గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా వ్యాప్తంగా ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వడగాడ్పులు, ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోయారు. మంగళవారం భానుడు శాంతించాడు. జిల్లాలోని పలు చోట్ల చిరు జల్లుల నుంచి భారీ వర్షం నమోదైంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో మంగళవారం వాతావరణం చల్లబడింది. విజయవాడ నగరంలో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడ్డాయి. నందిగామలో ఈదురు గాలులతో భారీ వర్షం నమోదైంది. మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. జాతీయ రహదారితో పాటు అంతర్గత రహదారులు నీట మునిగి చెరువులను తలపించాయి. వర్షాకాలం అన్నట్లుగా వాతావరణం మారిపోయింది. నందిగామ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోనూ వర్షం కురిసింది. ఈ వర్షానికి, ఈదురు గాలులకు అక్కడక్కడా మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. తిరువూరు నియోజకవర్గంలో ఈదురు గాలులు వీచాయి. రోలుపడి, చింతలపాడు, తిరువూరులో పిడుగులు పడ్డాయి. 15 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులకు మామిడి కాయలు నేలరా లాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలో స్వల్పంగా గాలులు వీచాయి. జగ్గయ్యపేట నియోజకవ ర్గంలో భారీ గాలులు వీచాయి. చిరు జల్లులు కురిశాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పట్టణంతో పాటు పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నగరంలో ఓ మోస్తరు వర్షం పడింది. ఈ వర్షానికి నగర ప్రజలు సేదతీరారు. ద్రోణి ప్రభావంతో పిడుగులు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
నందిగామలో భారీ వర్షం తిరువూరులో పిడుగులతో వర్షం ఈదురు గాలులకు దెబ్బతిన్న మామిడి