![No Free Toll For Long Queues At Toll Plazas Govt Clarifies](/styles/webp/s3/article_images/2024/08/4/toll.jpg.webp?itok=EBusgDQz)
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద క్యూ పొడవు లేదా వేచి ఉండే సమయాల ఆధారంగా ప్రస్తుత నిబంధనలు టోల్ ఫీజు మినహాయింపులను అందించవని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎంపీలు లేవనెత్తిన ఆందోళనలను ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో రెండు వేర్వేరు సమాధానాల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
60 కిలోమీటర్ల లోపే ఉన్నప్పటికీ రెండు ప్లాజాల్లో టోల్ వసూలు చేస్తున్నారని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ "ఎన్హెచ్ ఫీజు నిబంధనలు, రాయితీ ఒప్పందం ప్రకారం 60 కి.మీ పరిధిలో ఉన్నప్పటికీ ఫీజు ప్లాజాలకు అనుమతి ఉంటుంది" అని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా దీనికి సంబంధించి 2022 మార్చిలో గడ్కరీ మాట్లాడిన పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. 60-కిమీ పరిధిలో ఒకే ఒక టోల్ ప్లాజా ఉంటుందని, అదనంగా ఉన్నవాటిని మూడు నెలల్లో మూసివేస్తామని అందులో ఆయన హామీ ఇచ్చారు.
అయితే, లోక్సభలో ఆయన తాజాగా ఇచ్చిన సమాధానం దీనికి విరుద్ధంగా అలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. ఎగ్జిక్యూటింగ్ అథారిటీ డాక్యుమెంట్ చేసిన దాని ప్రకారం, అవసరమైతే 60 కిలోమీటర్లలోపు అదనపు టోల్ ప్లాజాలకు నిబంధనలు అనుమతిస్తున్నట్లు గడ్కరీ వివరించారు.
ఇక కొత్త టోల్ ప్లాజాల రూపకల్పనకు మార్గదర్శకాల్లో భాగంగా రద్దీ సమయాల్లో వాహనాల క్యూలు 100 మీటర్లు దాటితే బూమ్ బారియర్స్ను ఎత్తివేసే అంశంపై మరో ఎంపీ అడిగిన ప్రశ్నకూ గడ్కరీ స్పందించారు. “ఫీజు ప్లాజాల వద్ద నిర్ణీత దూరం లేదా సమయ పరిమితి దాటి వాహనాలను నిలిపివేసిన సందర్భంలో ఆ వాహనాలను యూజర్ ఫీజు నుంచి మినహాయించే నిబంధన లేదు” అని ఆయన స్పష్టం చేశారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి అమలును ఆయన గుర్తు చేశారు. ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment