ఎత్తిపోతలు సరే.. రిజర్వాయర్లేవి?
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని గణపసముద్రం చెరువు
● ప్రతిపాదనలను దాటని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం
● వరదలు వస్తున్నా కృష్ణా, తుంగభద్ర
నీటిని ఒడిసిపట్టుకోలేని దుస్థితి
● భారీ సామర్థ్యం గల జలాశయాలు
లేక నెరవేరని లక్ష్యం
● పాలమూరులో పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాని ఆయకట్టు
● కేఎల్ఐ, తుమ్మిళ్ల పెండింగ్ ప్రపోజల్స్పై రైతుల ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా.. ఉప్పొంగి ప్రవహిస్తున్నా.. ఆ నీటిని ఒడిసిపట్టుకోలేని దుస్థితి పాలమూరుది. నదీ నీటి మట్టం కంటే ఎక్కువ ఎత్తులో ఉండడమే ఇందుకు కారణం కాగా.. ఎత్తిపోతల పథకాలకు అంకురార్పణ జరిగింది. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ఎత్తిపోతల ప్రాజెక్ట్లకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చేపట్టాల్సిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాలు ఇప్పటికీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. కొన్నింటిని నిర్మించినప్పటికీ.. నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో ఆయకట్టు చివరి వరకు ఒక్క పంటకు సైతం పూర్తిస్థాయిలో నీరందడం లేదు. ప్రధానంగా కల్వకుర్తి, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాల్లో పలు రిజర్వాయర్ల నిర్మాణాలు అటకెక్కగా.. వాటి పరిధిలోని ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కేఎల్ఐ.. ప్రతిపాదనలకే పరిమితం
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐ)లో ఇప్పటివరకు నాలుగు రిజర్వాయర్లు నిర్మించారు. ఎల్లూరు 0.35 టీఎంసీలు, సింగోటం 0.55 టీఎంసీలు, జొన్నలబొగుడ 2.14 టీఎంసీలు, గుడిపల్లిగట్ట 0.96 టీఎంసీలు.. అన్ని కలిపి దాదాపు నాలుగు టీఎంసీల నిల్వ సామర్థ్యం గలవి ఉన్నాయి. కృష్ణానదికి సాధారణంగా 60 వరద రోజులు కాగా.. ఒక్కోసారి ఎక్కువ నమోదు కావొచ్చు. మొత్తం నాలుగు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్లలో 40 టీఎంసీలను ఎత్తిపోసేలా సమర్థవంతమైన నిర్వహణ కుదరడం లేదు. దీంతో కల్వకుర్తి కింద ప్రస్తుతం మూడు లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. ఈ ఎత్తిపోతల కింద నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో 47 అదనపు రిజర్వాయర్లను నిర్మించాలని అధికారులు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment