
యాంగాన్: మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, పెత్తనం సాగిస్తోన్న జుంటా సైనిక చర్యకు వ్యతిరేకంగా సెంట్రల్ మయన్మార్లో జరిగిన ఘర్షణల్లో ఇరవై ఐదు మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో యాంటీ జుంటా ఉద్యమకారులతో పాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలగొట్టి, పాలనా పగ్గాలు చేపట్టిన జుంటా సైన్యం.. నిత్యం తుపాకుల మోత మోగిస్తూ అరాచకం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు సైనిక బలగాల చేతుల్లో 890 మంది ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంఘం తెలిపింది. కాగా, జుంటా సైన్యం చేపడుతున్న చర్యలు సిరియాలో మాదిరిగా పౌర సంఘర్షణలకు దారి తీయవచ్చని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తుంది.