డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య

Published Sun, Jun 16 2024 4:40 AM

Murder of parents for money

నిద్రిస్తుండగా గొంతు నులిమి చంపిన కుమారుడు

ఆపై మృతదేహాలపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన వైనం

నిందితుడి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు 

నర్సాపూర్‌: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. 

తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్‌ ఫైనాన్స్‌లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.

గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్‌.. గత నెల 17న సాదుల్లానగర్‌కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్‌ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల  నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్‌ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్‌ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. 

వాట్సాప్‌ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్‌ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్‌ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.    

Advertisement
 
Advertisement
 
Advertisement