హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరో నవదీప్ సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన సోమవారం ఉదయం 10.20 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చారు. అలాగే సిట్ అధికారులు పబ్ల నిర్వహణపై నవదీన్ను విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ వాడకం, కెల్విన్తో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
కెల్విన్ కాల్ డేటాల్ నవదీప్ ఫోన్ నంబర్ ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. పబ్ల మాటున డ్రగ్స్ దందా చేసినట్లు నవదీప్పై ఆరోపణలు ఉన్నాయి. విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశ, విదేశాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న నవదీప్ నటుడుగానే కాక ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా చలామణీ అవుతున్నారు.
ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కావాల్సిన ఏర్పాట్లు కూడా తానే చేసేవాడని సమాచారం. ఈ నేపథ్యంలో గోవా ముఠాలకు సంబంధించిన కీలకమైన వివరాలను ఆయన నుంచి రాబట్టవచ్చని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెల్విన్తో సంబంధాలు, డ్రగ్స్ మాఫియాతో లింకులు, గతంలో డగ్స్ తీసుకున్నారా తదితర ప్రశ్నలను సిట్ అధికారులు నవదీప్ కోసం సిద్ధం చేశారు. సిట్ చేతిలో నవదీప్ కాల్డేటా, వాట్సాప్ మెసేజ్లు ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.కాగా గత ఏడాది మార్చిలో నవదీప్కు చెందిన గెస్ట్హౌస్పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమంగా వినియోగిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యామ్కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నవదీప్ పట్టుబడ్డారు.