
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకు టీడీపీ నాయకుడు పట్టాభి వాడుతున్న పదజాలం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇదే సందర్భంలో దాడులు చేయడం కూడా సరైన విధానం కాదన్నారు.
కార్యకర్తలను, నాయకులను నియంత్రించాల్సిన బాధ్యత సీఎం జగన్కు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉందన్నారు. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయడం సహజమని, వాటిని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు.