గుండాల: ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతమంది మారినా తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని, గ్రామాభివృద్ధికి లిఖితపూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తామని, లేదంటే ఎన్నికలు బహిష్కరిస్తామని ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురం గ్రామస్తులు తీర్మానించారు. ఈ మేరకు గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామంలో రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. అన్ని పార్టీల నాయకులకు ఎన్నికల సమయంలోనే తమ గ్రామం గుర్తొస్తుందని, ఆ తర్వాత తమ బాధలు ఎవరికీ పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లపల్లి నుంచి పెద్ద వెంకటాపురం వరకు రోడ్డు సౌకర్యం, పెద్ద వెంకటాపురం– సింగారం, పెద్దవెంకటాపురం – తుమ్మల గూడెం, బూసురాయి గ్రామాల మధ్య రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏదైనా మొబైల్ సిగ్నల్ సౌకర్యం కల్పించాలని కోరారు. డ్రెయినేజీ వ్యవస్థ లేదని, పోడు భూముల సమస్యతో నిత్యం అటవీ అఽధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాకే తమను ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. సమావేశంలో గ్రామ దొర సురేందర్, పటేల్ నాగరాజు, నీలమయ్య, కళ్యాణ్, నాగేశ్వరావు, నర్సింహారావు, మల్లయ్య, వసంతరావు, సత్యం, రామయ్య, బుచ్చయ్య, లక్ష్మీనారాయణ, నరేందర్, లక్ష్మి, కళావతి, మంగ, నరేష్ పాల్గొన్నారు.
పెద్ద వెంకటాపురం గ్రామస్తుల తీర్మానం