
సాక్షి, తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పెద్ద కుమార్తె టీ వీణ వివాహం సోమవారం నిరాడంబరంగా జరిగింది. సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్ తిరువనంతపురంలో వీణను పెళ్లాడారు. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రహీమ్ సహా మొత్తం 50 మంది అతిథులు పాల్గొంటారు. అనంతరం ట్విటర్లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మొదటి వివాహంలో వీణకు ఒకరు, రియాజ్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా వీణ 2014లో బెంగళూరులో ఎక్సోలాజిక్ సొల్యూషన్స్ సంస్థను నెలకొల్పి దానికి మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అబ్దుల్ ఖాదర్ కుమారుడు అయిన మహ్మద్ రియాజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2009 లోక్సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.