నారాయణపేట: ఎన్నికల పోలింగ్ నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారులు జి. రవినాయక్, కోయ శ్రీహర్షల ఆధ్వర్యంలో నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్ల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. రెండు నియోజకవర్గాలలో 156 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు గాను రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 171 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. అనంతరం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ రోజున ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటించాలని ఆదేశించారు. మాక్పోల్ నిర్వహణను నిశితంగా పరిశీలించాలని చెప్పారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకురావాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల నివేదికల ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎల్డీఎం విజయ్ తదితరులు ఉన్నారు.