
ప్రమాదవశాత్తు ఆమె జారి పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో హుటాహుటిన ఆమెను..
భువనేశ్వర్: బుల్లి తెర నటిగా విశేష ప్రేక్షక ఆదరణ చూరగొన్న నికిత (30) శనివారం ఆకస్మికంగా కన్ను మూశారు. ప్రమాదవశాత్తు ఆమె జారి పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో హుటాహుటిన ఆమెను కటక్ మహా నగరంలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చలన చిత్రాలు, బుల్లితెర ధారావాహికల్లో ఆమె నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఏసీపీ నికితగా ఆమె పాత్రలో జీవించి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సాధించారు.
100 పైబడి ఆల్బమ్స్లో ఆమె నటించారు. అఖి ఖొల్లిబాకు డొరొ లగ్గుచి చిత్రంతో ఆమె నట జీవితానికి శ్రీకారం చుట్టారు. గూండా, చోరీ చోరీ మొన్నొ చోరీ వంటి ఒడియా చలన చిత్రాల్లో ఆమె నటించారు. నికిత ఆకస్మిక మరణంతో ఓలీవుడ్, బుల్లి తెర రంగాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. గూండా చలన చిత్రం ఆమె చివరి సినిమాగా మిగిలింది. నటుడు లిపన్ సాహుతో 2 ఏళ్ల కిందట ఆమెకు వివాహం జరిగింది.