
భర్తకు తోడుగా...పతిభక్తి చాటుకున్న నాగలక్ష్మి
- ఇదీ గజదొంగ శివ స్నాచింగ్ల సంఖ్య
- భార్య రెక్కీ
- టార్గెట్ పూర్తిచేసేది శివ, జగదీష్, రాజ్కుమార్
- ముగ్గురి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ సభ్యులు విచారణలో వెల్లడించిన అంశాలు పోలీసుల దిమ్మెతిరిగి పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగ్ గత రెండేళ్లలో సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో 300 వరకు స్నాచింగ్లకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుకోగా.. విచారణలో 700 స్నాచింగ్లకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు.
ఇందులో సైబరాబాద్ పరిధిలోనే 500 చోరీలకు పాల్పడ్డారు. అందులో ఈ ఏడాది 250 స్నాచింగ్లకు పాల్పడి రికార్డు సృష్టించారని క్రైమ్ ఇన్చార్జి డీసీపీ జి.జానకీషర్మిల, ఏసీపీ రామ్ కుమార్లు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్లో జరిగిన పోలీసు కాల్పుల్లో గ్యాంగ్లీడర్ శివ మృతి చెందగా అతని భార్య నాగలక్ష్మి (30)తో పాటు అతని ఇద్దరు అనుచరులు జగదీష్ (30), రాజ్కుమార్ (23)లను సైబారాబాద్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
వీరి నుంచి రూ. 30 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్లతో పాటు అతని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ ముగ్గురినీ తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించే అవకాశాలున్నాయని జానకీషర్మిల అన్నారు.
జూనియర్ ఆర్టిస్ట్ అయ్యేందుకు వచ్చి...
రాజమండ్రికి చెందిన నాగలక్ష్మి, ఆమె సోదరి జూనియర్ ఆర్టిస్టుల య్యేందుకు 2005లో హై దరాబాద్కు వచ్చి కృష్ణానగర్లో స్థిరపడ్డారు. సోదరి టీవీ జూనియర్ ఆర్టిస్ట్గా చేరింది. కృష్ణానగర్లోని బంధువుల వద్దకు వచ్చే క్రమంలో నాగలక్ష్మితో శివకు పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నారు.
భర్తకు తోడుగా...
భర్త చేసే నేరాలలో తాను సైతం పాల్గొని పతిభక్తి చాటుకుంది నాగలక్ష్మి. ఆమె రెక్కీ ని ర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే శివ అతని అనుచరులు జగదీష్, రాజ్కుమార్ రంగంలోకి దిగి స్నాచింగ్ చేసేవారు. బస్తీలు, కాలనీలలో నాగలక్ష్మి తిరుగుతూ స్కూల్, గుడికి వెళ్లేవారిని, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వారిని గుర్తించి భర్తకు సమాచారం చేరవేసేది. వెంటనే ఒక్కరు..లేదా ముగ్గురూ కలిసి వెళ్లి ‘టార్గెట్’ పూర్తి చేసుకెళ్లేవారు.
కడచూపునకు సైతం నిరాకరించిన తల్లిదండ్రులు....
నెల్లూరులో ఉంటున్న తల్లిదండ్రులు ప్రసన్న, మస్తానయ్య కుమారుడు శివ నేరబాట పట్టడంతో అతనిపై ఆశలు వదిలేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయాడని తెలిసి కన్నీరుపెట్టారు. అయితే, ఆఖరి చూపు చూసేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు శివ మృతదేహా న్ని కృష్ణానగర్లో ఉంటున్న తోడల్లుడు దుర్గాప్రసాద్కు అప్పగించగా.. ఇక్కడే ఆదివా రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒంటరైన కొడుకు... ఒకపక్క తండ్రి శివ మృతదేహం.. మరోపక్క చూద్దామంటే కనిపించని తల్లి నాగలక్ష్మి... దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి ఏకైక కుమారుడు శ్రీను (4)ను చూసి స్థానికులు కన్నీరుపెట్టారు. శివ ఇంట్లో పెరుగుతున్న ఉదయ్సాయి (8) తోడల్లుడి కుమారుడని తెలిసింది.
రికవరీ కోసం ప్రయత్నాలు...
వందలాది గొలుసు చోరీలకు పాల్పడిన శివ గ్యాంగ్ నుంచి సొత్తు రికవరీ చేసే పనిలో పడ్డారు క్రైమ్ పోలీసులు. స్నాచింగ్చేసి తెచ్చిన బంగారాన్ని నాగలక్ష్మి ముత్తూట్, శ్రీరామ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టింది. వీటికి సంబంధించిన రసీదులపై నాగలక్షితో పాటు శివ పేరు కూడా ఉన్నాయి. తాకట్టు పెట్టడమే కాకుండా కొంత బంగారాన్ని వీరు విక్రయించి జల్సా చేసినట్టు విచారణలో తేలింది.
ఆ 24 మందీ టార్గెట్...
నేరగాడు హైదరాబాద్ రావాలంటేనే దడ పుట్టే విధంగా నిఘా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులు దానికి తగ్గట్టు కార్యాచర ణ రూపొందిస్తున్నారు. శివ బాటలో పయణిస్తున్న 24మంది కరుడుగట్టిన స్నాచర్లను గుర్తించారు. వారి ఫొటోలు, వివరాలను అన్ని శాంతి భద్రతలు, సీసీఎస్ ఠాణాకు సైబారాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం పంపించి అధికారులను అప్రమత్తం చేశారు.
వీరిలో ఏ ఒక్కరు కనిపించినా వెంటనే అరెస్టు చేయాలని సూ చించారు. వీరిలో కొందరిపై 100కు పైగా, మరికొందరిపై 50కి పైగా స్నాచింగ్ కేసులున్నాయి. కాగా శివ గ్యాంగ్ బారిన పడిన మహిళలు అభినందులు తెలుపుతూ ఆది వారం సైబరాబాద్ పోలీసు కమిషనర్కు ఎస్సెమ్మెస్లు పంపారు. శివ గ్యాంగ్ దాడి లో మూడు నెలల క్రితం గాయపడి అప స్మారక స్థితికి చేరిన రాంగోపాల్ భార్య వా రం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. కాగా, శివ దాడిలో గాయపడిన ఎస్ఐ వెంకట్ ఆస్పత్రిలో కోలు కుంటు న్నాడు