
సాక్షి, అమరావతి: గ్రామాల్లో కరోనా కట్టడితో పాటు పారిశుధ్య పనుల నిర్వహణకు ఉద్దేశించిన ‘జగనన్న స్వచ్ఛ సంకల్ప’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించడంతో పాటు వయసుతో నిమిత్తం లేకుండా వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాశారు.
ఈ సీజన్లో డయేరియా కేసులు తగ్గాయి
కాగా, ఏటా ఈ సీజన్లో గ్రామీణ ప్రాంతాల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయని, కానీ సర్పంచుల ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాల కారణంగా ఇప్పుడు గ్రామాల్లో ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని మంత్రి పెద్దిరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు. 30 గ్రామ పంచాయతీల్లో కరోనా అనేది లేదని, ముందుముందు అనేక గ్రామాలు కరోనా రహిత గ్రామాలుగా మారాలని మంత్రి ఆకాంక్షించారు.