
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్పై శనివారం జరిగిన వైమానిక దాడిలో అయిదుగురు చిన్నారులు సహా 17 మంది చనిపోయారు. ఆర్మీకి, శక్తివంతమైన పారా మిలటరీ విభాగం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్)కు మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిలటరీ విమానాలు ఆర్ఎస్ఎఫ్పై దాడులు జరుపుతుండగా, ఆర్ఎస్ఎఫ్ బలగాలు డ్రోన్లతో సైన్యంపై దాడులకు దిగుతోంది. ఖార్టూమ్లోని యోర్మౌక్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య భీకరపోరు సాగుతోంది.
ఈ నేపథ్యంలో తాజా దాడికి ఎవరు కారణమనే విషయం స్పష్టం కాలేదు. ఈ దాడిలో మరో 11 మంది వరకు గాయపడినట్లు మానవతా సాయం అందిస్తున్న ఒక సంస్థ అంటోంది. మిలటరీయే అక్కడ దాడి చేసిందని, తాము ఒక మిగ్ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆర్ఎస్ఎఫ్ అంటోంది. ఆర్మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అరబ్ మిలీషియాకు చెందిన జన్జవీద్ సంస్థ ఆర్ఎస్ఎఫ్తో కలిసి పోరాడుతోందని సమాచారం. జన్జవీద్ను విమర్శించినందుకే ఇటీవల పశ్చిమ దర్ఫుర్ గవర్నర్ ఖమిస్ అబ్దల్లా అబ్కర్ను చంపేశారని విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment