కార్పొరేషన్లోని ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ లింకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కుమార్ తెలిపారు.
వేలూరు: కార్పొరేషన్లోని ప్రతి ఇంటికీ భూగర్భ డ్రైనేజీ లింకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్లోని మొత్తం 24 వార్డుల్లో రూ.40 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ కాలువకు ప్రతి ఇంటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు పూర్తిగా పైప్లైన్ ఏర్పాటు చేసి కలపాల్సి ఉంది. వీటిపై కార్పొరేషన్ అధికారుల బృందం ఇళ్ల యజమానులకు అవగాహన కల్పిం చారు. కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ కాలువల్లో లింకు చేసేందుకు అతి తక్కువ మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు.
దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి వద్ద పరిశీలించి వారందరికీ కాలువల్లో లింకులు ఇచ్చామని తెలిపారు. దీనిపైఆయా వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని భూగర్భ డ్రైనేజీ కాలువలకు అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఈ పథకంలో లింకు చేసేందుకు ఒక ఇంటికి రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఒకే సారి చెల్లించక పోయినా నాలుగు దఫాలుగా కూడా నగదు చెల్లించవచ్చన్నారు.
అనంతరం కొసపేటలోని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ఇంటింటికీ వెళ్లిన కార్పొరేషన్ అధికారుల బృందం భూగర్భ డ్రైనే జీ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆ ప్రాంతంలో 450 ఇళ్ల పైపు లైన్లను లింకు చేసేందుకు దరఖాస్తులు అందజేశారు. ఆయనతో పాటు కార్పొరేషన్ ఇంజినీర్ బాలసుబ్రమణియన్, ఆరోగ్యశాఖ అధికారి బాలమురుగన్ ఉన్నారు.