
కోల్కత: పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్ బీమాన్ బెనర్జీ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సభలోకి సెల్ఫోన్లు తీసుకొచ్చిన సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ తొలిరోజున ఈ ఘటన వెలుగుచూసింది. ఇటీవల స్వర్గస్థులైన రాజకీయ ప్రముఖులకు సభ శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమయంలో కొంతమంది సభ్యుల మొబైల్ ఫోన్లు మోగాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ మొబైల్ ఫోన్లతో హౌజ్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు.. ఫోన్లు తెచ్చివ్వాలని స్పష్టం చేశారు. అయితే, ఒక సభ్యుడు మాత్రమే తన ఫోన్ తీసుకెళ్లి స్పీకర్కు అందించాడు.
కాగా, ఈ వ్యవహరంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల్లో కొందరు సభా నియామాల్ని ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఫోన్ వెంట తెచ్చుకుంటే తమను తిప్పి పంపరు కదా అని భావించే నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని అన్నారు. సభా మర్యాదల్ని కాపాడాలని హితవు పలికారు. కాగా, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు.. సంతాప తీర్మానాలు చేశారు. ఇటీవల మరణించిన లోక్సభ మాజీ ఎంపీలు కృష్ణా బోస్, తపస్ పాల్, మాజీ ఎమ్మెల్యేలు ప్రజాగోపాల్ నియోగి, పరిమల్ ఘోష్, వినయ్ దత్తా, ఫుట్బాల్ ఆటగాడు అశోక్ ఛటర్జీకి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment