
స్కూలు రోజుల అనుభవాన్ని సభలో పంచుకున్న మంత్రి
న్యూఢిల్లీ: తమిళనాడులో స్కూలుకెళ్లే రోజుల్లో హిందీ నేర్చుకునే విద్యారి్థనిగా అవమానాలను ఎదుర్కొన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లోక్సభలో మంగళవారం బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లుపై ఆమె హిందీలో మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దాంతో ఆమె తన చిన్ననాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ‘‘తమిళనాడులో హిందీ నేర్చుకునే వారికి అడ్డంకులు సృష్టించారు. తమిళ గడ్డపై పుట్టి, ఉత్తర భారత భాష నేర్చుకోవడమేంటని అడ్డుకునే వారు. నేను మదురై వీధుల్లో వెళ్తుండగా హేళనగా మాట్లాడేవారు’’ అని చెప్పారు.
‘‘ఇష్టమైన భాషను నేర్చుకునే స్వేచ్ఛ, హక్కు నాకు లేవా? తమిళనాడు మన దేశంలో భాగం కాదా? హిందీ నేర్చుకోకుండా నన్ను అడ్డుకోవడం నిర్బంధం కాదా?’’ అని ప్రశ్నించారు. హిందీ, సంస్కృతాలను విదేశీ భాషలుగా పరిగణించడం తగదన్నారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నామంటూ విమర్శించే వారు తన ప్రశ్నలకు సమాధానమివ్వాలన్నారు. ‘‘తమిళ భాషను ప్రధాని మోదీ ఐరాస దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఇంకెవరైనా చేయగలిగారా? మోదీ ప్రసంగాల్లో తరచూ తమిళ భాషను ప్రస్తావిస్తారు. అదీ తమిళులకు మేమిచ్చే గౌరవం! డీఎంకేతో పొత్తు పెట్టుకునే పారీ్టకి చెందిన ప్రధానులెవరైనా ఇలా చేశారా?’’ అని కాంగ్రెస్ను ఉద్దేశించి నిర్మల దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment