
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్కు కీలకమైన పవర్ గ్రిడ్ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.
ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్లో భారీగా పేలుళ్లు జరిగాయి.
ఇక్కడి సిటీ సెంటర్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.
ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్గ్రిడ్ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment