AP: పింఛనే కాదు.. పెన్షనర్లూ పెరిగారు | CM Jagan Govt Increased Pensions And Also Pensioners | Sakshi
Sakshi News home page

AP: పింఛనే కాదు.. పెన్షనర్లూ పెరిగారు

Published Wed, Jan 3 2024 4:57 AM | Last Updated on Wed, Jan 3 2024 8:37 AM

CM Jagan Govt Increased Pensions And Also Pensioners - Sakshi

సాక్షి, అమరావతి/కాకినాడ: అవ్వాతాతలతో పాటు వితంతువులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్‌ మొత్తం ఈనెల నుంచి రూ.మూడు వేలకు సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పింఛను పెంపు ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. వలంటీర్లు ఓ వైపు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తుండగా.. మరోవైపు రెండ్రోజులుగా వివిధ మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చురుగ్గా పాల్గొంటున్నారు.

నాలుగున్నర ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో కొత్తగా పింఛన్లు మంజూరు కావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టాక పింఛన్ల పంపిణీలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు గుర్తుచేస్తున్నారు. దీంతో.. ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఇచి్చన మాట ప్రకారం రూ.3,000ల పెన్షన్‌ అమలుపై వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
నేడు కాకినాడ ఉత్సవాలకు సీఎం జగన్‌.. 
ఈ నేపథ్యంలో.. బుధవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే పింఛన్ల పెంపు ఉత్సవంలో స్వయంగా పాల్గొననున్నారు. ఈ జనవరి ఒకటో తేదీ నుంచి 66,34,742 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తం రూ.1,967.34 కోట్లు విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన మెగాచెక్‌ను ముఖ్యమంత్రి కాకినాడలో ఆవిష్కరిస్తారు. అలాగే, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుకు ఇటీవల జాతీయ స్థాయిలో స్కోచ్‌ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన ప్లాటినం అవార్డును సీఎం జగన్‌ ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. అంతేకాక.. లబ్ధిదారులతో ఆయన  నేరుగా మాట్లాడుతారు.

అనంతరం.. రూ.65 కోట్లతో నిర్మించిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ను (ముత్తా గోపాలకృష్ణ వారధి), రూ.20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయరామ్‌కుమార్‌ కళాక్షేత్రాన్ని, రూ.9.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్‌ రింక్‌ను సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిచేశారు. సీఎం పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆయన ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎంపీ వంగా గీత, వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్‌ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్, ఇతర ప్రముఖులు సమీక్షించారు. 
 
సీఎం షెడ్యూల్‌ ఇలా.. 
– ఉ.9.30కు ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి నుంచి బయల్దేరి 10.20 గంటలకు కాకినాడకు చేరుకుంటారు.  
– ఉ.10.40కు బహిరంగ సభ జరిగే రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 
– 11.55 వరకూ వైఎస్సార్‌ పింఛన్‌ పెంపు ఉత్సవంలో పాల్గొంటారు. 
– మ.12 గంటల ప్రాంతంలో కాకినాడ నుంచి బయల్దేరుతారు. 
– మ.2 గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement