
తప్పిన వేలిముద్రల తిప్పలు
సామాజిక పింఛన్ దారులకు శుభవార్త. గత ప్రభుత్వం సామాజిక పింఛన్ దారులకు వేలిముద్రల నమోదు తప్పనిసరి చేసింది. దీంతో చేతిపై గీతలు అరిగిపోయిన వృద్ధులు పింఛన్ పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించనుంది. గ్రామ కమిటీల పర్యవేక్షణలో నేరుగా లబ్ధిదారులకే పింఛన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా పింఛన్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనుకుంటుంది.
-చిలుకూరు
వృద్ధాప్యంలో ఉన్న వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. వీటిని ప్రతినెలా పోస్టాఫీసుల ద్వారా అందజేస్తున్నారు. అయితే లబ్ధిదారుల లో కొంత మంది వేలిముద్రలు పడకపోవడం, అనారోగ్యంతో మంచానికే పరిమితమైనవారు, కుష్టువ్యాధితో బాధపడుతున్న వారు, ప్రమాదాల్లో చేతులు పోగొట్టుకున్న వారు పింఛన్ పొందేందుకు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి లబ్ధిదారులు సూచించిన వ్యక్తి యొక్క వేలిముద్రలు తీసుకుని పింఛన్ పంపిణీ చేస్తున్నారు.
అక్రమాలకు చెక్...
లబ్ధిదారుడి తరఫున ప్రతి నెలా పింఛన్ పొందుతున్న వ్యక్తి సదరు లబ్ధిదారుడికి పింఛన్ మొత్తం ఇస్తున్నాడా లేదా, లబ్ధిదారుడు జీవించి ఉన్నాడా లేదా చనిపోయినా అతని పేరు మీదా పింఛన్ పొం దుతున్నాడా అనే అనుమాలను నివృత్తి చేసుకునేందు కు ప్రభుత్వం కమిటీలు వేసింది. కమిటీ సభ్యులు గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి వేలిముద్రలు పడని, ఇతర ఇతర కారణాలతో వేరే వ్యక్తుల ద్వారా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల వివరాలు సేకరించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల సామాజిక పింఛన్లు పొందుతున్న వారు 3,93,133 మంది ఉండగా వీరిలో ఇతర వ్యక్తుల ద్వారా పింఛన్లు పొందుతున్న వారు 14వేల మంది ఉన్నట్లు గుర్తించారు.
గ్రామ కమిటీల ఏర్పాటు
పింఛన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటు ఇద్దరు గ్రామ మహిళా సమాఖ్య సభ్యులు, పట్టణ స్థాయిలో కౌన్సిలర్, బిల్ కలెక్టర్, ఐకేపీ అర్బన్ ఇద్దరి సిబ్బందిని నియమించారు. ఈ కమిటీ పర్యవేక్షణలో వచ్చే నెల నుంచి పింఛన్లు చెల్లించనున్నారు.
నేరుగా లబ్ధిదారుడికే..
కమిటీ సభ్యులు ప్రతి నెల 9 లేదా 10వ తేదీన ప్రత్యేకంగా గుర్తించిన పింఛన్దారుల డబ్బులు డ్రా చేసి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి అందజేస్తారు. ఈ మేరకు కమిటీ సభ్యుల వేలిముద్రలను నమోదు చేశారు. బయోమ్రెటిక్ ద్వారా డబ్బులు తీసుకునే క్రమంలో కమిటీలో ఏ ఇద్దరు ఉన్నా సరిపోతుంది.