నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగాలి | Telangana authors venue | Sakshi
Sakshi News home page

నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగాలి

Published Mon, Aug 10 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగాలి

నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగాలి

మన్ననూర్: నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగించి చెంచులకు సేద తీర్చడమే తన ఉద్దేశమని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జయధీర్ తిరుమల్‌రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని అప్పాపూర్, రాంపూర్, బౌరాపూర్ చెంచులతో ఆదివారం అప్పాపూర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను చెంచుపెంటకు వచ్చినప్పుడు కిన్నెర వాయిద్యం గురించి గొప్పగా చెప్పినట్లు వివరించారు.

అదే ఉద్దేశంతో మక్తల్‌కు చెందిన కిన్నెర వాయిద్యకారుడు పోషప్పతో తయారు చేయించిన రెండింటిని అప్పాపూర్ పెంటకు చెందిన గురువయ్య, రాంపూర్‌కు చెందిన బయ్యన్నకు ఇచ్చిన్నట్లు చెప్పారు. చెంచుల కళలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చెంచులను అడవులకు దూరం చేయాలనుకోవడం భావ్యం కాదని చెప్పారు. ఓయూ ప్రొఫెసర్ కృష్ణయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ గురించి హైదారాబాద్‌లో కార్యక్రమాలు చేపట్టడం కాకుండా మారుమూల ప్రాంతాల్లో దుర్భరమైన జీవితాలను గడుపుతున్న వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు.
 
చెంచులకు వైద్యపరీక్షలు
కడప మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా రాంకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుతో అమాయకులైన చెంచులు కూడా ఏదో వస్తుందని.. తమ బతుకులు బాగుపడుతాయని ఆశించారని చెప్పారు.

గతంలో కంటే ఇప్పుడే చెంచులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో భూమిక తెలుగు మాసపత్రిక సంపాదకులు సత్యవతి, పీయూ ప్రొఫెసర్ మనోజ, ప్రముఖ కవి బెల్లి యాదయ్య, జీసీసీ మేనేజర్ చందర్‌లాల్, రచయితల సంఘం సభ్యులు నర్సన్, శ్రీధర్, వహీద్, గురువయ్య, చందునాయక్, ప్రసన్నకుమార్, నాగభూషణం, రాజు, యాదగిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement