Railway Development
-
రైల్వేబడ్జెట్లో తెలంగాణకు రూ.4,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈసారి రైల్వేబడ్జెట్లో రూ.4,400 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి స్టేషన్గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలకు రెండు వందే భారత్ రైళ్లను అందించామని చెప్పారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో అశ్వనీ వైష్ణవ్ మాట్లాడారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్’పేరుతో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వేల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శ్రీవెంకటేశ్వర స్వామి సులభతర దర్శనం కోసమే వందేభారత్ రైలును ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు: కిషన్రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని.. మంచి మౌలిక వసతులు కల్పించేందుకే మోదీ హైదరాబాద్కు వచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. ఇప్పటివరకు దేశంలో 14 వందే భారత్ రైళ్లను ప్రారంభించామని, అందులో రెండింటిని తెలంగాణకు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తుండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంతకాలం ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయిందని.. బీజేపీ ఎంపీలు వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేయగా.. కేంద్రం చొరవ తీసుకుని మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ను, 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తోందని చెప్పారు. తెలంగాణను అన్నిరకాలుగా ఆదుకుంటున్న ప్రధాని మోదీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. -
త్వరలో కాజీపేట ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో తెలంగాణలోని రైల్వేల అభివృద్ధికి రూ. 4,418 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2009–14 మధ్య ఉమ్మడి ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు కేవలం రూ.886 కోట్లు కేటాయింపులు జరగ్గా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు రూ. 12,800 కోట్లు కేటాయించామన్నారు. శుక్రవారం ఢిల్లీలోని రైల్ భవన్లో అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కాజీపేటలో వ్యాగన్ ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కాజీపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెండర్లను పిలిచామని... త్వరలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఇందులోనే పీరియాడిక్ ఓవర్హాలింగ్, రిపేర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఉన్నాయన్నారు. దేశంలో వ్యాగన్ ఓవర్ హాలింగ్కు డిమాండ్ ఉందని... కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఓవర్ హాలింగ్లకు మధ్య పెద్ద తేడా ఉండదన్నారు. అందువల్ల కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే దేశంలో చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పారు. విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కాగా, కాజీపేటలో నెలకు 250 రైల్వే వ్యాగన్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి వాటి జీవితకాలాన్ని పెంచుతారు. దీనివల్ల దాదాపు 1,500 మందికి ఉపాధి కలుగుతుందన్న అంచనాలున్నాయి. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే సహకరించడం లేదన్న విమర్శలను అశ్వనీ వైష్ణవ్ కొట్టిపారేశారు. ఈ ఏడాది బడ్జెట్లో ఎంఎంటీఎస్కు రూ. 600 కోట్లు కేటాయించామని... ఎంఎంటీఎస్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వమే సహకరించట్లేదని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం చేయాల్సింది చేస్తుందని... మొదట ఎంఎంటీఎస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల తరహాలో 50 నుంచి 70 కి.మీ. దూరంలోని పట్టణాలను కలుపుతూ హైస్పీడ్ వందేభారత్ మెట్రో ప్రాజెక్టును త్వరలో పట్టాలెక్కించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వివరించారు. -
పార్లమెంట్కు చేరిన బిట్రగుంట అంశం
బిట్రగుంట రైల్వే అభివృద్ధి అంశం మరో మారు తీవ్రంగా తెరపైకి వచ్చింది. ఈ దఫా రైల్వే బోర్డు మెడలు వంచేందుకు ఉద్యమ ఘట్టం ప్రారంభమైంది. ఏటా రైల్వే బడ్జెట్కు ముందు లేదా కొత్త ప్రాజెక్ట్లు ప్రకటించినప్పుడు జిల్లా నేతలు, స్థానిక ప్రజా సంఘాలు బిట్రగుంట అభివృద్ధిపై గళమెత్తడం, రైల్వేబోర్డు మొండి చెయ్యి చూపాక రెండు రోజులు నిరసనలు తెలపడం షరా మామూలే అయినా ఈ దఫా మాత్రం వేడి కాస్త ఎక్కువగానే రాజుకుంది. సంవత్సరాలుగా స్థానికుల విజ్ఞప్తులు, అభ్యర్థనలను పట్టించుకోని రైల్వేబోర్డు తాజాగా ‘ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్’కు కూడా స్టాఫింగ్ నిరాకరించడంతో స్థానికులు భగ్గుమంటున్నారు. వినతిపత్రాలు, అభ్యర్థనలతో పనులు కావని ఆలస్యంగా అర్థం చేసుకుని పోరుబాటకు సిద్ధమవుతున్నారు. గూడూరు నుంచి విజయవాడకు Ðవెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్కు బిట్రగుంటలో స్టాపింగ్ ఇవ్వడంతో పాటు బిట్రగుంట నుంచి చెన్నైకు మెమూ రైలు, స్థానికంగా ప్రాజెక్ట్ల ఏర్పాటు నినాదంతో దశల వారీగా ఉద్యమాలను తీవ్ర స్థాయిలో నిర్వహించేందుకు ప్రజలు, ప్రజా సంఘాలు సమీకరణ అవుతున్నాయి. నిరసనలకు నాందీ ప్రస్తావనగా శనివారం భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా తర్వాత దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రం చేయడంతో పాటు సామూహిక ఆమరణ నినాదాలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, బిట్రగుంట: బిట్రిష్ కాలంలో ఒక వెలుగు వెలిగిన బిట్రగుంట 1980వ దశకంలో ప్రారంభమైన డీజిల్ ఇంజిన్లు, ఆ తర్వాత లోకో మోటివ్లతో ప్రాభవాన్ని కోల్పోయింది. తిరిగి పూర్వ వైభవానికి రెండు దశాబ్దాలుగా బిట్రగుంట ప్రజలు ఉద్యమాలు సాగిస్తున్నారు. 1880వ సంవత్సరం. ఆంగ్లేయులు రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ముమ్మరంగా సర్వే చేస్తున్న సమయం. ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక సమస్య. కొన్ని చోట్ల భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మరి కొన్ని చోట్ల ఆవిరి ఇంజిన్లు నడిపేందుకు అవసరమైన నీటి వనరుల లభ్యత లేకపోవడం. నాలుగేళ్ల సుదీర్ఘ అన్వేషణ తర్వాత పంటల అల్లూరు (ప్రస్తుత అల్లూరు) రామన్న చెరువుకు సమీపంలోని భాగవోలు (ప్రస్తుత బోగోలు) అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. సమతుల్యమైన నేల, రామన్న చెరువు ద్వారా పుష్కలమైన నీటి లభ్యత అనుకూల అంశంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు తెలుగు, ఇంగ్లిష్ కలగలసిన భాషలో ‘బెటర్ గుంట’గా పిలిచేవారు. కాల క్రమంలో అదే బిట్రగుంటగా మారింది. 1885 నాటికి ఈ ప్రాంతాన్ని భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దారు. సుమారు 4 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించి రైల్వేలైన్ల ఏర్పాటు, రైళ్ల మరమ్మతులను చేపట్టారు. ఆవిరి ఇంజిన్ల మరమ్మతులు, పరీక్షలకు కీలకమైన దేశంలోనే రెండో అతిపెద్ద లోకో రౌండ్ హౌస్ (మొదటి రౌండ్ హౌస్ మైసూర్లో ఉంది) నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టి 1935 నాటికి పూర్తి చేశారు. రైల్వే నిర్వహణ బాధ్యతల కోసం వలస వచ్చిన ఆంగ్లేయుల కోసం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో పాఠశాలలు, 30 పడకల ఆస్పత్రి, వినోద అవసరాల కోసం రైల్వే ఇన్స్టిట్యూట్, బర్మా టేకుతో తయారు చేసిన బిలియర్డ్స్ బోర్డు, ఫుట్బాల్ కోర్టు, పార్కులు ఏర్పాటు చేశారు. ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో బిట్రగుంట దశ తిరిగింది. దుకాణాలు, గృహాల నిర్మాణం ఊపందుకుని ప్రజల జీవన ప్రమాణాలు వేగంగా వృద్ధి చెందాయి. సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు ఈ ప్రాభవం కొనసాగింది. 1980 తర్వాత భారతీయ రైల్వేలో ఆధునికీకరణ ప్రారంభమై డీజిల్ ఇంజిన్లు అందుబాటులోకి రావడం బిట్రగుంటకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. బొగ్గు ఇంజిన్ల మరమ్మతుల్లో నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు కొత్త ఆవిష్కరణను అందిపుచ్చుకోవడంలో విఫలం కావడం షెడ్ ఆధునికీకరణకు అవరోదంగా మారింది. అంతలోనే విద్యుత్తో పనిచేసే ఇంజిన్లు కూడా అందుబాటులోకి రావడంతో లోకోషెడ్ మూతపడింది. ఆంగ్లో ఇండియన్లు ఒక్కొక్కరుగా బిట్రగుంట విడిచి వెళ్లిపోయారు. ఒక్కో విభాగం మూతపడుతూ 1998 నాటికి బిట్రగుంట పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. లోకోషెడ్, లోకో రౌండ్ హౌస్, సిబ్బంది క్వార్టర్లు, కార్యాలయ భవనాలు, పార్కు, ఫుట్బాల్ కోర్టు అన్నీ శిథిలావస్థకు చేరుకుని గత వైభవానికి చిహ్నాంగా మిగిలాయి. ఇటీవల లోకోషెడ్ను కూడా వేలం ప్రక్రియ ద్వారా తొలగించారు. అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితం ఆంగ్లో ఇండియన్ల కాలంలో ఒక వెలుగు వెలిగిన బిట్రగుంట రైల్వేకు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు జరిగిన ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సుమారు 2 వేల ఎకరాల స్థలం, నిపుణులైన కార్మికులు, విజయవాడ– చెన్నైల మధ్య కీలకమైన వనరులు బిట్రగుంట సొంతం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అమలుకు నోచుకోలేదు. రూ.100 కోట్ల ఖర్చయ్యే ఎలక్ట్రికల్ మల్టీఫ్యూయల్ యూనిట్ను ఇక్కడ ఏర్పాటు చేస్తే రూ.30 కోట్లతోనే పూర్తవుతుందని 1997 సెప్టెంబర్లో నిర్వహించిన రైల్వే అధికారిక సర్వేలో స్పష్టమైనా ఇంత వరకూ అతీగతీ లేదు. బిట్రగుంటలో ఏర్పాటు చేయాలనుకున్న క్యారేజ్ రిపేర్ వర్క్ షాపు ఒక సారి రేణిగుంటకు, మరోసారి రాయనపాడుకు తరలిపోయాయి. బిట్రగుంటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్నా చివరకు విజయవాడకు పక్కనే ఉన్న గుంటూరును ఎంపిక చేశారు. కొద్దిపాటి వ్యయంతో లోకోషెడ్ను ఎలక్ట్రికల్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ షెడ్డుగా మార్పు చేసుకోవచ్చనే ఆలోచన పదేళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉండి అధికారుల తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో బిట్రగుంట అభిృద్ధి కోసం జరుగుతున్న పోరాటాల నేపథ్యంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇక్కడ ఏదైనా రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. దీంతో 2004 సెప్టెంబర్ 17న అప్పటి రైల్వే మంత్రి లాలూప్రసాద్యాదవ్ను బిట్రగుంటకు తీసుకువచ్చి కాంక్రీట్ స్లీపర్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. ఇది కూడా నేటికీ కార్యరూపం దాల్చలేదు. బిట్రగుంట: నెల్లూరు జిల్లాలో రైల్వే కంటోన్మెంట్గా పేరు గడించిన బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ కర్మాగారం లేదా ఎలక్ట్రికల్ మల్టీఫుల్ యూనిట్ ఏర్పాటు చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్రెడ్డి లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ బిట్రగుంట విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. గతంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ కోచ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కార్యాచరణకు నోచుకోలేదని వివరించారు. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా ఫలితం కనిపించలేదన్నారు. ఈ కారణంగా సుమారు 1,100 ఎకరాల రైల్వే స్థలం నిరుపయోగంగా ఉందన్నారు. దేశంలోని అతిపెద్ద లోకోషెడ్ల్లో బిట్రగుంట లోకోషెడ్ ఒకటని గుర్తు చేశారు. డీజిల్, ఎలక్ట్రికల్ ఇంజిన్ల శకం ప్రారంభమైన తర్వాత ఈ లోకోషెడ్ మూతపడిందని తెలిపారు. 1885లో నిర్మించిన ఈ షెడ్కు అనుబంధంగా 1934లో లోకో రౌండ్ హౌస్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక్కడ 50 లోకో మోటివ్ ఇంజిన్లకు మరమ్మతులు చేసే సామర్థ్యంతో పాటు మేజర్ రైల్వే యార్డ్ కూడా ఉండేదని తెలిపారు. రైల్వే ప్రాజెక్ట్ల స్థాపనకు అవసరమైన అన్నీ వనరులు బిట్రగుంటలో ఉన్నందున తక్షణం ప్రతిపాదనల దశలో ఉన్న రైల్వేప్రాజెక్ట్ల్లో ఒక దాన్ని బిట్రగుంటకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన స్థానిక యువతకు రైల్వేప్రాజెక్ట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి చూపించవచ్చన్నారు. తక్షణం రైల్వే మంత్రి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా దశాబ్దాలుగా నిరాదరణకు గురైన బిట్రగుంట అంశాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఊపందుకుంటున్న ఉద్యమం బిట్రగుంటలో వందల ఎకరాల రైల్వే భూములు, వివిధ కార్యాలయాల నిర్వహణకు అవసరమైన భవనాలు, రైల్వే క్వార్టర్స్ అందుబాటులో ఉన్నా ప్రాజెక్ట్ల స్థాపనకు మాత్రం రైల్వే బోర్డు ముందుకు రావడం లేదు. కుంటి సాకులతో ప్రతి ప్రాజెక్ట్కు మోకాలడ్డుతోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం, రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకురాలేకపోవడంతో కోట్లాది రూపాయల రైల్వే ఆస్తులు నిరుపయోగంగా మారిపోయాయి. చివరకు రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చేందుకు బిట్రగుంటకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు బిట్రగుంట అభివృద్ధి కమిటీ పేరుతో ఐదారేళ్ల నుంచి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా త్వరలో ప్రారంభం కానున్న గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు బిట్రగుంటలో స్టాపింగ్ ఇవ్వకపోవడంతో బిట్రగుంట అభివృద్ధి అంశంపై తాడోపేడో తేల్చుకోవాలని నడుంబిగించారు. అందులో భాగంగా శనివారం భారీ స్థాయిలో జనసమీకరణ అయి ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం తర్వాత దశల వారీ ఉద్యమాలను తీవ్రస్థాయిలో చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో జీరో అవర్ సందర్భంగా శుక్రవారం బిట్రగుంట రైల్వే గురించి ప్రస్తావించడంతో జిల్లా వాసుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. -
నెల్లూరు రైల్వే రూపురేఖలు మారుస్తాం
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు నెల్లూరు (సెంట్రల్): రైల్వే శాఖ పరంగా నెల్లూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేసి రూపురేకలు మారుస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. నెల్లూరు సౌత్ స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, గూడూరులో యార్డ్ విస్తరణ, అదనపు ప్లాట్ ఫాంల నిర్మాణానికి శంకుస్థాపనలను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆదివారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వల్లే జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నెల్లూరు రైల్వే సమస్యల గురించి వెంకయ్యనాయుడు తనకు వివరించారన్నారు. వీటిని దశల వారీగా పరిష్కరిస్తానని ప్రభు హామీ ఇచ్చారు. నెల్లూరు మీదుగా కొత్త రైళ్లను వేయడంతో పాటు స్టేషన్ల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లను వేయడంతో పాటు కొత్త మార్గాలను కూడా నిర్మిస్తామన్నారు. సాగరమాల ప్రాజెక్ట్లో భాగంగా తీర ప్రాంతాలను కలుపుతూ రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ను రైల్వే పరంగా కూడా మొదటి స్థానంలో ఉండేలా చూస్తామన్నారు. నెల్లూరు స్టేషన్లో మరిన్ని సదుపాయాలు జిల్లాలో రైల్వే పరంగా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళికను రూపొందించామని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. గతంలో రైల్వే మంత్రిగా ఉన్న నితీష్ కుమార్ను తీసుకొచ్చి నెల్లూరును మోడల్ స్టేషన్గా ప్రకటింపచేసి సదుపాయాల కోసం రూ.5 కోట్లు మంజూరయ్యేలా చూశామన్నారు. నెల్లూరు–చెన్నైల మధ్య మెమూ రైళ్లను కూడా నడిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. దీనివల్ల కేవలం రూ.30కు నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లవచ్చన్నారు. నెల్లూరు స్టేషన్కు త్వరలోనే వైఫై సదుపాయాన్ని కల్పిస్తామని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాను ఆదేశించారు. గూడూరు–సికింద్రాబాద్ల మధ్య నడుస్తున సింహపురి ఎక్స్ప్రెస్ సమయాన్ని కూడా ప్రయాణికులకు అనుగుణంగా మార్చేందుకు అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ, నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వరప్రసాద్రావు, కలెక్టర్ జానకి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్కుమార్యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, బీద మస్తాన్రావు, గూడూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరిగ మురళి తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితో నగరం అభివృద్ధి : కలెక్టర్
కాకినాడ కలెక్టరేట్ : స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడను సమష్టి కృషితో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరాభివృద్ధికి అన్ని రంగాల అవసరాలను నివేదికలో పొందుపరచడం వల్లే కాకినాడకు జాబితాలో చోటు దక్కిందన్నారు. మంచినీరు, మురుగు వ్యవస్థతో పాటు మౌలిక, పౌర సదుపాయాల మెరుగుదల, సోలార్ విద్యుత్ వినియోగం, రైల్వే అభివృద్ధి, ఈఎస్ఐ ఆస్పత్రులు, విద్య, వైద్య రంగాలను కూడా నివేదికలో ప్రస్తావించినట్లు వివరించారు. తొలి జాబితాలో స్థానం దక్కడానికి పట్టణ పౌరులు, అనుభవజ్ఞులు, సోషల్ మీడియా ద్వారా అభిప్రాయ సేకరణ కూడా ఎంతో ఉపకరించినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ అలీం బాషాల కృషి అభినందనీయమన్నారు. -
తెలంగాణ రైల్వేకు వెయ్యి కోట్లివ్వాలి
రైల్వే మంత్రికి ఎంపీ దత్తాత్రేయ విజ్ఞప్తి న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనుల కోసం 2014-15 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడకు విజ్ఞప్తి చేశారు. అత్యాధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని విన్నవించారు. తెలంగాణలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గురువారం ఆయన రైల్వేమంత్రికి అందచేశారు. హైదరాబాద్- ఢిల్లీ, హైదరాబాద్- బికనీర్ మధ్య బుల్లెట్ రైళ్లను నడిపించాలని, సికింద్రాబాద్-బికనీర్, సికింద్రాబాద్ రాజ్కోట్ల మధ్య నడుస్తున్న సూపర్ఫాస్ట్ రైళ్లను ఇక మీదట రోజూ నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సికింద్రాబాద్-కాజీపేట మధ్య మూడో లైను ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలోని నిజామాబాద్, ఆదిలాబాద్ లైను విద్యుదీకరణ చేయాలని, కరీంనగర్-హసన్పర్తి లైనుకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. మణుగూరు-రామగుండం, భద్రాచలం-కొవ్వూరు, మెదక్-అక్కన్నపేట మధ్య కొత్త లైన్లను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్-మధురై (వయా తిరుపతి), సికింద్రాబాద్లో రాత్రి 9 గంటలకు బయలు దేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు బెంగుళూరు చేరేలా షెడ్యూల్తో కొత్త రైలును ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్-మహబూబ్నగర్, హైదరాబాద్-భద్రాచలం రోడ్, సికింద్రాబాద్-నల్లగొండ, కాజీపేట-కాగజ్నగర్ల మధ్య ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-గోవా, హైదరాబాద్-ముంబై మధ్య సూపర్ఫాస్ట్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.