
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ బుధవారం తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన పార్టీ నాయకుడు జయంత్ సింగ్ను త్వరగా విడుదల చేయకపోతే తనను చంపేస్తానని ఫోన్లో బెదిరించారని తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించడమే కాకుండా.. తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడని సౌగతా రాయ్ పేర్కొన్నారు.
కాగా పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అరియాదాహా ప్రాంతానికి చెందిన టీఎంసీ నాయకుడు జయంత్ సింగ్ను జూన్ 30న జరిగిన ఓ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గత వారం అరెస్టు చేశారు. అరియాదాహ.. డమ్ డమ్ లోక్సభ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ స్థానానికి సౌగతా రాయ్ గత నాలుగు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి రెండు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు రాయ్ పేర్కొన్నారు. అరియాదాహకు వెళితే చంపేస్తానని కూడా కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని తెలిపారు. తర్వాత తాను బరాక్పూర్ పోలీస్ కమిషనర్ను సంప్రదించి నంబర్ను ట్రాక్ చేయమని కోరినట్లు చెప్పారు. అనంతరం తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
టీఎంసీ నేత జయంత్ సింగ్పై కేసు ఏంటి?
జూన్ 30న కళాశాల విద్యార్థిని, అతని తల్లిపై దాడి చేసిన కేసులో జయంత్ సింగ్ను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇందులో కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను కొట్టడం కనిపించింది.
అరియాదాహాలో ఒక బాలికపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు చూపుతున్న పాత వీడియో ఆధారంగా పోలీసులు సింగ్పై సుమోటో కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ ఘటనకు సంబంధించి సింగ్ సన్నిహితుడు పట్టుబడ్డాడు. , ఈ కేసులో ఇప్పటి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
2023లో మరో కేసులో అరెస్టయి, ఇకపై ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా హామీ ఇచ్చి బాండ్తో బెయిల్పై బయటకు వచ్చాడు జయంత్. ఆ షరతును ఇప్పుడు ఉల్లంఘించినందుకు ఆయన తాజా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment