
స్పైస్ జెట్ మెగా ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మధ్య కాలంలో భారీ విస్తరణకు శ్రీకారంచుట్టిన ఎయిర్ లైన్స్ 205 బోయింగ్ విమానాల కొనుగోలుకు సుమారు 23బిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకునట్టు శుక్రవారం వెల్లడించింది. దేశీయ విమానయాన రంగాన్ని మరో మెట్టెక్కించేలా దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలతో ఈ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపింది. సంస్థ చైర్మన్, అండ్ ఎండీ, అజయ్ సింగ్ ఈ ఒప్పంద వివరాలను స్వయంగా ప్రకటించారు.
ఈ డీల్ లో భాగంగా ముఖ్యంగా 155 బోయింగ్ 737-8 మ్యాక్స్, 50 డ్రీమ్ లైనర్, బీ-737ఎస్ విమానాలను దశలవారీగా అందుకోనున్నామని అజయ్ సింగ్ తెలిపారు. గడచిన ఏడు త్రైమాసికాలుగా స్పైస్ జెట్ లాభాల్లో నడుస్తోందని, 20 నెలలుగా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్ తో సాగుతున్నామని వివరించారు. మరోవైపు ఈడీల్ ను దేశంలోనే ఎయిర్ లైన్స్ సంస్థలు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ గా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే గో ఎయిర్ , ఇండిగో లాంటి సంస్థలతో కొనుగోలు ఒప్పందాలుచేసుకున్న బోయింగ్ సంస్థకు భారత్ లో మంచి జోష్ నిస్తుందని భావిస్తున్నారు.
కాగా, బోయింగ్ కు పోటీగా ఉన్న సంస్థ ఎయిర్ బస్ కు భారత అతిపెద్ద బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోతో పాటు, గో ఎయిర్ నుంచి ఇప్పటికే భారీ డీల్స్ వెళ్లిన నేపథ్యంలో ఈ డీల్ తాము ఇండియాలో మరింతగా విస్తరించేందుకు ఉపకరిస్తుందని బోయింగ్ భావిస్తోంది. ముడిచమురు ధరల పతనం కారణంగా, విమాన ఇంధన ధరలు, ఆపై ప్రయాణ టికెట్ ధరలు తగ్గడంతో సాలీనా ప్రయాణికుల వృద్ధి 20 శాతంగా ఉంది. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే.