satlok ashram
-
రామ్పాల్ ఆశ్రమంలో ఆయుధాలు!
బర్వాలా: హర్యానాలోని బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్పాల్కు చెందిన ఆధ్యాత్మిక సామ్రాజ్యం సత్లోక్ ఆశ్రమంలో ఆధునిక ఆయుధాలు దొరికాయి. ఆశ్రమంలో ఆయుధాలు చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. హర్యానా పోలీసులు ఆదివారం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. ఆశ్రమంలో ఆయుధాలు, నగదు, తూటాల రక్షణ కవచం, కమాండో డ్రెస్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 19న రామ్పాల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న రామ్పాల్ను ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్) అధికారులు ఆదివారం హిసార్లోని ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లారు. రామ్పాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆశ్రమంలో లాకర్లు, అల్మరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిని మేజిస్ట్రేట్ సమక్షంలో తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. సోదాల సందర్భంగా నాలుగు .315 బోర్ రైఫిళ్లు, .12 బోర్ తుపాకులు, తూటాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, కమాండో డ్రెస్లను గుర్తించినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వాటితోపాటు 32 బోరు రివాల్వర్లు, 19 ఎయిర్ గన్స్, రెండు డబుల్ బేరర్ గన్స్, 4200 కర్రలు, 171 హెల్మెట్లు, రామ్పాల్ ప్రైవేట్ కమాండోలు ధరించే 235 జతల యూనిఫామ్, 12 పెట్రోల్ బాంబులు కూడా లభించాయి. వాటినన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామ్పాల్ నివాసం ఉండే భవనంలో అత్యాధునిక వసతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో తనిఖీలు ఇంకా కొనసాగుతాయని ఆ అధికారి చెప్పారు. ఇదిలా ఉండగా, హర్యానా డీజీపి వశిష్ట, ఐజీపి అనిల్ కుమార్ రావు ఆదివారం ఆశ్రమాన్ని సందర్శించారు. ** -
స్నానం పాలతో.. ప్రసాదం!
హిస్సార్: అరెస్ట్ అనంతరం రాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భక్త కబీరు ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించుకున్న రాంపాల్.. భక్తులకు రోజూ అందించే ప్రసాదం ఏంటో తెలుసా?. పాలతో స్నానం చేసి.. ఆ పాలతో ఖీర్ తయారు చేయించి, భక్తులకు క్షీరామృతంగా అందిస్తారు. కాగా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించవద్దని, భక్త కబీర్ను మాత్రమే ఆరాధించాలని రాంపాల్ బోధించేవారు. విగ్రహారాధన లాంటి హిందూ సాంప్రదాయాలను పాటించవద్దనేవారు. అన్ని మత గ్రంధాల్లోనూ భక్త కబీర్ను దేవుళ్లకే దేవుడిగా పేర్కొన్నారని వివరించేవారు. ఇక బల్వారాలో 12 ఎకరాల సువిశాల స్థలంలో రాంపాల్ షత్లాక్ ఆశ్రమాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. భారీ స్విమింగ్ పూల్, ముఖ్య అనుచరుల కోసం ఎసీ గదులు ఉన్నాయి. అనుయాయులకు ల్యాప్టాప్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో లెక్చర్ హాళ్లు ఉన్న ఆధునిక ఆశ్రమం అది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా భారీగానే సమకూర్చుకున్నారని సమాచారం. ఆశ్రమంలో అర్థనగ్నంగా ఉండాలని అక్కడి నిర్వాహకులు తమని వేధించేవారని ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన మహిళలు తెలిపారు. స్వామీజీ వల్ల కొన్ని కుటుంబాలు కూడా నాశనమయ్యాయని వారు చెప్పారు. -
నేను నిర్దోషిని, ఏ తప్పు చేయలేదు: రాంపాల్
చండీగఢ్ : తాను అమాయకుడినని.... ఏ తప్పు చేయలేదని వివాదాస్పద ఆధ్యాత్మిక స్వామి రాంపాల్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఆయన మీడియాతో వాపోయారు. ఉద్రిక్తతల నడుమ నిన్న అరెస్ట్ చేసిన రాంపాల్ను పోలీసులు గురువారం హర్యానా హైకోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా, 2006లో జరిగిన హత్య కేసులో రాంపాల్కు లభించిన బెయిల్ను కూడా కోర్టు రద్దు చేసింది. కోర్టు ధిక్కరణ కేసు విచారణను ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. అత్యంత గందరగోళం నడుమ రాంపాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు... ఈ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఛండీఘర్లోని పంచకుల ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం రాంపాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. -
బాబా రాంపాల్కు వైద్య పరీక్షలు పూర్తి
-
బాబా రాంపాల్కు వైద్య పరీక్షలు పూర్తి
చండీగఢ్ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్కు గురువారం ఉదయం పంచకుల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం రాంపాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనను ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు రాంపాల్ నిన్న రాత్రి పోలీసులు బల్వారాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాంపాల్తో పాటు ఆయన కుమారుడు పురుషోత్తం దాస్, ఆశ్రమ ప్రతినిధి రాజ్ కపూర్ సహా 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాంపాల్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నంత సేపు ఆస్పత్రి బయట పెద్ద ఎత్తున ఆయన భక్తులు గుమ్మిగూడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు 2006లో జరిగిన హత్య కేసులో రాంపాల్ బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. -
నేడు కోర్టుకు స్వామి రాంపాల్
-
స్వామి రాంపాల్ అరెస్ట్
ఉద్రిక్తత నడుమ ఆశ్రమంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం ఉదయం నుంచీ ఆశ్రమం వద్ద భద్రత బలగాలు ఆశ్రమంలో దాదాపు 15 వేలమంది అనుచరులు బర్వాలా/చండీగఢ్: ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్(63)ను బుధవారం రాత్రి పోలీసులు బల్వారాలోని ఆయన ఆశ్రమంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో దాదాపు రెండు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతకు తెరపడినట్లైంది. గురువారం ఉదయం హిస్సార్ కోర్టులో, శుక్రవారం పంజాబ్, హర్యానా హైకోర్టులో ఆయనను హాజరు పరుస్తామని పానిపట్ జిల్లా ఎస్పీ సతీశ్ బాలన్ వెల్లడించారు. చాలా కఠినమైన ఆపరేషన్ అనంతరం రాంపాల్ను అదుపులోకి తీసుకున్నామని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ తెలిపారు. వేలాది మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఆశ్రమంలో ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు ఎస్పీలు పాల్గొనడం విశేషం. 200 మందికి పైగా గాయాలపాలైన మంగళవారం నాటి ఘర్షణల అనంతరం.. బుధవారం ఉదయం నుంచీ ఆశ్రమం వద్ద పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆశ్రమం చుట్టూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. రాంపాల్ లొంగిపోవాలంటూ లౌడ్ స్పీకర్లలో పదేపదే ప్రకటించారు. ఆశ్రమంలో ఉన్నవారిలో దాదాపు 15 వేల మంది వెలుపలికి వచ్చారు. వారిని పోలీసులు క్షణ్ణంగా పరీక్షించారు. స్వామి రాంపాల్ ప్రైవేటు సైన్యం, అనుచరులు బలవంతంగా తమను లోపలే ఉంచారని బయటకు వచ్చినవారు తెలిపారు. ఆశ్రమం వద్ద మరింత హింస జరిగేందుకు అవకాశముందన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. మరో 500 మంది పారా మిలటరీ బలగాలను కేంద్రం హర్యానాకు పంపించింది. ఆశ్రమంలోకి విద్యుత్, నీటి సరఫరాలను అధికారులు నిలిపేశారు. మరోవైపు, ఆశ్రమంలో చనిపోయిన నలుగురు మహిళల మృతదేహాలను ఆశ్రమ వర్గాలు పోలీసులకు అప్పగించాయి. అస్వస్థతతో ఉన్న ఒక చిన్నారి, మరో మహిళను కూడా అప్పగించాయి కానీ వారు అనంతరం ఆసుపత్రిలో మరణించారు. వీరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని, ఈ మరణాలపై దర్యాప్తు జరుపుతున్నామని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ తెలిపారు. ఆశ్రమం లోపల ఉన్నవారిలో హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచి వచ్చిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారన్నారు. రాంపాల్ కుమారుడు, ప్రధాన అనుచరుడు పురుషోత్తం దాస్, ఆశ్రమ ప్రతినిధి రాజ్ కపూర్ సహా 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా స్వామి రాంపాల్, రాజ్ కపూర్, పురుషోత్తం దాస్ సహా పలువురిపై దేశద్రోహం సహా వివిధ కేసులు నమోదు చేశారు. రాంపాల్పై ఇప్పటికే హత్య, హత్యాయత్నం, ఫోర్జరీ కేసులున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం సీఎం ఖట్టర్కు ఫోన్ చేసి రాంపాల్ అరెస్ట్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారని, త్వరగా దీనికి తెర దించాలని ఆదేశించారని తెలిసింది. మెర్సిడెజ్లు.. బీఎండబ్ల్యూలు..! హిస్సార్: 1951లో హర్యానాలోని సోనేపట్లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాంపాల్ సింగ్ జతిన్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేసి హర్యానా నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్గా చేరారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను 2000 సంవత్సరంలో విధుల్లోం చి తొలగించారు. తర్వాత ఆయనే సద్గురు రాంపాల్జీ మహారాజ్గా అవతారం ఎత్తారు. రాంపాల్ ప్రస్తుతం దాదాపు 100 కోట్ల ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న బల్వారాలో 12 ఎకరాల విశాల స్థలంలో ప్రధాన ఆశ్రమమనే ఆధునిక భవనంలో ఆయన నివాసం ఉంది. ఆయనకు ప్రైవేటు సైన్యంతోపాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ కార్లు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకు 25 లక్షల మందికిపైగా అనుచరులు, భక్తులున్నారు. -
రామ్పాల్ ఆశ్రమం వద్దకు పారామిలటరీ బలగాలు
బల్వారా: హర్యానా బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్పాల్ కు చెందిన సత్యలోక్ ఆశ్రమం వద్ద శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్రం 500 పారామిలటరీ బలగాలను తరలించింది. హర్యానా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు బలగాలను పంపించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రామ్పాల్ ను అరెస్ట్ చేసేందుకు మంగళవారం పోలీసులు ప్రయత్నించగా హింస చెలరేగింది. సత్యలోక్ ఆశ్రమం వద్ద మళ్లీ ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించడంతో హోంశాఖ అప్రమత్తమైంది. ఆశ్రమంలో దాదాపు 12 వేల మంది రామ్పాల్ అనుచరులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆశ్రమం ఖాళీచేసి వెళ్లాలని వీరందరినీ పోలీసులు ఆదేశించారు. రామ్పాల్ ఇప్పటికీ ఆశ్రమంలోనే ఉన్నారని, ఆయనను అరెస్ట్ చేసే తమ వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట తెలిపారు.