
పాట్నా: బిహార్లో పోలీసులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. కూరగాయలు ఉచితంగా ఇవ్వలేదన్న కారణంతో పోలీసు అధికారి ఓ యువకుడిపై అక్రమ కేసు పెట్టి జైల్లో వేయించాడు. పాట్నాలో ఓ పోలీసు అధికారి కూరగాయలు విక్రయిస్తున్న యువకుడి (14) దగ్గరకు వచ్చి తనకు ఉచితంగా కూరగాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి ఆ యువకుడు నిరాకరించాడు. దానిని దృష్టిలో ఉంచుకున్న అధికారి రెండురోజల తరువాత ఆ యువకుడిపై బైక్ దొంగతనం కేసుపెట్టాడు.
కూరగాయలు ఉచితంగా ఇవ్వని కారణంగానే తన కుమారుడిపై దొంగతనం కేసుపెట్టి అక్రమంగా జైల్లో పెట్టించారని ఆ యువకుడి తండ్రి శుక్లా పాశ్వాన్ ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన మార్చిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుమారుడికి న్యాయం జరపాల్సిందని ఆ యువకుడి తల్లిదండ్రులు పాట్నా చేరుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ 48 గంటల్లో విచారణ జరిపాలని అధికారులను ఆదేశించారు.