
జనతాదళ్ యునైటెడ్ జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీలు త్వరలో విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ)అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపిణీపై పట్టబడుతున్నారన్న మీడియా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆసక్తికర కామెంట్లు చేశారు.
‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో పలు వ్యక్తిగత సమీకరణాలు పంచుకున్నా. ఆయన కూడా చాలా విషయాలు నాకు చెప్పారు. అయితే వాటిని మీడియా ముందు ప్రజలకు వెల్లడించడం సరికాదు. కానీ, మీకు నేను ఒకటి చెప్పగలను. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయి. అప్పడు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు’ అని అన్నారు.
అయితే గురవారం పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఇడియా కూటమి సమావేశం అనంతరం లలూ ప్రసాద్ ఇరువురు ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పట్నాకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం ఉన్న తన కుమారు తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రిని చేసే సమయం ఆసన్నమైందని లాలూప్రసాద్.. తనతో చెప్పాడని కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు.
కేంద్ర మంత్రి ‘విలీనం’ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని ఉంటుంది. ఆయన్ను ఎవరు గుర్తించరు కావును అసాధారణ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’ అని మండిపడ్డారు.
చదవండి: Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్