
లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ లక్నో స్థానం నుంచి రానున్న లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్ దాఖలుకు ముందు, రాజ్నాథ్ సింగ్ నగరంలో రెండు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించి, స్థానిక దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ మే 20న జరగనుంది. లక్నోతో పాటు మరో పదమూడు నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.
లక్నో లోక్సభ స్థానంలో 2019 ఎన్నికలలో రాజ్నాథ్ సింగ్ 6.3 లక్షల ఓట్లు సాధించి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ శత్రుఘ్న సిన్హాను ఓడించారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై 2.72 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.