
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి.. చరిత్ర సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించబోతున్నారు. వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగలరన్న నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్సీపీని 175 అసెంబ్లీ సీట్లలో 150కిపైగా స్థానాల్లో గెలిపించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు దోపిడీ పాలనతో విసుగెత్తిన ప్రజలు.. ఆయన పరిపాలన వద్దంటూ తమ తీర్పు ఇచ్చారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.