
న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.
లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్లు అరెస్టయిన సంగతి తెలిసిందే.
ఇక.. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవంటూ తొలి నుంచి అరవిండ్ కేజ్రీవాల్ విచారణకు హజరు కావడం లేదు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా.. ఢిల్లీ ప్రభుత్వానికి కూలదోసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు ప్రతిగా.. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత కార్యక్రమాలకు కేజ్రీవాల్ హజరవుతూ వచ్చారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేజ్రీవాల్కు కిందటి ఏడాది నవంబర్ 2వ తేదీన తొలిసారి సమన్లు పంపింది ఈడీ. అప్పటి నుంచి సమన్లు పంపిన ప్రతీసారి(నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 19, ఫిబ్రవరి 2) ఆయన అరెస్ట్ అవుతారంటూ చర్చ తీవ్రంగా నడిచింది.
Comments
Please login to add a commentAdd a comment