
సాక్షి, చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కజకం) పార్టీకి చెందిన ఎంపీ కుమారుడు రాకేష్(22) మృత్యువాతపడ్డాడు.
వివరాల ప్రకారం.. డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా.. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ ఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందగా.. అతడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న కారును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశాడు. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. మాజీ సీనియర్ న్యాయవాది ఇళంగోవన్ 2020 నుంచి డీఎంకే పార్టీ తరఫున రాజ్యసభలో తమిళనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేష్ మరణవార్త తెలియడంతో సీఎం స్టాలిన్ సహా, పలువురు పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.