
భారత బీమా ఫ్రేమ్వర్క్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్యాంకింగ్, అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన ఐదుగురు కీలక వ్యక్తులను బీమా సలహా కమిటీ (ఐఏసీ)లో భారత బీమా నియంత్రణ సంస్థ నియమించింది. ఇన్సూరెన్స్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, అవకాశాలను పరిష్కరించే బాధ్యతను కొత్తగా ఏర్పాటైన కమిటీకి అప్పగించారు. దేశంలో బీమా నియంత్రణ భవిష్యత్తును రూపొందించడానికి కార్యాచరణ సిఫార్సులను వివరిస్తూ మూడు నెలల్లో ఈ కమిటీ సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యుల్లో ఎల్ఐసీ మాజీ ఛైర్మన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎంఆర్ కుమార్, ఎస్బీఐ మాజీ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా, ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈవో విశాఖ ములే, కోటక్ మహీంద్రా ఏఎంసీ ఎండీ నీలేష్ షా, జీఐసీ రే మాజీ సీఎండీ, ఎయిరిండియా, టాటా ఏఐఏ లైఫ్ స్వతంత్ర డైరెక్టర్ ఆలిస్ జి వైద్యన్లు ఉన్నారు.
ఇదీ చదవండి: రూ.10కే కోకాకోలా, పెప్సికో షుగర్ ఫ్రీ డ్రింక్స్
పాలసీలకు సంబంధించిన నిర్ణయాల్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కు సలహాలు ఇచ్చే ఐఏసీ మూడు నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎఫ్డీఐల వాటాను 100 శాతానికి పెంచుకునేలా ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దీనిపై ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కొత్త బిల్లును రూపొందించాలని భావిస్తుంది. కొత్త ముసాయిదా బిల్లులో ఐఏసీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment