
సాక్షి, హైదరాబాద్ : బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రవర్తన అచ్చం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పోలి ఉందని చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ అన్నారు. సీఎం జగన్ను చూస్తుంటే ఆయన తండ్రి వైఎస్సార్ గుర్తుకు వచ్చారని చెప్పారు. ( సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు)
ఈ మేరకు గురువారం ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘‘ వైఎస్సార్ ఇవాళ లేరే అని అనుకున్నాను.. కానీ, ఆయన పోలేదు. ఆయన ఉన్నారనేది ఇప్పుడు వైఎస్ జగన్ రూపంలో ప్రపంచమంతా చూసింది. ప్రపంచవ్యాప్తంగా మీకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం కూడా మీరు తిరుమలలో ఉంటున్నందుకు చాలా సంతోషం. ధార్మిక పరిషత్ అమల్లోకి రావాలి. అందుకు మీ సహకారం అవసరం’’ అని సౌందరరాజన్ పేర్కొన్నారు.