వెంకటాపురం(ఎం): మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం మండల పరిధిలోని కల్వర్టులతో పాటు, పోలింగ్ కేంద్రాలను బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసినట్లు వెంకటాపురం ఎస్సై చల్లా రాజు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
గోవిందరావుపేట: పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను శనివారం ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్ శనివారం పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా మండల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన రంగాపూర్, ముత్తాపూర్, ప్రాజెక్ట్ నగర్ తో పాటు సమస్యాత్మకమైన చల్వాయి, పస్రా గ్రామాల పోలింగ్ కేంద్రాలను పస్రా సీఐ శంకర్, ఎస్సై కమలాకర్ లతో కలిసి ములుగు డీఎస్పీ ఎన్. రవీందర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో గతంలో జరిగిన ఎన్నికల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరగటానికి డీఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
వెంకటాపురం(కె): ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అవుతుందని బీజేపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సీతారాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యకర్తలు నిరంతరం సైనికుల్లా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అట్లూరి రఘురామ్, జాడి లక్ష్మి, త్రీనాధ్, లక్ష్మిపతి పాల్గొన్నారు.
ఓపెన్ కాస్ట్ షిఫ్ట్
సమయాలు మార్చాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్కాస్ట్ గనుల్లో పని వేళలు మార్చాలని కోరుతూ.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం గని మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని కార్మికుల పని సమయాలను మార్చాలని కోరారు. ఓపెన్కాస్ట్ ఉద్యోగులు అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట రామచందర్, ఎండీ కరిముల్లా, అల్లి చేరాలు, కృష్ణ, మధు, విజేందర్, కృష్ణారెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్షల్ని వాయిదా
వేయాలని వినతి!
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఈనెల 6 నుంచి నిర్వహించే డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2,4,6 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు విద్యార్థులు శనివారం కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిసి విన్నవించినట్లు సమాచారం. ఎండలు తీవ్రంగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారని, వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయ మై రిజిస్ట్రార్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు సకాలంలో నిర్వహిస్తేనే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నా రు. ముఖ్యంగా టీఎస్ఐసెట్, పీజీసెట్ తదితర ప్రవేశ పరీక్షలు ఉంటాయని అందువల్ల డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈనెల 6 నుంచి యథావిధిగా పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.