Jair Bolsonaro
-
Brazil and Peru: ఆ లాటిన్ అమెరికా దేశాల్లో... ‘లా’వొక్కింతయు లేదు!
దక్షిణ అమెరికాలో ముఖ్య దేశాలైన బ్రెజిల్, పెరు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బ్రెజిల్లో మాజీ అధ్యక్షుడే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ దేశాన్ని రావణకాష్టం చేస్తుండగా, పెరులో పదవీచ్యుతుడైన అధ్యక్షునికి మద్దతుగా ప్రజలే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లెక్కుతున్నారు! బ్రెజిల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంతో పాటు ఏకంగా పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల భవనాలపైనే దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. పెరులోనూ జనం రాజధానితో పాటు దేశమంతటా భారీగా ఆందోళనలకు దిగుతూ అట్టుడికిస్తున్నారు. వీటికి సమీప భవిష్యత్తులో కూడా తెర పడే సూచనలు కన్పించడం లేదు! బ్రెజిల్ బేజారు బోల్సొనారో అనుయాయుల అరాచకం కొత్త అధ్యక్షుడు డ సిల్వా ఆపసోపాలు దక్షిణ అమెరికాలో కొంతకాలంగా ‘గులాబి గాలి’ వీస్తోంది. చాలా దేశాల్లో ప్రధానంగా వామపక్ష భావజాలమున్న పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. ఈ ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్లోనూ అదే జరిగింది. గత అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ నాయకుడైన జెయిర్ బోల్సొనారో వెంట్రుకవాసి తేడాలో ఓటమి చవిచూశారు. 51 శాతం ఓట్లతో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నెగ్గారు. కానీ ఈ ఫలితాలను ఒప్పుకుని గద్దె దిగేందుకు బోల్సొనారో ససేమిరా అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సుప్రీంకోర్టు మద్దతూ ఉందని ఆరోపణలు గుప్పించారు. ఈవీఎంలపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాతి పరిణామాల్లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించుకునేందుకు అంతిమంగా అమెరికాలో తేలారు! కానీ, ‘‘అధికారం మీ చేతుల్లోనే ఉంది. సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది. దొంగల పాలనను కూలదోయండి’’ అంటూ అక్కడినుంచే తన మద్దతుదారులను రెచ్చగొడుతూ వస్తున్నారు. ఫలితంగా కొంతకాలంగా బ్రెజిల్ అల్లర్లు, ఆందోళనలు, గొడవలతో అట్టుడుకుతోంది. పార్లమెంటుపై దాడులు ముఖ్యంగా జనవరి 8న కరడుగట్టిన బోల్సొనారో మద్దతుదారులు ఉన్నట్టుండి వేల సంఖ్యలో అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. సైన్యం తిరగబడి ఎన్నికల ఫలితాలను రద్దు చేసి బోల్సొనారోను తిరిగి అధ్యక్షున్ని చేయాలనే డిమాండ్తో అరాచకానికి దిగారు. ఆ సమయంలో భద్రతా దళాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. పైగా ఆందోళనలు జరుగుతుండగానే పలువురు నేతలు, అధికారులు నవ్వుతూ ఫొటోలు తీసుకుంటూ కన్పించారు! నిజానికి అప్పటికి పది వారాలుగా నిరసనకారులు ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందే టెంట్లు వేసుకుని మరీ ఆందోళనలు చేస్తున్నా వాటిని ఆదిలోనే తుంచేసేందుకు డ సిల్వా పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. తిరుగులేని ప్రజాదరణ లులా డ సిల్వా సొంతమైనా కీలక సైన్యం మద్దతు ఆయనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపించాయి. దాంతో పరిస్థితిని ఏదోలా అదుపులోకి తెచ్చేందుకు డ సిల్వా కిందా మీదా పడుతున్నారు. ► మాజీ న్యాయ మంత్రి ఆండెర్సన్ టోరెస్తో పాటు పలువురు బోల్సొనారో సన్నిహితులను అరెస్టు చేశారు. ► సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందన్న వార్త నేపథ్యంలో జనవరి 8 ఆందోళనలకు బాధ్యున్ని చేస్తూ ఆర్మీ చీఫ్ను తాజాగా తొలగించారు. ► అల్లర్ల వెనక బోల్సొనారో హస్తంపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏం జరగనుంది... పరిస్థితులను చూస్తుంటే దేశంలో అల్లర్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కన్పించడం లేదు. అవినీతి ఆరోపణలపై ఇటీవలే ఏడాదిన్నర పాటు ఊచలు లెక్కించిన డ సిల్వాకు దేశాన్ని పాలించే అర్హత లేదంటూ బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చెలరేగిపోతూనే ఉన్నారు. సైన్యం పూర్తి మద్దతు లేకపోతే వాటికి డ సిల్వా ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలుమార్లు సైనిక కుట్రలను, నియంతల పాలనలను చవిచూసిన బ్రెజిల్లో మరోసారి అలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే. పెరు.. పేదల తిరుగుబాటు అధ్యక్షురాలు బొలార్టేపై వెల్లువెత్తిన వ్యతిరేకత మాజీ అధ్యక్షుడు కాస్టిలోకు మద్దతుగా ఆందోళనలు ఆమె పేరు మార్గరిటా కొండొరీ. పెరులో ఆండీస్ పర్వత శ్రేణుల్లోని అత్యంత వెనకబడ్డ పునో ప్రావిన్స్లో స్థానిక అయ్మారా తెగకు చెందిన వృద్ధురాలు. వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా రెండు రోజుల పాటు అత్యంత కఠినమైన బస్సు ప్రయాణం చేసి మరీ రాజధాని లిమా చేరుకుంది. ‘‘మేమంతా పేదరికంలో మగ్గుతున్నాం. మాపై ఉగ్రవాద ముద్ర వేసినా పర్లేదు. బొలార్టే రాజీనామా చేసేదాకా రాజధాని నుంచి కదిలే ప్రసక్తే లేదు’’ అంటూ సహచర ఆందోళనకారులతో కలిసి పెద్దపెట్టున నినదిస్తోంది. పెరులో దాదాపు ఆరు వారాలుగా ఇదే పరిస్థితి! స్థానిక తెగలకు చెందిన వామపక్ష ఫైర్ బ్రాండ్ నాయకుడు కాస్టిలోను అధ్యక్ష పదవి నుంచి కూలదోసి జైలుపాలు చేసి ఉపాధ్యక్షురాలు దినా బొలార్టే గత డిసెంబర్ 7న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచీ ఆమెకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాందోళనలు నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. దేశమంతటికీ వ్యాపించడమే గాక హింసాత్మకంగా మారుతున్నాయి. మార్గరిటా మాదిరిగా అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనం అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి మరీ లిమాకు ప్రవాహంలా వచ్చి పడుతున్నారు. బొలార్టే తప్పుకుని ఎన్నికలు ప్రకటించే దాకా దాకా ఇంచు కూడా కదిలేది లేదని భీష్మిస్తున్నారు. భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏమిటి సమస్య? ప్రపంచంలో రెండో అతి పెద్ద రాగి ఉత్పత్తిదారు అయిన పెరులో 1990 నుంచి దశాబ్దకాలపు నియంతృత్వ పాలన అనంతరం 2000లో ప్రజాస్వామ్య పవనాలు వీచాయి. 2001 నుంచి 2014 దాకా జోరుగా సాగిన ఖనిజ నిల్వల ఎగుమతితో జీడీపీ రెట్టింపు వృద్ధి రేటుతో దూసుకుపోయింది. కార్మికుల వేతనాలూ ఇతోధికంగా పెరిగాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు మాత్రం బాగా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. సంపదంతా ప్రధానంగా నగర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. మరోవైపు అవినీతి, అవ్యవస్థ నానాటికీ పెచ్చరిల్లాయి. స్థానిక ప్రభుత్వ పెద్దలు బడ్జెట్ కేటాయింపులను ఇష్టారాజ్యంగా భోంచేయడం ప్రారంభించారు. దాంతో కొన్నేళ్లుగా దేశంలో రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. గత రెండేళ్లలోనే ఏకంగా ఐదుగురు అధ్యక్షులు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో లెఫ్టిస్టు అయిన కాస్టిలోపైనా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణల దాకా వెళ్లడమే గాక రెండుసార్లు అభిశంసన ప్రయయత్నాలూ జరిగాయి. గత డిసెంబర్లో మరోసారి అభిశంసనకు రంగం సిద్ధమవడంతో కాంగ్రెస్ను రద్దు చేసి డిక్రీ ద్వారా పాలించేందుకు కాస్టిలో విఫలయత్నం చేశారు. అదే అభియోగంపై చివరికి ఆయన్ను పదవి నుంచి దింపి ఖైదు చేసి బొలార్టే పదవిలోకి వచ్చారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల్లో కాస్టిలోకు విపరీతమైన ఆదరణ ఉండటంతో ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలకు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 50 మందికి పైగా బలయ్యారు. అల్లకల్లోలం ► ఆందోళనల దెబ్బకు దేశంలో అవ్యవస్థ రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. రోడ్డు, రైలు, విమాన తదితర రవాణా సేవలన్నీ స్తంభించాయి. ► మైనింగ్ తదితర కార్యకలాపాలకూ తీవ్ర విఘాతం కలిగింది. ► అపారమైన ఖనిజ నిల్వలున్నా పేదరికంలో మగ్గుతున్న దక్షిణ ప్రాంతాల్లో నిరసనలు బాగా జరుగుతున్నాయి. ► వీటిపై బొలార్టే బలప్రయోగానికి దిగుతున్నారు. అవసరమైతే ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నారు. ఇది మరింత అస్థిరతకు, సామాజిక విభజనకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటమి తట్టుకోలేక విధ్వంస రాజకీయాలు
-
బోల్సోనారోపై విచారణకు బ్రెజిల్ సుప్రీంకోర్టు ఓకే
రియోడీజనీరో: జనవరి 8వ తేదీన బ్రెజిల్ రాజధానిలో జరిగిన విధ్వంసానికి కారకులను గుర్తించేందుకు మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తదితరులపై విచారణకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అల్లర్లు జరిగిన రెండు రోజుల తర్వాత బోల్సోనారో ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘దేశ సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కారణంగానే లులా డిసిల్వా అధ్యక్షుడయ్యారే తప్ప, ప్రజల ఓట్లతో కాదు’ అంటూ అందులో వ్యాఖ్యానించారు. దీనిని బట్టి బోల్సోనారో కొట్లాటలను ప్రేరేపించినట్లుగా ఉందని దేశ ప్రాసిక్యూటర్ జనరల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేసిన వినతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ డి మోరెస్ విచారణకు అనుమతి మంజూరు చేశారు. కాగా, ఆ వీడియోను అనంతరం బోల్సోనారో తొలగించారు. -
ప్రజాస్వామ్య పరిహాస క్రీడ
కింద పడ్డా పైచేయి నాదే అనడమంటే ఇదే. బ్రెజిల్లో ఎన్నికల తుది ఫలితాలొచ్చి రెండున్నర నెలలైనా వాటిలో మతలబు ఉందంటున్న తాజా మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సనారో మాటలు, ఆయన మద్దతుదారుల చేష్టలు అచ్చంగా అలాగే ఉన్నాయి. ఆ దేశ రాజధాని బ్రసీలియాలోనే సైనిక శిబిరాల సమీపంలో మకాం వేసిన బోల్సనారో భక్తులు సైనిక జోక్యంతోనైనా కొత్త దేశాధ్యక్షుడైన వామపక్ష లూలాను పదవి నుంచి తప్పించాలని పట్టుబట్టడం విడ్డూరం. పది వారాలైనా ఫలితం లేక వందల మంది జనవరి 8వ తేదీ ఆదివారం విధ్వంసానికి దిగిన దృశ్యాలు నివ్వెరపరుస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియపై బురద జల్లి, ప్రజాస్వామ్యానికి పాతర వేసే ప్రయత్నాలు ఆందోళనకరం. సరిగ్గా రెండేళ్ళ క్రితం అధ్యక్ష ఎన్నికల అనంతరం అమెరికాలో జరిగిన పరిణామాలను బ్రెజిల్లోని తాజా దాడులు గుర్తుచేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైనప్పుడు 2021 జనవరి 6న ఆయన మద్దతుదారులు ఇలాగే వ్యవహరించారు. వాషింగ్టన్లోని ఆ దేశ పార్లమెంట్ భవనంపై వారు దాడికి దిగితే, తాజాగా బ్రెజిల్లో బోల్సనారో సమర్థకులు అధ్యక్ష భవనం, పార్ల మెంట్ భవనం, సుప్రీమ్ కోర్ట్లలో చొరబడి, విధ్వంసం సృష్టించారు. ఓటమి పాలయ్యాక జనంలోకి రాకుండా కాలక్షేపం చేస్తున్న బోల్సనారో జనవరి 1న లూలా పదవీ ప్రమాణానికి రెండు రోజుల ముందే అమెరికాకు చెక్కేశారు. కొత్త దేశాధ్యక్షుడికి దండాన్ని అందించే సంప్రదాయాన్నైనా పాటించక ముఖం చాటేయడం ఆయన మనోభావాలకీ, వాస్తవ నిరాకరణ దృక్పథానికీ అద్దం. గత అక్టోబర్ 30న ముగిసిన బ్రెజిల్ ఎన్నికల్లో అతివాద ఛాందస నాయకుడు, అప్పటి దేశాధ్య క్షుడు బోల్సనారో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దేశానికి మరోసారి ఘనకీర్తి కట్టబెడతానని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన ఆయన ఓ పట్టాన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మాటకొస్తే ఎన్నికల్లో ఓటమికి చాలాకాలం ముందు నుంచే ఆయన ఓ పల్లవి అందుకున్నారు. తానంటూ తిరిగి ఎన్నిక కాకపోతే, అది ఎన్నికల్లో మోసం వల్లేనని పాట పాడసాగారు. ప్రజాతీర్పు ప్రతికూలంగా వచ్చాకా ఆ మాటే ప్రచారంలో పెడుతున్నారు. ఆయన సమర్థకుల్లో నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు – ధని కులు, పేదలు – యువకులు, వృద్ధులు... ఇలా అందరినీ కలిపిన సూత్రం – కమ్యూని జమ్పై విద్వేషం. అంతా కలసి పార్లమెంటరీ చిహ్నాలపై దాడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఈ ఘర్షణల్లో తన ప్రమేయం లేదని బోల్సనారో చేతులు దులుపుకొంటున్నారు. కానీ, ప్రాసంగిక సాక్ష్యాధారాలు విరుద్ధంగా ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులను ‘దొంగలు’గా పేర్కొంటూ, తాను ఓడిపోతే హింస తప్పదని ఎన్నికలప్పుడే ఆయన సెలవిచ్చారు. ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి నేటికీ సాగుతున్న ఆయన సమర్థకుల నిరసనలు, విధ్వంసాలు అందుకు ఆచరణరూపమే. వాట్సప్, టెలిగ్రామ్ ద్వారా అనేక రోజుల క్రితమే ఈ దాడులకు వ్యూహం, నిర్వహణ జరిగిందట. బ్రెజిల్లోని వివిధ రాష్ట్రాల నుంచి పదులకొద్దీ బస్సుల్లో వచ్చి, విధ్వంసం రేపిన వ్యక్తుల వెనుక బోల్సనారో పాలనలో యథేచ్ఛగా సాగిన పర్యావరణ విధ్వంసక వర్గాల డబ్బు ఉందనీ వినిపిస్తోంది. ప్రజా స్వామ్య పాలనను అడ్డుకోవాలనే ఈ తెర వెనుక వ్యక్తుల వ్యవహారం మరింత ఆందోళనకరం. రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసి, 2.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కల్పించిన చరిత్ర లూలాది. కమ్యూనిజాన్ని బూచిగా చూపి, అవినీతి ముద్ర వేసి ఓటర్ల దృష్టి మరల్చి, పబ్బం గడుపుకోవాలన్న బోల్సనారో పాచిక తాజా ఎన్నికల్లో పారలేదు. అదీ స్వయంకృతమే. దేశంలో 7 లక్షల పైగా మరణాలతో కరోనా కట్టడిలో వైఫల్యం, అమెజాన్ అడవుల నరికివేత, కునారిల్లిన ఆర్థిక వ్యవస్థ వగైరా ఆయనకు శాపాలయ్యాయి. అయితే, వర్గాలుగా చీలిన సమాజంలో లక్షలాది ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై అపనమ్మకం, లూలా అన్నా, వామపక్షమన్నా లేనిపోని భయం కలిగించడంలో బోల్సనారో కొంత విజయవంతమైనట్టే ఉన్నారు. ఇప్పుడదే దేశానికి పెనుశాపం. తాజా విధ్వంసాలను ఆ కోణంలోనూ చూడాలి. బాధ్యులను గుర్తించి, దురంతాలను ఉక్కుపాదంతో అణచాలి. 1980లలో నిరంకుశత్వం నుంచి బ్రెజిల్ బయటపడినా, బోల్సనారోకు సైనిక నియంతృత్వం పైనే మక్కువ. ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం లేని ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర మితవాదులతో, సంపన్న వర్గాలతో అంటకాగారు. ఆ ప్రయోజనాలకు లూలా అడ్డు అన్నదే ఆయన కడుపు మంట. ఈ సవాలును కొత్త అధ్యక్షుడు ఎంత సమర్థంగా ఎదుర్కొంటారో చూడాలి. ఫాసిస్టు ధోరణులకు అడ్డుకట్ట వేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం, గౌరవం కలిగించడం తక్షణ లక్ష్యం. ట్రంప్ ప్రవర్తన నుంచి ప్రేరణ పొందిన బోల్సనారో ఇకనైనా మూర్ఖత్వం వీడాలి. ఓటమిని హుందాగా అంగీకరించాలి. రాజ్యాంగానికి కట్టుబడేలా తన మద్దతుదారులకు నచ్చజెప్పాలి. ఆగని ఈ ఎన్నికల సంక్షోభం నుంచి ఎంత తొందరగా బయటపడితే 21.5 కోట్ల బ్రెజిలియన్లకూ అంత మంచిది. ‘బ్రిక్స్’ గ్రూపులో çసభ్యదేశంగా, ద్వైపాక్షికంగా బ్రెజిల్తో భారత్కు సత్సంబంధాలు న్నాయి. బోల్స్నారోను గతంలో మిత్రుడిగా భావించిన ప్రధాని మోదీ సైతం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన తాజా ఘటనల్ని ఖండించారు. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్యాలూ ముందుకొచ్చి, మితవాద విద్రోహులకు ఊతమివ్వబోమని తెలిసేలా చేయాలి. ప్రజాస్వామ్య సుస్థిరతకు భంగం కలిగే ఏ పరిణామం వాంఛనీయం కాదు. ఎందుకంటే, బ్రెజిల్ హింసాత్మక గతాన్ని విస్మరించలేం. నియంతృత్వాలకూ, నిరంకుశత్వానికీ పేరుబడ్డ దక్షిణ అమెరికాలో కేవలం కొన్ని పదుల వసంతాల ఈ యువ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ దేశ ప్రజలు, పార్టీలదే! -
బ్రెజిల్ రణరంగం: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత
ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో. 67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్లో చేరినట్లు బ్రెజిల్కు చెంది ఓ గ్లోబో న్యూస్పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. - Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos. - Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA. - Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc — Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023 మద్దతుదారుల దురాక్రమణ.. బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన -
బ్రెజిల్ అల్లర్లు.. గవర్నర్ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు..
బ్రెజీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు ఆదివారం విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 3,000 మంది పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ ప్యాలెస్పై దాడి చేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అయితే భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. దీంతో బ్రెజీలియా గవర్నర్ను సస్పెండ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మూడు నెలల పాటు అతన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. రాజధానిలో విధ్వంసం సృష్టించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రెజిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అల్లరిమూకలు దేశ రాజధానిలో హింసకు పాల్పడ్డాయని విమర్శించారు. రాజధానిలో భద్రతా వైఫల్యానికి బోల్సోనారోనే కారణమని లూలా ఆరోపించారు. ఫెడరల్ సెక్యూరిటీ జోక్యం చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. విధ్వంసకారులను మతోన్మాద నాజీలు, మతోన్మాద స్టాలిన్లు, ఫాసిస్టులుగా అభివర్ణించారు. దాడులకు పాల్పడ్డవారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బోల్సోనారో పార్టీపై స్వల్ప సీట్ల తేడాతో గెలిచారు లూలా. అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే బోల్సోనారో ఈయన విజయంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి రాజధానిలో బ్రెజీలియాలో ఆదివారం విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖండించారు. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
రణరంగంగా బ్రెజిల్.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన
రియో డీ జనీరియో: బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికార నివాసం, కాంగ్రెస్, సుప్రీంకోర్టు భవనాల ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసంచేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూర్చొనే ప్రధాన బల్లాను ధ్వంసంచేశారు. కోర్టు ఆవరణలోని పురాతన విగ్రహాన్ని కూలదోశారు. ‘‘బోల్సోనారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చర్యలు తీసుకోవాలి. డ సిల్వాను దింపేయాలి’’ అని డిమాండ్చేస్తున్నారు. భవనాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లనూ ధ్వంసంచేశారు. వారాంతం కావడంతో భవనాల్లో సిబ్బంది అంతగా లేరు.ఊహించని ఘటనతో ఉలిక్కిపడిన సైన్యం వెంటనే రంగ ప్రవేశం చేసింది. భవనాల ప్రాంగణాల్లోని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్లను ప్రయోగించింది. 300 మందిని అరెస్ట్చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని బోల్సోనారో ఒప్పుకోక మద్దతుదారులను ఉసిగొల్పడం ఇంతటి ఆందోళనకు కారణమైంది. రెండేళ్ల క్రితం అమెరికా పార్లమెంట్పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని ఈ ఘటన గుర్తుకుతెచ్చింది. ఫాసిస్టు శక్తుల విలయం: డసిల్వా ఆందోళనలపై డ సిల్వా ఆగ్రహించారు. ‘‘ఫాసిస్ట్ శక్తులు చెలరేగిపోయాయి. దీనిపై సత్వరం స్పందించని పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అన్నారు. ఇలాంటి ఘటన జరిగే ప్రమాదముందని కొన్నినెలలుగా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తుండటం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 30న డ సిల్వా గెలుపు తర్వాత మొదలైన నిరసనలు ఆనాటి నుంచి ఆగలేదు. రోడ్ల దిగ్బంధం, వాహనాల దగ్ధం, సైన్యం జోక్యంచేసుకోవాలంటూ సైనిక కార్యాలయాల వద్ద ఆందోళనకారుల బైఠాయింపులతో నిరసనలు దేశమంతటా కొనసాగుతుండటం తెల్సిందే. ప్రపంచ దేశాధినేతల ఆందోళన బ్రెజిల్లో అధికార కేంద్రాలైన ప్రధాన భవనాలపై దాడిని పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. ‘ప్రజాస్వామ్యాన్ని కూలదోసే ప్రతి చర్యనూ ఖండిస్తాం. పాలనలో అధ్యక్షుడు డ సిల్వాకు సాయంగా ఉంటాం’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. ‘ ఎన్నికల ద్వారా డ సిల్వా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజాభిష్టాన్ని గౌరవించాలి’ అంటూ దాడులను ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆందోళనకారులనుద్దేశిస్తూ.. ‘ఎన్నికలు అనే ప్రజాస్వామ్య సంప్రదాయాలను అందరూ గౌరవించాల్సిందే. ఈ విషయంలో డ సిల్వా సర్కార్కు మా పూర్తి మద్దతు ఉంటుంది’ అని మోదీ అన్నారు. ⚠️#BREAKING | 📍#BRAZIL THE NATIONAL CONGRESS BUILDING IS BEING TOTALLY OCCUPIED BY PROTESTERS pic.twitter.com/tDKIMcIkiR — Direto da América (@DiretoDaAmerica) January 8, 2023 Some police officers of Rio de Janeiro refuse to disperse Bolsonaro supporters and clearly express their support for the protestors, according to the Clash Report. #Brazil pic.twitter.com/lLkduuBvPD — Stephiereine28🇺🇲🍊 (@stephiereine) January 9, 2023 -
బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా
బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్ లులా(77) ఎన్నికయ్యారు. ఆదివారం(అక్టోబర్ 30) జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోను ఓడించి బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇరువురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్వల్ప తేడాతో బోల్సోనారోపై లులా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో లులాకు 50.9శాతం ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఆ దేశ అత్యున్నత ఎన్నికల విభాగం తెలిపింది. తాజా ఎన్నికతో లులా డ సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ప్రెసిడెంట్గా చేశారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వా.. అధికారం కోల్పోయి తర్వాత అవినీతి ముద్రతో జైలుకు వెళ్లారు. బయటకు వచ్చి రాజకీయ పోరాటంలో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు లులా డ సిల్వా. ‘దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తాను. ఆయుధాల వినియోగాన్ని తగ్గించేందుకు పాటుపడతాం. అలాగే అమెజాన్ అడవులను రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం కావాలి. ప్రపంచ దేశాలు అందుకు సహకరించాలి. ప్రపంచ వ్యాణిజ్యం మరింత పారదర్శకంగా చేస్తాం.’ అని పేర్కొన్నారు లులా. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన క్రమంలో 2018లో పోటీ చేసేందుకు అనర్హులుగా మారారు లులా. 2021లో ఆయనపై ఉన్న కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వాకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అంతర్జాతీయ అంశాలపై సహకారం అందిస్తామన్నారు. Congratulations to @LulaOficial on winning the Presidential elections in Brazil. I look forward to working closely together to further deepen and widen our bilateral relations, as also our cooperation on global issues: PM @narendramodi — PMO India (@PMOIndia) October 31, 2022 ఇదీ చదవండి: Morbi Tragedy: కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై పుతిన్ సంతాపం -
చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ
ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన కూడా వెళ్లిన ఓ ఆదివాసి ఉద్యమకారుడు.. అమెజాన్ అడవుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్లను చంపి ముక్కలుగా నరకడమే కాదు.. విడి భాగాలు దొరక్కుండా పూడ్చిపెట్టారు ఇద్దరు అన్నదమ్ములు. అమెజాన్ అడవుల్లో పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ వ్యవహారాలను బయటపెడతారనే భయంతోనే ఈ జంట హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో తాజాగా ఘోరం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్, అక్రమ చేపల వేట, డ్రగ్స్ రవాణా నేరాలకు నెలవైన ప్రాంతంలో ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన వెంట ఉన్న ఆదిమ తెగకు చెందిన బ్రూనో పెరెయిరా(అమెజాన్ ఆదిమ తెగల హక్కుల పరిరక్షకుడు) హత్యకు గురయ్యారు. వీళ్లిద్దరినీ అక్కడ ఇల్లీగల్ వ్యవహారాలు(చేపల వేట, డ్రగ్స్ మాఫియా) నడిపించే ఒలీవెరియా బ్రదర్స్ హతమార్చినట్లు తేలింది. తొలుత ఈ కేసులో.. అమరిల్డో ఒలీవెరియాను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ద్వారా అమెజోనాస్లోని ఇటాక్యూవాయి నదీ తీరం వెంట పాతిపెట్టిన మృతదేహాల శకలాలను అతికష్టం మీద వెలికి తీశారు బ్రెజిల్ పోలీసులు. ఇందుకోసం నాలుగు రోజులపాటు గాలింపు చర్యలు సాగాయి. ఇక ఈ జంట హత్యల్లో ఒలీవెరియా సోదరుడు ఒసెనే ఒలీవెరియాను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో జరుగుతున్న అక్రమ దందాలను బయటపెట్టే ఉద్దేశంతో.. ఫిలిప్స్,పెరెయిరా విచారణ కోసం వెళ్లారు. అయితే జూన్ 5వ తేదీ నుంచి వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫిలిప్స్ భార్య అలెస్సాండ్రా సంపాయో న్యాయం కోసం పోరాటానికి దిగారు. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా మద్ధతు పెరిగింది. మిస్టరీని త్వరగా చేధించాలని పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే.. ఆ ప్రాంతంలో ఇల్లీగల్ వ్యవహారాలకు కారణమయ్యే అమరిల్దోను అరెస్ట్ చేశారు. ఆపై అతన్ని, అతని సోదరుడైన ఒసెనేను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఇద్దరూ కూడా మత్స్యకారులనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిలిప్స్(57) గార్డియన్తో పాటు ఎన్నో అంతర్జాతీయ పత్రికలకు పని చేశారు. ఇక పెరెయిరా(41) ఆదిమ తెగల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమవేత్త, న్యాయవాది. బ్రెజిల్ ఆదిమ తెగల వ్యవహారాల సంస్థలో పని చేస్తున్న ఆయన.. సెలవులు తీసుకుని మరీ ఫిలిప్స్ వెంట అమెజాన్ అడువుల్లోకి వెళ్లారు. బోల్సోనారో బలుపు వ్యాఖ్యలు ఇదిలా ఉంటే.. ఈ జంట హత్యల మీద బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘‘ఆయన(ఫిలిప్స్ను ఉద్దేశించి)కు వేరే పని లేదేమో. ఏం దొరకనట్లు.. పర్యావరణ సంబంధిత కథనాలు, ఇల్లీగల్ మాఫియాల మీద స్టోరీలు రాశారు. యూరప్వాడు కదా! బహుశా అందుకే అక్కడి వాళ్లకు నచ్చక.. ఆయన్ని చంపి ఉంటారంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ప్రభుత్వం పని అడవుల్ని పరిరక్షించడం.. అక్కడి క్రిమినల్స్ను నియంత్రించడం కాదు అంటూ వ్యాఖ్యానించారాయన. ‘‘ఒకవేళ వాళ్లిద్దరినీ చంపి ఉంటే.. కచ్చితంగా నీళ్లలో పడేసి ఉంటారు. ఆ నీళ్లలో పిరానా(రాక్షస చేపలు)లు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు’’ అంటూ తిక్క తిక్క ప్రసంగంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు బోల్సోనారో. అమెజాన్ మీద పుస్తకం రాస్తున్న తరుణంలోనే ఫిలిప్స్ ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. ఇక పరెయిరాకు గతంలోనూ ఇల్లీగల్ మాఫియాల నుంచి బెదిరింపులు వచ్చాయి. అమెజాన్ అడవుల్లో ఇల్లీగల్ దందాలు, కార్యకలాపాలు జరుగుతున్నా.. ఆయా దేశాల ప్రభుత్వాలు ముఖ్యంగా బ్రెజిల్ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ వస్తోంది. -
నరేంద్ర మోదీ.. తగ్గేదేలే!
One Crore Subscription Completed For Modi Youtube: సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా అరుదైన రికార్డు ఆయన సొంతం అయ్యింది. ప్రపంచంలోని టాప్ లీడర్స్కు సాధ్యం కానీ మైలురాయిని చేరుకున్న మోదీ. ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లతో దూసుకుపోతోంది నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్. తాజాగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకుల యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో మోదీనే టాప్. ఆయన దరిదాపుల్లో ఏ ప్రపంచ నేత కూడా లేకపోవడం విశేషం. రెండో ప్లేస్లో 36 లక్షల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. 30.7 లక్షల సబ్స్క్రైబర్లతో మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ మూడో స్థానంలో ఉండగా.. 28.8 లక్షల సబ్స్క్రైబర్లతో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మూడో స్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం 7.03 లక్షలు మాత్రమే. ఇటు.. దేశంలో మోదీ తర్వాత అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నేతలను గమనిస్తే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్కి 4.39 లక్షలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షలు, తమిళనాడు సీఎం స్టాలిన్కి 2.12 లక్షలు, ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2007 అక్టోబరు 26న నరేంద్ర మోదీ పేరిట యూట్యూబ్ ఛానెల్ పప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మోదీకి సంబంధించిన చాలా అంశాల వీడియోలతో పాటు, బాలీవుడ్ ప్రముఖలతో పాల్గొన్న పలు వీడియోలు, కరోనా విజృంభణ సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. మిగతా వాటిల్లోనూ.. యూట్యూబ్తో పాటు ఇతర సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ఫామ్ల్లోనూ ప్రధాని మోదీకి ఫాలోవర్లు ఎక్కువే. మోదీ ట్విట్టర్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 7.53 కోట్లు కాగా, ఆయన ఫేస్బుక్ను 4.68 కోట్ల మంది అనుసరిస్తున్నారు. -
ఆస్పత్రి పాలైన బోల్సోనారో.. కోలుకోవద్దంటూ నెటిజనుల ఆగ్రహం!
సావో పాలో: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురై సోమవారం ఆస్పత్రిలో చేరారు. కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పేగుకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు. 66 ఏళ్ల జైర్ బోల్సోనారో 2018 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా టైంలో బోల్సోనారో నిర్ణయాల వల్ల బ్రెజిల్ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. మాస్క్ అక్కర్లేదంటూ, వ్యాక్సినేషన్ వద్దంటూ నిర్ణయాలు తీసుకుని విమర్శలపాలయ్యాడు. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్లలా మారిపోవచ్చు తద్వారా బ్రెజిల్లో లక్షల్లో కరోనా మరణాలు సంభవించగా.. బోల్సోనారో తీరును వ్యతిరేకిస్తూ జనాలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయడం ప్రపంచం మొత్తం వీక్షించింది. ఈ తరుణంలో బోల్సోనారో కోలుకోవద్దంటూ పలువురు సోషల్ మీడియాలో కోరుకుంటుండడం గమనార్హం. - Comecei a passar mal após o almoço de domingo. - Cheguei ao hospital às 03h00 de hoje. - Me colocaram sonda nasogástrica. - Mais exames serão feitos para possível cirurgia de obstrução interna na região abdominal. pic.twitter.com/NPgv6HwoHj — Jair M. Bolsonaro (@jairbolsonaro) January 3, 2022 సంబంధిత వార్త: బోల్సోనారో ఓ ‘రక్తపిశాచి’ అంటూనే.. నిరసనకారుల ఘోర తప్పిదం -
Covaxin: రాజకీయ దుమారం.. బ్రెజిల్ డీల్ క్యాన్సిల్!
అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా.. భారత్ బయోటెక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్తో కుదుర్చుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కరోనా కారణంగా 2లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడిపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ త్వరగతిన సరఫరా కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సొనారో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్తో ఒప్పందం కుదర్చుకున్నారు. భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసేందుకు బొల్సొనారో మధ్యవర్తిగా ప్రముఖ ఫార్మసంస్థ ప్రెసిస మెడికామెంటోస్,ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ అనుమతించారు. ఈ క్రమంలో... ఒక్కోడోసు 15 డాలర్ల చొప్పున 300 మిలియన్ డాలర్లు విలువ చేసే 20 మిలియన్ డోసులను తెప్పించుకునేందుకు బొల్సొనారో సర్కార్ ఒప్పందం చేసుకుంది.. అయితే ఈ వ్యాక్సిన్ ఒప్పందంలో బొల్సొనారోపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవాగ్జిన్ను తన సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముడుపులు అందుకున్నారని ఆయనపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీకా అనుమతుల్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఆ వెంటనే.. బ్రెజిల్ సైతం తమ దేశంలో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ మూడోదశ నిర్వహించడాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఒప్పందం రద్దైనప్పటికీ .. కోవాగ్జిన్ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్ బయోటెక్ కలిసి పని చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
10 రోజులుగా ఎక్కిళ్లు.. ఆస్పత్రి పాలైన అధ్యక్షుడు
బ్రసీలియా: జైర్ బోల్సోనారోను 10 రోజులుగా వెక్కిళ్లు వేధించసాగాయి. ఆయన పేగులో సమస్య తలెత్తిందని.. ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స అవసరమని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బోల్సోనారోను పరీక్షల కోసం సావో పాలోలోని విలా నోవా స్టార్ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కార్యాలయం బుధవారం పేర్కొంది. ఈ ఘటనపై బోల్సోనారో కుమారుడు ఫ్లావియో మాట్లాడుతూ.. తన తండ్రి బోల్సోనారోను బ్రసిలియాలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా బోల్సోనారో సావో పాలో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే.. ఆస్పత్రిలో బెడ్పై పడుకుని పడుకుని, సెన్సార్లు, కేబుళ్లు అమర్చి చికిత్స అందిస్తున్న ఫోటోను పేస్బుక్లో "ప్రతి ఒక్కరి మద్దతు, ప్రార్థనలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ పోస్ట్ చేశారు. కాగా జైర్ బోల్సోనారో 2018లో ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనపై కత్తితో దాడి చేశారు. ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొవాగ్జిన్ డీల్కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఖండించారు. అయితే ఇటీవలి జరిగిన ఎన్నికల్లో అతనిపై జనాదరణ తగ్గిపోతోంది. దీంతో ఇది వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ఇక జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు బ్రెజిల్లో 5,35,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
Vaccine Corruption Scandal: బొల్సొనారోకు భారీ షాక్
కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసుల కోసం భారత్ బయోటెక్తో బ్రెజిల్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. ఆపై ముడుపుల విమర్శలతో రద్దు చేసుకున్న పంచాయితీ బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనల మధ్య బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు భారీ షాకిచ్చింది అక్కడి అత్యున్నత న్యాయస్థానం. ఈ భారీ కుంభకోణంలో బొల్సొనారోతో సహా కీలక పదవుల్లో ఉన్నవాళ్లను సైతం విచారించాలని దర్యాప్తు బృందాలను ఆదేశించింది బ్రెజిల్ సుప్రీం కోర్టు. సావ్ పాలో: కొవాగ్జిన్ డీల్కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. శుక్రవారం రాత్రి హడావిడిగా ఆదేశాలను జారీ చేసిన జస్టిస్ రోసా వెబర్.. 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు విధించారు. మరోవైపు బ్రెజిల్ కాగ్(సీజీయూ)ను ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరింది న్యాయస్థానం. తగ్గని ఆగ్రహజ్వాలలు కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడంటూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేల మంది యాంటీ-బొల్సొనారో ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనాతో ఐదు లక్షల మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడంటూ బొల్సొనారోపై హత్యాయత్నం కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ ముడుపుల ఆరోపణలు రావడంతో వాళ్లలో మరింత ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో మూడురోజులుగా రోడెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శనివారం సైతం పార్లమెంట్ ఆవరణలో వీళ్లు నిరసనలు చేపట్టారు. ఇక బొల్సొనారోను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పాత-కొత్త ఆరోపణలు(కొవాగ్జిన్ డీల్ అంశం సహా), వివాదాలను ప్రస్తావిస్తూ ఈ వారంలోనే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. చదవండి: బొల్సొనారో రక్తపిశాచి.. జనాగ్రహంతో పెరిగిన కరోనా! అఘమేఘాల మీద రద్దు కాగా, ఈ ఫిబ్రవరిలో కొవాగ్జిన్ డోసుల కోసం బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్తో ఒప్పందం చేసుకుంది. ఒక్కో డోస్కు 15 డాలర్ల చొప్పున.. సుమారు 2 కోట్ల డోసుల సరఫరాకు ఆ ఒప్పందం జరిగింది. ఈ డీల్ విలువ వేల కోట్లు కాగా, దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీ ప్రిసిసా మెడికంతోస్తో పాటు.. బొల్సొనారోకు సైతం ముట్టినట్టు ప్రతిపక్ష సెనేటర్లు ఆరోపించారు. అయితే ఈ డీల్లో ఆరోపణలతో తమకు సంబంధం లేదని భారత్ బయోటెక్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ముందస్తు చెల్లింపులు తమకు జరగలేదని, ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. అయితే అత్యవసర అనుమతులు మాత్రం ఈమధ్యే జరిగాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈలోపే బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. చదవండి: వ్యాక్సిన్తో మొసళ్లుగా మారుతున్న మనుషులా? -
Covaxin: భారత్ బయోటెక్కు మరోసారి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ డీల్ను బ్రెజిల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2 కోట్ల కోవాగ్జిన్ సరఫరాకు బ్రెజిల్తో భారత్ బయోటెక్ ఒప్పందం కురుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.2,234 కోట్లు, కాగా, వ్యాక్సిన్ సరఫరాలో ముడుపులు ముట్టాయని సెనేటర్స్ ఆరోపణ. దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీతో పాటు.. బ్రెజిల్ ప్రెసిడెంట్కి ముట్టినట్టు సెనేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని అంటున్నారు. చదవండి: కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు -
వారు గాడిదపై ప్రయాణిస్తున్నట్టున్నారు!
బ్రెసీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్షల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన బ్రెజిల్లోని ఆగ్నేయ రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోను సందర్శించి పలు ప్రజా ప్రాజెక్టులను ప్రారంభించడానికి వెళ్లారు. ఆ సమయంలో అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఓ విమానంలోకి ఎక్కి వారికి హలో చెప్పారు. అయితే ఆ క్షణం ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. కాగా వెనుక నుంచి ప్రయాణీకుల్లో కొందరు మధ్య వేలును చూపుతూ.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గెట్ అవుట్, బోల్సోనారో!", "జెనోసిడల్ ఉన్మాది!" అంటూ పలువురు ఘాటుగా విమర్షించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. బయటకు వెళ్లండి అనేవారు గాడిదలపై ప్రయాస్తున్నట్టున్నారు అంటూ చమత్కరించారు. ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిపై పోరులో బోల్సోనారో తరచుగా ఫేస్ మాస్క్లు, లాక్డౌన్, వ్యాక్సిన్లను విమర్శించారు. కాగా బ్రెజిల్లో కరోనా మహమ్మారి బారిన పడి 4,80,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అమెరికా తరువాత అత్యధిక మరణాలు బ్రెజిల్లోనే చోటుచేసుకున్నాయి. Jair Bolsonaro tried to take a plane. This is how it went. pic.twitter.com/xOer7Kdo2M— Brasil Wire (@BrasilWire) June 11, 2021 చదవండి: వైరల్: పారాచూట్తో ఫుట్బాల్ గ్రౌండ్కి.. పసుపు కార్డుతో రిఫరీ -
Brazil: జనాగ్రహంతోనూ కరోనా విలయం!
కరోనా జస్ట్ ఎ ఫ్లూ అనే స్టేట్మెంట్ ఇచ్చిన తిట్లు తిన్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో శైలిపై తీవ్ర దుమారం రేగుతోంది. తమ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు కారకుడంటూ ఆయనపై వేల క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో బోల్సోనారోకు వ్యతిరేకంగా ఓవైపు ప్రజలు నిరసనలు చేపడుతుంటే.. ఆ నిరసనల వల్ల కేసుల తారాస్థాయి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బ్రసీలియా: కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సొంత దేశ ప్రజలు ఆయన మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణకు అనుమతులు, ఫలితంగానే వైరస్ వ్యాప్తికి కారకుడయ్యాడంటూ మండిపడుతున్నారు. అయితే బోల్సోనారో మీద కోపంతో చేస్తున్న నిరసనలే ఇప్పుడు అక్కడ కొంప ముంచుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. పెరుగుతున్న కేసులు బోల్సోనారోకి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్కు వ్యతిరేకంగా ఆయన చేసిన కామెంట్స్, పైగా ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లకు మరోసారి అనుమతులు ఇవ్వడంపై వేల మంది రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వైరస్ బారిన పడుతున్న వారిలో నిరసనకారులు కూడా ఉంటున్నారని న్యూయార్క్కి చెందిన ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రచురించింది. కిందటి నెలలో బ్రసీలియాలో చేపట్టిన పదివేల మంది నిరసనకారుల్లో.. 2 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. వాళ్లలో 189 మంది చనిపోయినట్లు ఆ వెబ్ సైట్ కథనం పేర్కొంది. అలాగే పోయిన శనివారం కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు దిగారు. 16 నగరాల్లోని వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు బోల్సోనారోని ‘రక్త పిశాచి’గా పేర్కొంటూ సావోపాలో బెలూన్లు ప్రదర్శించారు. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న సుమారు 22 వేలమంది కరోనా బారినపడ్డారని, 380 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ కథనం ప్రస్తావించింది. మరోవైపు ఈ కథనంపై స్పందించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం నిరాకరించింది. తగ్గని మరణాలు కాగా, బుధవారం తన పాలనలో జరిగిన అభివృద్ధి గురించి జాతిని ఉద్దేశించి బొల్సొనారో ప్రసగించాడు. ఈ విషయం ముందే తెలియడంతో ఆ టైంకి ప్రజలంతా ప్లేట్లు, చప్పట్లతో నిరసన తెలియజేశారు. అయితే వీధుల్లోకి వేలమంది గుంపులుగా రావడం, మాస్క్లు లేకుండా నిరసనల్లో పాల్గొనడం ఆందోళన కలిగిస్తోందని బ్రెజిల్ ఆరోగ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనల టైంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలా ఉంటే బ్రెజిల్లో మరణాల లెక్కలు మాత్రం తగ్గట్లేదు. బ్రెజిల్లో కరోనా విజృంభణ తర్వాత ఒకానొక తరుణంలో నాలుగు వేలకు పైగానే మరణాలు సంభవించాయి. బుధవారం కూడా లక్ష కేసులు, ఇరవై ఐదు వందలకుపైగా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు సంయమనం పాటించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: రూల్స్ పాటించరా? అయితే.. -
బ్రెజిల్లో మరణ మృదంగం
బ్రెజీలియా: బ్రెజిల్లో కోవిడ్ –19 విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. రోజుకి సగటున 2 వేల మంది ప్రాణాలను కరోనా బలి తీసుకుంటోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైంది బ్రెజిల్లోనే. ఇప్పటివరకు 2,59,271 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నట్టుగా వరల్డో మీటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఊహించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మొదట్నుంచి నిర్లక్ష్యమే: కరోనాని కట్టడి చేయడంలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో మొదట్నుంచి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వైరస్ని తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. మాస్కులు తప్పనిసరి చేయలేదు. లాక్డౌన్ విధించడానికి ఇష్టపడలేదు. ప్రజలు కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. బ్రెజిల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిగా సాగుతోంది. చైనా తయారీ కరోనావాక్, ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ఇస్తోంది. ఇప్పటివరకు 71 లక్షల మందికి ఒక్క డోసు, 21 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చింది. కేసుల తీవ్రతకి అమెజాన్ అడవులు బాగా విస్తరించిన మానస్ నగరం నుంచి నుంచి వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్ పీ1 కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న అభినందన
జెనీవా: కరోనా వైరస్తో అతలాకుతలమైన బ్రెజిల్కు భారత్ 20 లక్షల డోసుల్ని పంపడంపై బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీని వినూత్నంగా అభినందించారు. కరోనా వ్యాక్సిన్ను హనుమంతుడు మోసుకొచ్చిన సంజీవిని పర్వతంతో పోల్చారు. ‘నమస్కార్ ప్రధాని మోదీ, ప్రపంచాన్ని పీడిస్తున్న ఒక మహమ్మారిని జయించడంలో ఒక అద్భుతమైన భాగస్వామిని పొందడం గౌరవంగా భావిస్తున్నాం. టీకా డోసుల్ని మాకు పంపించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు సంజీవిని పర్వతం స్థానంలో వ్యాక్సిన్ పర్వతాన్ని హనుమంతుడు మోసుకొస్తున్నట్టుగా ఒక చిత్రాన్ని ట్వీట్ చేశారు. భారత్ వ్యాక్సిన్ మైత్రి భేష్: డబ్ల్యూహెచ్ఓ ఇరుగు పొరుగు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఉద్దేశించిన వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు కురిపించింది. భారత్ మాదిరిగా ప్రపంచదేశాలు ఒకరికొకరు సహకరించుకుంటే త్వరలోనే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ అంశంలో నైబర్ ఫస్ట్ విధానాన్ని అవలంబిస్తున్న ప్రధాని మోదీని అభినందించారు. ‘‘కోవిడ్–19పై మీరు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. ప్రపంచ దేశాలు ఒకరికొకరు అన్నీ పంచుకుంటూ ఉంటేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుంది. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం’ అని టెడ్రోస్ ట్వీట్ చేశారు. బోల్సనారో ట్వీట్ చేసిన చిత్రం -
భారత్ సాయాన్ని హనుమాన్తో పోల్చిన బ్రెజిల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపడంతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. రామాయణంలో హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడిని కాపాడినట్టు తమ దేశాన్ని కాపాడినట్టుగా జైర్ బొల్సనారో భావించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పంపినందుకు కృతజ్ఞతలు చెబుతూ హనుమంతుడు సంజీవని (వ్యాక్సిన్) తీసుకొస్తున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ‘ధన్యవాద్ భారత్ అంటూ… హనుమంతుడు సంజీవని (వ్యాక్సిన్) తీసుకువస్తున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘నమస్కార్ ప్రైమ్ మినిష్టర్ మోదీజీ ! కోవిడ్ పై పోరులో మేం చేస్తున్న పోరుకు మీరు కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు.. ఇది మాకు గర్వకారణం కూడా’ అని తెలిపారు. అతడి ట్వీట్కు ప్రధాని మోదీ స్పందించారు. ‘కరోనా వైరస్ మీద మనం కలిసికట్టుగా చేస్తున్న పోరాటానికి మా సహకారం ఎప్పటికీ ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో ఉభయ దేశాలూ సహకరించుకోవలసిందే అని గుర్తుచేశారు. భారత్లో తయారైన వ్యాక్సిన్ను సరిపడా నిల్వలు ఉంచుకుని మిత్ర దేశాలకు భారత్ ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం బ్రెజిల్కి రెండు మిలియన్ల కోవీషీల్డ్ టీకామందు సరఫరా చేశారు. అత్యవసరంగా కోవిడ్ వ్యాక్సిన్ కావాలని బ్రెజిల్ చేసిన విజ్ఞప్తికి భారత్ స్పందించి పంపించింది. అయితే కరోనా ప్రారంభ దశలో బ్రెజిల్కు మనదేశం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
టీకా తీసుకుంటే మొసళ్లుగా మారతారు!
బ్రెసీలియా: కరోనాపై తొలి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మరోమారు తన వ్యంగ్య ధోరణిని ప్రదర్శించారు. బ్రెజిల్లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఆయన.. ఫైజర్ ఇచ్చిన కాంట్రాక్టులో స్పష్టంగా కంపెనీ ఏ సైడ్ ఎఫెక్ట్స్కు బాధ్యత వహించదని ఉందని, అందువల్ల టీకా తీసుకున్న తర్వాత ఎవరైనా మొసలిగా మారితే అది వారి సమస్యని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు సూపర్ హ్యూమన్గా మారినా, మహిళలకు గడ్డాలు వచ్చినా, మొగవాళ్ల గొంతులు మారినా, ఫైజర్ పట్టించుకోదని గుర్తు చేశారు. సోమవారం బైడెన్కు వాక్సిన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్కు సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇస్తారని అధికారులు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, నమ్మ కం కలిగించేందుకు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఇప్పటికే బైడెన్ చెప్పారు. శుక్రవారం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్కు, హౌస్ స్పీకర్ నాన్సీపెలోసికి తొలిడోసు ఇచ్చారు. తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని పెన్స్ చెప్పారు. -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే అంతేనట!
కరోనావైరస్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలతో మొదటినుంచీ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారిపోవచ్చంటూ సరికొత్త వివాదానికి తెర తీసారు. అంతేకాదు ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ కోవిడ్ వ్యాక్సిన్పై సంచలన కామెంట్స్ చేశారు. అమెరికా ఆమోదం తెలిపిన ఫైజర్ టీకాపై ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. (టీకా భద్రత : బైడైన్ దంపతుల ముందడుగు) ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు అంతానికి వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బోల్సనారో వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి. కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఫైజర్ టీకా తయారీ కంపెనీలపై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ టీకా తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇలాంటి దుష్ప్రభావాలకు తాము బాధ్యత వహించమనీ, మీరు (ప్రజలు) మొసళ్లుగా మారితే, అది మీ సమస్య అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సూపర్ హూమన్గా మారినా, మహిళలకు గడ్డం మొలిచినా, పురుషులు వేరేవిధంగా మాట్లాడినా ఔషధ తయారీదారులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ వారిపై దాడిచేశారు. టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కానీ తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు కరోనా సోకిన కారణంగా ఇప్పటికే తన శరీరంలో యాంటిబాడీస్ ఉన్నాయి.. ఇక తానెందుకు టీకా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే టీకాను తాము ఉచితంగా ఇవ్వబోతున్నామని, అలాగని టీకా తప్పనిసరి కాదన్నారు. టీకా తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తే ఉండదని బోల్సనారో స్పష్టం చేశారు. (వ్యాక్సిన్ షాట్: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్) కాగా బ్రెజిల్లో ఇప్పటి వరకు 7.1 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేల మంది మృతి చెందారు. గతంలో కరోనా వైరస్, లాక్డౌన్పై విభిన్నంగా స్పందించిన బ్రిజిల్ అధ్యక్షుడు కరోనా సాధారణ ఫ్లూమాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. మాస్క్ ధరించేందుకు నిరాకరించి వివాదంలో నిలిచారు. ఆ తరువాత ఆయన కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. -
కరోనా వ్యాక్సిన్ తీసుకోను: బోల్సొనారో
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం చేశారు. కోవిడ్-19ను ఎదుర్కొనే అంశంలో తొలి నుంచీ వ్యాక్సినేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన వ్యాక్సిన్ను తీసుకోనంటూ మరోసారి ప్రకటించారు. ఇది నా హక్కు అంటూ బోల్సొనారో పేర్కొన్నారు. కోవిడ్-19ను నిరోధించేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను వీటిని వినియోగించబోనని తెగేసి చెప్పారు. అంతేకాకుండా బ్రెజిల్ దేశ ప్రజలకు సైతం వ్యాక్సిన్ల అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన దేశాలలో బ్రెజిల్ మూడో స్థానంలో నిలుస్తుండటం గమనార్హం! (విలేకరులు పిరికి వాళ్లు: బోల్సొనారో) కరోనా బారిన పడినా.. కాగా బోల్సొనారో సైతం జులైలో కరోనా వైరస్బారిన పడ్డారు. అయితే ఇప్పటికే వ్యాక్సినేషన్ల ప్రోగ్రామ్లపై బోల్సొనారో పలుమార్లు అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కాగా.. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో మాస్క్లు అంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టం కాలేదని అభిప్రాయపడ్డారు. వైరస్ను మాస్క్లు అడ్డుకుంటున్నట్లు స్వల్ప ఆధారాలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తన పెంపుడు కుక్కకు మాత్రమే అవసరమున్నట్లు అక్టోబర్లో ట్విటర్ ద్వారా బోల్సొనారో జోక్ చేశారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రకటనలు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విస్తృతంగా ప్రచారమవుతున్నట్లు ఈ సందర్భంగా ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. (బోల్సొనారోకు మళ్లీ కరోనా పాజిటివ్!) -
చైనాకు షాక్: ‘ఆ వ్యాక్సిన్ కొనుగోలు చేయం’
బ్రసిలియా: చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ను తమ ప్రభుత్వం కొనుగోలు చేయదని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వెల్లడించారు. చైనా సినోవిక్ వ్యాక్సిన్ను కొనొద్దు అంటూ ఆయన మద్దతుదారులు కొంతమంది ఆయనకు సోషల్మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన బోల్సోనారో చైనా వ్యాక్సిన్ను తమ దేశం కొనదని తేల్చి చెప్పారు. ఇదిలా వుండగా ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్వర్డో పజుఎల్లో రాష్ట్ర గవర్నర్లతో జరిగిన సమావేశంలో సినోవాక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో చేర్చడానికి మంత్రిత్వ శాఖ కొనుగోలు చేస్తుందని చెప్పారు. దీనికి అదనంగా కొన్ని వ్యాక్సిన్లను ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయని చెప్పారు. సావో పాలో స్టేట్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్, బుటాంటన్ ఇన్స్టిట్యూట్, సినోవాక్ వ్యాక్సిన్ను పరీక్షిస్తోందని తెలిపారు. ఇక గవర్నర్ జోనో డోరియా మాట్లాడుతూ జనవరిలో ప్రజలకు కరోనా టీకాలు వేయడం ప్రారంభిస్తామని చెప్పారు. దానికి కోసం ఈ ఏడాది చివరి నాటికి హెల్త్ రెగ్యులేటర్ ఆమోదం పొందాలని భావిస్తున్నట్లు తెలిపారు. 46 మిలియన్ మోతాదుల సినోవాక్ వ్యాక్సిన్ను కొనుగోలు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశం అనంతరం డోరియా చెప్పారు. కరోనావాక్ అని పిలువబడే వ్యాక్సిన్ను 230 మిలియన్ల జనాభా కలిగిన జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చడం సినోవాక్కు మంచి గుర్తింపు తీసుకువస్తుందని అన్నారు. బ్రెజిల్ ప్రభుత్వం ఇప్పటికే యూకే వ్యాక్సిన్ను కొనుగోలు చేసి రియో డీ జనేరియాలోని బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్లో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఇలా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చదవండి: ‘అతను చనిపోయింది మా వ్యాక్సిన్ వల్ల కాదు’ -
విలేకరులు పిరికి వాళ్లు: బోల్సొనారో
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి జర్నలిస్ట్లపై నోరు పారేసుకున్నారు. విలేకరులంతా పిరికి వాళ్లని... త్వరగా కోవిడ్ బారిన పడతారని.. కోలుకోలేరంటూ తీవ్రంగా దూషించారు. బోల్సొనారో కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘డిఫీట్ కోవిడ్-19’ కార్యక్రమానికి హాజరైన బోల్సొనారో.. తన స్వీయ అనుభవాలను వివరించారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకంతో పాటు తనలోని రోగనిరోధక శక్తి కారణంగానే తాను కోవిడ్ను జయించగలిగానని తెలిపారు. ఆ తర్వాత జర్నలిస్ట్లను ఉద్దేశించి ‘మీలో ఎవరైనా కోవిడ్ బారిన పడవచ్చు. కానీ మీకు ధైర్యం లేదు. పిరికివాళ్లు. అందువల్ల మీరు కరోనా నుంచి కోలుకోలేరు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీరు చెడును మాత్రమే సృష్టించగలరు. మీ కలాలను కేవలం చెడును సృష్టించడానికే ఉపయోగిస్తున్నారు. మీరు త్వరగా కోలకోలేరు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు బోల్సొనారో. (‘ఇది చాలా భయకంరంగా ఉంది’) కొద్ది రోజుల క్రితం ఒక విలేకరిని మూతి పగలకొడతానంటూ బెదిరించిన సంగతి తెలిసిందే. బ్రెసిలియాలోని మెట్రోపాలిటన్ కేథడ్రాల్ పర్యటన సందర్భంగా బోల్సొనారో భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఒక విలేకరి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహోదగ్నుడైన బోల్సొనారో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మూతి పగులగొడతానంటూ ఆ విలేకరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
మూతి పగులగొడతా: బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. బోల్సొనారో భార్య, ప్రథమ మహిళ మిచెల్లి బోల్సోనారోపై అవినీతిపై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించిన విలేకరిపై మండిపడ్డారు. మూతి వాయగొడతానంటూ బెదిరింపులకు దిగడం నిరసనలకు దారి తీసింది. బ్రెసిలియాలోని మెట్రోపాలిటన్ కేథడ్రాల్ పర్యటన సందర్భంగా బోల్సొనారో భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఒక విలేకరి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహోదగ్నుడైన బోల్సొనారో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మూతి పగులగొడతానంటూ ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. దీంతో ఇతర జర్నలిస్టుల నిరసనలకు దిగారు. కానీ ఇవేమీ పట్టించుకోని అధ్యక్షుడు అక్కడినుంచి నిష్క్రమించారు. జైర్ బోల్సొనారో బెదిరింపులపై పత్రిక స్పందించింది. ఒక ప్రభుత్వ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఆయన తన కర్యవ్యాన్ని విస్మరించారని విమర్శించింది. వృత్తిపరంగా తన విధిని నిర్వర్తించారంటూ భాధిత జర్నలిస్టు, తమ ఉద్యోగికి మద్దతుగా నిలిచింది. కాగా ఒక అవినీతి కేసులో రిటైర్డ్ పోలీసు అధికారి, బోల్సొనారో సన్నిహితుడు ఫాబ్రిసియో క్యూరోజ్, మిచెల్లి మధ్య అక్రమ లావాదేవీలపై క్రూసో పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. క్యూరోజ్ ప్రస్తుత సెనేటర్, ఆమె కుమారుడు ఫ్లావియో బోల్సోనారోకు మాజీ సలహాదారు కూడా. 2019 జనవరిలో జైర్ బోల్సోనారో అధ్యక్షుడయ్యే ముందు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనీ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తు కూడా జరుగుతోంది. అయితే ఈ నిధులను ఫ్లావియో బోల్సోనారో రియోడి జనీరోలో ప్రాంతీయ చట్టసభ సభ్యుడిగా సమయం 2011-2016 మధ్య మిచెల్లి బ్యాంకు ఖాతాలో క్యూరోజ్ నిధులను జమ చేశారని ఈ కథనం పేర్కొంది. ఈ వ్యవహారంపై మిచెల్లి బోల్సొనారో ఇంకా స్పందించాల్సి ఉంది. -
కరోనా ఎవరినీ వదిలి పెట్టదు : బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరూ బహుశా ఏదో ఒక సమయంలో కరోనావైరస్ మహమ్మారి బారిన పడక తప్పదని ఆయన పేర్కొన్నారు. వైరస్ ఎవరినీ వదిలిపెట్టదు..కాబట్టి భయం వద్దు దాన్ని ఎదుర్కోండి అంటూ చెప్పుకొచ్చారు. కరోనా మరణాల పట్ల విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన ప్రతిరోజు చాలా కారణాలతో జనం చనిపోతారు. అదే జీవితం అంటూ వేదాంత ధోరణి ప్రదర్శించడం గమనార్హం. కరోనావైరస్ నిర్ధారణ తరువాత బలహీనంగా ఉన్నానని, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నానని బోల్సొనారో చెప్పిన ఒక రోజు తర్వాత శుక్రవారం దక్షిణ రియో గ్రాండే దో సుల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కోవిడ్-19 ఒక సాధారణ ఫ్లూ లాంటిదే నని వ్యాఖ్యానించిన బోల్సొనారో, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందంటూ లాక్ డౌన్ ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. జూలై 7న బోల్సొనారోకు కరోనా సోకింది. 20 రోజులకు పైగా హోం ఐసోలేషన్ లో ఉంటూ అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలను చక్కబెట్టారు. 18 రోజుల్లో మూడుసార్లు పాజిటివ్ రాగా గత శనివారం నాల్గవసారి నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే ఆయన భార్య, ప్రథమ మహిళ మిచెల్ బోల్సొనారోకు వైరస్ సోకింది. అలాగే ఆయన ఇద్దరు సహాయకులతోపాటు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మంత్రి మార్కోస్ పోంటెస్ కు పాజిటివ్ వచ్చిందని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ఈ వైరస్ బారిన పడ్డారు. కాగా బ్రెజిల్ ప్రభుత్వ సమాచారం ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,662,485 గా ఉండగా, 92,475 మరణాలు సంభవించాయి. (బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా) -
బోల్సొనారోకు మళ్లీ కరోనా పాజిటివ్!
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (65)కు మరోసారి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఫాలో-అప్ పరీక్షల అనంతరం తాజాగా ఆయనకు మరోసారి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన మరో రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ రెండు వారాల్లో ఉన్న అన్ని పర్యటనలను ఆయన వాయిదా వేసుకున్నారు. అమెరికా తరువాత ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయిన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్లాగానే బోల్సోనారో కూడా కరోనాను తేలికగా తీసుకున్నారు. కరోనాను సాధారణంగా వచ్చే ఒక ఫ్లూగా ఆయన అభివర్ణించారు. వైద్య, ఆరోగ్య సంస్థుల సూచించినట్లు ఆయన మాస్క్లు ధరించలేదు. సామాజిక దూరం పాటించలేదు. ఆయన పార్టీలోని వారిని కలిసినప్పుడల్లా వారికి షేక్ హ్యాండ్స్ ఇస్తూ, కౌగిలించుకున్నారు. ఆయనకు జూలై 7 వ తేదీన కరోనా పాజిటివ్గా తేలింది. అప్పటి నుంచి ఆయన క్వారంటైన్లో ఉన్నారు. తేలికపాటి లక్షణాలున్నబాధితుల క్లినికల్ రికవరీ సగటు సమయం సుమారు రెండు వారాలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రెండు వారాల తరువాత కూడా ఆయనకు నెగిటివ్ రాకపోవడం గమనార్హం. ఇప్పుడు పరీక్షించగా మరోసారి కరోనా పాజిటివ్గానే వచ్చింది. దీంతో బోల్సొనారో మరో రెండు వారాలపాటు ఐసోలేషన్లో ఉండనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండని వైద్యులు తెలిపారు. ప్రెసిడెంట్ భవనంలోనే బోల్సొనారోకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఇప్పటి వరకు బ్రెజిల్లో 2.2 మిలియన్ కరోనా కేసులు నమోదు కాగా 80,000 మంది వైరస్ బారిన పడి మరణించారు. చదవండి: 100 గంటల్లో 10 లక్షలు -
బోల్సొనారోకు మూడోసారి కరోనా పాజిటివ్
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (65)కు వరుసగా మూడోసారి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. జూలై 15 తరువాత ఫాలో-అప్ పరీక్షల అనంతరం తాజాగా ఆయనకు మరోసారి పాజిటివ్ వచ్చింది. అధికార నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటూ అక్కడి నుంచే అధికార కార్యకలాపాలు కొనసాగిస్తానని బోల్సొనారో ప్రకటించారు. తేలికపాటి లక్షణాలున్నబాధితుల క్లినికల్ రికవరీ సగటు సమయం సుమారు రెండు వారాలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రెండు వారాల తరువాత కూడా ఆయనకు నెగిటివ్ రాకపోవడం గమనార్హం. (బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా) తాజాగా బోల్సొనారోకు మరోసారి పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. వీడియోకాన్ఫరెన్సుల ద్వారా మాత్రమే కార్యలాపాలు కొనసాగిస్తారని తెలిపింది. అలాగే అధ్యక్షుడి ఈశాన్య బ్రెజిల్ పర్యటనను రద్దు చేసినట్టు ప్రకటించింది. అయితే కరోనా చిన్న జలుబు మాత్రమే అంటూ కొట్టిపారేయడంతో పాటు, మాస్క్ లేకుండానే సంచరించి వివాదం రేపిన జేర్ బొల్సొనారోకు ఈ నెల మొదట్లో (జూలై, 7) వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో సెమీ ఐసోలేషన్లో అధ్యక్ష నివాసం నుండే కార్యకలాపాలను చక్కబెడుతున్నారు. తనకు తేలికపాటి లక్షణాలే ఉన్నాయని ఈ సందర్భంగా ప్రకటించారు. యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వాడుతున్నానని, ఇది తనకు సహాయపడిందని నమ్ముతున్నానని పదే పదే చెబుతూ వచ్చారు. అయితే వివాదాస్పద హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం మానేయాలని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గత వారం కోరింది. కాగా బ్రెజిల్ ప్రభుత్వ సమాచారం ప్రకారం దేశంలో 2 మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదు కాగా 81వేల మందికి పైగా మరణించారు. కరోనా మహమ్మారికి భారీగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. -
‘ఇది చాలా భయకంరంగా ఉంది’
బ్రెజీలియా: మహమ్మారి కరోనా బారిన పడి తన అధికారిక భవనంలో విశ్రాంతి తీసుకుంటున్న బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారోకు చేదు అనుభవం ఎదురైంది. క్వారంటైన్లో భారంగా రోజులు గడుపుతున్నానన్న ఆయన.. సరదాగా రియా పక్షులకు ఆహారం తినిపించడానికి వెళ్లి చేతికి గాయం చేసుకున్నారు. పక్షి ముక్కుతో పొడవడంతో కాసేపు బాధతో విలవిల్లాడిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మురేల్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా తనకు కరోనా పాజిటివ్గా తేలినట్లు బోల్సోనారో జూలై 7న ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం బ్రెసీలియాలోని అధ్యక్ష భవనంలో నిర్బంధంలోకి వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం ఆయన ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇలా ఇంటికే పరిమితం కాలేను. ఇది చాలా భయంకరంగా ఉంది. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులేమీ లేవు. రుచి కూడా బాగానే తెలుస్తోంది’’ అని వెల్లడించారు. (బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా ) bolsonaro tentando alimentar uma ema e sendo bicado pic.twitter.com/jMT9gd3MeM — muriel (@pedromuriel) July 14, 2020 కాగా ఇంట్లో బోర్ కొట్టడం మూలాన రియా పక్షులకు ఆహారం తినాలని అధ్యక్షుడు భావించారని.. ఇంతలో ఓ పక్షి తన ముక్కుతో ఆయన చేతిని పొడిచిందని సదరు మీడియా పేర్కొంది. కాగా దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపించే రియా పక్షులు ఈము, నిప్పుకోడిలాగా బాగా ఎత్తుగా ఉంటాయి. ఇవి ఎగరలేవు. కాగా బ్రెజిల్లో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఆది నుంచి వైరస్ తీవ్రతను తక్కువగా అంచనా వేసిన బోల్సోనారో ప్రస్తుతం తానే మహమ్మారితో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాంతక వైరస్తో ఇప్పటికే అక్కడ దాదాపు 74 వేల మంది మృత్యువాత పడగా.. 19 లక్షల మందికి పైగా కరోనా సోకింది. -
బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా
బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో , కరోనా బారినపడ్డారు. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సొనారో మంగళవారం ధృవీకరించారు. ఆసుపత్రినుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన బ్రెసిలియాలోని ప్యాలెస్ లో తన మద్దతుదారులతో మాట్లాడారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. (మాస్క్ తప్పనిసరి.. అనవసర ఆదేశం) మార్చిలో ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన ప్రతినిధి బృందంలో చాలా మంది సభ్యులు వైరస్ బారిన పడటంతో బోల్సొనారోకు నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో మూడుసార్లు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. బ్రెజిల్లో కరోనా శరవేగంగా విస్తరిస్తూ మరణమృదంగం మోగిస్తున్నా లాక్ డౌన్ ప్రకటించేందుకు ససేమిరా అన్న బోల్సోనారో వివాదానికి తెరతీశారు. కాగా కరోనా ప్రభావానికి తీవ్రంగా గురైన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అమెరికా నిలిచింది. ఇప్పటివరకు 65,000 మందికి పైగా బ్రెజిలియన్లు మరణించగా 1,500,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. -
మాస్క్ తప్పనిసరి.. అనవసర ఆదేశం
బ్రెసీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో పబ్లిక్ మీటింగులలో తప్పక మాస్క్ ధరించాలంటూ అక్కడి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును ఓ జడ్జి తప్పుపట్టారు. అధ్యక్షుడు మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం అనవసరం అన్నారు. జడ్జి డేనియల్ మారన్హావో కోస్టా మాట్లాడుతూ ‘రాజధాని బ్రెసీలియాలో ఇప్పటికే ఫేస్ మాస్క్లు తప్పనిసరి చేశారు. కాబట్టి ఈ ఆర్డర్ అనవసరం. అధ్యక్షుడిని కూడా దేశంలోని ఇతర సామన్య ప్రజల మాదిరిగానే చూడాలి’ అని తెలిపాడు. ఏప్రిల్ నుంచి బ్రెజిల్లో మాస్క్ ధరించడం తప్పని సరి చేశారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారికి రెండు వేల రియాలు(రూ.29 వేలు) జరిమానా విధిస్తారు. కాగా గత వారం తన పదవికి రాజీనామా చేసిన బ్రెజిల్ విద్యాశాఖ మంత్రి మాస్కు ధరించనందుకు రెండు వేల రియాల ఫైన్ కట్టిన విషయం తెలిసిందే.(దేశాధ్యక్షుడైనా మాస్కు ధరించాల్సిందే: కోర్టు) అయితే అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో మాత్రం ఎప్పటికప్పుడు కరోనా నియమాలను ఉల్లంఘిస్తూనే ఉంటారు. సామాజిక దూరాన్ని పాటించరు. ర్యాలీలలో ప్రజలకు హ్యాండ్షేక్ ఇవ్వడమే కాక వారిని కౌగిలించుకుంటారు. మాస్క్ ధరించకుండ బార్బక్యూలను నిర్వహించడం, హాట్ డాగ్ల కోసం బయటకు వెళ్లడం వంటివి చేస్తారు. అంతేకాక బొల్సనారో మొదట్లో కరోనా వైరస్ను సాధారణ ఫ్లూతో పోల్చారు. వైరస్ను అరికట్టేందుకు క్వారంటైన్, సామాజిక దూరం పాటించాలంటూ గవర్నర్లు, మేయర్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసుల్లో బ్రెజిల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నది. (3 కేసులు...3 లక్షలు) -
దేశాధ్యక్షుడైనా మాస్కు ధరించాల్సిందే: కోర్టు
బ్రెసీలియా: దేశాధ్యక్షుడైనా, సామాన్య ప్రజలైనా కరోనాకు అందరూ సమానమే. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాల్సిందే. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో ఈ మధ్య మాస్కు వాడటం లేదట. ప్రజలతో కలిసి ర్యాలీ తీస్తున్న సమయంలోనూ మాస్కు ధరించనేలేదట. ఈయన వ్యవహారంతో స్థానిక కోర్టుకు చిర్రెత్తుకొచ్చింది. దేశాధ్యక్షుడైనా మాస్కు ధరించాల్సిందేనని మంగళవారం స్పష్టం చేసింది. పబ్లిక్ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాస్కు వాడాలని బొల్సనారోని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో రెండు వేల రియాలు(రూ.29 వేలు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. (బ్రెజిల్ బేజార్) కాగా గత వారం తన పదవికి రాజీనామా చేసిన బ్రెజిల్ విద్యాశాఖ మంత్రి మాస్కు ధరించనందుకు రెండు వేల రియాల ఫైన్ కట్టిన విషయం తెలిసిందే. లాక్డౌన్, భౌతిక దూరం వంటి చర్యల్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ జెయిర్ బొల్సనారో కరోనాను తక్కువ అంచనా వేయడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక్క మంగళవారం నాడే ఆ దేశంలో 1374 మందిని కరోనా పొట్టన పెట్టుకోగా 39,436 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు బ్రెజిల్లో కరోనాతో 52 వేల మంది మరణించారు. 1.1 మిలియన్కు పైగా జనాభా కరోనా బారిన పడ్డారు. (డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం: బోల్సోనారో) -
బ్రెజిల్ బేజార్
కరోనాతో కొంపలేం మునిగిపోవని అనుకున్నారు అదో ఫ్లూ లాంటి జ్వరమేనని ప్రకటనలూ జారీ చేశారు లాక్డౌన్, భౌతికదూరం అవసరమే లేదన్నారు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా వైరస్ తీవ్రతను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది. కోవిడ్ కేసులు 10 లక్షలు దాటిపోతే, మృతులు 50 వేలకు చేరువలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా తర్వాత కరోనా కోరల్లో చిక్కుకొని బ్రెజిల్ విలవిలలాడుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనోరా ఏకపక్ష ధోరణితో వైరస్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన సావో పాలో గవర్నర్ జాయ్ డోరియా ‘దేశాన్ని పట్టిపీడిస్తున్నది కరోనా వైరస్ కాదు. బోల్సనోరా వైరస్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. లాక్డౌన్, భౌతిక దూరం వంటి చర్యల్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బోల్సనోరా కొన్ని రాష్ట్రాల గవర్నర్లు అమలు చేసినా వారు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారంటూ వైరస్ తీవ్రతని తగ్గించి చూపించే ప్రయత్నాలు చేశారు. జూన్ మొదటి వారం నుంచి ప్రతీరోజూ సగటున రోజుకి 30వేల కొత్త కేసులతో మొత్తం కేసులు 10 లక్షలు దాటేశాయి. మృతుల సంఖ్య 50వేలకు చేరువలో ఉంది. అయినప్పటికీ అధ్యక్షుడు బోల్సనోరా వైరస్ కంటే లాక్డౌన్ అనేదే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనాల ప్రకారం ఇకనైనా బ్రెజిల్ ప్రభుత్వం పకడ్బందీగా కోవిడ్ కట్టడి చర్యలు చేపట్టకపోతే దేశ ప్రజలు అసహనంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. వైరస్ వ్యాప్తికి కారణాలివీ ► బ్రెజిల్లో ప్రతీ ఏటా ఫిబ్రవరిలో జరిగే కార్నివల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం. అప్పటికే దేశంలో కరోనా జాడలున్నప్పటికీ ఉత్స వాల్ని ఘనంగా జరుపుకున్నారు. భారీగా ప్రజలు గుమికూడి సంబరాలు చేసుకున్నారు. కార్నివాల్ జరిగిన మర్నాడే ఫిబ్రవరి 26న దేశంలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత నాలుగు వారాల్లోనే కేసుల సంఖ్య లక్షకి చేరుకుంది. ► కరోనా సంక్షోభ పరిస్థితిని తట్టుకునే వైద్య సదుపాయాలు దేశంలో లేవు. ఐసీయూలు, ఆక్సిజన్ సిలండర్లకు తీవ్ర కొరత నెలకొని ఉంది. కొన్నేళ్లుగా ఆరోగ్యరంగానికి కేటాయింపులు సరిగా జరగడం లేదు. దేశంలో ఏకంగా 40 వేల మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు. ఆరోగ్య రంగంలో మరో లక్ష మందికి కరోనా సోకుతుందనే అంచనాలున్నాయి. వీటన్నింటితో ప్రభుత్వ ఆస్పత్రులే పడకేశాయి. బోల్సనోరా ధోరణితో విసిగిపోయి మూడు నెలల్లోనే ఇద్దరు ఆరోగ్య మంత్రులు రాజీనామా చేశారు. ► దేశంలో కోవిడ్ పరీక్షలు సరిగా జరగడం లేదు. కరోనా కట్టడికి అన్ని దేశాలు అనుసరిస్తున్న ప్రధాన సూత్రం ‘ట్రేస్, టెస్ట్, ట్రీట్’ను బ్రెజిల్ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రతీ లక్ష మందికి సగటున రోజుకు కేవలం 14 పరీక్షలు జరుగుతున్నాయి. ► దేశంలో నెలకొన్న భారీ ఆర్థిక అసమానతలు కరోనా కేసులను పెంచేస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా కరోనా విస్తరించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకొనే స్థోమత కలిగిన వారు దేశ జనాభాలో 20 శాతం మాత్రమే ఉన్నారు. వారు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గణాంకాలన్నీ తప్పుడు తడకలు! బ్రెజిల్ కరోనా గణాంకాలన్నీ దాస్తోందన్న అనుమానాలున్నాయి. కోవిడ్ కేసుల్ని ట్రాక్ చేసే జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అధికారిక లెక్కల కంటే కేసులు 7 రెట్లు ఎక్కువగా నమోదై ఉండవచ్చునని చెబుతోంది. దీంతో జూన్ తొలివారంలో బ్రెజిల్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు అధికారిక గణాంకాలను విడుదల చేయడం మానేసింది. ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ ఇవ్వడం ప్రారంభించింది. -
కరోనా: ‘నిమిషానికో పౌరుడి మరణం’
బ్రెసీలియా: బ్రెజిల్లో కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ కొనసాగుతోంది. ఆరు లక్షల మందికి పైగా మహమ్మారి సోకగా.. దాదాపు 35 వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. ఆరోగ్య సమస్యల కంటే ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మీడియా సైతం బోల్సోనారో విధానాలను విమర్శిస్తూ.. ‘‘నిమిషానికో బ్రెజిలియన్ను బలితీసుకుంటున్న కరోనా సాధారణ ఫ్లూ వంటిదేనన్న వ్యాఖ్యలు చేసి మూడు నెలలు దాటిపోయింది’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వార్తను చదువుతున్న సమయంలోనే కోవిడ్తో మరో బ్రెజిల్ పౌరుడి ప్రాణం పోయినా ఎవరికీ పట్టదు అంటూ ఫోహా డీ ఎస్. పౌలో తన ఎడిటోరియల్లో ఈ మేరకు భావోద్వేగ కథనం ప్రచురించింది. (కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమే : డబ్ల్యూహెచ్ఓ) ఇదిలా ఉండగా.. కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ప్రపంచ దేశాలు లాక్డౌన్ నిబంధనలు సడలిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమైనదేనని.. అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో తాము డబ్ల్యూహెచ్ఓ నుంచి నిష్క్రమిస్తారంటూ బెదిరింపులకు దిగారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాకు డబ్ల్యూహెచ్ఓ వంతపాడుతుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు బోల్సోనారో మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.(40 వేలు దాటిన కరోనా మరణాలు) -
కరోనా కల్లోలం: ఒక్క రోజులో వెయ్యి మరణాలు!
బ్రెసీలియా: లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్పై కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1179 మంది కరోనాతో మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 17,971కి చేరినట్లు పేర్కొంది. అదే విధంగా మంగళవారం నాడు కొత్తగా 17,408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని... దీంతో మొత్తం కరోనా సోకిన బాధితుల సంఖ్య 2,71,628కి చేరుకుందని తెలిపింది. కాగా బ్రెజిల్లో ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి విస్తృతమవుతున్న కారణంగా మరిన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో అతి తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య 15 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.(బ్రెజిల్ ప్రయాణాలపై నిషేధం: ట్రంప్) కాగా గత మూడు రోజులుగా బ్రెజిల్లో మహమ్మారి తీవ్రత ఉధృతమవుతోంది. ఈ క్రమంలో అత్యధిక కేసులు నమోదైన జాబితాలో బ్రిటన్, స్పెయిన్, ఇటలీని అధిగమించి బ్రెజిల్ మూడో స్థానానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకై ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. (కరోనా: ఫ్రాన్స్ను దాటేసిన బ్రెజిల్) అదే విధంగా.. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన బ్రెజిల్ను తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27 రాష్ట్ర ప్రభుత్వాలు, అధ్యక్షుడి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా... కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో యాంటీ- మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగం, కోవిడ్-19 చికిత్సలో పాటించాల్సిన నూతన ప్రొటోకాల్ గురించి తమ ఆరోగ్యశాఖా మంత్రి వివరాలు వెల్లడిస్తారని బోల్సోనారో ప్రకటించారు.(కరోనా సోకినా వారు చనిపోరు: బ్రెజిల్ అధ్యక్షుడు) -
జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో నగ్నంగా..
బ్రెసీలియా: లాక్డౌన్ వల్ల అనేక రంగాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరిగా మారింది. అధికారులు సైతం ఇళ్లలో నుంచే వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా సమీక్షలు జరుపుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా దేశాధ్యక్షునికి సైతం ఓ చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. కరోనా కట్టడిలో భాగంగా అనుసరిస్తున్న లాక్డౌన్ ఫలితాలపై చర్చిందుకు సావో పాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు పాలో స్కాఫ్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఇందులో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారోతో పాటు పది మంది ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఇంతలోనే ఆ వీడియో కాల్లో ఓ వ్యక్తి నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. (బొల్సొనారో ఆసుపత్రికి వెళ్లింది అందుకేనా !) దీంతో ఖంగు తిన్న అధ్యక్షడు జైల్ బొల్సనారో.. "పాలో, ఈ కాల్లో చివర్లో ఉన్న వ్యక్తి బాగానే ఉన్నాడు కదా?" అని అనుమానాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఇతర అధికారులు సదరు వ్యక్తిని కాన్ఫరెన్స్ నుంచి తొలగించారు. ఈ వీడియో గురించి పరిశ్రమల శాఖ మంత్రి పాలో గ్యూడ్స్ మాట్లాడుతూ.. "అతను నగ్నంగా స్నానం చేస్తున్నాడు. ఈ మీటింగ్ వేడి వేడిగా జరుగుతోంది. అందుకని అతను చన్నీళ్లతో స్నానం చేస్తున్నాడు" అని చమత్కరించారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఏప్రిల్లోనూ ఓ బ్రెజిల్ జడ్జి చొక్కా వేసుకోకుండా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న విషయం తెలిసిందే. (కరోనా: ఫ్రాన్స్ను దాటేసిన బ్రెజిల్) -
కరోనా: ఫ్రాన్స్ను దాటేసిన బ్రెజిల్
బ్రెసిలియా : బ్రెజిల్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు మరింత ఉదృతమవుతున్నాయి. బ్రెజిల్లో బుధవారం ఒక్కరోజే (24 గంటల్లో) 11,385 కేసులు నమోదవ్వడంతో పాటు 749 మంది మరణించారు. దీంతో బ్రెజిల్లో మొత్తం కేసుల సంఖ్య 1,88,974కు చేరగా మృతుల సంఖ్య 13,149కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్యలో బ్రెజిల్ ప్రాన్స్ను దాటేసింది. కాగా ప్రాన్స్లో బుధవారం రాత్రి వరకు కరోనా కేసుల సంఖ్య 1,77,700లుగా ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో బ్రెజిల్లో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. (చైనాకు అక్రమంగా మాస్కులు, పీపీఈ కిట్లు) కరోనా నేపథ్యంలో ఇప్పటికే బ్రెజిల్లో కొనసాగుతున్న లాక్డౌన్ మరికొన్ని వారాలు పొడిగించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారొ ఆయా రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా బుధవారం బ్రెజిల్ ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితిని వివరించింది. బ్రెజిల్ ఎకానమీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని, గత వందేళ్లలో ఇంతలా క్షణించడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. కాగా నిర్బంధ చర్యలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలకు అదనపుగా వారానికి 20 బిలియన్లు ఖర్చు అవుతున్నట్లు మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్ని రోజులు ఆకలి సమస్య ఎక్కువయి ప్రజలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉందంటూ బొల్సొనారొ అభిప్రాయపడ్డారు. కాగా బ్రెజిల్లో జిమ్, బ్యూటీ సెలూన్లను అత్యవసర సేవలుగా భావించి అనుమతులిస్తున్నట్లు బోల్సోనారొ తెలిపారు. వారి బిజినెస్ను అడ్డుకునే చర్యలకు పాల్పడితే లీగల్ యాక్షన్ తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే బ్రెజిల్లో అత్యధిక జనాభా కలిగిన సావో పాలలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. అధ్యక్షుడు బోల్సోనారో ఉత్తర్వులను పాటించలేమని గవర్నర్ జోవో డోరియా బుధవారం తేల్చిచెప్పారు. ఇప్పటివరకు ప్రపంచంలో బ్రెజిల్ కంటే అత్యధికంగా కరోనా కేసులు నమోదైనవిగా అమెరికా, స్పెయిన్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. -
కరోనా: ‘ఫుట్బాల్ ప్లేయర్లు చనిపోయే అవకాశం తక్కువ’
బ్రెసీలియా: ‘‘ఫుట్బాల్ ఆటగాళ్లకు కరోనా సోకినా.. వారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు అథ్లెట్లు. శారరీక దారుఢ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఫుట్బాల్ మ్యాచ్లు నిర్వహించవచ్చు’’అని బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు కష్టాలు పడుతున్నారని.. వారిలో చాలా మంది తిరిగి క్రీడల్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఇందులో భాగంగా బ్రెజిల్లో నిర్వహించాల్సిన ఫుట్బాల్ టోర్నమెంట్లను తాత్కాలికంగా వాయిదా వేశారు. మే ప్రారంభంలో బ్రెజీలియన్ చాంపియన్షిప్ ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా విస్తరిస్తున్న తరుణంలో టోర్నమెంట్ను పూర్తిగా రద్దు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు) ఈ క్రమంలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో గురువారం రేడియో గైబాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా తమ ఆరోగ్య శాఖా మంత్రి సూచించారని తెలిపారు. అదే విధంగా ఆటగాళ్లకు ఒకవేళ వైరస్ సోకినా వారి ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా బ్రెజిల్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ పరిస్థితులు చక్కబడిన తర్వాతే మ్యాచ్ నిర్వహణ గురించి ఆలోచించాలంటూ.. ఆరోగ్య శాఖ సూచనలు కోరుతూ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఇక బ్రెజిల్లో కరోనా మరణాలు ఆరు వేలు దాటినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సావో పౌలో ఫుట్బాల్ క్లబ్ డైరెక్టర్, 1994 ప్రపంచ కప్ విజేత రాయ్ సైతం బోల్సోనారో తీరును తప్పుబట్టారు. కరోనా సంక్షోభాన్ని కట్టడి చేయలేని అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఇక ఆది నుంచి కరోనా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తూ.. ‘‘లిటిల్ ఫ్లూ ’’అంటూ బోల్సోనారో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.(‘ట్రంప్లాగే ఆలోచించవద్దు.. ప్రాణాలే ముఖ్యం’) (మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్ అధ్యక్షుడు) -
మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్ అధ్యక్షుడు
రియో డి జనీరో: బ్రెజిల్కు కష్టకాలంలో అండగా నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్ ప్రజలను ఉద్దేశించి జేర్ బోల్సోనారో గురువారం ప్రసంగించారు. కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని, భయపడాల్సిన పనిలేదని బ్రెజిల్ ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. కరోనా వైరస్ నివారణ పోరాటంలో ‘గేమ్ చేంజర్’గా భావిస్తున్నహైడ్రాక్సీక్లోరోక్విన్ విషయంలో తమ అభ్యర్థనపై నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మోదీతో జరిగిన చర్చల్లో... కరోనా చికిత్సకు అవసరమయ్యే హైడ్రాక్సీక్లోరోక్విన్ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు ఇవ్వడానికి అంగీకరించారని వెల్లడించారు. కాగా, బ్రెజిల్లో ఇప్పటి వరకు 16 వేల మందికిపైగా కరోనా వైరస్ సోకగా, 822 మంది మృతిచెందారు. President of #Brazil, Jair Bolsonaro in his address to his nation thanks PM @narendramodi and people of #India for helping Brazil with Hydroxychroloquine to treat patients of #COVID19 pic.twitter.com/zI5cCKXk3l — PIB India 🇮🇳 #StayHome #StaySafe (@PIB_India) April 9, 2020 అయితే ఈ ఔషధం కోసం జేర్ బోల్సోనారో భారత్కు ‘సంజీవని’ లేఖ రాసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నివారణ పోరాటంలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్కు తమకు సరఫరా చేయాలని మోదీని కోరారు. ‘రామాయణంలో హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి పవిత్ర ఔషధాన్ని తెచ్చి రాముడి సోదరుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడు. అనారోగ్యంతో ఉన్నవారిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. బార్టిమేయుకు దృష్టిని పునరుద్ధరించాడు. సంయక్త బలగాలు, ఆశీర్వాదాలతో ప్రజలందరి మేలు కోసం భారత్, బ్రెజిల్ దేశాలు ఈ ప్రపంచ సంక్షోభాన్ని అధిగమించాలి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించండి. మీరు ఇచ్చే భరోసాయే అత్యున్నత గౌరవంగా భావిస్తాను’ అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో పేర్కొన్నారు. చదవండి: భారత్కు పెరుగుతున్న డిమాండ్ మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్ -
క్లోరోక్విన్.. మాకూ ఇవ్వండి
న్యూఢిల్లీ: మలేరియా నివారణ ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం భారత్ను అభ్యర్థిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ ఔషధం కోసం బ్రెజిల్ కూడా భారత్కు ‘సంజీవని’ లేఖ రాసింది. కరోనా వైరస్ నివారణ పోరాటంలో ‘గేమ్ చేంజర్’గా భావిస్తున్నహైడ్రాక్సీక్లోరోక్విన్కు తమకు కూడా సరఫరా చేయాలని కోరింది. ‘రామాయణంలో హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి పవిత్ర ఔషధాన్ని తెచ్చి రాముడి సోదరుడు లక్క్ష్మణుడి ప్రాణాలు కాపాడు. అనారోగ్యంతో ఉన్నవారిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. బార్టిమేయుకు దృష్టిని పునరుద్ధరించాడు. సంయక్త బలగాలు, ఆశీర్వాదాలతో ప్రజలందరి మేలు కోసం భారత్, బ్రెజిల్ దేశాలు ఈ ప్రపంచ సంక్షోభాన్ని అధిగమించాలి. దయచేసి మా అభ్యర్థనను అంగీకరించండి. మీరు ఇచ్చే భరోసాయే అత్యున్నత గౌరవంగా భావిస్తాను’ అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో పేర్కొన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ను తమకు సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం క్లోరోక్విన్ ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. అయితే పొరుగు దేశం నేపాల్ సహా ప్రపంచ దేశాల నుంచి అభ్యర్థనల నేపథ్యంలో ఎగుమతులపై నిషేధాన్ని పాక్షికంగా సడలిచింది. మనకు సరిపడా ఉంచుకుని మిగతా వాటిని ఎగుమతి చేస్తామని భారత్ ప్రకటించింది. అమెరికాకు భయపడి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించారన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కరోనాతో విలవిల్లాడుతున్న దేశాలకు మానవతాదృక్పథంతో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి చేస్తామని ప్రకటించింది. (ట్రంప్ బెదిరించారు.. మీరు ఇచ్చేశారు) -
బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
బ్రెసిలియ: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం కంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకే అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో మొగ్గు చూపుతున్నారని బ్రెజిల్లోని పలు రాష్ట్రాల గవర్నర్లు ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ల ఆరోపణలపై బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో స్పందిస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేశ ఆర్థిక రాజధాని సావోపాలోలోని కరోనా వైరస్ మరణాల సంఖ్యను తారుమారు చేశారని మండిపడ్డారు. అంతేగాక అక్కడ మరణాల సంఖ్యపై తనకు సందేహం ఉందని కూడా ఆరోపించారు. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం) కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రజా వైద్య ఆరోగ్య సంస్థ సూచనల మేరకు బ్రెజిల్లోని 26 రాష్ట్రాల గవర్నర్లు అనవసరమైన వాణిజ్య కార్యకలాపాల సేవలను నిషేధించారు. దీంతో ఆ దేశ ఆధ్యక్షుడు బోల్సోనారో దీనిపై ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ‘దేశ ఆర్థిక రాజధాని అయిన సావోపాలోలో మరణించే వారిని మనం కాపాడలేనప్పుడు.. వారిని చనిపోనివ్వండి. ట్రాఫిక్ వల్ల కారు ప్రమాదం జరిగితే ఏకంగా కార్ల తయారి కర్మాగారాన్ని మూసి వేయలేం కదా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సావోపాలోలో మరణాల సంఖ్య అధికంగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ వల్ల శుక్రవారం నాటికి అక్కడ 1,223 పాజిటివ్ కేసులు నమోదు కాగా 68 మంది మరణించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అక్కడి పరిస్థితుల తీవ్రతను మనం గమనించాలి. కానీ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునే సమయం ఇది కాదు’ అంటూ మండిపడ్డారు. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..) కరోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు... ఇతర దేశస్థులు తమ దేశంలో ప్రవేశించకుండా విమానాశ్రయ సేవలను బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ శుక్రవారం నిలిపివేసింది. దీనిని సోమవారం నుంచి అమలు చేయలనున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు ఇతర దక్షిణ అమెరికా దేశాలల్లో కూడా ఈ చర్యలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం కూడా బ్రెజిల్ సెంట్రల్ బ్యాంక్ ఇతర దేశాలలో 'క్వాంటిటేటివ్ సడలింపు' విధానాలకు అనుగుణంగా అత్యవసర బాండ్-కొనుగోలకు అధికారాలు పిలుపునిచ్చారు. అదే సమయంలో పేరోల్తో చిన్న కంపెనీలకు సహాయం చేయడానికి 40 బిలియన్ల రీయిస్ క్రెడిట్ లైన్ను ఆవిష్కరించింది. అలాగే 3 నెలల లాక్డౌన్ నేపథ్యంలో స్వయం ఉపాధి, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం తరపున రూ. 45 బిలియన్ల రీయిస్లను అందిస్తుందని, ఇలా మూడు నెలల పాటు మొత్తం రూ. 700 బిలియన్ల రీయిస్లను ఇవ్వనున్నట్లు సావోపాలో ఆర్థిక మంత్రి పాలో గూడెస్ శుక్రవారం ప్రకటించించారు. అంతేగాక దేశ వ్యాప్తంగా సోమవారం నాటికి కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,891 నమోదు కాగా, మరణాలు 92కి చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
బొల్సొనారో ఆసుపత్రికి వెళ్లింది అందుకేనా !
బ్రెసిలియా : భారత్లో జరిగిన గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బ్రెసిలియాలోని ఆసుపత్రికి వచ్చిన బొల్సొనారో మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపించారు. కాగా బొల్సొనారో ఆసుపత్రికి రావడంపై వివిధ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత అధికారులు స్పందించారు. గత కొద్దికాలంగా బ్రెజిల్ అధ్యక్షుడు ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మధ్యనే జరిగిన హెర్నియా చికిత్స సమయంలో తన శరీరం భాగంలో ఉంచిన మెష్ భాగం రీప్లేస్కు సంబంధించిన విషయం తెలుసుకునేందుకు వైద్యులను కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బొల్సొనారోను పరీక్షించిన వైద్యులు మెష్ భాగం రీప్లేస్ అంశంపై వైద్యులు ధృవీకరించనున్నట్లు తెలిపారు. కాగా 2018లో బొల్సొనారో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక వ్యక్తి బ్రెజిల్ అధ్యక్షుడిపై కత్తితో ఉదర భాగంలో దాడికి పాల్పడ్డాడు. దీంతో బొల్సొనారో శరీర భాగానికి నాలుగు సర్జరీలు జరిగాయని, ఈ మధ్యనే హెర్నియా చికిత్స కూడా చేయించుకున్నారని పేర్కొన్నారు. -
నారీ శక్తి సైనిక శక్తి
న్యూఢిల్లీ: భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్పథ్లో ఘనంగా జరిగాయి. శీతాకాలం వేళ ఆదివారంనాడు సూర్యకిరణాల వెచ్చదనం మధ్య త్రివిధ బలగాలు నిర్వహించిన 90 నిమిషాల పెరేడ్ అణువణువునా దేశభక్తిని నింపుతూ రోమాలు నిక్కబొడిచేలా సాగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే విన్యాసాలతో పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది. రాజ్పథ్లో గోవా, మేఘాలయ తదితర రాష్ట్రాల శకటాల ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం దగ్గర నివాళులర్పించడం దగ్గర్నుంచి గగనతలంలో త్రివిధ బలగాలకి సంకేతంగా హెలికాప్టర్లు చేసే విన్యాసాల వరకు ఎన్నో తొలి ఘటనలకు ఈ వేడుకలు సాక్షీభూతమయ్యాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి పెరేడ్ని తిలకించారు. రాజ్పథ్లో పెరేడ్ మొదలు కావడానికి ముందు జాతీయ గీతం బ్యాండ్ని వాయించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో 21 సార్లు గాల్లోకి తుపాకులు పేల్చి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఇతర ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. యుద్ధస్మారక కేంద్రం వద్ద ప్రధాని నివాళులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం పెరేడ్ ప్రారంభం కావడానికి ముందు కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు. ఏటా ఇండియా గేట్ దగ్గరున్న అమర్ జ్యోతి జవాన్ వద్ద నివాళుల ర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కాషాయ బాందినీ ప్రింట్ తలపాగాతో.. జాతీయ వేడుకల సమయంలో ప్రధానమంత్రి మోదీ రంగుల తలపాగా ధరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. తెల్ల రంగు పైజామా, కుర్తా, దానిపైన నీలం రంగు జాకెట్, కాషాయ రంగులో వీపు మీదుగా జారేలా ఉండే బాందినీ ప్రింట్ తలపాగా ధరించారు. రాజస్తాన్, గుజరాత్లలో ఇలాంటి తలపాగాలను ధరిస్తారు. ఆకట్టుకున్న శకటాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, మన సైనిక పాటవాన్ని చాటేలా మొత్తం 22 శకటాల ప్రదర్శన ఆద్యంతం మనోహరంగా సాగింది. కప్పల్ని కాపాడాలని గోవా శకటాన్ని రూపొందిస్తే, హిమాచల్ ప్రదేశ్ కులు దసరా ఉత్సవాన్ని, ఒడిశా రథయాత్రను ప్రతిబింబించేలా శకటాల్ని రూపొందించాయి. వాయుసేనకు చెందిన శకటం తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇక జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2024కల్లా ప్రతీ గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చాటిచెప్పే శకటాన్ని ప్రదర్శించింది. ఎన్నో ఫస్ట్లు రాజ్పథ్లో జరిగిన పెరేడ్ని మహిళా కమాండర్ కెప్టెన్ తాన్యా షెర్గిల్ ముందుండి నడిపించారు. అందరూ పురుషులే పాల్గొన్న ఈ మార్చ్కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. ► సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగింది. ఇన్స్పెక్టర్ సీమ నాగ్ నేతృత్వంలో డేర్ డెవిల్ స్టంట్ ప్రదర్శన సాగింది. నడుస్తున్న బైక్ పైభాగాన నిల్చొని సీమ సెల్యూట్ సమర్పించడం ఈ షోకే హైలైట్. ► జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొని ‘‘తిరిగి గ్రామానికి’’అన్న థీమ్తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటం ముందుభాగంలో కశ్మీర్ చేతి వృత్తులను ప్రతిబింబించేలా శాలువా అల్లుతున్న కార్మికుడ్ని ఉంచారు. ► రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఒ) గత ఏడాది రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్)ని ఈ సారి పెరేడ్లో తొలిసారిగా ప్రదర్శించారు. మిషన్ శక్తిలో భాగంగా మన క్షిపణి వ్యవస్థ సత్తా దీంతో తెలుస్తుంది. ► ధనుష్ శతఘ్నులను తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించారు. 155ఎంఎం/45 కాలిబర్ సామర్థ్యం కలిగిన ఈ శతఘ్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 36.5కి.మీ. దూరం వరకు ధనుష్ కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తుంది. ► కొత్తగా మన అమ్ముల పొదిలో వచ్చి చేరిన చినూక్, అపాచీ భారీ యుద్ధ హెలికాప్టర్లు తొలిసారిగా పెరేడ్లో ప్రదర్శించాయి. మారుమూల ప్రాంతాల్లో భారీ లోడ్లను కూడా చినూక్ మోసుకుపోగలదు. ఇక అపాచి హెలికాప్టర్ గగనతలం నుంచి గగనతలానికి, నింగి నుంచి నేలకి కూడా క్షిపణుల్ని ప్రయోగించే సత్తా ఉంది. ► నీలాకాశంలో జరిగే వైమానిక విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా సాగాయి. 40 విమానాలు త్రిశూల్ ఆకారంలో విన్యాసాలు చేయడంతో మొదలై త్రివిధ దళాలకి గుర్తుగా మూడు ఏఎల్హెచ్ హెలికాప్టర్లు ’VIP’ ఆకారంలో వచ్చాయి. ఈ ప్రదర్శనని ఇలా నిర్వహించడం ఇదే తొలిసారి. 17 వేల అడుగుల ఎత్తులో.. న్యూఢిల్లీ: 17 వేల అడుగుల ఎత్తు.. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత.. మోకాళ్ల లోతు మంచు.. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లకు ఇవేవీ అడ్డంకి కాలేదు. 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా లదాఖ్లో ‘వందేమాతరం.. భారత్ మాతా కీ జై’ నినాదాల నడుమ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ట్విట్టర్లో వైరల్గా మారింది. సైనికులను కీర్తిస్తూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు. దేశానికి నిజమైన హీరోలు మీరే అంటూ ఒకరు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. గణతంత్ర వేడుకలు జరుపుతున్న హీరోలు అంటూ ఇంకొకరు అని కొనియాడారు. గణతంత్ర వేడుకల్లో మోదీ ధరించిన తలపాగాలు పరేడ్లో ఆకాశ్ క్షిపణి బైక్పై సీఆర్పీఎఫ్ మహిళా జవాన్ల విన్యాసం -
బంధం విస్తృతం
న్యూఢిల్లీ: సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేయడానికి భారత్, బ్రెజిల్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారో సమక్షంలో శనివారం రెండు దేశాల అధికారులు ఈ మేరకు 15 ఒప్పందాలపై సంతకాలు చేశారు. కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, పౌరవిమానయానం, ఇంధన, ఆరోగ్యం, పరిశోధన రంగాల్లో మరింతగా సహకరించుకునేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసేందుకు అంగీకరించాయి. ‘మీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది’ అని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోతో చర్చల అనంతరం మోదీ పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో బ్రెజిల్ను కీలకమైన భాగస్వామిగా ఆయన వర్ణించారు. ఇప్పటికే బలంగా ఉన్న రెండు దేశాల సంబంధాలు తాజాగా కుదిరిన ఒప్పందాలతో మరింత దృఢమవుతాయని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొననున్న జయిర్ బొల్సనారో తన కూతురు లారా, కోడలు లెటిసియా ఫిర్మోతోపాటు 8 మంది మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు, వాణిజ్య ప్రతినిధుల బృందంతో శుక్రవారం వచ్చారు. భారత్ ఎగుమతుల్లో ప్రధానంగా రసాయనాలు, సింథటిక్ దారం, వాహన భాగాలు, పెట్రోలియం ఉత్పత్తులు అలాగే, బ్రెజిల్ నుంచి ముడి చమురు, బంగారం, ఖనిజాలు దిగుమతి చేసుకుంటోంది. -
ప్రధాని మోదీతో భేటీ అయిన బ్రెజిల్ అధ్యక్షుడు
ఢిల్లీ : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్కు చేరుకున్న సంగతి తెలిసిందే. 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో జైర్ బొల్సొనారో అధికారికంగా బేటీ అయ్యారు. కాగా ఈ పర్యటనలో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్ వద్ద ఘన స్వాగతం లభించింది.ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఆయనతో కరచాలనం చేసి ఆహ్వానించారు.అనంతరం త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఢిల్లీలోని రాజ్ఘాట్కు వెళ్లిన జైర్ బొల్సొనారో మహాత్మగాంధీకి ఘనమైన నివాళులు అర్పించారు. -
భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి. -
గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగే 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో ప్రత్యేక అతిథిగా రానున్నారు. దీనికోసం నేడు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక బొల్సోనారో భారత్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు హాజరవనున్నారు. అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. కాగా భారత గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధక్షుడు ప్రత్యేక అతిథిగా విచ్చేయడం ఇది మూడోసారి. 2004లో తొలిసారిగా బ్రెజిల్ అధ్యక్షుడు రిపబ్లిక్ డేకు హాజరైన విషయం తెలిసిందే. చదవండి: ఇకపై వీసా లేకుండానే బ్రెజిల్కు.. ‘మతి’ పోయింది.. ఇపుడు ఓకే! -
‘మతి’ పోయింది..ఇపుడు ఓకే!
సావోపోలో : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో (64) తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారట. ఈ విషయాన్నిస్వయంగా అధ్యక్షుడు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానేవుందని చెప్పొకొచ్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్లో చికిత్స అనంతరం తన అధికారిక నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాని ఆయన తెలిపారు. బొల్సొనారో అందించిన వివరాల ప్రకారం తన అధికారిక నివాసంలో జారి కిందపడటంతో ఆయన తలకు బలంగా దెబ్బ తగిలింది. అల్వొరాడా ప్యాలెస్లో బాత్రూమ్లో జారిపడ్డారు. అయితే పడిపోయిన వెంటనే ఏమీ గుర్తు లేదు..జ్ఞాపకశక్తిని కోల్పోయాననీ అధ్యక్షుడు తెలిపారు. ఉదాహరణకు నిన్న ఏం చేశానో, ఏం జరిగిందో గుర్తు లేదు. ఆ తర్వాతి రోజు నుంచి నెమ్మదిగా, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోగలుగుతున్నా..ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని బ్యాండ్ టెలివిజన్కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిని ఆయన వివరించారు. కానీ వయసుతోపాటు, కత్తిపోటు (అధ్యక్ష పదవికి పోటీ సందర్భంగా 2018 సెప్టెంబర్లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితోదాడి చేశాడు) గాయం వల్ల కొన్ని సమస్యలు ఇంకా వున్నాయన్నారు. కాగాఈ ఏడాది జనవరిలో బొల్సొనారో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తి కడుపులో కత్తితో పొడిచారు. ఈ గాయానికి చికిత్సలో భాగంగా ఇప్పటికే నాలుగు సార్లు సర్జరీ కూడా చేయించుకున్నారు. అలాగే స్కిన్ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నానని ఈ నెల ప్రారంభంలో బోల్సొనారో వెల్లడించిన సంగతి తెలిసిందే. -
సిగ్గుపడాలి; ఆమె ఓ ఆకతాయి!
బ్రెసీలియా: స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త, వాతావరణ మార్పుపై ఉద్యమిస్తున్న గ్రెటా థంబర్గ్పై బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్రెటా ఓ ఆకతాయి పిల్ల అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై గ్రెటా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపడేశారు. అమెజాన్ అడవుల్లో ముగ్గురు గిరిజనులు కాల్పుల్లో మృతి చెందడంపై గ్రెటా స్పందించిన తీరు ఆయన ఆగ్రహానికి కారణమైంది. ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరందిన అమెజాన్ అడవుల్లో ఇటీవల తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా అధిక సంఖ్యలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరాన్హా రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో శనివారం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటనపై స్పందించిన గ్రెటా... అడవుల అక్రమ నరికివేతను అడ్డుకున్నందుకే వారిని కాల్చి చంపారని ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడకుండా ఉన్నందుకు ప్రతీ ఒక్కరు సిగ్గుపడాలి అని బ్రెజిల్ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గ్రెటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోల్సోనారో.. ‘ప్రతీ చావుకు చింతించాల్సిందే. తనొక ఆకతాయి పిల్ల’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గిరిజనుల కాల్చివేత ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా అస్పెర్జర్ సిండ్రోమ్తో బాధ పడుతున్న గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వాతావరణ మార్పులపై ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఇక బోల్సోనారో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అమెజాన్లో కార్చిచ్చు రగిలిన నేపథ్యంలో పర్యావరణ కార్యకర్తలే అడవిని తగులబెట్టారంటూ వ్యాఖ్యానించారు. -
ఇకపై వీసా లేకుండానే బ్రెజిల్కు..
బ్రెసీలియా : భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించవచ్చని బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ప్రకటించారు. భారత్తో పాటు చైనాకు చెందిన పర్యాటకులు, వ్యాపార నిమిత్తం తమ దేశానికి వచ్చే వారికి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా పర్యటన సందర్భంగా బోల్సోనారో గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక భారత్, చైనా కంటే ముందే అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల పౌరులకు దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే ఈ దేశాలేవీ కూడా బ్రెజిల్ పౌరులకు మాత్రం ఫ్రీ వీసా ప్రయాణం చేసే అవకాశం కల్పించలేదు. కాగా సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జేర్ బోల్సొనారో(63) గతేడాది బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. 1964- 85 మధ్య బ్రెజిల్లో సైనిక నియంత పాలన కొనసాగడాన్ని ఆయన బహిరంగంగా సమర్థించిన బోల్సోనారో.. పలుమార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా... ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ అడవిలో కార్చిచ్చు రగిలిన నేపథ్యంలో... పర్యావరణం కోసం పాటుపడే ఎన్జీవోల వల్లే ఈ మంటలు చెలరేగాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అమెజాన్ తగులబడుతోంటే ఆటలేంటి అధ్యక్షా..!
పోర్టో వెల్హో: ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటేనే జీ–7 నుంచి అమెజాన్ కార్చిచ్చు ఆపే సాయం తీసుకునే విషయం ఆలోచిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా తెలిపారు. అడవుల్లో మంటల్ని ఆర్పడానికి యుద్ధ విమానాలను పంపేందుకు బ్రెజిల్కు 2 కోట్ల అమెరికా డాలర్ల సాయాన్ని అందిస్తామని ఫ్రాన్సు అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే. పుడమికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవులు తగలబడిపోతూ ఉంటే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోకూడదని మాక్రాన్ జీ7 సదస్సులో చర్చకు పట్టుబట్టి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీనిపై బ్రెజిల్ అధ్యక్ష ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫ్రాన్స్ అధ్యక్షుడి కృషిని ప్రశంసిస్తున్నాం. అయితే అదంతా యూరప్లో అటవీ పునరుద్ధరణకు వాడితే బెటర్’ అని అన్నారు. ఫ్రాన్స్లో నోట్రే డామ్ చర్చి తగలబడటాన్ని ప్రస్తావిస్తూ ‘ఒక చర్చిలో మంటలు చెలరేగితే ఆర్పలేని వాళ్లు.. మా దేశానికి పాఠాలు చెబుతారా? అని వ్యంగ్యంగా అన్నారు. అనంతరం బోల్సనారో మాట్లాడుతూ..‘ఫ్రాన్సు సాయాన్ని అంగీకరించాలన్నా ఆ దేశంతో చర్చలు జరపాలన్నా ముందుగా మేక్రాన్ నాపై చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలి’ అంటూ డిమాండ్ చేశారు. తన భార్య బ్రిగెట్టెపై బోల్సనారో చేసిన వ్యాఖ్యలు తీవ్ర పరుషంగా ఉన్నాయని మేక్రాన్ పేర్కొన్నారు. దీనిపై బోల్సనారో స్పందిస్తూ బ్రెజిలేమీ ఫ్రాన్సు కాలనీ కాదు, మనుషులు లేని దీవి అంతకంటే కాదు’ అంటూ ప్రతి దాడికి దిగారు. తీవ్రంగా వ్యాపిస్తున్న పొగలు అమెజాన్ కార్చిచ్చు ఆర్పడానికి బ్రెజిల్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పొగ అడ్డంకిగా మారింది. అమెజాన్ అటవీ ప్రాంతంలోని రోన్డోనియాలో జకాండా జాతీయ అటవీ ప్రాంతంలో మంటలు విస్తృతంగా వ్యాపిస్తుండడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. అయితే, దట్టంగా పొగలు కమ్మేయడంతో ఏమీ కనిపించక మంటల్ని ఆర్పడం కష్టమైంది. పశు పోషణ కోసం అటవీ ప్రాంతాన్ని చదును చెయ్యడానికి ఆ మంటల్ని పెట్టారని అధికారుల పరిశీలనలో తేలింది. -
బ్రెజిల్ అధ్యక్షుడికి అమెజాన్ సెగలు
పోర్టో వెల్హో(బ్రెజిల్): అమెజాన్ అడవుల్లో రేగిన కార్చిచ్చు సెగలు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారోకి తగులుకుంటున్నాయి. అడవులు తగలబడిపోతుంటే ఆయన స్పందించిన విధానంపై స్వదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు సర్వసాధారణమే అయినప్పటికీ గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది 85 శాతం పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయడానికి సామాజిక సంస్థలే అడవుల్ని తగలబెట్టి ఉంటాయని బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. బ్రెజిల్ వ్యాప్తంగానూ, ప్రపంచ దేశాల్లో బ్రెజిల్ దౌత్యకార్యాలయాల ఎదుట వందలాది మంది నిరసన ప్రదర్శనలకు దిగారు. సొంత దేశంలోనే కొందరు యువకులు ‘‘బోల్సోనారో మా భవిష్యత్ని మసి చేస్తున్నారు‘‘అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పోప్ ప్రాన్సిస్ కూడా తన నిరసన గళాన్ని వినిపించారు. ఊపిరితిత్తుల్లాంటి అడవులు మన భూమికి అత్యంత ముఖ్యమంటూ ప్రకటన జారీ చేశారు. ప్రేఫర్అమెజాన్ అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం ప్రపంచంలోనే ట్రెండింగ్ అంశంగా మారింది. బ్రెజిల్తో వ్యాపార సంబంధాలు నిలిపివేస్తాం బ్రెజిల్ అధ్యక్షుడు వాణిజ్య ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన అటవీ విధానాలే కార్చిచ్చు రేపాయని, ఇవి ఇంకా కొనసాగితే బ్రెజిల్, ఇతర దక్షిణ అమెరికా దేశాలతో వ్యాపార సంబంధాలు రద్దు చేసుకుంటామని యూరోపియన్ నాయకులు హెచ్చరించారు. బ్రెజిల్ అధినేత అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను తోసి రాజని అడవుల నరికివేత, పశువుల మేతకు చదును చేయడం, అక్రమ మైనింగ్ను ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ప్రపంచ దేశాల అభిప్రాయంగా ఉంది. గతంలో కూడా బోల్సోనారో అమెజాన్ వర్షారణ్యాలు బ్రెజిల్ ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారాయని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో బోల్సోనారోపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన దిగివచ్చారు. పర్యావరణ విధానాల్ని సవరించుకుంటామని హామీ ఇచ్చారు. మంటల్ని ఆర్పడానికి 44వేల మంది సైనికుల్ని పంపిస్తానని వెల్లడించారు. అంతేకాదు కార్చిచ్చు రేగడానికి గల కారణాలపై విచారణ జరిపి బాధ్యుల్నిశిక్షిస్తామని అధినేత చెప్పినట్టుగా ఆ దేశ న్యాయశాఖ మంత్రి, పర్యావరణ విధానాలను సమీక్షించే అధికారం ఉన్న సెర్గియో మోరో ట్విటర్లో వెల్లడించారు. ఆర్పడానికి జీ7 అండ అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుని ఆర్పడానికి అన్నివిధాల సాయపడడానికి జీ7 దేశాలు ముందుకొచ్చాయి. 2.2 కోట్ల అమెరికా డాలర్లు సాయం చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. మంటలనార్పే విమానాలు పంపడానికి ఈ డాలర్లని వినియోగించాలని తెలిపింది. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలతో కూడిన జీ7 సదస్సు అడవుల పునరుద్ధరణ ప్రణాళిక అంశంలో కూడా బ్రెజిల్కు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి దక్షిణ అమెరికా దేశాల్లో రోజురోజుకూ విస్తరిస్తున్న కార్చిచ్చు, బ్రెజిల్, బొలివియా, పెరూ, పరాగ్వే, ఈక్వెడార్, ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనా, వాయవ్య కొలంబియా దేశాల్లో కార్చిర్చు ( ఎరుపురంగు) -
అమెజాన్ తగులబడుతోంటే.. అధ్యక్షుడి వెర్రి కూతలు!
రియోడిజెనిరో : కార్చిచ్చుతో గత కొన్ని రోజులుగా అమెజాన్ అడవి తగులబడిపోతోంది. వేలాది ఎకరాల్లో అడవులు బుగ్గి పాలవడంతో పర్యావరణంపై దుష్ప్రభావం చూపిస్తోంది. అక్కడంతా దట్టమైన పొగ కమ్మేయడంతో చీకటిమయమైంది. లక్షలాది చెట్లు దహనం కావడంతో భారీ స్థాయిలో కార్బన్వాయువు వాతావరణంలోకి విడుదల అవుతోంది. మొత్తం అమెజాన్ పరివాహకం 30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు నెలవు. దాదాపు పది లక్షల మంది ఆదిమవాసులు ఈ అడవుల్లో నివసిస్తున్నారు. భూతాపాన్ని నియంత్రించడానికి, ప్రపంచానికి ఆక్సిజన్ అందించడానికి ఈ ప్రాంతం చాలా కీలకమైంది. కోట్లాది టన్నుల కర్బన ఉద్గారాలను ఈ అడవులు పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. చదవండి: మంటల్లో ‘అమెజాన్’; విరాళాలు ఇవ్వండి! ఉత్తర ప్రాంత రాష్ట్రాల్లో ఈ మంటల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 74 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న అమెజాన్ బేసిన్ ప్రధానంగా బ్రెజిల్లో ఉంది. దీంతో బ్రెజిల్లో అతి పెద్ద రాష్ట్రమైన అమెజానాస్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నెల 14న బ్రెజిల్లోని ట్రాన్స్-అమెజానియా హైవేలో కొన్ని మీటర్ల విస్తీర్ణంలో మొదలైన ఈ మంటలు వారం రోజుల వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించి ప్రస్తుతం అదుపు చేయలేనంతగా విస్తరించడంతో బ్రెజిల్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ఓ వివాదాస్పద ప్రకటన చేశాడు. పర్యావరణం కోసం పాటుపడే ఎన్జీవోల వల్లే ఈ మంటలు చెలరేగాయని ఆరోపించారు. ఎన్జీవోలకు విరాళాలు తగ్గడంతో తన ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ఇలా చేశారని అన్నారు. బోల్సొనారో వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అమెజాన్ కోసం ప్రార్థించండి అంటూ సోషల్మీడియా ద్వారా ఉద్యమం చేస్తూ బోల్సొనారోపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా జాయర్ బోసానారు
సావోపౌలో: సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జాయర్ బోసా నారు(63) బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ కూటమికి చెందిన వర్కర్స్ పార్టీ నాయకుడు ఫెర్నాండో హాడడ్పై ఆయన సంపూర్ణ మెజారిటీ సాధించారు. బోసానారుకు 55.2 శాతం ఓట్లు రాగా, ఫెర్నాండోకు 44.8 శాతం ఓట్లు దక్కాయి. గతంలో సైనికాధికారిగా పనిచేసిన బోసానారు ఎన్నికల ప్రచార సమయంలో తరచూ మహిళలు, గేలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి ‘బ్రెజిల్ ట్రంప్’గా పేరొందారు. గత నాలుగు సార్లు లెఫ్ట్ పార్టీకి పట్టంకట్టిన బ్రెజిల్ ప్రజలు..మార్పు కోసం ఈసారి బోసానారుకు అధికారం అప్పగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బోసానారు గెలుపుపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజ్యాంగం, వైవిధ్యం, భిన్నత్వం పరిరక్షించి ప్రజలను ఏకంచేస్తానని ఆయన తన తొలి సందేశంలో పేర్కొన్నారు. -
బ్రెజిల్ అధ్యక్షుడిగా జైర్ బొల్సొనారో ఎన్నిక
రియో డి జెనీరో : బ్రెజిల్ అధ్యక్షుడిగా మాజీ ఆర్మీ కెప్టెన్ జైర్ బొల్సొనారో ఎన్నికయ్యారు. 55.13 శాతం ఓట్లతో బొల్సనారో నెగ్గగా, 44.87 శాతం ఓట్లు ప్రత్యర్థి ఫెర్నాండో హదద్కు పోలయ్యాయి. రాజధాని రియో డి జెనీరోలో అభిమానులు, మద్దతుదారులు భారీ ర్యాలీ తీశారు. 'సమిష్టిగా అందరం కలిసి బ్రెజిల్ తలరాతను మారుద్దాం' అని ఎన్నికల ఫలితాల తర్వాత బొల్సొనారో తన ఫేస్బుక్లో పేర్కొన్నారు. జనవరి 1న అధ్యక్షపదవిని బొల్సొనారో చేపట్టనున్నారు. -
‘దేవుడు ఆదేశించాడు.. నేను పాటించాను’
బ్రెజీలియా : ఎన్నికల ప్రచారంలో భాగంగా మినాస్ గ్రేస్ రాష్ట్రంలో పర్యటిస్తున్న బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి జేర్ బోల్సోనారోపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మినాస్ గ్రేస్కు చెందిన అడెలియో డీ ఒలివిరాగా నిందితుడిని గుర్తించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల(అక్టోబర్)లో పోలింగ్ జరగనున్న క్రమంలో జేర్పై దాడి జరగడంతో.. ఇది ప్రత్యర్థుల పనేనంటూ సోషల్ లిబరల్ పార్టీ ఆరోపించింది. కాగా తన చర్య వెనుక దేవుడు తప్ప ఎవరూ లేరని, ఆయన ఆదేశించడం వల్లే తానిలా చేశానంటూ ఒలివిరా పేర్కొన్నాడు. అతడి తరపు లాయర్ మాట్లాడుతూ...‘ ఒలివిరా ఆవేశంలో దాడి చేశాడని, రాజకీయ, మత పరమైన నాయకులకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. ఒలివిరా మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఇలా చేసి ఉండవచ్చని పేర్కొన్నాడు. బాగానే ఉన్నారు.. ఆందోళన వద్దు ఒలీవిరా దాడిలో జేర్ తీవ్రంగా గాయపడ్డారు. కత్తితో కడుపులో పొడవడంతో పెద్దపేగుకు తీవ్ర గాయమైందని వైద్యులు పేర్కొన్నారు. 40 శాతం రక్తం పోయిందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే జేర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఆయన కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జేర్ కోలుకుంటున్నారని, ఆయనకు విజయాన్ని బహుమానంగా ఇవ్వాలంటూ కోరారు. కాగా గతంలో బ్రెజిల్ మిలిటరీ అధికారిగా పనిచేసిన జేర్కు వివాదాస్పద నేతగా పేరుంది. 1964- 85 మధ్య బ్రెజిల్లో సైనిక నియంత పాలన కొనసాగడాన్ని ఆయన బహిరంగంగానే సమర్థించేవారు. అదే విధంగా పలుమార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జేర్పై దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఒలీవిరా ఫేస్బుక్ పోస్టుల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.