
దుబాయ్: గత నాలుగన్నరేళ్లలో భారతదేశం చాలా ఎక్కువ మొత్తంలో అసహనం, కోపానికి సాక్ష్యంగా నిలిచిందనీ, అధికారంలో ఉన్నవారి మనస్తత్వాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం అన్నారు.యూఏఈలో పర్యటిస్తున్న రాహుల్ శనివారం ఐఎంటీ దుబాయ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. ‘సహనం భారతీయుల సంస్కృతిలో మిళితమై ఉంది. అయితే గత నాలుగున్నరేళ్లుగా భారత్లో జరుగుతున్నది చూస్తుంటే విచారంగా ఉంది. వివిధ కులాలు, వర్గాలు, మతాల మధ్య చాలా ఎక్కువ స్థాయిలో అసహనం, కోపం, విభజనలను మనం చూశాం.
పాలిస్తున్నవారి మనస్తత్వాల నుంచి ఇవి వస్తున్నాయి’ అని రాహుల్ ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందనీ, ప్రస్తుతం భారత వ్యవసాయ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానమై లేదని రాహల్ తెలిపారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థను కూడా మార్చి, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆర్థిక వనరులు కల్పించి అవి దిగ్గజ కంపెనీలుగా ఎదిగేందుకు తోడ్పడాల్సిన అవసరం ఉందన్నారు. యూఏఈ సాంస్కృతిక, యువజన, సామాజికాభివృద్ధి శాఖల మంత్రిని రాహుల్ కలిశారు.