ఫోన్‌ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు | Electricity Consumers In Telangana Will Not Be Able To Pay Their Bills Through Third Party Apps | Sakshi
Sakshi News home page

ఫోన్‌ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు

Published Tue, Jul 2 2024 3:22 PM | Last Updated on Tue, Jul 2 2024 3:49 PM

Electricity consumers in the State will not be able to pay their bills through third party apps

టీజీఎస్‌పీడీసీఎల్‌ ప్రకటన

ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్‌పీడీసీఎల్‌ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్‌పీడీసీఎల్‌ లేదా ఎస్‌పీడీసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో వివరాలు వెల్లడించింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో 85 శాతానికి పైగా పవర్‌ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్‌లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్‌)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్‌ పార్టీ యాప్‌లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.

ఆర్‌బీఐ నిబంధనలు..

జులై 1 నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్‌) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్‌ను ఎనేబుల్‌ చేసుకోలేదు. దానివల్ల ఫోన్‌పే, గూగుల్‌ పే, అమెజాన్‌ పే.. వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్‌ల ద్వారా క్రెడిట్‌ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్‌ చేయలేరు.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..

ఇదిలాఉండగా ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్‌ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement