మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ | Sakshi
Sakshi News home page

మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ

Published Mon, May 6 2024 2:40 AM

మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ

అచ్చంపేట రూరల్‌/ఉప్పునుంతల: రాష్ట్రంలో 80లక్షలకు పైగా ఉన్న మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా మాదిగలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఫంక్షన్‌హాలులో మాదిగ రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. అదేవిధంగా ఉప్పునుంతలలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓట్లు వేయడానికి మాదిగలు కావాలి కానీ, ఎంపీ సీట్లు ఇవ్వరా? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాదిగలకు బీఆర్‌ఎస్‌ సముచిత స్థానం కల్పించిందన్నారు. కేంద్రంలో బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. చరిత్ర తిరగ రాయాలన్నా.. చరిత్ర సృష్టించాలన్నా మాదిగలకే సాధ్యమన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు సంపాదించిన నాగర్‌ కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎంతోమంది స్వార్థపరులు పదవులను అనుభవించి బీఆర్‌ఎస్‌ను వీడితే.. తాను మాత్రం కేసీఆర్‌ నికార్సయిన పాలనకోసం, పేద ప్రజల సంక్షేమం కోరి బీఆర్‌ఎస్‌లోకి వచ్చానని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. తాను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్న సమయంలో పేద విద్యార్థులను ఎంతోమందిని ఉన్నత స్థితికి తీసుకెళ్లానన్నారు. ప్రస్తుత ఎంపీ రాములు రాజకీయ లబ్ధి కోసం బీజేపీలో చేరి తన కుమారుడి అధికారం కోసం తహతహలాడుతున్నాడే తప్పా ఈ ప్రాంత అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నవీన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సత్తు భూపాల్‌రావు, గోపాల్‌రెడ్డి, రవీందర్‌రావు, భాస్కర్‌, శంకర్‌, విజయ్‌, వెంకటయ్య, రవీందర్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement