![Smriti Irani Supports MS Dhoni Over Indian Army Special Forces Gloves Row - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2019/06/8/smriti-irani-and-ms-dhoni.jpg.webp?itok=uxN7TymK)
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి కేంద్రమత్రి స్మృతి ఇరానీ మద్దతుగా నిలిచారు. పారా కమెండోల ప్రత్యేక దళానికి చెందిన బలిదాన్ చిహ్నాన్ని, #heroes #menofhonour హాష్టాగ్ను జతగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ‘బలిదాన్ బ్యాడ్జ్’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) ఉన్న గ్లౌవ్స్ ధరించి ధోని కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భిన్న వాదనలు వినిపించాయి. భారత క్రికెట్ అభిమానులు ధోని చర్యపై హర్షం వ్యక్తం చేయగా.. మరొక వర్గం మాత్రం ‘క్రికెట్లో బలిదాన్ ఎందుకు..?’అని విమర్శలు చేసింది.
దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ధోనితో ఆ లోగో తీయించండి’ అని బీసీసీఐని కోరింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్ మేనేజర్ (కమ్యూనికేషన్స్) ఫర్లాంగ్ వెల్లడించారు. అయితే, ఐసీసీ విజ్ఞప్తిని బీసీసీఐ తోసిపుచ్చింది. ధోని ధరించిన గ్లౌజ్పై ఉన్న ‘బలిదాన్ బ్యాడ్జ్’ తొలగించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది. ‘ ధోని ధరించిన గ్లౌజ్పై ఉన్న లోగో మిలటరీ సింబల్ కాదు. దీనిపై రాద్ధాంతం అనవసరం. ఐసీసీ నిబంధనల్ని ధోని అతిక్రమించలేదు. ఇందుకు ఐసీసీ అనుమతి కోరాం’ అని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment