హైదరాబాద్: నగరంలోని సనత్నగర్-భరత్నగర్ స్టేషన్ల మధ్య మెట్రో రైల్ నిర్మాణ పనుల దృష్ట్యా శనివారం వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు లింగంపల్లి-ఫలక్నుమా మార్గంలో 20 సర్వీసులు నిలిచిపోనున్నాయి. అలాగే వికారాబాద్-కాచిగూడ, తాండూరు-హైదరాబాద్, సికింద్రాబాద్-వికారాబాద్, హైదరాబాద్-తాండూర్ ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోనున్నాయి. ఫలక్నుమా-నాంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్ వరకే నడుపుతారు.
పూణే నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ లింగంపల్లి వరకే పరిమితమవుతుంది. వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.45 గంటలకు బదులు 2.30 గంటలకు బయలుదేరుతుంది.