
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ ఎన్కౌంటర్తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు 2 వారాల గడువునిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
నయీం అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సూర్యాపేట హుజూర్నగర్కి చెందిన శ్రీనివాస్ 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీజే నేతృత్వం లోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలీసుల అండదండలతో నయీం వందల కోట్ల రూపాయాలతోపాటు వందల ఎకరాల భూములను అక్రమంగా ఆర్జించారని తెలిపారు. ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశం తో నయీంను ఎన్కౌంటర్ చేశారని, అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment