందిన బలమైన బీసీ నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర తెలంగాణాలో బలమైన బీసీ సామాజికవర్గం అయిన మున్నూరు కాపులకు కమలం పార్టీలో కీలక పదవులున్నాయి. అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లాంటి మున్నూరు కాపునేతలకు పార్టీలో మంచి గౌరవం దక్కింది. ఇక ఈటలను చేర్చుకోవడం ద్వారా ముదిరాజ్ ఓటుబ్యాంకు తమవైపే ఉందని బీజేపీ అంటోంది. -
ఏమతమైన అందరం ఒక్కటే!... అంటే ఇదేనేమో! వీడియో వైరల్
ఇంతవరకు మనం ఎన్నో వీడియోలను చూశాం. కానీ ఈ వీడియో మనకోక గొప్ప సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మనమంతా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. కొన్నిసారు పెద్ద పెద్ద నేతలు మనమందరం సమానం అంటూ పెద్దపెద్ద మాటాలు మాట్లాడుతుంటారు. కానీ అవన్నీ నోటి మాటల వరకే పరిమితం. వాస్తవిక రూపంలో చాలా వేరుగా ప్రవర్తింస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వీడియో వాస్తవికంగా కూడా చాలా బాగుంటుందని చెప్పేలా ఉంది. ఇంతకీ ఆ వీడియయోలో ఏముందంటే....ముస్లీంలకు హజ్ యాత్ర అనేది అత్యంత పవిత్రమైనది. ప్రతి ముస్లీం జీవితంలో ఒక్కసారైన హజ్యాత్ర చేయాలనుకుంటాడు. ఐతే ఈ మేరకు సౌదీ అరేబియాలోని మక్కా(హజ్) యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముస్లీం సోదరులకు కాశ్మీరీ హిందువులు ఘనంగా స్వాగంత పలికారు. ఈ మేరకు కాశ్మీరీ పండిట్లు విమానాశ్రయం వెలుపలు ఉండి...స్వాగతం పలుకుతూ... ప్రవక్త మహ్మద్ను ప్రశంసిస్తూ కవిత్వం చెప్పారు. వారు తీర్థయాత్రను విజయవంతం చేసుకుని తిరిగి వచ్చినందుకు గూలాబీ పూలు ఇస్తూ అభినందనలు చెప్పారు. అంతేకాదు వారికి హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇస్తూ.. ఆహ్వానం పలికారు కూడా. ఈ వీడియోని ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అబ్బాస్ బిన్ ముఖ్తార్ అన్సారీ పోస్ట్ చేస్తూ...మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ సోదరుల ప్రేమ పై రాజీకీయాల చెడు దృష్టి పడుకుడదని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. అన్సారీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నేతగా ఉత్తరప్రదేశ్లోని మౌ సదర్ నియోజకవర్గానిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. हज करके लौटे हाजी लोग श्रीनगर एयरपोर्ट से निकले तो कश्मीरी पंडित भाईयों ने नात पढ़ते हुए आरती उतार कर उनका स्वागत किया और मुबारकबाद दी। इस मुहब्बत को राजनीति की नज़र ना लगे। pic.twitter.com/Oo338QsrlV — Abbas Bin Mukhtar Ansari (@AbbasAnsari_) July 16, 2022 (చదవండి: ఆ చిన్నారి చేసిన పని చూస్తే... నోట మాట రాదు!వీడియో వైరల్) -
మానవత్వమే మనిషికి ముఖ్యం!
వైరల్: మత సామరస్యం.. మతోన్మాదులకు మింగుడు పడని విషయం. కష్టకాలంలో మనిషి.. మతానికి ఓటేస్తాడా? మానవత్వానికి ఓటేస్తాడా? మనిషంటే ఒక నమ్మకం.. ఆత్మీయత, అంతకు మించి అభిమానం. మానవత్వం ఎంతో గొప్పది. ఎందుకనో టీవీల్లో కూడా సరైన విషయాలను చూపించరు. ఒక పిల్లవాడు గాయపడితే.. ముందు అతన్ని పైకి లేపుతాం. గాయానికి మందు వేసి అతన్ని ఓదారుస్తాం. అంతేగానీ.. ఏ మతం బాబూ నీది అని అడగం. అసహ్యించుకోం. హిందువులు మా ఇంట కార్యక్రమాలకు హాజరవుతారు. అదే విధంగా మేం వాళ్ల కార్యక్రమాలకు హాజరవుతాం... దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై మొహమ్మద్ రిజ్వాన్ ఖాన్ చెప్తున్న మాటలివి. రిజ్వాన్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాడు. తన దుకాణంలో పని చేసే రామ్దేవ్ షా అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాడు రిజ్వాన్. బీహార్ రాజధాని పాట్నాలో రిజ్వాన్కు ఓ కుట్లు అల్లికల ఉత్పత్తుల షోరూం ఉంది. తన దగ్గర పాతికేళ్ల పాటు నమ్మకంగా పని చేసిన రామ్ దేవ్ షా ఈ మధ్యే వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలిసిన రిజ్వాన్.. ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. ఆ పెద్దాయన పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. రిజ్వాన్తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అంతిమ యాత్ర సమయంలో వెంటే ఉన్నారు. ‘‘పాతికేళ్ల కిందట ఓ పెద్దాయన రిజ్వాన్ దుకాణానికి వచ్చి పని ఏమైనా ఉందా? అని అడిగాడు. మోటు పని చేయలేవులే అన్నాను. లెక్కలు రాసే పని అయినా ఇమ్మని బతిమాలాడు. ఆయనెంతో సాదాసీదాగా కనిపించాడు. అందుకే పని ఇచ్చా. ఇరవై ఏళ్లకు పైగా ఆయన నా దగ్గరే పని చేశారు. వయసు రిత్యా ఇబ్బందులతో బాధపడుతుంటే.. నెల నెల కొంత డబ్బు పంపించా. షా నాకు తండ్రి లాంటి వారు. నాకు ఒక పెద్ద దిక్కు. ఆయన కుటుంబం.. మా కుటుంబంతో సమానం. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నాకు చేతనైన రీతిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అంటూ గద్గద స్వరంతో మాట్లాడాడు రిజ్వాన్. ఎన్డీటీవీ సౌజన్యంతో.. -
హిందూ దేవుళ్ల విషయంలో అది సాధ్యం కాదా?: ట్విటర్కు చురకలు
సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లపై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్ సైట్కు చురకలు అంటించింది. 'AtheistRepublic' అనే ట్విటర్ పేజీలో కాళి మాతకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు కనిపించాయి. దీంతో ట్విటర్ ఆ అకౌంట్ను బ్లాక్ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన డొనాల్డ్ ట్రంప్ విషయంలో ట్విటర్ అనుసరించిన తీరును ఈ సందర్భంగా ట్విటర్కు గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు. ఇలా హిందూ దేవుళ్లపై అభ్యంతరకర పోస్టులు చేసేవాళ్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయడం లేదంటూ, చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. అలాగే ఇతర ప్రాంతాల, జాతుల ప్రజల సున్నితత్వాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్లాట్ఫారమ్లో కొంతమంది వ్యక్తులను బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ.. అసలు ఖాతాల బ్లాక్ను ఎలా చేపడతారో వివరించాల’ని ట్విట్టర్ను ఆదేశించింది. అందరి అకౌంట్లు అలా బ్లాక్ చేయలేమని ట్విటర్ వివరణ ఇవ్వగా.. మరి ట్రంప్ అకౌంట్ ఎలా చేశారని నిలదీసింది. కంటెంట్ సున్నితమైందని, వ్యక్తులు సున్నితమైన వాళ్లని భావించినప్పుడు వాళ్లను బ్లాక్ చేశారు కదా. అలాంటప్పుడు ఇక్కడ కూడా సున్నితమైన అంశాలపై పట్టించుకోరా? ఈ తీరు సరైందేనా? అని నిలదీసింది. అభ్యంతకర కంటెంట్ విషయంలో కేసు, ఎఫ్ఆర్లు నమోదు అవుతున్నాయని ట్విటర్ తరపున సీనియర్ అడ్వొకేట్ సిదార్థ్ లుథ్రా వెల్లడించారు. ఈ నేపథ్యంలో... ఐటీ యాక్ట్ ప్రకారం.. ప్రస్తుత సందర్భంలో(కేసు విషయంలో) అకౌంట్ బ్లాక్ చేయడం సబబేనా పరిశీలించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై తర్వాతి వాదనలను సెప్టెంబర్ 6వ తేదీన విననుంది ఢిల్లీ హైకోర్టు. -
మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు. -
దేశంలో ఇక్కట్లకు హిందుత్వే కారణం
అమేథి: దేశంలో ధరల పెరుగుదల, బాధలు, విచారాలన్నింటికీ హిందుత్వే ప్రత్యక్ష కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2019లో ఓటమి అనంతరం శనివారం ఆయన రెండో మారు అమేథిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్లో హిందుత్వవాదుల వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని దుయ్యబట్టారు. ‘హిందువులు, హిందుత్వవాదులకు మధ్య పోరు నడుస్తోంది. హిందువులు సత్యాగ్రహంపై నమ్మకం ఉంచగా, హిందుత్వవాదులు సత్తాగ్రహ్(రాజకీయ దురాశ)ను నమ్ముతున్నారు’ అని అన్నారు. పార్టీ నేత ప్రియాంక గాంధీతో కలిసి అమేథిలో ఆయన ఆరు కి.మీ.ల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగితపై మోదీ మాట్లాడరని, గంగలో మునకలు మాత్రం వేస్తారని ఎద్దేవా చేశారు. ‘హిందువులు కోట్లాదిమంది తోటివారితో కలిసి గంగలో స్నానాలు చేస్తుంటే, హిందుత్వ మాత్రం ఒంటరిగా గంగలో మునుగుతోంది’ అన్నారు. కనీసం తోటి నాయకులకు తనతో కలిసి గంగాస్నానం ఆచరించే అవకాశాన్ని మోదీ ఇవ్వలేదన్నారు. కీలక అంశాల పైనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం మార్కెటింగ్ వ్యూహాలు అవలంబిస్తోందని విమర్శించారు. గాంధీ హిందూ కాగా, గాడ్సే హిందుత్వ వాది అని విమర్శించారు. మోదీకి వ్యాపారవర్గాలపై ప్రేమ అని, నోట్ల రద్దు, సాగు చట్టాలు, జీఎస్టీ వంటివన్నీ వారి ప్రయోజనాల కోసమే తెచ్చారని దుయ్యబట్టారు. 2004 నుంచి అమేథిలో గెలుస్తూ వస్తున్న రాహుల్ను 2019లో స్మృతీ ఇరానీ ఓడించారు. నాటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన రాహుల్ కేరళలోని వయనాడ్లో గెలుపొందారు. -
Boycott Myntra.. ఎందుకో తెలుసా?
Boycott Myntra trending on Twitter: మనోభావాలు.. దెబ్బతినడానికి ప్రత్యేకించి కారణాలు అక్కర్లేని రోజులివి. అలాంటిది చిన్న కారణం దొరికినా.. వివాదాన్ని రేపి, రచ్చ చేసి గోల చేస్తున్నారు చాలామంది. ఈ తరుణంలో దుస్తుల ఈ-కామర్స్ సంస్థ మింత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. బాయ్కాట్ మింత్రా పేరుతో సోషల్ మీడియాలో కుప్పలుగా పోస్ట్లు కనిపిస్తున్నాయి. దానికి కారణం.. ఓ పాత ఫేక్ పోస్ట్. లోగో మార్పుతో వివాదంలో నిలిచిన మింత్రా.. ఇప్పుడు మరో విమర్శను ఎదుర్కొంటోంది. మహాభారత దుశ్వాసన పర్వంలో కృష్ణుడు, ద్రౌపదికి వలువలు అందించే ఘట్టాన్ని తమ ప్రమోషన్కు వాడుకుందనేది మింత్రాపై వినిపిస్తున్న ఆరోపణ. ఈ కారణంతోనే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మింత్రా వ్యవహరించిందని.. కాబట్టి తక్షణమే దానిని అన్-ఇన్స్టాల్ చేయాలని విమర్శలు వినిపిస్తున్నాయి. Shame On Myntra . Retweet And #BoycottMyntrahttps://t.co/kPROnzxLwh — Sadhvi Prachi (@Sadhvi_prachi) August 23, 2021 This is not an ad, it is a direct insult to Hinduism & Hindu’s everywhere. It’s time to send a message loud & clear: Anti-Hindu propaganda will no longer be met with passivity. It will be met with action. #BoycottMyntra pic.twitter.com/EThpeT0xrL — Kavita (@Sassy_Hindu) August 22, 2021 Guy's this has not been done by @myntra it is a post shared on 2016 which has popped now . I'm not supporting myntra but what wrong is wrong . An I'm not an anti-Hindu . I love my religion but we should not blindly tweet without knowing thefact do fact check once #BoycottMyntra pic.twitter.com/MIH2NDt5v4 — B Sanki (@sanjubhujlthapa) August 23, 2021 Abe yaar bc pagal hain kya log? #BoycottMyntra but why? 5 saal pehle ka incident hai ye and myntra has said they didn’t create this artwork neither did they endorse it. Bhai ek baar double check to kar liya karo!🤦🏻♂️ pic.twitter.com/Hl5osQcNT0 — Sanjay Beniwal (@noSanjayBeniwal) August 23, 2021 ఈ మేరకు ఉదయం నుంచి విపరీతమైన పోస్టులు ట్విటర్లో కనిపిస్తుండడంతో.. ట్రెండింగ్లోని వచ్చింది. అయితే ఈ పోస్ట్ కొత్తది కాదు. మింత్రా డిజైన్ చేసింది అంతకన్నా కాదు. 2016లోనే ఈ ఫేక్ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ టైంలోనే స్పందించిన మింత్రా.. అలాంటి ఆర్ట్ వర్క్ను తాము సృష్టించలేదని, ఎండోర్స్ కూడా చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ హిందుత్వఅవుట్లౌడ్( @hindutvaoutloud) అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి ఈ పోస్ట్ అప్లోడ్ అయ్యింది. కొందరు మింత్రాకు మద్దతుగా ఈ ఫేక్ ఓల్డ్ పోస్ట్పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Outloud (@hindutvaoutloud) -
పైశాచిక వివాహం అంటే ఏంటో తెలుసా?
బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని వివాహాన్ని ఎనిమిది విధాలుగా శాస్త్రాలు సూచిస్తున్నాయని గతవారంలోనే చెప్పుకున్నాం కదా... ఇప్పుడు ఆయా వివాహాల గురించి క్లుప్తంగా... ► బ్రాహ్మం: బ్రాహ్మమనగా ధర్మబద్ధమైనది. ఈ పద్ధతి, ఎనిమిది రకాల వివాహాలలో శ్రేష్ఠమైనదని శాస్త్రకారుల నిర్ణయం. ఈ పద్ధతిలో, వధువు తండ్రి, యోగ్యుడు, గుణవంతుడు మరియు విద్యావంతుడైన వరుణ్ణి వెతికి, అతడినుండి ఎటువంటి కన్యాశుల్కం తీసుకోకుండా, తన కూతుర్నిచ్చి అనగా ‘కన్యాదానం‘ చేసి వేదమంత్రాలతో విధిపూర్వకంగా, దేవతలసాక్షిగా, బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిపిస్తాడు. ► దైవం: ఈ పద్ధతిలో, తనకు యాగం నిర్వహించిన ఋత్విక్కుకు, వధువు తండ్రి, యాగ దక్షిణలో భాగంగా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. దీనిని కొందరు స్మతికారులు విమర్శించారు, మరికొందరు సమర్థించారు. ఈ విధానంలో వర్ణంతో నిమిత్తంలేకుండా వివాహాలు జరిగేవి. అంటే ఋత్విక్కులు యాగదక్షిణగా రాజులనుండి కూడా కన్యలను గ్రహించేవారు. ఈ విధానంలో జరిగే వివాహంలో పెండ్లికుమార్తెను ‘వధువు‘ అనేవారు. ప్రస్తుతం ఈ పద్ధతి పాటించుటలేదు. ► ఆర్షం: ఈ విధానంలో, కన్య తండ్రి, వరుడినుండి యజ‘ నిమిత్తమై రెండు గోవులను తీసుకుని తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఈ గోవులను కట్నంగా భావించరాదు. ఇది కేవలం యాగధర్మంకోసమే. కానీ దీనినికూడా కొందరు స్మతికర్తలు విమర్శించారు. యాగార్థం తీసుకున్నా అది కట్నమే అని దీనిని తిరస్కరించారు. ► ప్రాజాపత్యం: ఈ పద్ధతిలో, కన్య తండ్రి గుణవంతుడైన ఒక వరుణ్ణి నిర్ణయించి, తన కుమార్తెను వివాహమాడవలసిందిగా అతణ్ణి ప్రార్థించి, అంగీకరించిన తర్వాత, తన కుమార్తెనిచ్చి వివాహంచేస్తాడు. ఈ వివాహం ఏకపత్నీవ్రతులకు మాత్రమే విహితం. ఎందుకంటే, ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే, మరో స్త్రీని వివాహం చేసుకోకూడదు. గృహస్థుగానే జీవించాలి. ► ఆసురం: ఈ పద్ధతిలో, తాను ఇష్టపడిన కన్యని వివాహమాడడానికిగాను, ఆ కన్య తండ్రికి కొంత ధనమిచ్చి ఆ తర్వాత ఆమెను వివాహమాడతాడు. ఇది అధమమైనదని దీనిని శాస్త్రకారులు తిరస్కరించారు. అలా ధనమిచ్చి కొనుక్కున్న కన్య దాసియే అవుతుందికానీ ధర్మపత్ని కాజాలదు. కనుక ధర్మకార్యాలలో తనకు ప్రవేశం నిషిద్ధం. ► గాంధర్వం: స్త్రీపురుషులిద్దరూ ప్రేమించుకున్నప్పుడు, లేదా మోహవశులై ఒకరిని విడిచి ఒకరు వుండలేని పరిస్థితులలో, ఎవ్వరి అనుమతులూ తీసుకోకుండా స్వతంత్రించి చేసుకునే వివాహమే గాంధర్వం. ► రాక్షసం: కన్యను బలవంతంగా అంటే, ఆ కన్యకు ఆ వరునిపై ఇష్టంలేకపొయినా, అవసరమైతే ఆ కన్య తండ్రినికానీ, బంధువులనుకానీ చంపి అయినాసరే వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు. ► పైశాచం: కన్యను మోసగించి, లేక నిద్రించుచుండాగా, లేక స్పహలో లేకుండగా, తీసుకెళ్ళి లేక బలవంతంగా తీసుకెళ్ళి వివాహమాడడాన్ని పైశాచం అంటారు. ఇది భరతఖండంలో పశ్చిమోత్తరప్రాంతంలో (అనగా ప్రస్తుత పాకిస్తాన్) కొందరు పిశాచజాతులు వుండేవని, వారిలో ఈ ఆచారం వుండేదని అందుకే దీనికి పైశాచమని పేరువచ్చిందని చరిత్రకారుల నిర్ణయం. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
ఫాతిమాగా తప్పిపోయి.. స్వప్నగా తిరిగొచ్చింది
సాక్షి, హైదరాబాద్: గత పదిహేనేళ్లుగా సాకినా తప్పిపోయిన తన బిడ్డ ఫాతిమాను తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. రెండున్నరేళ్ల వయసులో తప్పిపోయిన తన కుమార్తె.. ప్రస్తుతం ఎక్కడుందో.. ఎలా ఉందో.. అసలు బతికి ఉందో లేదో అనే ఆలోచన ఆ తల్లి గుండెని పిండేసేది. ఎక్కడో ఒక చోట తన బిడ్డ క్షేమంగా ఉండాలని అల్లాను ప్రార్థించేది. ఆమె మొర ఆలకించిన దేవుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత వారి గుండెకోతను దూరం చేశాడు. చివరకు కుమార్తెని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు. దాదాపు 16 ఏళ్ల క్రితం కర్నూలుకు చెందిన ఫాతిమా తన కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వచ్చింది. మక్కా మసీదు సందర్శనలో ఉండగా.. తప్పిపోయింది. అప్పటి నుంచి వెతుకుతుండగా..16 ఏళ్ల తర్వాత హైదరాబాద్లోని ఓ చిల్డ్రన్ హోంలో తనను గుర్తించారు. ప్రస్తుతం ఆమెని కుటుంబం వద్దకు చేర్చారు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఫాతిమా.. ఆ తర్వాత 15 ఏళ్లు హోంలో స్వప్న పేరుతో హిందువుగా పెరిగింది. ఆమె ప్రస్తుతం తన కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతుంది. ఈ సందర్భంగా ఫాతిమా అలియాస్ స్వప్న సోదరుడు అబిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఓ ఉద్వేగభరిత సన్నివేశం. మేం ఫాతిమాను మా ఇంటికి తీసుకెళ్లి.. బంధువులు, స్నేహితులకు పరిచయం చేస్తాం. ఆ తర్వాత ఆమెను తిరిగి హోంకు పంపిస్తాం. తన చదువును కొనసాగిస్తుంది’ అని తెలిపాడు. (చదవండి: 16 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బాలిక!) -
హిందూ పండుగలపై సర్కారు వివక్ష
సాక్షి, వరంగల్: రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కారు హిందూ సమాజంపై వివక్ష చూపుతోందని విశ్వహిందు పరిషత్ నాయకులు కేశిరెడ్డి జయపాల్ రెడ్డి, కట్ట రమేశ్ అన్నారు. గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు, నిర్బంధాలు విధించడాన్ని నిరసిస్తూ సోమవారం విశ్వహిందు పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. హన్మకొండలో కాళోజీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రంజాన్, బక్రీద్ సమయంలో స్వేచ్ఛ ఇచ్చిన సీఎం కేసీఆర్ బోనాలు, వినాయక చవితి పండుగలకు ఆంక్షలను విధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఓవైసీకి తొత్తుగా మారిన సీఎం కేసీఆర్ హిందు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల అనుమతితో హిందు పండుగలు నిర్వహించుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమాల్లో ఆయా సంఘాల నాయకులు సంతోష్కుమార్, ఆలకట్ల సాయి కుమార్, వలస అశోక్, నక్క పూర్ణచందర్, కిరణ్ చౌదరి, తాడిశెట్టి శ్రీధర్, వాడపల్లి సురేష్, మనోహర్, రఘు, శ్రీకాంత్, సందీప్, వంశీ, రమేశ్, నవీన్, దీపు, శ్రావణ్ కుమార్, రాజేశ్ ఖన్నా, మోడెం పూర్ణ, జగదీష్, యశ్వంత్, మనిదీప్, సురేందర్తో పాటు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. హన్మకొండ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్రెడ్డి, వీహెచ్పీ, బీజేపీ నాయకులు కట్ల రమేష్, చిక్కుడు సంతోష్, అల్లకట్ల సాయికుమార్, వలస అశోక్ పాల్గొన్నారు. -
హిందువుల బస్తీ నేలమట్టం చేసిన పాకిస్తాన్
-
పాక్ దుశ్చర్య: హిందువుల ఇళ్లు కూల్చివేత
పంజాబ్ (పాకిస్తాన్): మైనారిటీలపై వివక్ష చూపుతూ పాకిస్తాన్ సాగిస్తున్న ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. కరోనా నేపథ్యంలో ఎవరూ ఇళ్లు దాటి బయటకు రావద్దని ప్రపంచ దేశాలు పిలుపునిస్తుంటే పాక్ మాత్రం తన సొంత గడ్డ మీద మైనారిటీ హిందువుల ఇళ్లను నేలమట్టం చేసి వికృతరూపాన్ని చాటుకుంది. ఇది ఆ దేశ మంత్రి ఆధ్వర్యంలోనే జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ ప్రావిన్స్లోని భవల్పూర్లో మైనారిటీల నివాసాలను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. నిలువనీడ లేకుండా చేయకండంటూ బాధితులు రోదిస్తూ అధికారుల కాళ్లావేళ్లా పడ్డా ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. (భారత్పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు) కళ్ల ముందు ఇల్లు కూలిపోతూ శిథిలాల దిబ్బగా మారుతుంటే హిందువులు గుండెలు పగిలేలా రోదించారు. ఈ కూల్చివేతల ఘోరం ఆ దేశ గృహనిర్మాణ మంత్రి తరీఖ్ బషీర్ పర్యవేక్షణలోనే జరిగింది. ఈ ఘటనలో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా మైనారిటీ హక్కులను కాలరాస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ దారుణానికి పాల్పడింది. ఇటీల ఇదే తరహా ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్లోని ఖనేవాల్లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్కు చెందిన ఓ రాజకీయ నాయకుడు క్రైస్తవులకు చెందిన ఇళ్లు, స్మశానాన్ని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశాడు. (పాక్ జర్నలిస్ట్కు నగ్మా సపోర్ట్: నెటిజన్ల ఫైర్) -
మసీదులో హిందూ పెళ్లి
తిరువనంతపురం : హిందూ సంప్రదాయంలో జరిగే పెళ్లికి కేరళలోని ఓ మసీదు వేదిక కానుంది. ఈ పెళ్లి ఈ నెల 19న జరగనుంది. మసీదుకు సమీపంలో నివసించే పేద హిందూ కుటుంబానికి చెందిన బిందు, అశోకన్ల కుమార్తె అంజు (22)కు మసీదులో పెళ్లి జరగనుంది. 2018లో అశోకన్ మరణించినప్పటి నుంచి వీరి కుటుంబం ఆరి్థక ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఈ విషయాన్ని బిందు మసీదు పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో చెరువల్లి జమాత్ కమిటీ కార్యదర్శి నుజుముదీన్ అలుమూట్టిల్ ఈ పెళ్లిని జరిపిస్తామని చెప్పారు. పెళ్లి బహుమానంగా అంజుకు బంగారం, రూ. 2 లక్షలు ఇవ్వడంతో పాటుగా, పెళ్లిలో 1000 మందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. అంజు చదువుకు తాను వ్యక్తిగతంగా సహాయం చేశానని నుజుముదీన్ చెప్పారు. ఈ భిన్నమైన పెళ్లి కార్డులు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
హిందుమైన..పాపానికి..
-
తొలి హిందూమంత్రిగా అనితా ఆనంద్
ఒటావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్ చోటుదక్కించుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా ఇటీవల ఆమె పార్లమెంట్కు ఎన్నికయిన విషయం తెలిసిందే. అక్టోబర్లో జరిగిన హౌస్ ఆఫ్ కామన్స్ సభకు ఆమె అర్హత సాధించారు. అలాగే తొలి హిందూ పార్లమెంటేరియన్గా కూడా అనిత ప్రత్యేక గుర్తింపును పొందారు. టొరంటోలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. తొలిసారి మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. కాగా అనిత తల్లిదండ్రులు భారత్కు చెందిన వారు కావడం విశేషం. బుధవారం ఏర్పడిన నూతన వర్గంలో మరో ముగ్గురు కొత్త వారికి కూడా ట్రూడో చోటుకల్పించారు. వీరంతా ఇండో-కెడియన్కు చెందిన సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారు. -
హిందూ సమాజ్ నేత దారుణ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లో అంతగా గుర్తింపు లేని రాజకీయ పార్టీ హిందూ సమాజ్ అధ్యక్షుడు కమలేష్ తివారీ (45) దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలో అత్యంత రద్దీగా ఉండే నాకా హిందోలా ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో శవమై కనిపించారు. లక్నో పశ్చిమ ఏఎస్పీ వికాస్ త్రిపాఠీ అందించిన వివరాల ప్రకారం కమలేష్ తివారీని ఆయన ఇంట్లోనే అతి దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు ఇద్దరు వ్యక్తులు ఆయనను కలవడానికి వచ్చారు. వారితో మాట్లాడుతున్న తివారీ పాన్ల కోసం తన అనుచరుడ్ని బయటకి పంపించారు. మార్కెట్ నుంచి అతను తిరిగి వచ్చేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. రక్తపు మడుగులో తివారీ శవమై కనిపించారు. తివారీని కలవడానికి వచ్చినవారు ఆ ఇంట్లో అరగంట కంటే ఎక్కువ సేపు గడిపినట్టు పోలీసులు చెబుతున్నారు. హంతకుల్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. హిందూ మహాసభతో విభేదాల కారణంగా బయటకు వచ్చిన తివారీ హిందూ సమాజ్ పార్టీని స్థాపించారు. తివారీ హత్య కేసులో ఐదుగురి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్లిం మత గురువు అన్వర్-ఉల్ -హక్ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తివారీ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు మహ్మద్ ముఫ్తీ నదీమ్ కాజ్మి, ఇమామ్ మౌలానా అన్వర్-ఉల్-హక్ కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త తలకు రూ.1.5 కోట్లు వెల కట్టారని ఆరోపించారు. కమలేష్ తివారీ హత్యకు సూరత్లో కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని సూరత్లో శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సూరత్ నుంచి అహ్మదాబాద్కు తీసుకొచ్చారు. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చి నివాళి అర్పించే వరకు తివారీ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. తివారీ హత్య నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతను యూపీ పోలీసులు కట్టుదిట్టం చేశారు. -
జమ్మూ ఓటు ఎవరికి ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రపంచ శక్తుల ముందు లొంగని వ్యక్తి, ఆర్థిక సాయం కోసం వారి ముందు చేతులు చాచని వ్యక్తినే నేను ప్రధాన మంత్రిగా కోరుకుంటున్నాను. బలహీనులు ప్రధాని కావడానికి వీల్లేదు. ప్రపంచ శక్తుల ముందు బలంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడే వ్యక్తి కావాలి. స్థానికంగా ఎవరు నిలబడుతున్నారో, గతంలో ఆయన ఏం చేశారో నాకు తెలియదు. ప్రధాన మంత్రిగా మాత్రం బలమైన వ్యక్తిని కోరుకుంటున్నాను’ అని వినియోగదారులకు వేడి వేడి టీని సరఫరా చేస్తున్న ఓ చిన్న టీకొట్టు యజమాని తర్సెమ్ లాల్ శర్మ (42) వ్యాఖ్యానించారు. ఆయన ఇచ్చిన టీ తాగుతున్న వినియోగదారులు అవునన్నట్టుగా తలలు ఊపారు. జమ్మూలోని రఘునాథ్ బజార్లో మీడియాకు కనిపించిన దశ్యం ఇది. దేశప్రధానిగా లాల్ శర్మ ఎవరిని ప్రధానిగా కోరుకుంటున్నారో వేరుగా చెప్పక్కర్లేదు. అర్థం అవుతుంది. లాల్ శర్మ పక్కనే ఉన్న అఖ్కూర్ పట్టణానికి చెందిన వ్యక్తి. ఆ పట్టణం పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉండడం వల్ల అక్కడ పాక్ వైపు నుంచి తరచుగా కాల్పులు జరగడం సాధారణం. జమ్మూ లోక్సభ స్థానానికి ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో జమ్మూ, సాంబ, పూంచ్, రాజౌరి అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం జనాభాలో 65 శాతం మంది ముస్లింలు ఉండగా, 30 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జమ్మూ, సాంబలో హిందువులు ఎక్కువగా మిగతా రెండు జిల్లాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు వర్గాల ప్రజలు విడిపోయే బతుకుతున్నారు. 2014 ఎన్నికల్లో హిందువులంతా ఐక్యం కావడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2008లో కశ్మీర్లోని ప్రభుత్వ స్థలాన్ని అమర్నాథ్ ఆలయం బోర్డుకు అప్పగించడంతో అక్కడ హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలు పెరిగాయి. ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. వారి ఆందోళనలు వెంటనే వారికి కలిసి రాలేదు. 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్లాల్ శర్మ విజయం సాధించారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలోని రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో జమ్మూ నుంచి మదన్లాల్ శర్మపై బీజేపీ అభ్యర్థి జుగల్ కిషోర్ ఏకంగా రెండున్నర లక్షల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో 37 సీట్లకుగాను 25 సీట్లను బీజేపీ గెలుచుకుంది. తద్వారా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి తొలిసారిగా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈసారి జమ్మూ నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ జుగల్ కిషోర్ పోటీ చేస్తుండగా, ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు రామన్భల్లా పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర మంత్రి చౌదరిలాల్ సింగ్ త్రిముఖ పోటీలోకి దిగారు. పాకిస్థాన్ వైపు నుంచి తరచుగా కాల్పులు జరుగుతుండడం, వాటి నుంచి సరైన భద్రత లేకపోవడంతోపాటు ఇక్కడ ఎక్కువగా ఉన్న డోగ్రా జాతి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం పట్ల ఇక్కడ హిందువులంతా ఏకమయ్యారు. బీజేపీ ప్రభుత్వం కూడా డోగ్రా కమ్యూనిటీని పట్టించుకోకపోవడంతో వారికి బీజేపీ పట్ల కూడా కోపం పెరిగింది. పుల్వామా ఉగ్ర ఆత్మాహుతి దాడితో మళ్లీ డోగ్రా కమ్యూనిటీ బీజేపీవైపే మొగ్గు చూపుతోంది. -
హిందుత్వాన్ని నమ్మిన అమెరికన్
అన్నీ కలిసొస్తే ఆమె అగ్రదేశాధినేత అవుతారు.. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలవుతారు. అమెరికా పీఠం అధిష్టించిన తొలి క్రైస్తవేతర, తొలి హిందూ మహిళగా మన దేశానికి గర్వకారణం అవుతారు. ఆమే.. తులసీ గబార్డ్. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను ఢీకొనేందుకు డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు 37 ఏళ్ల తులసి ప్రకటించడం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు మరికొందరు మహిళలూ ప్రకటించారు. అయితే వారితో పోలిస్తే తులసికి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. పుట్టుకతో అమెరికన్ అయినా చిన్న వయసులోనే హిందూ మతం స్వీకరించి హిందుత్వాన్ని పాటిస్తున్నారు. ఇండియన్ అమెరికన్లలో ఆమెకు మంచి పేరు ఉంది. తులసి వరుసగా నాలుగోసారి అమెరికన్ కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసి. హిందూ మహిళగానే చెప్పుకోవడానికి ఇష్టపడతారు. వరల్డ్ హిందూ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. 21 ఏళ్ల వయసులోనే హవాయి ప్రతినిధుల సభకు ఎన్నికయిన తులసి రెండేళ్లు దాంట్లో కొనసాగారు. 2012లో అమెరికన్ కాంగ్రెస్కు ఎంపికయ్యారు. అమెరికా సైన్యంలో పని చేశారు. ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పు, నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలపై తులసి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ప్రజా సమస్యల పట్ల మెరుగైన అవగాహన ఉంది. ఈ అనుకూలాంశాలతో మిగతా వారికంటే రేసులో ఆమె ఒకడుగు ముందుంది. నేటివిటీ సమస్య తులసికి నేటివిటీ పెద్ద సమస్య కావచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తులసి అమెరికా పౌరురాలే. అయితే ఆమె అమెరికా గడ్డమీద పుట్టలేదు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లోని తుతులియా దీవిలో 1981లో పుట్టారు. తర్వాత ఆమె కుటుంబం హవాయికి వచ్చింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం(ఐఎన్ఏ)ప్రకారం తుతులియా వంటి ప్రాంతాల్లో పుట్టినవారు అమెరికా జాతీయులే కాని పుట్టుక తో అమెరికన్లుగా పరిగణించబడరు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ‘నేచురల్ బోర్న్ సిటిజన్’అయి ఉండాలి. అయితే, నేచురల్ బోర్న్ సిటిజన్ అంటే ఎవరో రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించలేదు. సాధారణంగా పుట్టుకతో అమెరికా పౌరుడయిన వారిని నేచురల్ బోర్న్ సిటిజన్గా పరిగణిస్తుంటారు. తులసి తల్లిదండ్రులిద్దరూ అమెరికా పౌరులే. కాబట్టి చట్ట ప్రకారం తులసి అమెరికా పౌరురాలే అవుతుంది. అయితే అమెరికా బయట పుట్టినవారెవరూ ఇంతవరకు అధ్యక్ష పదవికి ఎన్నికవలేదు. -
అయ్యప్పకు ముస్లిం–క్రైస్తవ స్నేహితులు
తిరువనంతపురం: కఠినమైన అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, చర్చి కొలనులో స్నానాలు చేయడాన్ని ఎవరైనా విశ్వసిస్తారా? ఇది మత సామరస్యానికి సంబంధించిన కల్పిత కథ అనుకుంటే పొరబడినట్లే. శబరిమల అయ్యప్పస్వామి కొలువైన కేరళలో చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మండాలం–మకరవిలక్కు యాత్రకు వచ్చే స్వాములు శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో కొట్టాయం జిల్లాలో ఉన్న ఎరుమేలి నాయనార్ జుమా మసీదు(వావర్పల్లి మసీదు) చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తిరుగు ప్రయాణంలో ఆ పక్కనే అలప్పుజలో ఉన్న ఆర్థంకల్ సెయింట్ అండ్రూస్ బాసిలికా చర్చి ఆవరణలోని చెరువులో స్నానాలాచరిస్తారు. నవంబర్–జనవరి నెలల మధ్య ఎన్నో ఏళ్లుగా ఇదొక ఆనవాయితీగా కొనసాగుతోంది. దీని వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నమాజ్.. ప్రదక్షిణలు పండాలం రాజు దత్తపుత్రుడైన స్వామి అయ్యప్పకు హజ్రత్ వావర్ షా అనే ముస్లిం, ఆర్థంకల్ వెలుథచన్ అనే క్రైస్తవ బోధకులు మంచి స్నేహితులుగా ఉండేవారని ఇక్కడి వారు చెప్పుకుంటుంటారు. వారి మధ్య స్నేహానికి, మత సామరస్యానికి గుర్తుగా అయ్యప్ప దీక్షాపరులు వావర్ పేరుతో ఉన్న మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కేరళతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా స్వాములు వస్తుంటారని వావర్ మసీదు జాయింట్ సెక్రటరీ హకీం తెలిపారు. ‘స్వాములు మసీదు ప్రార్థన మందిరం లోపలికి మాత్రం ప్రవేశించరు. మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేసి, టెంకాయ కొట్టి, కానుకలు సమర్పించి శబరిమల సందర్శనకు బయల్దేరుతారు. మసీదు లోపల నమాజ్ జరుగుతుండగా వెలుపల అయ్యప్ప భక్తులు శరణం అయ్యప్ప అంటూ ప్రదక్షిణలు చేయడం ఓ అరుదైన దృశ్యం. అయ్యç ప్ప, వావర్ల మధ్య స్నేహగాథ కేరళలో మత సామరస్యం, లౌకికత ఎంతగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని హకీం అన్నారు. ఈ మసీదు వద్దే వావర్ స్వామి అనే ఆలయం కూడా ఉంది. యాత్ర ముగించుకున్న భక్తులు అర్థంకల్ బాసిలికా చర్చి వద్దకు చేరుకుంటారు. ‘చర్చి ఆవరణలోని చెరువులో లేక సమీపంలోనే ఉన్న సముద్రంలో స్నానాలు చేసి, స్వాములు దీక్షను విరమిస్తారు. చర్చిలోని సెయింట్ సెబాస్టియన్ విగ్రహం వద్ద పూజలు చేస్తారు’ అని ఫాదర్ క్రిస్టోఫర్ ఎం.అర్థస్సెరిల్ తెలిపారు. -
ప్రేమ వ్యవహారం.. యువతికి వినూత్న శిక్ష
లండన్ : ప్రేమించినవాడు దక్కలేదన్న అక్కసుతో ఓ బ్రిటిష్ సిక్కు యువతి మూర్ఖంగా ప్రవర్తించి జైలు పాలయింది. దాదాపు అయిదేళ్లుగా మాజీ ప్రియుడినీ, అతని కుటుంబ సభ్యులను టార్చర్ చేస్తున్న అమన్దీప్ ముధార్ (26).. ఆమె ఫ్రెండ్ సందీప్ డోగ్రా (30)కు ఇంగ్లండ్లోని సీన్డన్ క్రౌన్ కోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. జాతివివక్ష, మత విశ్వాసాలు, సామాజిక సంబంధాల పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు వారిద్దరికీ రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష అమలు చేయాలని స్వీన్డన్ క్రౌన్ కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. కోర్టు తెలిపిన వివరాలు.. ముధార్, కృపాకర్ (పేరుమార్చాం) అనే హిందూ యువకుడు 2012లో ప్రేమలోపడ్డారు. అయితే, కొన్నాళ్లపాటు కలిసున్న అనంతరం మతాలు, సంప్రదాయాల విషయంలో మనస్పర్థలతో వారిద్దరు విడిపోయారు. ఇక అప్పటినుంచి యువకుడిపై పగ పెంచుకున్న ముధార్ తన మిత్రుడు సందీప్తో కలిసి కృపాకర్పై కక్ష సాధింపు మొదలు పెట్టింది. అతని కుటుంబ సభ్యులను మతం, జాతి పేరుతో దూషిస్తూ.. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టింది. కృపాకర్ చెల్లెల్లను రేప్ చేయిస్తానని బెదిరింపులకు గురిచేసింది. వారి మత విశ్వాశాలు దెబ్బతినేలా ప్రవర్తించింది. కృపాకర్ కుటుంబం వెళ్లే దేవుడి సన్నిధిలో సైతం దుర్భాషలాడింది. అంతటితో ఆగక వాళ్లింట్లో పశు మాంసం పారవేసింది. ఇంకా... కృపాకర్ చెల్లెలి కొడుకుని స్కూల్లో మరో పిల్లాడితో కలిసి వేధింపులకు గురిచేసింది. రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష మాత్రమే కాకుండా.. మత విశ్వాశాలపై దాడి చేసినందుకు 100 గంటల ధార్మిక సేవ, కోర్టు ఫీజుల కింద 750 పౌండ్ల జరిమానా విధించింది. కాగా, ముధార్ చిన్నతనంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగానే మొండితనం, పెంకితనం వచ్చాయనీ ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తల్లి సంరక్షణలో వేధింపులకు గురికావడంతోనే అలా తయారైందని విన్నవించారు. అతని వాదనలతో ఏకీభవించని కోర్టు ఈ వినూత్న శిక్షతో ముధార్ ప్రవర్తనలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు.. లండన్లోని సిక్కు కమ్యునిటీ కూడా ముధార్, సందీప్ చర్యలపై మండిపడింది. వారికి ఎటువంటి సాయం చేయబోమని ప్రకటించింది. సస్పెండెడ్ జైలు శిక్ష అనగా.. సాధారణ జైలు శిక్ష విధించే క్రమంలో ముద్దాయిలకు ఒక అవకాశంగా సస్పెండెడ్ జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షా కాలంలో ముద్దాయి ప్రవర్తనపై నిఘా ఉంచుతారు. విపరీత మనస్తత్వం కలిగిన సమూహంలో వారిని విడిచిపెడతారు. అక్కడ వారు మళ్లీ ఎలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో శిక్షా కాలం పూర్తి చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అలాకాకుండా సస్పెండెడ్ జైలు శిక్ష కాలంలో కూడా నేరాలకు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే వాటిపై విచారణ చేసి మునుపటి జైలు శిక్ష.. తాజా శిక్షను విధించి కటకటాల వెనక్కి పంపుతారు. -
‘ముస్లింలను కలుపుకున్నదే హిందుత్వ’
న్యూఢిల్లీ: హిందూ దేశమంటే ముస్లింలకు చోటులేదని అర్థం కాదనీ, హిందుత్వమంటే అన్ని మతాలను కలుపుకుని పోవడమేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మంగళవారం అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల ‘భవిష్యత్ భారతం–ఆరెస్సెస్ దృక్పథం’ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వం కోసం సంఘ్ పనిచేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే ప్రాథమిక సిద్ధాంతం నుంచి ఈ సౌభ్రాతృత్వం పుట్టుకొచ్చింది. హిందూ దేశంలో ముస్లింలకు లేదా ఇతరులకు చోటు లేదన్న రోజున అది హిందూత్వమే కాకుండా పోతుంది. వసుధైక కుటుంబం గురించి మాట్లాడేదే హిందూత్వం. అలా ఉంటేనే అది హిందూ దేశం’ అని భాగవత్ వివరించారు. అలాగే ఓ నిర్దిష్ట పార్టీ కోసం పనిచేయాలని ఆరెస్సెస్ తన కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పదనీ, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వారికే మద్దతు తెలపాల్సిందిగా తాము కార్యకర్తలకు సూచిస్తామని భాగవత్ చెప్పారు. ఆరెస్సెస్ నేపథ్యమున్నవారు బీజేపీలో అత్యున్నత పదవుల్లో ఉండగా, ఆరెస్సెస్కు, బీజేపీకి వ్యత్యాసముందని చెప్పేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. -
‘గాడ్సే కాకపోతే నేను గాంధీని చంపేదాన్ని’
అలహాబాద్ : ‘ఒకవేళ గాడ్సే, మహాత్మ గాంధీని చంపకపోయి ఉంటే నేనే ఆ పని చేసి ఉండేదాన్ని’ అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త పూజా శకున్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత్ హిందూ మహాసభ(ఏబీహెచ్ఎమ్) అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మీరట్లో ఏర్పాటు చేసిన హిందూ కోర్టు ప్రథమ జడ్జీగా పూజా శకున్ పాండే నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘నేను, ఏబీహెచ్ఎమ్ నాథురాం గాడ్సే చేసిన పనిని కీర్తిస్తున్నాను. అంతేకాక నేటి కాలంలో కూడా విభజనను సమర్ధించే గాంధీలు ఉంటే, వారిని వ్యతిరేకించే గాడ్సేలు కూడా ఉంటారు. ఒక వేళ గాడ్సే గాంధీని చంపకపోతే నేనే ఆ పని చేసేదాన్ని’ అని ప్రకటించారు. గత కొంత కాలంగా ఏబీహెచ్ఎమ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. కేరళ వరదల నేపథ్యంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిలో గొడ్డు మాంసం తినే వారు ఉంటే వారికి సాయం చేయొద్దంటూ ఏబీహెబ్ఎమ్ నాయకుడు చక్రపాణి మహరాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరిన్ని హిందూ కోర్టులు: ఏబీహెచ్ఎమ్ మీరట్లో తొలి హిందూ కోర్టును ఏర్పాటు చేసిన ఏబీహెచ్ఎమ్ త్వరలోనే దేశ వ్యాప్తంగా మరిన్ని హిందూ కోర్టులను ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ఈ హిందూ కోర్టు భూ తగదాలు, ఆస్తి లావాదేవీలు, విడాకుల వంటి అంశాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుందని ఏబీహెచ్ఎమ్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ శర్మ తెలిపారు. అంతేకాక ఈ ఏడాది అక్టోబర్ 2న ఈ హిందూ కోర్టుకు సంబంధించిన నియమ నిబంధనలను, కార్యకలాపాల వివరాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఇదిలావుండగా హిందూ కోర్టు ఏర్పాటు విషయంపై అలహబాద్ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ కోర్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాలని నోటీసులు కూడా జారీ చేసింది. -
పాక్ విలువలకు దివిటి ఆ గెలుపు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను అంతర్జాతీయ మీడియాకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. పాకిస్తాన్లో మానవత్వం, భిన్న మతాల మధ్య సామరస్యం ఉందని. నా విజయం మత తీవ్రవాద చీకటిలో మినుకుమినుకు మంటున్న వెలుగుకాదు. నా దేశ విలువలను చూపే దివిటి’ అని డాక్టర్ మహేశ్ కుమార్ మలానీ వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తొలి హిందువు. పార్లమెంట్కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తొలి ముస్లింయేతరుడు. పాకిస్తాన్ పార్లమెంట్కు ముస్లింయేతరులు పోటీచేసేందుకు వీలుగా, అలా పోటీ చేసిన వ్యక్తికి ముస్లింయేతరులు ప్రత్యేకంగా ఓటు వేసేందుకు వీలుగా 2002 నుంచి పాకిస్తాన్ ఎన్నికల్లో సంయుక్త ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చారు. ముస్లింయేతరుల కోసం పాక్ పార్లమెంట్లో పది నామినేట్ సీట్లను కూడా కేటాయించారు. ఈ పది నామినేట్ సీట్లను రాజకీయ పార్టీలకు పార్లమెంట్లో గెలుచుకున్న సీట్ల సంఖ్యనుబట్టి కేటాయిస్తారు. మొత్తం పోలయిన ఓట్లలో కనీసం ఐదు శాతం ఓట్లు సాధించిన పార్టీలకే ఈ నామినేటెడ్ సీట్లను కేటాయిస్తారు. మహేశ్ కుమార్ మలానీ ముందుlవరకు ముస్లిం ఏతరులు నేరుగా పార్లమెంట్కు పోటీచేసి విజయం సాధించలేదు. ఈసారి ఎన్నికల్లో ఆయన పాకిస్తాన్ ఎంపీగా ఎన్నికై ఎంతో మంది ముస్లిం ఏతరులకు ఆదర్శంగా నిలిచారు. తనకు హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఓటువేసి గెలిపించారంటూ వారందరికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఆయన సింధు ప్రాంతంలోని తార్పార్కర్ 2 నియోజక వర్గం నుంచి గెలుపొందారు.