
భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్న కశ్మీరీ వేర్పాటువాదులు (పాత ఫొటో)
శ్రీనగర్, జమ్మూకశ్మీర్ : జమ్మూ కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి(యూఎన్) రిపోర్టును వెలువరించింది. ఈ రిపోర్టును భారత్ ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే యూఎన్ జమ్మూ కశ్మీర్పై ఈ రిపోర్టును ప్రచురించిందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. భారత్, పాకిస్తాన్లు కశ్మీరీల మనోభావాలను గౌరవించాలని యూఎన్ రిపోర్టులో పేర్కొంది.
2016 జులైలో హిజ్బుల్ మొజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీని బలగాలు తుదముట్టించిన దగ్గర నుంచి కశ్మీర్ వ్యాలీలో అశాంతి నెలకొందని యూఎన్ తన రిపోర్టులో వెల్లడించింది. ఈ మేరకు యూఎన్ మానవ మానవహక్కుల విభాగం చీఫ్ జైద్ రాద్ అల్ హుస్సేన్ 2016 నుంచి కశ్మీర్లో మరణాలపై విచారణ చేయాలని ఆదేశించారు.
పెద్ద సంఖ్యలో బలగాల మొహరింపు, పెల్లెట్ల వినియోగంపై తదితరాలపై మానవహక్కుల విభాగం విచారణ చేయనుంది. వచ్చే వారం జరగనున్న సమావేశంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తామని జైద్ వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో(ఉదాహరణకు సిరియా అంతర్యుద్ధం) మాత్రమే యూఎన్ విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది.