వృద్ధుడు అనుమానాస్పద మృతి
పీలేరురూరల్ : అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రేగళ్లులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని రేగళ్లు పంచాయతీ నగిరికి చెందిన డి. కృష్ణయ్య (64) గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో శుక్రవారం మృతదేహం లక్ష్యమైంది. పీలేరు పట్టణం జర్నలిస్టు కాలనీలో కాపురం ఉంటూ జీవనం సాగిస్తున్న ఆయన గురువారం స్వగ్రామానికి వెళ్లి చౌకదకాణంలో బియ్యం తీసుకెళ్లాడు. అనంతరం ఇంటి నుంచి వెళ్లి కనబడలేదు. శుక్రవారం పొలాల వద్ద కృష్ణయ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. గట్టు గ్రామానికి చెందిన అశోక్ భార్య భార్గవి కుటుంబసమస్యలతో ఇంటివద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగ వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు.
తండ్రి, కొడుకులపై దాడి
మదనపల్లె : ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తండ్రి, కొడుకులపై దాడిచేసిన ఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని శేష్మహల్ సమీపంలో నివసిస్తున్న జాషువా(50) అదే ప్రాంతంలో ఉన్న వెంకటరమణకు స్థలం కొనుగోలు కోసం మూడు సంవత్సరాల క్రితం మూడులక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే మూడేళ్లుగా స్థలం ఇప్పించకపోగా, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో గురువారం రాత్రి జాషువా నగదు తిరిగి ఇవ్వాల్సిందిగా వెంకటరమణను నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వెంకటరమణ, జాషువాను కొట్టాడు. దీంతో జాషువా తన కుమారుడు భరత్(28), జోసెఫ్(22), మహేష్(20) లకు సమాచారం ఇచ్చి సంఘటనాస్థలానికి పిలిపించాడు. దీంతో వెంకటరమణ సైతం తన మనుష్యులను అక్కడకు రప్పించి జాషువా, అతడి కుమారులపై దాడికి పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్లు సీఐ ఎరీషావలీ తెలిపారు.
సౌమ్యనాథుడి హుండీ ఆదాయం లెక్కింపు
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రూ. 1,94,302 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. 24 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు చెప్పారు. మొత్తం డబ్బును ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ హనుమంతయ్య, టీటీడీ విజిలెన్సు అధికారి రమణారెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వృద్ధుడు అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment