
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాదళాలకు మరో విజయం. పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ వసీం షాను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని లిట్టర్ గ్రామంలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో వసీం షా సహా అతని అనుచరుడైన మరో ఉగ్రవాది నజీర్ అహ్మద్ మృతి చెందారు. వసీం షా లష్కరే తోయిబా షోపియన్ జిల్లా కమాండర్గా కొనసాగుతున్నాడు.
అతన్ని మట్టుబెట్టిన భద్రతా దళాలను జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ప్రశంసించారు. 'క్లీన్ ఆపరేషన్లో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. వెల్డన్ జేకేపీ (జమ్మూకశ్మీర్ పోలీస్) బాయ్స్, సెక్యూరిటీ ఫోర్సెస్' అని వైద్ ట్వీట్ చేశారు.
దక్షిణ పుల్వామా జిల్లాలోని లిట్టర్ గ్రామంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు, పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. శనివారం ఉదయమే ఈ గ్రామాన్ని చుట్టుముట్టి.. ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment