
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణం ఆయన అభిమానులకు తీరని లోటు అని చెప్పవచ్చు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు మిస్ యూ మ్యూజిక్ లెజండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు జాకీర్ జీవితంలో ప్రత్యేకమైన విషయాల గురించి చర్చించుకుంటూ పోస్ట్లు పెడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన జాకీర్ హుస్సేన్.. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, ఫ్యూజన్ సంగీత రంగంలో గణనీయమైన కృషి చేశారు. జాజ్, రాక్ వంటి సంగీతంలో నైపుణ్యం సాధించి ఆపై వాటికి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని మిళితం చేయడంలో జాకీర్ హుస్సేన్ ఒక మార్గదర్శకుడిగా నిలిచారు. శక్తి బ్యాండ్లోని జాన్ మెక్లాఫ్లిన్ వంటి కళాకారులతో పాటు అమెరికన్ వాద్యకారుడు మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ కోసం ఆయన పనిచేశారు. ఆ ప్రదర్శనలు అన్నీ సంచలనం రేపాయి.

చిత్ర పరిశ్రమలో జాకీర్ హుస్సేన్ పాత్ర
జాకీర్ హుస్సేన్ అనేక చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి తనదైన ముద్ర వేశారు. ఆయన సంగీతం అందించిన సాజ్, కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి చిత్రాలకు మంచి ఆదరణ వచ్చింది. ఆపై పలు సినిమాల్లో కూడా నటించారు కూడా. చివరగా మంకీ మ్యాన్ (2024) చిత్రంలో ఆయన కనిపించారు. జాకీర్ హుస్సేన్ సినిమాకి చేసిన కృషి చెరగని ముద్ర వేసింది. తబలాలో అతని నైపుణ్యాన్ని ప్రపంచ చలనచిత్రాలతో మిళితం చేసింది. భారత చిత్ర పరిశ్రమకు జాకీర్ హుస్సేన్ అందించిన గణనీయమైన సహకారం మరువలేనిదని చెప్పవచ్చు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ఆయన ప్రదర్శనలిచ్చారు. ఈ క్రమంలో విమర్శకుల నుంచి కూడా ఆయన ప్రశంసలు అందుకున్నారు.
జాకీర్ హుస్సేన్ గురించి ఆసక్తికరమైన విషయాలు
జాకీర్ హుస్సేన్ తన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా మార్గదర్శకత్వంలో మూడు సంవత్సరాల వయస్సులోనే తబలా వాయించడం ప్రారంభించారు. ఆపై ఏడేళ్ల వయస్సులోనే తన మొదటి బహిరంగ సంగీత ప్రదర్శన ఇచ్చారు.
ఆయన కేవలం 12 సంవత్సరాల వయస్సులో తన మొదటి అంతర్జాతీయ సంగీత కచేరీ పర్యటనను ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించారు.
సంగీతంలో రాణించడంతో పాటు, అతను ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.
జాకీర్ హుస్సేన్ మిక్కీ హార్ట్తో కలిసి "ప్లానెట్ డ్రమ్" ఆల్బమ్లో తన సహకారానికి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించిన కొద్దిమంది భారతీయ సంగీతకారులలో ఒకరిగా రికార్డ్ క్రియేట్ చేశారు.
భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా.. జాకీర్ జార్జ్ హారిసన్, జాన్ మెక్లాఫ్లిన్ (శక్తి), యో-యో మా వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి.. తూర్పు. పాశ్చాత్య సంగీత సంప్రదాయాల మధ్య అంతరాన్ని తగ్గించారు.
జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో వర్క్షాప్ల ద్వారా తదుపరి తరం తబలా ప్లేయర్లను పెంపొందించడంలో తనవంతుగా పనిచేశారు.
అతను భారతదేశంలో 'నేషనల్ ట్రెజర్' బిరుదుతో గౌరవించబడ్డారు. ఆపై భారతీయ సంగీతానికి సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.
ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment