
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మూడింట ఓ వంతు పైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2013లో వారు ఎన్నికైనప్పుడు 35 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. పార్టీల వారీగా చూస్తే 36 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదవగా, బీజేపికి చెందిన 13 మంది, జేడీఎస్కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి.
కర్ణాటక ఎమ్మెల్యేల్లో 52 శాతం మంది 5 కోట్ల రూపాయలు పైబడిన ఆస్తులు కలిగిఉన్నారు. 25 శాతం మంది ఎమ్మెల్యేలకు 2 నుంచి 5 కోట్ల రూపాయల మధ్య ఆస్తులుండగా, 22 శాతం ఎమ్మెల్యేలకు రూ. 50 లక్షల నుంచి 2 కోట్ల మధ్య ఆస్తులున్నాయి. రూ. 10 లక్షల నుంచి 50 లక్షల లోపు ఆస్తులున్న ఎమ్మెల్యేలు కేవలం 0.5 శాతం మందే కాగా పది లక్షల రూపాయలలోపు ఆస్తులు కూడా కేవలం 0.5 శాతం మందే ఉన్నారు.
ఇక దేశవ్యాప్తంగా 1765 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్ధానాలు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.