
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్(61) గురువారం సుప్రీంకోర్టు జడ్జీగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు కాంప్లెక్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ మన్మోహన్ చేరికతో సీజేఐతో కలిపి సుప్రీంకు మంజూరైన 34 మంది జడ్జీలకు గాను ప్రస్తుతం 33 మంది ఉన్నట్లయింది.
జస్టిస్ మన్మోహన్ను అత్యున్నత న్యాయస్థానానికి నవంబర్ 28న కొలీజియం సిఫారసు చేయడం, డిసెంబర్ 3న ఆయన్ను రాష్ట్రపతి ముర్ము నియమించడం తెల్సిందే. ఆల్ ఇండియా హైకోర్టు జడ్జీల్లో సీనియారిటీ పరంగా జస్టిస్ మన్మోహన్ రెండో స్థానంలోనూ, ఢిల్లీ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగాను ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్న ఈయన 1987లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు కాగా, హైకోర్టు జడ్జీల విరమణ వయస్సు 62 ఏళ్లు.
Comments
Please login to add a commentAdd a comment